సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

19, మే 2024, ఆదివారం

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన 
మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై 

డా. మండల స్వామి 
రాసిన సమీక్షా వ్యాసాన్ని 
ఈ రోజు తేది: 19-05-2024 సృజన క్రాంతి దిన పత్రికలో ప్రచురించిన గౌరవ సంపాదకులు కె. విల్సన్ రావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐🌹🌹🌹🙏🙏🤝🤝


*వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు*

     ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల పుస్తకం మూడు గుడిసెల పల్లె. ఇందులో పదిహేను కథలున్నవి. ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన కథలున్నవి. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, బాధలు, అవమానాలు, కలలు, ఆశయాలు, ఆకాంక్షలు చూపిస్తూ, సామాజిక స్పృహతో, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సంఘర్షణలతో తనదైన కోణంలో రచయితగా విభిన్నస్వరంతో వినిపించిన కథలివి.

     ఈ కథల ద్వారా ఎక్కువగా దళిత స్పృహ, దళిత చైతన్యం, సామాజిక చైతన్యం వైపు బాగా ఆలోచింప చేస్తాడు. అట్లా రాసిన కథల్లో ఒకటి 'అంటరాని బతుకమ్మ.' తెలంగాణ జన జీవన సంస్కృతిలో బతుకమ్మ పండుగ సందర్భంగా కింది కులాల వారికి ఎదురవుతున్న అవమానాల నుంచి ఆత్మగౌరవ వైపు నడిపించే కథ ఇది. దొరల, పటేల్ల, భూస్వాముల ఇండ్లల్లో కింది కులాలవారు పూలు సేకరిస్తారు. అనాదిగా పూలను సేకరించే దగ్గర కష్టపడినప్పటికీ ఆ పూలతోనే అల్లిన బతుకమ్మ ఆట దగ్గర మాత్రం తగిన చోటు సంపాదించుకోలేని తనాన్ని నిరసించి, కొత్త ఆలోచనల వైపు మళ్ళిస్తుందీ కథ. ఊర్లోని జంగమయ్య మర్రి కాడ అంబేద్కర్ దేవుడిని నిలుపుకొని అంబేద్కర్ చౌరస్తాగా మార్చినం. ఈ బతుకమ్మ ఆట దళితులు ఆడడమేందని కమ్యూనిటీ హాల్ దగ్గర కుల పెద్దలు వ్యతిరేకించినప్పటికీ మారుతున్న కాలం, నవ యువ విద్యావంతుల కొత్త ఆలోచనలు చూసి అర్థం చేసుకొని, అంబేద్కర్ విధానాల స్ఫూర్తితో వాళ్లు కూడా ఒప్పుకుంటారు. గంగ నీళ్లు తెచ్చి గౌరమ్మ చెయ్యాలె. పోచమ్మకాడ బతుకమ్మ ఎయ్యాలె. దాని ప్రకారమే చేద్దామని నిర్ణయించుకుంటారు. పంతులు సూచన మేరకు గ్రామ యువకులు రాజు, మహేష్ ఇద్దరూ టూవీలర్ మీద వంద కిలోమీటర్ల దూరం ఉన్న ధర్మపురికి వెళతారు. ఆ గోదారి నీళ్లలో దిగుతుంటే మహనీయుడు అంబేద్కర్ మహద్ చెరువులోకి దిగిన ఉద్యమ అనుభూతి వారికి కలుగుతుంది. వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకుని తన్మయత్వంతో జై భీం, జై భీం అంటారు. ఆ తర్వాత తడిబట్టలతో గుడిలోకి పోయి దండం పెట్టుకొని, గోదారి నీళ్లు క్యాన్ లో నింపుకొని వస్తారు. గ్రామంలో జరిగిన చిన్న సంఘటనల వలన దళితులు కొందరిలో అనుమానాలు సందేహాలు వస్తాయి. అయినా అన్నింటినీ పక్కకు పెట్టి చివరికి దళిత కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ వద్ద ఆత్మగౌరవ గాలులు పీలుస్తూ, బతుకమ్మ ఆటను ఆడుకోవడం జరుగుతుంది. ఈ కథలో అంటరాని బతుకమ్మగా ముద్ర పడి, బతుకమ్మ ఆటకు దూరంగా ఉన్న దళితులకు మనో ధైర్యం పెంచిన కథ ఇది. అనివార్యంగా అంబేద్కర్ ఆలోచనా తత్వాన్ని దళితుల్లో ఎట్లా పెంచాలో చూపిస్తూ కథకుడు విజయవంతంగా కథను మలిచారు.

      స్వంత ఊరితో విడదీయలేని అనుబంధాన్ని ఎంతో ఆర్ధ్రతతో చెప్పిన కథ 'ఆఖరి కోరిక.' ఈ కథలో ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి ఆరవ తరగతి విద్యార్థిని నవీన స్కూల్ మానేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న వెంకటయ్య సార్ ఆలోచించి మరో విద్యార్థి నితిన్ ని వెంట బెట్టుకొని నవీన కోసం ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు. ఊరిలో బద్ధి పోషవ్వ అనే ముసలవ్వ వెంకటయ్య సార్ కి ఒడవని ముచ్చటోలే చెప్పుకున్న తీరని ఆవేదనే ఈ కథ. తక్కువ పాత్రలతో హృదయవిదారకంగా సాగుతూ కంటతడి పెట్టిస్తుంది. ఊరంటే గుంపు అనీ, సబ్బండ కులాల సమూహమనీ, పోషవ్వ స్పృహ కల్పిస్తుంది. మాదిగోళ్లు లేకుంటే పీనుగ లేవదీ, పీరి లేవది. ఈ ఊరిలోనే అన్ని కులాల వారు, అన్ని మతాలవారు అన్నదమ్ములోలె కలిసి బతికినమనీ, పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా అందరమూ కలిసిమెలిసి బతికినమనీ తన తొంబై ఏళ్ల జ్ఞాపకాలకు కన్నీళ్లను కలగలిపి మనలనూ కంట తడిపిస్తుంది. అనుబంధాల అల్లికకు ప్రతీకగా నిలిచిన ఊరు ఈరోజు మాయమైతుందంటే తట్టుకోలేక పోతుంది. చివరికి పోషవ్వ చనిపోయినా తన ఆఖరి చూపుకు ఎవరు వచ్చి తన పిల్లలకు ధైర్యం చెప్తారనీ, ఊరుతో తనకున్న సంబంధం మాయం చేస్తుందనే బాధనంతా చెప్పుకుంటది. తాను ఎక్కడ చచ్చినా కూడా ఇక్కడనే (ఆ ఊరిలోనే) పాతి పెట్టమని అంటుంది. అది తప్పు కాదని అంటుంది. ఆ అమాయకపు మాటలకి కన్నీళ్ల పర్యంతమైతాడు వెంకటయ్య సార్. నువ్వు నా తల్లి లాంటి దానివని నీకు ఏమి జవాబు చెప్పలేనమ్మా అని విద్యార్థిని నవీనను బడికి రోజూ పంపమని చెప్పి వెళ్ళిపోతాడు.

     'లందస్నానం' అనే కథలో అనేక మలుపులు ఉన్నాయి. ఉత్కంఠ ఉన్నది. ఈ కథలో కమలయ్య తన గ్రామంలో, తన మాదిగ కులంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, తన వల్ల జరిగిన దోషానికి బాధపడుతున్నానంటూ, మనమందరం విడిపోకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉందామని, తన కులస్తులందరికీ వేడుకుంటాడు. ఇట్లా చెప్పడంతో తన కులస్తులందరిలో ఆకాశమంత సంబరం కనబడుతది." ఆ వాతావరణాన్ని చూపిస్తూ అందరి మనుసులు లందస్నానం చేసిన తోలులా శుద్ధీకరించబడి స్వచ్ఛంగా నిగనిగలాడుతున్నయి. మా ఊరి వాగు పెద్దగుండు మీది నుంచి పారినట్లు వచ్చిన శబ్దంలా చప్పట్లు, కేకలు కరతాళ ధ్వనులు. ఆనందానికి హద్దుల్లేని సంతోషాలు. వంద డప్పులు ఒక్కసారి గంతేసి కొట్టినట్లు వేడుక. ఇదే అసలైన దసరా. ఇదే అసలైన బతుకమ్మ. అలాయి బలాయిలు. ఆలింగనాలు. కరచాలనాలు. తీరొక్క రంగులు పూచిన పూలతోటలా కమ్యూనిటీ హాల్లో పేర్చిన బతుకమ్మలా మనసులు కొత్త శోభను సంతరించుకున్నాయి." ఈ ముగింపు కథకుడి సమర్థతకు, స్పష్టతకు నిలువెత్తు నిదర్శనం.

     గ్రామ రాజకీయాలలో దళితుల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూపించే కథ ' 'మూడు గుడిసెల పల్లె' ఈ కథలో ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలనే రాజకీయ కుట్రతో తెలివైన, దళిత మహిళ సరితను సర్పంచ్ పదవికి ఎన్నిక కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్ చేసిన మోసం, ఆడిన నాటకం కథలో చూస్తాము. పటేల్ కి భజన చేసిన వ్యక్తులే ఆ పదవికి ఎన్నికవుతారు. ఆ పదవినే పటేళ్లు తమ పదవిగా మార్చుకొని అధికారాన్ని చలాయిస్తుంటారు. సామాజిక చైతన్యం, దళిత చైతన్యం మెండుగా ఉన్న దళితులను రాజకీయ పదవులను అనుభవించకుండా అడ్డుకునే పటేళ్ల పితలాటకాన్ని బయటపెట్టిన కథ ఇది.

     చదువు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేది అసలైన విద్య అని, జీవితంలో ఎదురయ్యే అనేక కష్టనష్టాలను చదువుతోనే జయించవచ్చని నిరూపించే చక్కని కథ 'గెలుపు గీతం'.ఈ కథలో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఓదయ్య సార్ ఉపాసముండి, కన్నీళ్లు మింగి, అనేక కష్టాలెదుర్కొని, కన్న కలలు తీర్చుకుని ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడని, కష్టాల కొలిమిలో కాలినోల్లే సొక్కం బంగారమైతరని, అందుకు ప్రేరణగా ఓదయ్య సార్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని హెడ్మాష్టర్ విద్యార్థులకు హిత బోధ చేస్తాడు.

     కరోనా వచ్చిన వ్యక్తి పట్ల సొంత మనుసులే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో నిరూపించిన 'రుణం' కథ. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయో చిత్రించిన 'పిడుగు' కథ. అంబేద్కర్ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో తెలియజేస్తూ అంబేద్కర్ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ఆచరణ. కరోనా వచ్చినపుడు గ్రామ సమస్యలు పరిష్కరించలేని తీర్మానం కథ. 

     కులమతాల చర్చ వచ్చినప్పుడు నిన్ను కోస్తే రక్తం, నన్ను కోస్తే పాలు ఒస్తాయా? మనుషులందరికి రక్తమే వస్తది. మనుషులంతా ఒక్కటే. కులాలు మనం పెట్టుకున్నం అని బెస్త నరసయ్య మామ చెప్తుంటాడు. ఆయన చనిపోయినప్పుడు కుల మతాలకతీతంగా అందరి చేత కన్నీళ్లు తెప్పించిన 'బెస్త నరసయ్య మామ' కథ మనసులను కదిలిస్తుంది.
 ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక ఆత్మీయ పలకరింపుల ఆధారంగా నడిచిన కథ 'ఆరుకోట్ల అందగాడు'. ఈ కథలో టెన్త్ ఫెయిల్ అయినోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తుండగా, మార్కులు బాగా తెచ్చుకున్న విద్యార్థులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సర్దుబాటు జీవితాలు గడుపుతుంటారు.

     దళితులకు కిరాయి ఇల్లు ఇవ్వడానికి ఇతర కులాల్లో కొందరు వెనకా ముందు ఆలోచిస్తారన్న విషయం అందరికీ తెలుసు. కానీ 'పుండకోరు' కథ ద్వారా దళితులు కూడా ఇవ్వరని కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు.

     ఈ కథల్లో ఉపయోగించిన భాష, సామెతలు, పలుకుబడులు, పోలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. పల్లెల్లో ఎక్కువగా వినబడే సామెతలు "బెల్లం మీద ఈగలు వాలినట్లు, ఊరంతా ఒక్కటి ఊరవిస్కే ఒక్కటి, కూట్లే రాయి తియ్యనోడు ఏట్లే రాయి తీసిండంట, ఏం లేని ఇత్తారు ఎగిరెగిరి పడ్డదట అన్ని ఉన్న ఇత్తారు అనిగి ఉన్నదట, ఉరికి ఉరికి పసుల కాస్తే పొద్దూకుతాది, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషవ్వ తల్లి కొడుతది, సల్లకొచ్చి ముంత దాసినట్లు ఉంటది, చెవిటోని ముందట శంఖూదుతున్నట్లే, కొంచెపోని కొంగు పడితే మంచోని మానం పోయినట్లు, పిట్ట బెదిరించి బట్ట గుంజుకుపోయినట్లు, మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటోల్నే, దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంట" ఇట్లాంటి సామెతలు (ఊర్లలో శాస్త్రాలు అంటారు) కోకొల్లలుగా ఉన్నాయి.

     సిద్దెంకి కేవలం తన కథల కోసం సృష్టించాడా అనిపించేవి కూడా ఉన్నాయి. అవి "గునుక పువ్వసొంటి నెరిసిన తల, శెరువు నిండితే అత్తరు పల్లి ఎండితే తుత్తురు పల్లి, ఉన్క మీది రోకలోలె, పెంట తవ్వితే పెంకాసులు ఎల్లుతయి, ఎద్దు ఎగురంగనే గంట ఎగురుతాది, వంద కోయిలలు ఒక్కసారి పాడుతున్నట్లు వెయ్యి రామ చిలుకలు కోరస్ అందిస్తున్నట్లు, వాళ్లు బూమ్మీద నిలవడరు మాట మీద నిలవడ్తరు, సేతుల తున్క కాకి తన్నుకవోయినట్లు" వంటి సరి కొత్త పోలికలు ఎన్నో సందర్భానుసారంగా, చమత్కారంగా ఉపయోగించడం వలన కథలను పాఠకుడు హాయిగా చదువుతాడు. 

     సిద్దిపేట, గోనేపల్లి ప్రాంతానికి చెందిన కొన్ని మాండలిక పదాలు వొల్షన్ని=ఎక్కువ, పంజిర్కం=వాదులాట, సరాంచి=గొంతుపెంచి, కైకిల్లు=కూలి,దడ్వత్=భయాన (డిపాజిట్), బకాట్ని=బక్క పశువులని, పుల్కాషి=అమాయకత్వం, ఉన్క=పొట్టు, కోత్కాలు=కోపం, జెమ్మటాలు, చెంగలియ్యాలె మొదలగు అనేక పదాలతో కథలు నిండి ఉన్నవి. ఈ పదాలతో ఈ ప్రాంతపు మాండలిక పదకోశం తీసుకు రావచ్చు.

     ఎవరికి సమాజం నుండి తీవ్ర సంఘర్షణ ఎదురవుతుందో, ఎవరి హృదయాలు గాయ పడుతాయో, ఎవరి మనసులు కలిచి వేస్తాయో అట్లా ఈ రచయితకు అనేకానేక స్వీయ అనుభవాల్లోంచి ఒడువని ముచ్చటగా వచ్చిన కథలివి. మన బాధలు మనమే రాసుకోవాలి. మన గాథలు మనమే చెప్పుకోవాలి అన్నట్లు సిద్దెంకి తన గ్రామం, జీవితం, భాష, ప్రాంతం, కులం, గ్రామీణ కళలు, అస్తిత్వాన్ని కలగలిపి చుట్టూ ఉన్న పల్లె వెతలను పట్టి చూపిన ఉత్తమ కథల పుస్తకం మూడు గుడిసెల పల్లె. దళితుల బాధలే కాదు తెలంగాణ పల్లె సమాజం బాధలూ ఉన్నాయి. ఈ కథలు తప్పకుండా చదవాల్సినవి. చదువుతున్నపుడు మనం ఆ పల్లెల్లో తిరుగుతున్నట్లే అనిపిస్తది. బాధపడుతున్న మనిషి ఎదురుగా కూర్చుని బాధలు వింటూ మాట్లాడుతున్నట్టే ఉంటది. ఇందులో పల్లె జీవన సౌందర్యం, శ్రామిక సంస్కృతి, బాధలు, వర్తమాన స్తితిగతులు, అస్తిత్వమై మాట్లాడుతాయి. ముచ్చెట పెడుతాయి. ఈ కథల్లో సగానికి ఎక్కువగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నవే ఉన్నాయి. అంటే ఈ కథలన్నీ కథనంలో, వస్తువులో, శిల్పంలో, ఎంత బలమైనవో చూడవచ్చు.

  పుస్తకం పేరు: మూడు గుడిసెల పల్లె కథలు. పేజీలు : 152. సెల్ : 9441244773

     *డా. మండల స్వామి* 
          9177607603

6, మే 2024, సోమవారం

బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు - డా. సిద్దెంకి యాదగిరి


బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు
    - డా. సిద్దెంకి యాదగిరి 





జీవితాల్ని కథలుగా వ్యాఖ్యానించడమంటే మరుగున పడిన మానవ సంబంధాల ఎతలను దృశ్యీకరించడమే. నిజజీవితంలోని కనబడని కోణాల్ని, మనసు తడిని, ప్రేమ పదనను, ధర్మాగ్రహ పదునును అక్షరాల్లో అంతరాత్మను కథల్లో ఆవిష్కరించడమే కథనం.   నిబద్ధతతో నిజాయితీగా మానవీయతను నిలుపడమే కథల అంతిమ లక్ష్యం. బంధాలను అక్షరీకరించడం ద్వారా సంఘటనలకు జీవం పోసే అక్షర శిల్పి, కథకులు కొట్టం రామకృష్ణారెడ్డి. వారి కథలు జీవితాల్లోని అడుగంటిన ప్రేమను పాతాళగరిగెతో దేవి గిడస బారిన మనసుపై కుంభవృష్టిగా ఆర్ద్రతల్ని కురిపిస్తాయి. మమతల్నీ బాధ్యతగా హృదయంలోకి వొంపి అనుబంధాలను తిరిగి అంకురింప చేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి నిలదీసి అడుగుతున్నట్లు కనిపిస్తాయి. 

ఆధునిక జీవితంలో నూతన దంపతుల మధ్య అగాథం సృష్టిస్తున్న అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో దాంపత్య జీవితానికి మంట పెడుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి. మనసెరిగి మసలుకుంటే జీవితం ఎలా మారుతుందో నిరక్షరాస్యుల విచక్షణాత్మక నిర్ణయాన్ని ఆదర్శంగా చూపుతూ రాసిన కథ ‘అద్దం వెనుక’.
మనసుకు అవిటితనం లేని సీతమ్మకు భర్త రామయ్య అంటే మహా ప్రాణం. అతనికి, వ్యవసాయంలో, జీవితంలో అన్ని విధాలుగా తోడుండేది. ఒకనాడు సినిమా హీరో ప్రసేన్‌ చిత్రపటాన్ని చూసి ముచ్చటపడి కొనుక్కొచ్చి  దానిని రహస్యంగా అద్దం వెనుక దాచింది. సీతమ్మ మనసు గ్రహించిన రామయ్య చేసిన పనిని తెలిపే కథ ‘‘అద్దం వెనుక’’ చదివితే నేటి దంపతులకు అపార్ధాలు రావని తెలుపుతుంది. 

తండ్రి జబ్బుకు మందు తేవాలని కల్మకల్‌ వెళ్లిన రచయితకు మందు ఇచ్చిన సాకలి బాలయ్య వర్షం వస్తుందనీ, వెళ్ళవద్దని వారించినా వినకుండా బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో వయసుకు వచ్చిన మనుమరాలుతో ఉంటున్న ముసలమ్మ తుంగ గడ్డి గుడిసెలో ఆ రాత్రి ఆశ్రయం పొందుతాడు. వారిపట్ల ఎనలేని కృతజ్ఞతాభావంతో నిండిపోతాడు. తెల్లవారి బయలుదేరిన రచయితకు ఆ మనుమరాలి చూపులు ఎందుకు గుచ్చుకున్నయో, ఆ అనుభవాన్ని తలుచుకొని అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ ఊరినీ, అక్కడి పరిస్థితుల్ని కళ్లగట్టినట్టుగా హృదయానికి హత్తుకునేటట్టు మారాలనీ బోధిస్తూ  ‘ఆఖరికి’ కథ పాఠకుల్ని మూలాలు మరువకూడదనీ గుర్తు చేస్తుంది. 

అర్థం వేరు. అంతరార్థం వేరు. వాస్తవాన్ని గుర్తించకపోతే జరిగిన అపార్థమే జనిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న తల్లి కొడుకుల మధ్య ఒకరి మొఖం ఒకరు చూడకుండా ప్రేమ లేకుండా చేసిన ‘నూనె సుక్క’ తల్లి కొడుకులను ఒక జీవితకాలం ఎందుకు విడదీసింది? కనపడని శూన్యాన్ని ఎలా నింపిందో తెలుసుకున్న రచయితకు నానమ్మ చెప్పిన జీవిత తాత్వికత, మార్మికతలో జీవితానికి సరిపడే ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆలోచనలో బాధపడిరదెవరో ‘నూనె సుక్క’ కథ చదవి అపార్ధాన్ని తొలగించుకోవాల్సిందే.

రాముడు విడిచి వెళుతున్నాడని అయోధ్య వాసులు ఒకవైపు విలపిస్తున్నారు. రుతుక్రమాన్ని మరిచి అడవిలోని ఫలాలు ఫలి స్తున్నాయి. ఏది తెచ్చిన కాకి ఎంగిలి అనీ అంటారని ఆయాసం వస్తున్న ఆవాసాన్ని వెతికిన వాయసం. బిచ్చగాడు ఎత్తుకుపోయిన నాటి సీతమ్మను నేడు కనుగొనడానికి జనావాసాల మధ్య,  తిరుగుతూ వాయసం ఏం వెతుకుతుందో తెలియాలి అంటే ‘కాకి రామమం’ చదవాలి. రంగు నలుపు. కానీ కాకి మనసు నల్లగా ఉంటుందా అని ప్రశ్నిస్తుందీ కథ. ఈ కథలో కాకులంటే అణగారిన వర్గాలే. 

ఎండాకాలం తాతిల్‌ (సెలవులు)అంటే పిల్లలకు తల్లిదండ్రులకూ ఇష్టమే. పిల్లాడిని తీసుకుని లక్ష్మీ మామ ఆడపడుచు దగ్గరికి రుక్కమ్మతో సహా వెళ్లడం వల్ల లక్ష్మీ ఆశ అడియాశ అయింది. వారం తర్వాత వారం రోజులు బిడ్డ అత్తమామను పిలిచి తన ఇంట్లోనే మర్యాద చేసిండు రాములయ్య. వాళ్ల తర్వాత వారం రోజులు బిడ్డ కలమ్మ తల్లిగారింట్లో ఉన్నది. కలమ్మను సాగనంపుతున్న బస్సులోనే లక్ష్మి తండ్రి లక్ష్మిని తీసుకెళ్దామని దిగిండు. తల్లి గారి ఇంటికి వెళ్లే లక్ష్మికి అత్త రుక్కమ్మ ద్వారా నూరు రూపాయలు ఇస్తాడు. తాతీలు దొరకగానే వద్దామని అనుకున్నానని తండ్రితో చెబుతుంది. లక్ష్మికి తన తండ్రి అత్తమామల గురించి చెప్పిన తాతీల్‌ ఎవరెవరికీ కావాలో ఎలా అందివ్వాలో తెలియజేసిన విషయం ఆర్ద్రంగా చెప్పిన బ్రహ్మ రహస్యం ఏమిటో తెలిస్తే గాని కన్నీళ్లతో అమ్మగారింటికి పోయే కోడల్ని మొట్టమొదటిసారిగా విడ్డూరంగా ఊరిలోని చుట్టుపక్కలోల్లు  చూసిండ్రని ‘తాతిల్‌’ కథను ఆత్మీయతతో ముగిస్తాడు. 

కథకుడు ద్రష్ట అయి భవిష్యత్తును ఊహిస్తాడు. అసహజమనిపించినా రచయిత సహజంగా తీర్చిదిద్దాడు. ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగు చేస్తాడు ? దేవుడే ప్రకృతి. ప్రకృతే దేవుడుగా ఆచరించాలనీ, ఆరాధించాలనీ వివరిస్తుంది. అలా చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తు అభ్యున్నతికి పాటుపడ్డ వాళ్ళమైతామని బోధించే బాధ్యతని మేల్కొల్పే కథ 3456జిబి. ఈ కథ చదివితే ప్రకృతి వినాశనం కానివ్వ కూడదని గట్టిగా కోరుకున్న వాళ్ళమై గొప్ప బహుమానంగా ముందుతరాలకు అందజేయాలనీ సంకల్పించుకుంటాము. 

మనిషినై పుట్టనందుకు మురిసిపోతుందని తెలపడమంటే పశువుల గొప్పతనం కోడె పాత్ర ద్వారా ఉన్నతీకరిస్తాడు రచయిత.అప్పుడే పుట్టిన కోడె తల్లి మాటలు విని మురిసిపోయినా కష్టాలు తప్పలేదు. ముసలిదైన ఎద్దు నెమరేసుకుంటున్న జ్ఞాపకాల్లో కొత్తకోడల్ని హింసించి ఎలా బలితీసుకున్నారో ఎవరు బలిపసువులవుతున్నారో తెలుపుతూ పైసలు ఎదిరిచ్చి కష్టాలు కొనుక్కునే కోడళ్ళ బలహీనత మీద, చచ్చిపోయేలా కల్పించిన పరిస్థితుల మీద, జీవితకాలం పనిచేసి అతని అభివృద్ధికి ఆధారమైన ఆ పశువును కసాయి వాడికి అమ్ముతున్నపుడు ఆ పశువు జ్ఞాపకాల ఆత్మఘోషనే ‘బలిపసువు’ కథ బలి విధానాన్ని ధిక్కరిస్తుంది.

ఏ ఆధారం లేకుండా తన చెల్లెల్ని చంపిన వరకట్న పిశాచిపై తీర్చుకున్న పగకు శిక్ష విధించాలనుకున్న జడ్జి బాధితుడై మథనపడుతూ కుమిలిపోతూ ఒక్క శిక్షకైనా రెండో శిక్షకైనా అదే తీర్పు అనీ ఇవ్వాల్సిన తీర్పే ఇచ్చిన ‘తీర్పు’ కథ హృదయ ఫలకం పై చెక్కు చెదరకుండా ముద్రించబడుతుంది.

చెరపకురా చెడేదవు అని బోధించే కథ ‘ఆకుపచ్చటి నెత్తుటి జాడ’. శంకర్‌ రెడ్డిది ఓర్వజాలని మనస్తత్వం. కుమ్మరి మల్లయ్య జాగలోని మామిడి చెట్టు నీడ వల్ల పంట పండుతలేదనీ మనుషుల చేత కాత ఉండగానే దౌర్జన్యంగా కొట్టేస్తాడు. కుమ్మరి మల్లయ్య పిచ్చివాడై శాపనార్ధాలు పెట్టినందుకు రక్తం గారేటట్లు కొడతే చెట్టు మొదట్లోని తల్లి సమాధిపై పడి స్పృహ తప్పుతాడు. శంకర్‌ రెడ్డి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అతడి రెండో భార్య బావికాడి నివాసం నుంచి కనబడకుండా తప్పిపోయిన మిస్టరీ ఊహకందకుండా నడిపిన కథనం పాఠకున్ని విస్మయానికి గురిచేస్తుంది. 

అంతరిక్షజాడలు కనుగొంటున్న మనిషికి ఎదుటివారి అంతరంగంలోని స్వార్థం కనుగొనకపోవడమే అతి పెద్ద విషాదం. అంతరిక్ష యాత్రికుని మనసులో ఏముందో ఎవరికి అంతుపడుతుంది? ముక్కోణపు ప్రేమలో మిగిలేవి రెండే. మిగిలేది అంతర్ధానమే. స్వార్ధం రగిలించిన ప్రేమ కోసం అంతరిక్షంలో చేసిన అఘాయిత్యమే ‘ఎల్లలు’ కథలో గెలిచింది ప్రేమనా? స్వార్థమా ఏది గెలుస్తుందో చదివాక స్పష్టత కలుగుతుంది.

బతుకమ్మ పండుగకు తల్లి గారి ఇంటికి వచ్చిన బాల్య మిత్రురాల్లు వినోదా, సరోజ సుమతులు. పువ్వు ఏరడానికి పోయి అక్కడ సరోజ కుటుంబం పట్నం పోయి అప్పుల పాలైండ్రు. వినోద తక్కువ జీతమున్నా డబ్బు వెన్కకేస్తుండ్రు. ఏంటి మీ రహస్యం అని అడిగిన వినోదకు కరువులో ఉన్నా కష్టాలో ఉన్నా ఊల్లో ఉన్నా పట్నంల ఉన్నా ఎక్కడున్నా కష్టపడాలి. రేపటి కోసం పొదుపు చేయాలి. ఈ ఆలోచన, ఆచరణ లేకపోతే బతుకే ఆగమాగం అని పొదుపు రహస్యం చెప్పే ‘ఇగురం’ కథ ఏరుకొచ్చి పేర్చిన పెద్ద బతుకమ్మలా ప్రేరేపిస్తుంటది. 

చాలా మందికి కఠినపదాలకు అర్థాలు సమగ్రంగా తెలియవు. కథనేకాదు భాష కూడా అర్థమయ్యే విధంగా చెప్పడంలో రచయిత సిద్ధహస్తులు. సమూహంలోంచి వెలివేయబడితే ఒంటరితనమని, సమూహాన్ని వెలివేస్తే  ఏకాంతం అని పాత్రలు సమభాషిస్తాయి. ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య నిట్టూర్పే మానవ జీవితం. ఒంటరితనం ఓటమివైపు, ఏకాంతము గెలుపుకు బాటలేస్తాయనీ,  ఒంటరితనంలో సమాజం కోసం రచయిత లోలోన కుమిలిపోయే వ్యవస్థను చూసిన మనస్సుకు బతికినన్నాళ్లు ఈ బాధ తప్పదని ఉదాసీనంగా వెళ్లిపోవడమే ఏకాంతం కలిగించే జాలి అనీ డిస్ట్రక్టివ్‌ (విధ్వంసం)గా చెప్పే అంశం అబ్సట్రాక్టివ్‌ (అమూర్తం)గా వివరించే ‘ఒంటరి ఏకాంతం’ చదివితే ఎన్నో విషయాలు, విశేషాలు విధితమవుతాయి. ఈ కథ చదివాక కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’అన్న ప్రసిద్ధ పంక్తులు గుర్తుకొస్తాయి.

ఊరిలో మనుషుల మధ్య సంబంధం కలిపేది వృత్తి పని. వృత్తి పనివాల్లను కలిపే వేదిక పంట పండాక ధాన్యం కొలిచే కల్లం. పనిచేయనోళ్లకు మన దాన్నెం పంచిపెట్టుడెందుకు తాతా అని అడిగినప్పుడు కడుపులో చేయి పెట్టి దేవి తీసిన సమాధానం తాత చెప్తూ ‘‘ఆళ్ళందరూ పరాయోళ్ళు కాదురా! కులాలు వేరైనా మనందరం ఒకటే. మనకు భూముంది. సేద్యం చేస్తం. గది మన వృత్తి. కమ్మరి కుమ్మర్లందరూ మన కోసం పని చేస్తరు. మనం వాళ్ల కోసం పని చేయాలి. మనకోసం వాళ్లు చేస్తారు. ఎవ్వలి పని ఆడే చేసుకుంటే మందితోటేం పని?’’ అని  ఏకత్వం మర్మం చెప్పే ‘బర్కత్‌’ కథ మనుషులంతా ఒక్కటనే నిజం కడుపుల ఆత్మ కండ్లకు దుఃఖం తెస్తది. ఈ కథ ముగింపు నేడు దేశమంతా కులాల మతాల పేరిట జరిగే అసహనం జరిపే ఆకృత్యాలకు చెక్‌ పెట్టి గుణపాఠం చెబుతుంది.

నాయకుడిగా ఎదగాలనుకుంటే మనొక్కరమే ఎదుగుతాం. నాయకులు తయారు చేయగలిగిన వాడే మహానాయకుడు అని పేర్కొన్న ఒక జింక నాయకత్వం వహిస్తూ జింకల గుంపును, కుర్ర జింకను కాపాడుతూ పులిని చంపేస్తూ తను చనిపోతూ పదుగురికి  మేలు చేసే చావు గొప్పదనీ జింక చేసిన త్యాగమే ‘యుద్ధం’ కథ. ఈ కథలో జింకలు మానవులకు ప్రతీకలు. ఈ కథలో మానవ సమూహాన్ని ఎలా కాపాడాలో నేతలకు బోధించే గురూపదేశం ఉంది. 

జీవితంలో సంపాదనే ముఖ్యం కాదు బిడ్డా అని ‘‘పానంతోటి బతకాలంటే ఊర్లలో బతకాలె’’నని ఊరిపై నున్న మమకారానికి ఆకారాన్ని చిత్రించే ‘రెండో ఉత్తరం’ కథ ప్రతీకాత్మక భవిష్యత్తు సందేశాన్ని తండ్రి ద్వారా కొడుకు అందిస్తుంది. ఊరిని ఇడ్సిపెట్టి ఉండుడంటే పానం లేకుండ బతికినట్లే అని చదివిన కొడుకు శాశ్వతంగా ఇండియా వస్తాడు. 

తెరచిన కిటికీలోంచి ప్రకృతిని చూసినప్పుడు అనేక దృశ్యాలు కనబడుతుంటాయి. ఆలోచనల్లోకి వెళ్లి భ్రమల్లో బతుకుతుంటాం కానీ నిజం వేరే ఉంటుంది. అతనికి బాల్యమిత్రుడు చావు గుర్తు తెచ్చుకొని మనసు శకలాలుగా విరిగిపడుతుంది. ఎంసెట్‌ మెడికల్‌ సీట్‌ మొదటి ర్యాంకు సాధించిన కొడుకు బీఎస్సి అగ్రికల్చర్‌ వైపు వెళ్తాననడం. కిటికీ దృశ్యాలతో ఆలోచనలు ఆచరణలు మూలాల్లోకి వెళ్లడం కోసం మమేకం చేసే కథ ‘తెరిచిన కిటికీ.’ గో బ్యాక్‌ టూ అగ్రికల్చర్‌ అని వివరిస్తుంది.

అనువణువునా పల్లె తనం నింపుకున్న మనిషి జీవన విధానమే ‘ఇగురంగల్లోడు’ కథ. ఎవరికి అర్థం కాకపోయినా బాధ్యతకు నిలువెత్తు విగ్రహం. నీతికి చిరునామా. రీతికి దిక్సూచి. కడుపు నిండా కనబడని ప్రేమ, కనిపించే శత్రువుగానే ఉన్నా కుటుంబం పట్ల అంకితభావమే. ఉల్లాసము నింపని వ్యక్తి పట్ల కుటుంబ సభ్యుల అనుబంధాల అల్లికే ఈ కథ. 

ఊరు దాటకున్నా సరే వ్యవసాయ దంపతుల అన్యోన్యతలు ఎలా రెట్టింపు చేస్తూ బావిని హనీమూన్‌ గా భావిస్తూ, పొలాన్ని ఫారిన్‌ ట్రిప్‌ గా చిత్రిస్తూ జీవిత యాత్ర కొనసాగించాలనే సందేశాత్మకమైన కథ ‘యాత్ర’. ఏవీ లేవని బాధపడటం కంటే ఉన్న వాటితో తృప్తి పడటం జీవితానికి మించిన సంతోషం లేదని ఆలుమగలు అరమరికల్లేకుండా ఎలా జీవించాలో తెలియజేసే కథ యాత్ర. నవల లా సాగిన వర్ణన.



వర్ణన`పోలికలు: కథలోని వర్ణన ద్వారా సంఘటన, పాత్రోచిత సంభాషణ, సమన్వయంతో పాటు సొగసైన వర్ణనతో రచయిత ఆకట్టుకుంటాడు. పోలికల ద్వారా కథనానికి రచయిత బలం చేకూరుస్తాడు. ‘నా ఎన్నెల ఎలుగుల కన్న ఎక్వ వెలుగు యాడ్కెలొచ్చింది’ అని సీత కండ్లని సూసి, సిగ్గుపడి మబ్బు సాటుకు దాక్కున్న సంద్రుడు. అని వ్యక్తీకరించడం ద్వారా అతిశయాన్ని అతికిస్తాడు.(ఆఖరికి కథ). సూర్యుడు ఊరిడిసి పెట్టి పోయిండు, పొద్దుగాల మల్లొస్తనని జెప్పి’ అని తాతిల్‌ కథలో పోలుస్తాడు. పెండ్లిపిల్ల కడిగిన ముత్యమోలే మంచిగున్నది. (బలిపసువు). ‘ఎవరి బతుకు వారే బతుకాలనీ కోడి పిల్లలు పెద్దగయినంక కోడి పిల్లలను ఎడవాపుతుంది’ లాంటి పోలికలు కావల్సినన్ని ఏరుకోవచ్చు.

ప్రతి కథలోనూ ఒక సామాజిక దృక్పథంతో రాయడం రచయిత సామాజిక బాధ్యతకు నిదర్శనం. మనుషులంతా మానవీయ సంబంధాలతో అనుబంధాలు పెనవేసుకొని జీవించాలని, లుప్తమవుతున్న విలువల్ని పెంపొందించాలని సందేశం ఇచ్చేవి ‘నూనె సుక్క’ కథలు.

ఆర్ద్రతను పిండి మనసును తడి చేసే కథలు. కనిపించని కల్లోలాన్ని కనిపించేలా చెక్కిన శిల్పాలు. ఎంచుకునే కథా వస్తువును లోతుగా పరిశీలించి, పరిశోధించి ఫలవంతంగా అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడం కొట్టం రామకృష్ణారెడ్డి ప్రత్యేకత. వారు కథ వస్తువు ఎంపికలో జాగ్రత్త వహిస్తాడు.

 ఎంచుకున్న కథ పట్ల స్పష్టత లేనిది రాయడు. ఎక్కడా అనవసరమైన వాక్యాలు, పదాలు పాఠకుల్ని ఇబ్బంది పెట్టవు. వారి శిల్పంలో మట్టి కూడా మాణిక్యంగా మారుతుందనడంలో అతిశయం కాదేమో. వీరి కథనం ప్రత్యేకమైన శైలితో ఉంటుంది. కథకు కథకు పోలిక లేకుండా, ఊహకు అందకుండా రాసే వీరి శ్కెలి ఎంతో రమణీయం. ఎంతో అధ్యయనం చేస్తే కానీ ఇలాంటి శైలీఅలవడదు. 

రాసిన కథలను వాసికక్కేలా తీర్చిదిద్దడం వారి నిపుణతకు, నిబద్ధతకు పరాకాష్ట. ఇవి టైం పాస్‌ కథలు కావు. తప్పక చదవాల్సిన బతుకు గాథలు. బాధ్యతలకు బాటలేసే  అత్యుత్తమ మా’నవ’ జీవితానికి  ప్రబోధించే ఆచరణాత్మక ఎతలు.

    ` డా. సిద్దెంకి యాదగిరి 9441244773