1
పట్టణమనగా గోలకొండపట్టణమే దక్షిణాపథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా మూడు కోటలు. ఏడు మైళ్ళ కైవారము, ఎనుబదిఏడు బురుజులు, ఎనిమిది దర్వాజాలు . సుమారు నాలుగు మైళ్ల వైశాల్యముండెను.
ఆజంఖాన్ అను ఇంజనీరు.
పట్టణము భాగములే మొహల్లాలు. రికార్డులు లేవు.
హక్షికమాన్, దికాబ్ బాగ్, కటోరాహవుజు, మీరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లాలు. మీరుజుమ్లా, మాదన్న నివసించు మందిరాలుండుటచే ఆ ప్రాంతములకు వారి పేర్లే యుంచబడినవి.
ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు, అధికం.
వీధులు విశాలం. రాజభవనాలు పడమటి దిశయందుండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు, ప్రజా సముదాయము నివసించుచుండెను. ఉత్తర ప్రాంతము మాత్రము అధిక జనసమర్థము.
గోలకొండ పట్టణమునకు ఒంపు, సొంపులు కలిగించుటలో మొదటివాడగు కులీ కుతుబుషా, నాల్గవవాడగు ఇబ్రాహీం కుతుబ్షా (1550-1580) ఐదవవాడగు మహమ్మదు కులీ కుతుబ్షా, ఏడవవాడగు అబ్దుల్లా కుతుబ్షా చాల శ్రద్ధ వహించిరి.
ఇబ్రాహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోటలోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించెను. ఈ విధముగా పట్టణము అలంకార భూయిష్టముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుబడిరి. కచ్చేరి భవనములు, ఉద్యోగస్థుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు, పాఠశాలలు, స్నాన మందిరములు మున్నగునవి నిర్మితములయ్యెను. ఇబ్రాహీంకుతుబ్షా పండ్రెండు భిక్షాగృహములు నిర్మించెను. ఈ పన్నెండు రాజ హర్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములగు ఉదాహరణములు, "దిల్ కుషా" భవనము పన్నెండుగురు ఇమాములకు అంకితము చేయబడెను.
నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమణి, షాహి మహలులు అను రాజహారిమ్ల కలవు. మనోహరమైన మందిరరాజము. ఈ మందిరమునందే పారశీకదేశపు రాయబారికిని, అతని అనుచరవర్గమునకు ఏర్పాటు చేయబడెను. యుద్ధభటులకు ప్రత్యేకముగా రెండు బారకాసు లుండెను. రెండు ప్రాకారముల మధ్య నొకటియు. పర్వత శిఖరమునందు మరొకటియు బారకాసులు ఉండుచుండెను. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణము నందు విలక్షణమయి, ఆకర్షణీయమైనట్టివి మిద్దెలమీది తోటలు (Roofgardens) భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యముతో రూపురేఖలు దిద్ది, తీర్చి, రమ్యోద్యానములను మనోహరముగ నిర్మించినారు. ఈ ఉద్యాన వనమునకు నీటిని సప్లయిచేయు విధానము అందులో నీటి కాలువలు, జలాశయములు, కేళాకూళులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను. ఈ అంతరాళ నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. భారతభూమిలో ఏకైకదృశ్యముగా గోలకొండ పట్టణములోనే యుండెను మజ్నూ బురుజుకు వాయవ్యదిశయందు దొడ్డ బాల్బోవా (Balaboa) వృక్షమొకటియుండెను. దీని స్కంధపు కైవారము 80 అడుగులుండెను. ఆ చెట్టు యొక్క పాదమునందలి తొఱ్ఱలో ఒక గుండ్రనిబల్ల, దానిచుట్టు నాలుగు కుర్చీలు వేసికొని నలుగురు కూర్చుండి ఉపాహారము పుచ్చుకొనుటకు వీలగునంత విశాల ప్రదేశముండెను. ఆ తొట్టి గదిలోనికి గాలి, వెలుతురుగూడ చక్కగా ప్రసరించుచుండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హపుజు అనునది ఒక జలాశయము. ఈ కటోరా హవుజు ప్రాంతము వేసవి కాలములో గొప్పవారికి విహారభూమిగా నుండెను.
**********************************
ఆలోచించండి- చెప్పండి.
ఆజంఖాను ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి?
* పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి?
* * గోలకొండ కోట ఎందుకు అచ్చెరువు గొల్పుతున్నది?
***********************"**"********
II
హైదరాబాదునగరము నిర్మాణ క్రమాభివృద్ది చెందుచుండుటచే, గోలకొండ ప్రాధాన్యము తగ్గుచుండెను. అందుచే గోంకొండలోని వర్తకులు, సర్దారులు, సామాన్యజనము గోలకొండను వదలి హైదరాబాదులో నివసింపసాగిరి. హైదరాబాదులో దొరికిన రికార్డునుబట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోలకొండపట్టణములో రమారమి నలుబదివేల యిండ్లు ఉండియుండుననియు, రెండు లక్షల ప్రజలు నివసించుచుండి యుందురనియు లెక్కతేల్చినాడు, ఈ ప్రజల సౌకర్యార్ధము
మహమ్మదు కులీ కుతుబుషా 78 లక్షల హోనులు వెచ్చించినాడు. పట్టణములోని జనమునకు పానీయజలము లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. దుర్గమున కొంతదూరములో ఎత్తుప్రదేశమున దుర్గతటాకము నిర్మింపబడెను. ఆ దుర్గతటాకము నుండి, భూమిలోనుండి మట్టిగొట్టముల ద్వారా నీటిని ప్రవహింపజేసి కటోరా హవుజును నింపుచుండిరి. కటోరా హపుజు నుండి నీరు మట్టిగొట్టములద్వారా పట్టణములోని పలు ప్రాంతములకు సప్లయి అగుచుండెను. నీటిని నిలువచేయుటకు పెక్కు హవుజులు నిర్మితములయ్యెను. కొన్ని హవుజులు జనానా వారికి నియమితములయియుండెను.
రాజుగారి హర్మ్యమును చేరవలెనంటే పన్నెండు ద్వారములు దాటవలసి యుండెను. ఉమ్రావుల యొక్కయు, పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు చాలవరకు లోపలికోటలో నుండుచుండెను. గొప్పవారికి గోలకొండ యందును భాగానగరము నందును మందిరము లుండుచుండెను. పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారములు విలాసవస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. గోలకొండ పట్టణములో వణికంగవులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరసములయి యుండిరి. అప్పుడీ పట్టణములో దొరకనివస్తువే లేకుండెను. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లేగదా! భారతభూమి నలుమూలల నుండి వర్తకము సాగుచుండెను. విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణము(బందరు) నుండి వేరుగా గోలకొండకు వచ్చుచుండును విదేశ వ్యాపారము చేయువారిలో ప వారు ప్రధానులుగా నుండిరి. ఈ వర్తకునకు గోలకొండపట్టణము కేంద్రముగా నుండి తెలంగాణను సంతకును ప్రాకుచుండెను. ఇబ్రాహీం కులీకుతుబు కాలములో తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచు అంగడిగానుండెను. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకము, మొదలగు దేశాలనుండి వర్తకులు వచ్చుచుండిది. కౌశల్యముగల శిల్పులు, చిత్రకారులు ఉండేది.
పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజ ద్వారానే వచ్చుచుండును. బంజారాలనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటనే ప్రవేశద్వారమునకు బంజారా దర్వాజా అను పేరువచ్చినది.
బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనాపట్టుగుడ్డలు, కర్పూరము, గాజుసామానులు, సువాసనద్రవ్యములు మొదలగునవి దిగుమతి అగుచుండెను. కొన్ని వస్తువులు ధరలు వివరించుకొనుచున్నాను.
ఈ విధముగా 300 సంవత్సరముల క్రిందట ధర లుండెను. "హోను" అనునది ఒక బంగారు నాణెము. దీనిని పెగోడా. అనికూడ అందురు. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువను కలిగియుండెను. "పణము" అనునది హోనులో పదహారవ భాగము. పెగోడాలలో అర్ధ, పావు పెగోడాలుకూడా ఉండెను. ఇవిగాక పైసలు, గవ్వలు క్రయ విక్రయాదులయందు ప్రచారములోనుండెను. పైఠన్ వస్త్రాలు, బందరు కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుబోవుచుండెను.
రంగుల కర్మాగారము డచ్చివారు నడుపుచుండిరి. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారమునందే ఆయుధములు, ఫిరంగులు నిర్మించుచుండిరి. కూరగాయలు, మాంసము అమ్ము దుకాణములుండెను. కాని అవి అంతపెద్దవికావు. కోటవెలుపల పెద్ద మార్కెట్లుండెను.
గోలకొండ పట్టణములోనికి రాకపోకల విషయములో చాల జాగ్రత్త వహించుచుండిరి. క్రొత్తవాడు వచ్చినచో వానికి ప్రవేశము చాల దుర్లభము. వానికి దారోగా యొద్దినుండి అనుమతి పత్రమైనా యుండవలెను. లేదా రాజోద్యోగులలో ఎవ్వని పరిచయమయినా యుండవలయును. క్రొత్తవాడు రాగానే వానివద్ద ఉప్పుగాని, పొగాకుగాని ఉన్నదేమోనని వళ్ళు, బట్టలు బాగా తడవిచూచెదరు. ఈ రెండు వస్తువులవల్ల రాజుగారికి ఎక్కువగా రెవిన్యూ వసూలగుచుండెను. వానికి ఒక్కొక్కసారి రెండు మూడు రోజులవరకు ప్రవేశము లభింపకపోవచ్చును. అనుమతినిచ్చు దారోగా లేడనియో, మరేవేవో సాకులు గల్పించి, ద్వారరక్షకులు వాని నుండి లాభము బొందుటకు ప్రయత్నించుచుందురు.
గోలకొండ పట్టణములో గొప్ప అధికారులు కూడ వర్తకము చేయుచుండిరి. మీరుజుమ్లా యను మంత్రి కొన్ని వజ్రపుగనులకు సొంతదారుడయి వజ్రాల వ్యాపారమున మిగుల ధనము గడించుచుండెను. అతనివద్ద ఇరువయి మణుగుల తూకముగల వజ్రాలుండెను. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతదారుడయి ఓడలవ్యాపారము చేయుచుండెను.
*****************************
* గోలకొండ వదిలి సామాన్యజనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు?
* గోలకొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి?
గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు?
*******************
Ⅲ
గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబుషా విద్యాప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్షా చాలాకాలము విజయనగరమునందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్రభాషా మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్ర భాషయందు అభిమానముగలిగి, ఆంధ్రకవులను
మిచ్చియున్నాడు. ఇబ్రాహీంకుతుబ్ షా మహబూబునగరు జిల్లాలో నివశించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి "మత్త గందేభ సితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను" ఇచ్చి సత్కరించుచుండెను.
అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యాన' కావ్యమును రచించి సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు "యయాతిచరిత్ర"ను కృతిభర్తయయి. కలవాడు. ఇతని చుట్టును ఎల్లప్పుడు బ్రాహ్మణులు పరివేష్టించి యుండెడివారు. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారము ఆ కాన్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్క రించినాడు. ఏడవ పాదుషాయగు అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణుల భక్తిగల రాజుగారు. ఇతడు విజ్ఞాన శాస్త్రములు, లలితకళలు, వాఙుయము వృద్ధిచేయుటకు ప్రయత్నించినణ
పట్టణములో ద్రాక్షతోటలు పెక్కు ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ నెలలలో పక్వమునకు వచ్చును. ద్రాక్షలకు మంచిగా దోహదము చేయుదురు. ఈ (ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షాసవము తయారుచేసి త్రాగుచుండిరి. అశేష జనమునకు తాటి కల్లు ప్రీతికరమయిన పానీయముగా నుండెను.
గోలకొండ పట్టణములో 1589 ప్రాంతములో మహామారీ పీడ సంభవించెను. లెక్కలేనంతమంది మరణించిరి. చివరకు కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగిరి. తత్ఫలితముగా ఆ మహానూరి పీడవడలెను. తత్ జ్ఞాపక చిహ్నముగా కృతజ్ఞతా సూచకముగా మహమ్మదు కులీకుతుబ్షా పాదుషావారు 1591 సంవత్సరమున హైద్రాబాదులో తాబూతు ఆకారమున చారుమినారు నిర్మాణము గావించిరి,
ఉమ్రావులు బజారులయందు బోవుట చాల పటాటోపముగా నుండుచుండెను. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు ఒకటో, రెండో ఏనుగులు పోవును. వీటిమీద ధ్వజములు పట్టుకొని ముగ్గురు భటులు కూర్చుందురు. తరువాత అస్త్ర శస్త్రాదులను ధరించిన ఏబది, అరువదిమంది భటులు అశ్వారూఢులై పోవుదురు. వీరి వెనుక గుఱ్ఱాల మీద కూర్చుండి బాకాలూదుచు, సన్నాయిలు బాడుచు కొందరు బయలుదేరుదురు. వీరి వెనుక ఉమ్రావు అశ్వారూఢుడయి వచ్చును. ఈతని కంగరక్షకులుగా ముప్పది, నలుబది మంది పదాతివర్గముండును. కొందరు ఉమ్రావులకు సురటీలు విసురుచుందురు. ఒకడు గొడగు పట్టును. ఇంకొకడు హుక్కాపట్టుకొని వచ్చుచుండును. ఒకడు కావడిలో జలపూర్ణ కుంభములను పట్టుకొని వచ్చును. తరువాత ఒక పల్లకిని నలుగురు మోసుకొని వచ్చుచుందురు. భుజాలు మార్చుకొనడానికి ఇద్దరు బోయీలు విడిగానుందురు. వీరందరి చివర ఒకటో, రెండో ఒంటెలు బయలుదేరును. ఒంటెలమీద కూర్చుండి భటులు తప్పెటలు వాయించుచుందురు. నవాబుగారికి ఇష్టమయినప్పుడు గుఱ్ఱముదిగి పల్లకిలో పరుండెదరు. పల్లకీకి వెండిపూత పూయబడి యుండును. పల్లకి దండెలకు వెండిపొన్ను లుండును, పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్ఛమును పట్టుకొని యుందును. తాంబూల చర్వణము చేయుచునో, హుక్కా పీల్చుచునో కనుపట్టుచుండును.
గోలకొండ పట్టణములో నేరస్థులను శిక్షించు విధానము మిగుల కఠినముగా నుండెను. వారిని జైలులో బెట్టు పద్ధతియే లేకుండెను. వెంటనే విచారణ చేయుటయు, దోషియైనచో శిక్షించుటయు, నిర్దోషియైనచో విడిచిపెట్టుటయు జరుగుచుండెను.
గోలకొండ పట్టణములో జనాభావత్తిడి అధికమయ్యెను. నీటి వసతి కూడ చాలదయ్యెను. అందుచే పాదుషాలు, గొప్పవారు, కొందరు వర్తకులు హైద్రాబాదులో నివసింపసాగిరి. అయినను ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయములు, ధనాగారము, సేనాసిబ్బంది గోలకొండ పట్టణములోనే యుండుచుండెను. యుద్ధభీతి కలిగినప్పుడు రాజులు, రాణులు మొదలగువారు గోలకొండ దుర్గములో తలదాచుకొనుచుండిరి. గోలకొండనుండి హైద్రాబాదు రాజధానిగా ఎప్పుడు మార్చబడినదో సరిగా తెలియదు. కాని పదునారవ శతాబ్దము చివరనిది జరిగియుండవచ్చునని చరిత్రకారు లూహించుచున్నారు.
గోలకొండ పట్టణములోని పురుషులు, స్త్రీలు సరిసమానమైన అవయవస్ఫూర్తి గలిగియుండిరి. మనోజ్ఞమైన ముఖవిలాసములతో ఒప్పుచుండిరి. ఉమ్రావులు, సేనానులు గంభీర సుందరాకారము గలిగియుండి ఆకర్షణీయముగా నుండిరి. ఉమ్రావులు మితిలేని భాగ్యవంతులు. రాజు మొదలుకొని బీదవరకు ఆటపాటలతో వినోదించుచు, భోగలాలసులై యుండిరి.
రెండు వందల ఏబది సంవత్సరములు సకలసంపద్వైభవములతో విరాజిల్లి, ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన గోలకొండ పట్టణమును 1687వ సంవత్సరమున ఔరంగజేబు చక్రవర్తి మోసముగా జయించి, సర్వనాశనము గావించెను. అంతటితో గోలకొండ పట్టణపు అందచందములు, వైభవములు, ఠీవి పరిసమాప్తి జెందెను.
******************************
ఆలోచించండి-చెప్పండి
◆ గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని ఎట్లా చెప్పగలవు?
• పట్టణాల్లో జనాభా ఎందుకు పెరుగుతుంది?
*************
బల్బోవా: 80 అడుగుల కైవారం గల స్కందము గల వృక్షం
హోనులు: బంగారు నాణెం.
మైండ్ మ్యాపింగ్ - సులువు గుర్తించుకోవడానికి పై వీడియొ లింక్ నొక్కండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి.
(లేదా)
గోలకొండ నవాబుల సాహిత్య సేవ ఎట్టిది ?
(లేదా)
ఇబ్రహీం కుతుబ్షా సాహిత్య పిపాస గూర్చి వివరించండి.
జవాబు:
“గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబుషా విద్యా ప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్షా చాలాకాలము విజయనగరము నందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్ర భాషా మాధుర్యమును గ్రోలినవాడు ఆంధ్రభాష యందు అభిమానము గలిగి, ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాఖ్యాన” కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు.
ఇబ్రాహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించు చుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను” ఇచ్చి సత్కరించినాడు. సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి, ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు.
ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
జ:నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితి
ఇబ్రహీం కుతుబ్షా తెలుగుభాష తియ్యదనం తెలిసినవాడు. తెలుగు భాషయందు అభిమానంతో తెలుగు కవులను, పండితులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధర కవి రచించిన ‘తపతీ సంవరణో పాఖ్యాన కావ్యము’ వీరికి అంకితమివ్వబడినది. వీరు మహాకవి ఆసూరి మరింగంటి సింగరాచార్యను చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.
మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ దీనిని పొన్నగంటి తెలగనార్యులు రచించారు. ఈ కావ్యానికి కృతిభర్త ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్. దీనిని రచించిన కవిని ఘనంగా సత్కరించారు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.
ఇ) “తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
జ: తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి:
పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా ! భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను.
విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణం నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను.ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.
ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
జ: ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.
నీటి సమస్య : చెరువులు భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.
ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం.
విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతుల ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.
సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి, ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణ తో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరక ప్రాయంగా మారుతుంది.
2. క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) గోలకొండ పట్టణము విశిష్టతను తెలుపండి.
జ: పట్టణమంటే గోలకొండ పట్టణమే అనే ప్రఖ్యాతి పొందింది. అందుకు కారణం గోలకొండ యొక్క అందచందాలు, వైభవం, విశిష్టతలు.
అందచందాలు : గోలకొండ పట్టణ నిర్మాణ పథకకర్త ఆజంఖాన్, పట్టణాన్ని మొహల్లాలుగా విభజించారు. వీధులు విశాలంగా ఉంటాయి. భాగ్యవంతులు, సరదార్ల మేడలు కోట లోపల ఉంటాయి. పట్టణానికి ఆ భవనాలన్నీ అలంకారాలుగా ఉంటాయి. నగీనాబాగ్ ఒక అందాలకుప్ప అయిన ఉద్యానవనం.
షాహిమహలులు అనే రాజహర్మ్యములు చాలా అందమైనవి. దిల్కుషా భవన సౌందర్యం వర్ణనాతీతం. ఉద్యానవన నిర్మాణాలు గోలకొండ పట్టణం అందచందాలను చాలా పెంచాయి. మిద్దెలమీది తోటలు శిల్పకళా నిపుణత్వానికి గీటు రాళ్ళు. ఈ ఉద్యానవనాలకు నీరు సరఫరా చేసే కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు చూసి ఆశ్చర్యపడని వారుండరు. బాల్బోవా వృక్షం పట్టణం అందాలను పెంచింది.
వైభవం : గోలకొండ పట్టణం వజ్రాలకు పుట్టినిల్లు. అక్కడి వ్యాపారులు మహాధనవంతులు. దేశవిదేశాలతో ఎగుమతి దిగుమతి వాణిజ్యం చేసేవారు. అప్పుడా పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాల వ్యాపారం, ఓడల వ్యాపారం కూడా జోరుగా సాగేది.
విశిష్టత : కవులు, పండితులను పోషించేవారు. అనేక గ్రంథాలను రచింపచేసి, అంకితం పుచ్చు కొనేవారు. కవులను ఘనంగా సన్మానించేవారు. అగ్రహారాలిచ్చేవారు. జంతు ప్రేమికులు. ద్రాక్ష తోటలు పెంచేవారు. ఉమ్రావులు విలాసవంతంగా జీవించే వారు. శిక్షలు కఠినం.
3. క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక/సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
జ: పర్యాటక క్షేత్రం – ఆదిలాబాద్ జిల్లా బాసర
పవిత్ర గోదావరీ నదికి సుమారు అరవై మైళ్ళ దూరంలో ఒక ఋష్యాశ్రమం ఉండేది. దానిని వ్యాస మహర్షి స్థాపించడం చేత దానికి “వ్యాసపురి” అని పేరు వచ్చింది. తరువాత ‘వాసర’ అని పిలువబడుతుండేది.
కాలక్రమంలో అదే ‘బాసర’ అని ప్రసిద్ధిపొందింది. ఇక్కడ సరస్వతీ దేవి దేవాలయం ఉంది. ఉత్తర భారతదేశంలో కాశ్మీరంలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో మాత్రమే సరస్వతీ దేవి దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్ నారాయణాంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి మహాభారత భాగవతాది అష్టాదశ పురాణాలు, వ్యాఖ్యాన గ్రంథాలు రచించి, నాలుగు వేదాలను పరిష్కరించి మానవాళికి అందించిన మహోన్నతుడు.
అటువంటి వేదవ్యాసునికే ఒకసారి మనశ్శాంతి లేక సకల మునిగణ సేవితుడై ఉత్తరభారతదేశ యాత్రచేసి, దండకారణ్యానికి వచ్చాడట. కలిదోష నివారణ చేయగలిగిన గౌతమీ నదిలో స్నానం చేసి, సంధ్యా వందనము వంటి అనుష్ఠానాలను పూర్తిచేసుకుని, అమ్మను ప్రార్థించి సాకారముగా ఇక్కడనే నెలకొని ఉండమని శ్రీ సరస్వతీ దేవిని ప్రార్థించాడు. ప్రతిరోజూ గౌతమీ నదిలో స్నానము చేసి మూడు గుప్పెడులతో ఇసుక ను తెచ్చి ఒక చోట ఉంచేవాడు.
క్రమంగా అది మూడు మూర్తు లుగా మారి శ్రీ మహాసరస్వతీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాకాళి రూపాలతో ఆవిర్భ వించింది. అందులో శ్రీ మహా సరస్వతిని అధి దేవతగా మిగిలిన దేవతలను పరివార దేవతలుగా ఆరాధించేవాడు. తరువాతి కాలంలో తురుష్కులు దండయాత్రలలో ఈ మందిరాన్ని నాశనం చేయటం జరిగింది.
వీరశైవులైన ‘మాక్కజీ పటేలు’ సమూహము వాళ్ళను ఎదిరించారు. శిథిలమైన దేవాలయం పునరుద్ధరించబడింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ సరస్వతీ దేవిని పునఃప్రతిష్ఠ చేసి పునరుద్ధరించారు. ఇక్కడ దత్తమందిరము, గణేశ మందిరము, ఏకవీర మందిరము, పాతాళేశ్వర మందిరము,
ఆంజనేయ మందిరము’ ఉన్నాయి. శ్రీ సరస్వతీదేవి ఆలయము కేంద్రంగా ఇంద్రేశ్వరము, సూర్యేశ్వరము, నారాయణేశ్వరము మొదలైన ఆలయ సముదాయ ముతో కూడిన మహాక్షేత్రము బాసర. ఇక్కడ ప్రతి సంవత్సరము విజయదశమికి, శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీ సరస్వతీదేవిని దర్శించి, ఆమె అనుగ్రహంతో పిల్లలకు విద్యాభ్యాసాలు జరుపుకుంటారు. పల్లె వాసుల జాతరలు, శుభకార్యాలు కూడా జరుగు తుంటాయి.
III. భాషాంశాలు
పదజాలం
1. క్రింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) పుట్టినిల్లు: భారతదేశం కళలకు పుట్టినిల్లు.
ఆ) పాటుపడడం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో వీరులు పాటుపడ్డారు.
ఇ) పీడవదలడం : కంసుని వధతో ఆ రాజ్యానికి పీడవదిలింది.
ఈ) తలదాచుకోవడం :కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ పురవీధుల్లో తలదాచుకున్నారు.
2. క్రింది పదాలను వివరించి రాయండి.
అ) పటాటోపము : మితిమీరిన వస్త్రాలంకారణాన్ని పటాటోపం అని అంటారు. ‘పటము’ అనగా వస్త్రము అని అర్థం అనగా బాగా అలంకరించుకొని హడా వుడిగా తిరుగు అని భావం.
ఆ) అగ్రహారం : ఇబ్రహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్త మాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహార ములను” ఇచ్చి సత్కరించినాడు.
ఇ) బంజారాదర్వాజా : పట్టణంలోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును. బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ప్రవేశద్వారమునకు బంజారా దర్వాజా అను పేరు వచ్చినది.
ఈ) ధర్మశాల : పుణ్యాన్ని పొందదలచి యాత్రికులకు, బాటసారులకు, అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేందుకు నిర్మించబడిన వసతి గృహాలను ధర్మశాలలు అని అంటారు. ఇవి ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో కులమతాలకు అతీతంగా జనులు ఆశ్రయం పొందుతారు.
వ్యాకరణాంశాలు
1. క్రింది వాక్యాలలో సంధి పదాలను విడదీసి అవి ఏ సంధులో రాయండి.
అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిట కిటలాడుతాయి.
జ: దేవ + ఆలయాలు = దేవాలయాలు (సవర్ణదీర్ఘ సంధి)
ఆ) మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనస్సు లను ఆకట్టుకుంటాయి.
జ: రమ్య + ఉద్యానములు = రమ్యోద్యానములు (గుణ సంధి)
ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
జ: ‘అశ్వ + ఆరూఢుడు = అశ్వారూఢుడు (సవర్ణదీర్ఘ సంధి)
ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
జ: రాజ + ఆజ్ఞ (సవర్ణదీర్ఘ సంధి)
బహువ్రీహి సమాసము
క్రింది సమాసపదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ) ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు.
ఆ) ముక్కంటి – మూడు కన్నులు కలవాడు.
ఇ) గరుడ వాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు.
ఈ) చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు.
ఉ) పద్మాక్షి – పద్మం వంటి కన్నులు కలది.
పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని “బహువ్రీహి” సమాసం అంటారు.
ఉదా : ‘చక్రపాణి’ అనే సమాసపదంలో ‘చక్రము’ అనే పదానికి ప్రాధాన్యం లేదు. ‘పాణి’ (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
అన్యపదార్థ ప్రాధాన్యం బహువ్రీహి.
2. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను రాయండి.
ఉదా: యాయాతి చరిత్ర - యాయాతి యొక్క చరిత్ర షష్టి తత్పురుష సమాసం.
అ) బ్రాహ్మణ భక్తి : బ్రాహ్మణుల యందు భక్తి - సప్తమి తత్పురుష సమాసం.
ఆ) నీలవేణి : నీలం వంటివేని కలది బహువ్రీహి సమాసం
ఇ) పుష్పగుచ్చము: పుష్పం యొక్క గుచ్ఛము - షష్టి తత్పురుష సమాసం
ఈ) గోల్కొండ పట్టణము : గోల్కొండ అనే పేరు గల పట్టణము - సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఉ) గరళకంఠుడు : గరళము కంఠమున గలవాడు - బహువ్రీహి సమాసం
ఊ) సుందరాకారములు : సుందరమైన ఆకారములు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఋ) దయాంతరంగుడు : దయతో కూడిన అంతరంగం గలవాడు - బహువ్రీహి సమాసం
ౠ) అందచందములు :అందమును చందమును - ద్వంద్వ సమాసం.
3. కింది వాక్యాలను వ్యవహార భాషలోకి మార్చండి.
ఉదా పట్టణము అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి.
పట్టణము అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటు పడ్డారు.
అ) ఈ మందిరము నందే పారసీకపు రాయబారికిని, అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జవాబు: ఈ మందిరంలోనే పారశీక రాయబారికి, అతడి అనుచర వర్గానికి, బస ఏర్పాటు చేశారు (వ్యవహార భాష)
ప్రాజెక్టు పని ; మీ జిల్లాలోని వివిధ కోటల చిత్రాలు లేదా మీరు చూసిన కోట / ప్రాచీన గుడి / కట్టడం ఆధారంగా నివేదిక రాయండి ప్రదర్శించండి.




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి