సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

5, ఫిబ్రవరి 2024, సోమవారం

VII. 2. నాయనమ్మ

ప్రశ్నలు:

1.పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.పై బొమ్మలో ఒక వృద్ధురాలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

2. బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు. బొమ్మలో వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆ సమయంలో భార్యాభర్తలు ఆ వృద్ధురాలికి సపర్యలు చేస్తున్నారు. పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు.

3.ముసలమ్మకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు ?
జవాబు.ముసలమ్మకు సేవలు చేస్తున్నది ఆమె కుమారుడు, కోడలు అయి ఉంటారు.

ప్రశ్న 4.మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు ?
జవాబు.మా ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉన్నారు. వారు వృద్ధులు. వారికి నేను సేవ చేస్తాను. వారికి అవసరమైన మందులు అందిస్తాను. బయటకు తీసుకొని వెళ్తాను. అల్పాహారం, భోజనం పెడతాను. కాళ్ళు నొప్పులు వస్తే మర్దన చేస్తాను.

 

 

పాఠం ఉద్దేశం:

వృద్ధులపట్ల సానుకూలవైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మనవల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారిపట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం కథానికప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది.

ప్రవేశిక:

కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబవ్యవస్థ నిలిచి ఉన్నది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితంఅనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం….

ఆలోచించండి చెప్పండి:

ప్రశ్న 1.శేఖర్ పశ్చాత్తాపపడ్డాడు కదా! మీరు ఏయే సందర్భాల్లో పశ్చాత్తాపపడ్డారో చెప్పండి ?
జవాబు.తాను చేసిన తప్పు గుర్తించినప్పుడు, తప్పును పెద్దలు గుర్తించి మందలించినప్పుడు, తన తప్పుల వల్ల ఇతరులకు హాని కలిగినప్పుడు పశ్చాత్తాపం చెందుతాడు.

ప్రశ్న 2.శేఖర్ అందరితోని మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి.
జవాబు.శేఖర్ అందరితోని మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉన్నాడు. శేఖర్ తాను చేసిన తప్పును గుర్తించాడు. దీన్ని అందరూ గుర్తించి తనను మందలిస్తారనే భయం ఎక్కువైంది. అందుకోసమే శేఖర్ ముభావంగా ఉన్నాడు.

ప్రశ్న 3.నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు ?
జవాబు.నాయనమ్మ శేఖర్ను క్షమించింది. అయినా శేఖర్ ఏడ్చాడు. దానికి కారణం తాను చేసింది పెద్ద తప్పు. తన తప్పు కారణంగా నాయనమ్మ బాధపడింది. ఆమెకు కాలు విరిగింది. ఇది గుర్తించి తట్టుకోలేక ఏడ్చాడు.

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా ! వీరిద్దరిలో ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నాను. వీరిలో అందరు రవిలాగా ఉండాలనుకుంటారు. ఇంట్లో నాయనమ్మ, తాతయ్య ఉంటారు. వారు వృద్ధులు. వారికి సేవలు చేయాలి. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. వారి దీవెనలు పొందాలి. నాయనమ్మకు పిల్లలపై మమకారం ఉంటుంది. పిల్లలకు కూడా తాతయ్య, నాయనమ్మలంటే బాగా ఇష్టపడతారు. అందువల్ల అందరు రవిలాగా ఉండాలని అనుకుంటారు.

ప్రశ్న 2.నాయనమ్మ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.వృద్ధులపట్ల సానుకూలవైఖరిని ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి. నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.

ఒకసారి బంధువులు ఊరి నుండి వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందామని అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను తారుమారు చేశాడు. దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.


II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

ప్రశ్న 1.
కింది పేరా చదువండి. ముఖ్యమైన పదాలు రాయండి.

ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదుటిమీద దెబ్బతోని అవ్వ స్పృహతప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. అందరూ శివుడిని చూడడానికి ఎగబడ్డారు. కాని ఇద్దరు ఆడపిల్లలు చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. బంగారుతల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారుఅని అవ్వ ఆనందబాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది.

ఉదా : జనసమ్మర్థం, దీవించటం

1.    స్పృహతప్పింది

2.    ఎగబడ్డారు

3.    కట్టుకట్టారు

4.    దుమ్ముధూళి

5.    బంగారుతల్లులు

6.    ఆనందబాష్పాలు

2. కింది వాక్యాలు చదువండి. వీటిలో మీరు అవునుఅని అనుకొనే వాటికి () లేకుంటే () గుర్తు పెట్టండి.

అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం.       

ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులను చేసిపెడుతాను. 

ఇ) ఎవరి వస్తువులనైనా నాకిష్టమైతే తీసుకొంటాను.                 

ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు, పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను.  

ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను.

ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను.

ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది. 

ఏ) నావల్ల ఎవరికైనా బాధకలిగితే, నేనుకూడా బాధపడుతాను.

ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను.

 

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు ? ఎందుకు?’
జవాబు.రవి, శేఖర్ మంచిమిత్రులే. అయితే శేఖర్కు ఎప్పుడు రవి తనతో ఆడుకోవాలనే కొద్దిపాటి స్వార్థం ఉంది. కాని చివరకు శేఖర్ తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. నాకు బడిలో ఎంతోమంది మిత్రులున్నారు. సుమారు ఇరవైకిపైగా మిత్రులున్నారు. వారంతా నాతో కలిసి ఉంటారు. నేను వృద్ధులకు సేవచేస్తున్నా బాధపడరు. సమాజసేవలో నాతో కలిసి పనిచేస్తారు. మాలో మాకు అభిప్రాయభేదాలు ఎప్పుడు రావు. అందరం ఒక్కటిగా ఉంటాం. ఆదర్శంగా నిలుస్తాం.

ఆ) మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి.
జవాబు.వృద్ధులు నిద్ర లేచింది మొదలు మరలా రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను.

వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీసు నుంచి కార్డులు, కవర్లు తెచ్చి పెడతాను. ఉత్తరాలు రాసిపెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకువెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయపడతాను. మరల జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను.

ఇ) కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి”. ఎందుకో రాయండి.
జవాబు.భారతీయ సంస్కృతిలో కుటుంబవ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మ మొదలైనవారంతా ఒక్కటిగా ఉండేవారు. ఇలా ఉండడం మంచిది. ఇలా అందరూ కలిసి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబసభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సంస్కృతీ సంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. మన వారసత్వ సంపద పరిపుష్టిని పొందుతుంది. అందువల్ల కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉండాలి.

ఈ) ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిదిదీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.మానవునికి ఈర్ష్య శత్రువు వంటిది. ఇది మనలోని సద్గుణాలను దూరం చేస్తుంది. ఎదుటివారి అభివృద్ధిని సహించనివ్వదు. కోపం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడూ తనకు ఇబ్బందికరంగా ఉండేవారికి కీడును చేపట్టే మనస్తత్వం అలవడుతుంది. చదువు, సంస్కారం దూరమౌతాయి. మమతానుబంధాలను, మానవీయ విలువలను అంతం చేస్తుంది. అందువల్ల ఈర్ష్యను మానవుడు దూరం చేసుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏమిటి ? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి.
జవాబు.రవి, శేఖర్ ఇద్దరు మంచి స్నేహితులు. రవికి నాయనమ్మకు సేవచేయడమంటే ఎంతో ఇష్టం. శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే ఇష్టం. రవి తనతో ఆడుకొనకపోవడానికి నాయనమ్మే ప్రధాన కారణమని గ్రహించాడు. ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. దీని ఫలితంగా ఒకసారి నాయనమ్మకు కాలు విరిగింది. దీంతో శేఖర్కు భయం పట్టుకుంది. నాయనమ్మ శేఖర్ను ఆదరించింది. మంచి మాటలు చెప్పింది. అన్నం తినిపించింది. నాయనమ్మలోని ఆప్యాయత శేఖర్ లో మార్పు తెచ్చింది. తప్పు ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. ఈ రకంగా శేఖర్ మారి, మంచి మనిషిగా అయ్యాడు.

ఆధునిక కాలంలో ఎంతోమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

1.    పిల్లలు ఉద్యోగాలతో దూరప్రాంతాల్లో ఉండటం.

2.    కుటుంబ తగాదాలు, ఆర్థిక సమస్యలు.

3.    నేటి యువతకు వృద్ధులపట్ల చులకన భావన.

4.    సమాజంలో మానవీయ విలువలు లోపించడం.

5.    ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గిపోవడం.

IV. సృజనాత్మకత / ప్రశంస:

ప్రశ్న 1.వృద్ధులకు సేవచేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

సిద్ధిపేట,
X X X X X.

 ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,

శుభాకాంక్షలు. నేను బాగానే చదువుతున్నాను నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన సమాజంలో ప్రస్తుతం వృద్ధుల జీవితం ఎంతో దుర్భరంగా ఉంది. వివిధ కారణాలతో అనాథలుగా వృద్ధాశ్రమంలో చేరుచున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలు కుటుంబ కారణాలతో వృద్ధులను పట్టించుకోవడం లేదు. వృద్ధాశ్రమాల్లో దింపి బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. మనం వృద్ధులను సేవించాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూచుకోవాలి. వారి దీవెనలు పొందాలి. అది మన కర్తవ్యంగా భావించాలి. నీవు కూడా వృద్ధులను ఆదరించి, సేవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికి నమస్కారాలు
తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఎ. వరప్రసాద్.

చిరునామా :
పి. రాధాకృష్ణ,
7
వ తరగతి,
బూర్గంపహాడ్ ఉన్నత పాఠశాల
గజ్వేల్ సిద్దిపేట  జిల్లా.

 

IV. పదజాల వినియోగం:

1. ఈ కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.

అ) అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత

 

జవాబు.
1.
అంధులు = గుడ్డివారు
2.
ద్వేషం = పగ
3.
జ్ఞాపకం = గుర్తు
4.
తుంటరి = అల్లరి చేసేవాడు
5.
జపమాల = జపం చేసుకునే మాల
6.
ఆతృత = తొందరపడు

2. పాఠాన్ని చదువండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి.

 


VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.

అ) నాయనమ్మ ___ కు_________ మందులు వేసుకోవడం చాతనవుతుంది.
ఆ) కోపం ___ వలన ________ ఇట్లా జరిగింది.

ఇ) శేఖర్ ____ కొరకు ________ రవి ఎదురుచూశాడు.
ఈ) అందరి _____ తో _______ కలసి ఆడుకో !

2. ఈ కింది వాక్యాల్లో క్రియలు గుర్తించి పక్కనే రాయండి.

అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. ____వెళ్ళాడు____

ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. _____ చదివి, నిద్రపోయింది__
ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు. ____పరిగెత్తుతున్నాడు___

ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. __చేసి, వెళ్ళాడు____

పై వాక్యాల్లో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి ? ఆ రెండు క్రియల్లో భేదం గమనించారా ?
ఆ. చదివి, నిద్రపోయింది
ఈ. చేసి, వెళ్ళాడు

ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తి అయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలుఅంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తికానట్లు తెలిపే క్రియలను అసమాపక క్రియలుఅంటారు.

 3. కింది వాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.

అ) చెంబుతో నీళ్ళు ముంచుకొని, తాగుతుంది.
అసమాపక క్రియ ముంచుకొని సమాపక క్రియ తాగుతుంది.

ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
అసమాపక క్రియ ఆపివేసి సమాపక క్రియ వెళ్ళిపోయాడు.

ఇ) పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.
అసమాపక క్రియ చేసి సమాపక క్రియ చెప్పాడు.

ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
అసమాపక క్రియ తీసుకొని సమాపక క్రియ తుడిచింది.

ప్రాజెక్టు పని:

మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏయే పనులవల్ల వారికి సంతోషం కలుగుతుందో తెలుసుకుని నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
వృద్ధులకు ఇష్టమైన పనుల్లో ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం, పూల మొక్కలను పెంచడం, కథలను పిల్లలకు చెప్పడం మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

వృద్ధులు నాతో ఈ సమయంలో తమ బిడ్డలు తమకు దగ్గరగా ఉండాలని, తమ బాగోగులను చూచుకోవాలని కోరారు. తమకు తమ పిల్లలు ఆర్థికంగా సహాయపడవలసిన అవసరం లేదని, తమను జాగ్రత్తగా చూచుకుంటే సరిపోతుందని వాళ్ళు నాతో అన్నారు. పిల్లలు దూరంగా ఉంటే పడే బాధ చెప్పనలవికాదని కూడా చెప్పారు.

(లేదా)

మీ ప్రాంతంలోని తాత, నాయనమ్మలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి, వారితో మాట్లాడండి. మీకెట్లా అనిపించిందో నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
నేను సంక్రాంతి సెలవులకు మా స్నేహితునితో కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాను. వారిది ఉమ్మడికుటుంబం. ఆ కుటుంబం నాకు బాగా నచ్చింది. ఆ ఊరి ఆత్మీయతలు బాగా ఆకట్టుకున్నాయి. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో సీత ఇంటర్ మొదటి సంవత్సరము, రమణ 7వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు ఇద్దరూ చైతన్య జూనియర్ కాలేజీలో, స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఆ ఇంట్లో రఘునాథ్ గారి తండ్రి వెంకట్రావుగారు, తల్లి శేషమ్మగారు కూడా ఉన్నారు.

పిల్లల చదువుల గురించి వెంకట్రావుగారు మంచి శ్రద్ధ తీసుకుంటారు. శేషమ్మగారు ఇంటి పనులు అన్నీ చూస్తారు. ఆ కుటుంబంలో సభ్యులందరూ చక్కగా కలసిమెలసి ఉంటారు. తల్లిదండ్రుల యోగక్షేమాల్ని రఘునాథ్ గారు చక్కగా చూస్తారు. వెంకట్రావుగారు, శేషమ్మగారు సాయంత్రం పార్కుకు వెళ్ళి నడుస్తారు. వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి వస్తారు. సాయంత్రం అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు. భోజనాలయ్యాక ఒక గంట టి.వి. చూస్తారు. పిల్లలకు భారత, భాగవత, రామాయణ కథలు వాళ్ళ తాత, మామ్మలు చెపుతూ ఉంటారు. వారి ఏకతను చూసి నాకు సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం అన్యోన్యత నాకు చూడముచ్చటగా ఉంటుంది.

 

I. అవగాహన ప్రతిస్పందన:

అపరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకు లోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలు అవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను, అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద,మాత్సర్యాలు) నుండి ఎలా బయటపడగలను ?

ప్రశ్నలు :

ప్రశ్న 1.ఏనుగు దేనివల్ల బందీ అవుతున్నది ?
జవాబు.తన మేని దురద వల్ల

ప్రశ్న 2.నోటికి రుచి ఆశించి ఏది బందీ అయింది ?
జవాబు.చేప

ప్రశ్న 3.రాగానికి లొంగినది ఏది ?
జవాబు.పాము

ప్రశ్న 4.వేటికై మైమరచినవి తుమ్మెదలు ?
జవాబు.పూలవాసనకు

ప్రశ్న 5.అరిషడ్వర్గాలు ఏవి ?
జవాబు.కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.రవి వాళ్ళ అమ్మనాన్నలు నాయనమ్మను ఎలా చూసుకుంటారు ?
జవాబు.
నాయనమ్మ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయిస్తారు. రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నొసలు మీద ముద్దు పెట్టుకుంటుంది. సమయానికి మందులు అందిస్తారు.

ప్రశ్న 2.ఇంట్లో అవ్వను అందరూ బంగారం లెక్క చూసుకుంటారు. ఈ వాక్యాన్ని బట్టి బంగారం లెక్క చూసుకోవడమంటే మీకేమి అర్థమైంది ? రాయండి.
జవాబు. ఇంట్లో అందరికీ అవ్వ ఇష్టం. అందుకే ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. బంగారం లెక్క చూసుకోవడం అంటే బీరువాలో పెట్టి తాళం వేసి భద్రంగా చూడడం కాదు. బంగారం అనేదానికి అపురూపంగా చూడడం అనే అర్థం కూడా ఉంది. కనుక అవ్వను ఇంటిలోని వారందరూ అపురూపంగా, చాలా ఇష్టంగా చూసుకొనేవారని నాకు అర్థమైంది.

ప్రశ్న 3.అయ్యో నాయనమ్మకు ఈ కష్టం కలగటానికి కారణం నేనే కదా! అని పశ్చాత్తాపపడ్డ శేఖర్ ఆలోచనలో మీరేం గ్రహించారో రాయండి.
జవాబు.
శేఖర్కు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కాని రవి నాయనమ్మతోనే ఉండేవాడు. దాంతో నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. కాని తాను చేసిన పని వల్ల నాయనమ్మ నెలరోజులు దవాఖానాలోనే ఉంది. అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా గుబులైంది. తాను చేసిన తప్పును గుర్తించాడు. తన తప్పు వల్ల నాయనమ్మకు ప్రమాదం కలిగిందని పశ్చాత్తాపంతో ఉన్నాడని గ్రహించాను.

ప్రశ్న 4.మీ పెద్దలకు మీరు ఎలాంటి సేవలు చేస్తారో తెల్పండి. (లేదా)
మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలుపండి.

జవాబు. వృద్ధులు నిద్ర లేచింది మొదలు మరలా రాత్రి నిద్రపోయే వరకు వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను. వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చూస్తాను. వారికి అల్పాహారం, భోజనం వంటివి ఒక నియమిత కాలంలో అందేటట్లు చూస్తాను. విశ్రాంతి తీసుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ తగిన ఏర్పాట్లు చేస్తాను. వారి కాలక్షేపానికి పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ వంటివి అందుబాటులో ఉంచుతాను.

వారు తమ బంధువులకు ఉత్తరాలు రాయాలనుకుంటే పోస్టాఫీసు నుంచి కార్డులు, కవర్లు తెచ్చి పెడతాను. ఉత్తరాలు రాసి పెడతాను. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంట ఉండి జాగ్రత్తగా తీసుకువెళ్తాను. రోడ్డు దాటేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు సహాయపడతాను. మరల జాగ్రత్తగా ఇంటికి తీసుకునివస్తాను.

ప్రశ్న 5. పిల్లలకు అమ్మమ్మలు, నాయనమ్మలంటే ఎందుకిష్టం? కారణాలు రాయండి.
జవాబు. అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లలను ఆప్యాయంగా పలుకరిస్తుంటారు. ఆట వస్తువులు కొని ఇస్తుంటారు. మంచి కథలు నీతిమాటలు చెబుతారు. అనారోగ్యం వస్తే దగ్గరుండి సేవలు చేస్తారు. అందుకే పిల్లలకు అమ్మమ్మ, నాయనమ్మలంటే ఇష్టం.

 

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1. శేఖర్ తాను తప్పు చేశానని నాయనమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చాడు. ఎందుకు ?
(
లేదా)
నాయనమ్మ ఓదార్పుతో శేఖర్ కలిగిన ఆలోచనలు ఊహించి రాయండి.

జవాబు.
రవి, శేఖర్లు మంచి స్నేహితులు. రవి తనతో ఆటలాడకుండా వాళ్ళ నాయనమ్మకు సేవలు చేయడం శేఖర్కు నచ్చలేదు. తనతో రవి ఆడకపోవడానికి నాయనమ్మే కారణమని, ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. దీని ఫలితంగా ఆమెకు కాలు విరిగింది. అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా గుబులైంది. తన వల్లే ఆమెకు ఈ కష్టం వచ్చింది. అదే అనుకోనిది జరిగి ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించే సరికి శేఖర్కు చాలా ఏడుపు వచ్చింది.

పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు. అలాగే ఇక్కడ శేఖర్ చేసింది అదే. తన తప్పు తెలుసుకొని బాధపడుతున్న శేఖర్ని పిలిచి అవ్వ పళ్ళు తినమని ఇచ్చేది. దానివల్ల ఆమెపై శేఖర్కి ఇంకా ఇష్టం పెరిగింది. నాయనమ్మకు తాను చెడు చేసినా తన పట్ల ఆమె చూపే ప్రేమకు కరిగిపోయి ఆమె పాదాల చెంతకు చేరాడు. తనలోని ఈర్ష్య నాయనమ్మ ప్రేమకు తొలగిపోయింది. అందుకే నాయనమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చాడు.

ప్రశ్న 2.‘వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారుఇది సబబేనా ? ఎందుకో వివరించండి.
(
లేదా)
నాయనమ్మ లాంటి పెద్దవాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో రాయండి.
(
లేదా)
నేటికాలంలో ఇంటాబయట వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది ? దానికి కారణాలు ఏమిటి?
(
లేదా)
నేటికాలంలో కొంతమంది కొడుకులు ముసలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్నున్నారు. కారణాలు తెల్పండి.

జవాబు.
అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం పంచేవాళ్ళు అమ్మానాన్నలుఅని ఓ సినీ కవి అన్నాడు. అమృతాన్నే చనుపాలుగా చేసి పట్టిన తల్లిని వయసు మీరిన తరువాత భారంగా భావించే బిడ్డలున్నంతవరకు తల్లులు వృద్ధాశ్రమాల్లో బాధ పడవల్సిందే. ఇక్కడ ఆ బిడ్డలు గ్రహించలేదో లేక కావాలని తెలియనట్లున్నారో కాని రేపు తాము కూడా యౌవనం దాటి వృద్ధులు అయినపుడు తమ లక్షణాలే కల తమ బిడ్డల వల్ల తాము కూడా ఇలాగే చూడబడతామని, నేటి యౌవనం గల తల్లిదండ్రులు రేపటి వృద్ధులని గ్రహించకపోవడం విచారకరం.

వృద్ధులు గతకాలపు అనుభవపు సారాలు. వారి అనుభవాలను గ్రహించి భావి జీవితాన్ని పూబాటగా మలచుకోవలసిన బాధ్యత బిడ్డలుగా మనందరి బాధ్యత. వారి మాటలు చాదస్తంగా, అయిష్టంగా ఉంటాయని భావించి మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటున్నాము. వృద్ధశబ్దానికి అర్థం పెద్దఅని పెద్దల మాట చద్దిమూటఅంటే బలాన్నిచ్చేది అని అర్థం. దీనిని ప్రస్తుత సమాజం మాటగా మాత్రమే స్వీకరించడం, ఆచరణ శూన్యం కావడం వల్ల పెద్ద అనర్థం జరుగుతోంది. ఇంట్లో గొడవలయినపుడు సర్ది చెప్పే పెద్దదిక్కు లేనపుడు బిడ్డల జీవితం కూడా ఏకాకి జీవితం అవుతుంది.

బాల్యంలో ఉన్నప్పుడు మనం మన పనులు. చేసుకోవడానికి కుదరదు అంటే వయసు చాలదు. ముసలితనంలో పనులు చేసుకోవడానికి వయసు సహకరించదు. అంటే వారికి మరల బాల్యం వచ్చినట్లే. చిన్నపిల్లలను సాకినట్లుగా వారికి మనం సేవ చేసి చిన్నప్పుడు వారు మనకు చేసిన సేవలు గుర్తు చేసుకోవాలి.

భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాల వల్ల మానవీయ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు అంతరించకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. కనుక పెద్దలను గౌరవించడం మనందరి విధి. రేపటి తరాలకు ఇది వారధి.

 

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.వృద్ధులకు సేవ చేయవల్సిన అవసరాన్ని వివరిస్తూ, కరపత్రం రాయండి.
జవాబు.

వృద్ధుల సంరక్షణ సమితి

యువతా నీ పయనమెటూ !
మేల్కోండి ! గమనించండి !
సోదర సోదరీమణులారా !

నేటి వృద్ధులు నిన్నటి యువకులు, నేటి యువకులు రేపటి వృద్ధులుఅన్న సంగతి మరచి ప్రవర్తించడం దురదృష్టకరం. పిన్న వయసులో మనం సేవలు చేయించుకొని పెరిగి పెద్దయి, వాళ్ళు పెద్దవారయ్యే సరికి బాధ్యత మరచి ఇంటి నుండి గెంటేస్తున్నాం. ఇది న్యాయమేనా ? చర్మం ముడతలు పడి, జుట్టు రాలిపోయి, కళ్ళు కనబడక, చెవులు వినబడక, పట్టు తప్పుతున్న కాళ్ళు చేతులతో పనులు చేసుకోలేని వృద్ధులైన తల్లిదండ్రులను అందరూ ఉండీ అనాథలను చేయడం కలవరపెడుతున్న విషయం.

వృద్ధాశ్రమాలు ఉన్నది అనాథలైన వారికి మేమున్నామంటూ ఆసరా, అండగా ఉండడానికే తప్ప అందరూ ఉన్న వారికి కాదు. కానీ వారిని చూడటానికి కూడా ఆశ్రమ నిర్వాహకులు దాతృత్వాన్ని చాటుతున్నారు. ఇది మనందరం. సిగ్గుతో తల దించుకోవలసిన విషయం. మీరు ఈ రోజు చేసిన పని రేపు మీ పిల్లలు మీ పట్ల ప్రవర్తిస్తే అప్పుడు మీ మానసిక స్థితి ఏమిటో ఒకసారి ఊహించుకోండి.

అమృతం తాగిన వారు దేవతలైతే, అనురాగామృతాన్ని పంచేవారు మన తల్లిదండ్రులు. అటువంటివారు వృద్ధులైనారని వారిపట్ల హీనంగా ప్రవర్తించడం మంచిది కాదు. వారే నీకు తోడుంటే నీ పిల్లలకు చక్కని బుద్ధులు నేర్పుతారు. తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని కథల రూపంలో మీ పిల్లలకు అందించి, వారి బంగారు జీవితానికి బాటలు వేస్తారు.

వృద్ధుల పట్ల పిల్లల తీరు బాగుండాలనే ఉద్దేశ్యంతో Xxxxన ఆదివారం 6 గం॥ భద్రాచలంఆలయ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.

ఇట్లు,
వృద్ధుల సంరక్షణ సమితి.

XXXX,
సిద్దిపేట.

 


IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

 1.అమ్మ = _____జనని, తల్లి, మాత

 2. రవి = _____సూర్యుడు, దివాకరుడు, ప్రభాకరుడు

 3.ఇచ్ఛ= ________వాంఛ, ఈప్స, కోరిక

 4.నాన్న = ______తండ్రి, జనకుడు, పిత

 5. స్నేహం = _____నెయ్యం, మైత్రి

 

నానార్థాలు:

1. వృద్ధులు = ___ముసలివారు, పెద్దలు

2.సేవ = ____శుశ్రూష, అనుసరణ, పూజ

3. పెద్ద = ___వృద్ధుడు, జ్యేష్ఠుడు, గొప్పవాడు.

4.కాలం = ____సమయం, నలుపు, చావు

5. క్షమ = ___ఓర్పు, భూమి, ఇష్టం

6.మిత్రుడు = _____జవాబు.
స్నేహితుడు, సూర్యుడు

వ్యుత్పత్త్యర్థాలు:

1.మిత్రుడు : _______
జవాబు.సర్వభూతములయందు స్నేహయుక్తుడు స్నేహితుడు, సూర్యుడు

 2. దిశ : __అవకాశమునిచ్చునది, ప్రార్ధక్షిణాది భేదములచే వ్యపదేశింపబడునది దిక్కు.

 

ప్రకృతి వికృతులు:

ప్రకృతి వికృతి
1.
సింహం- సింగం
2.
సహాయం సాయం
3.
నిద్ర నిదుర
4.
యత్నం జతనం
5.
స్వామి సామి
6.
స్నానం తానం

సొంతవాక్యాలు:

 1.ఆందోళన : వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందారు.

 2.ఆరోగ్యం : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు.

3.ఆదుకోవడం : పేద ప్రజలను ఆదుకోవడం మన ధర్మం.

 4.సహాయం : వరద బాధితులకు విద్యార్థులు సహాయం చేశారు.

వ్యాకరణాంశాలు:

సంధులు:

 1.నాయనమ్మ =నాయన + అమ్మ అత్వసంధి

 2.మందులిస్తు =మందులు + ఇస్తు ఉత్వసంధి

 3.తెలియనట్లు =తెలియని + ఇట్లు ఇత్వసంధి

 

సమాసాలు:

సమాసపదం

విగ్రహ వాక్యం

సమాస నామం

అమ్మానాన్న

అమ్మయును, నాన్నయును

ద్వంద్వ సమాసం

తొడఎముక

తొడ యొక్క ఎముక

షష్ఠీ తత్పురుష సమాసం

పెద్ద వయసు

పెద్దదైన వయసు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రతిరోజు

రోజు రోజు

అవ్యయీభావ సమాసం

రెండురోజులు

రెండు సంఖ్యగల రోజులు

ద్విగు సమాసం

భాషాభాగాలు గుర్తించండి.

 1.మా ఊరి ప్రక్కనే గోదావరి నది ఉన్నది.                         నామవాచకం

 2.మామిడిపండు తియ్యగా ఉంది.      విశేషణం

3.అతడు చాలా మంచివాడు.సర్వనామం

 

సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

 1. పరీక్ష చేశాడు. కాలు విరిగిందని చెప్పాడు.
జవాబు.పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.

 2. దగ్గరకు తీసుకున్నది. కన్నీళ్ళు తుడిచింది.
జవాబు.దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.

పాఠ్యభాగ సారాంశం:

వృద్ధులపట్ల సానుకూలవైఖరిని ప్రదర్శించాలి. ఇది మన ధర్మం. ఇంట్లో నాయనమ్మ జ్వరంతో బాధపడుతున్నది. కొడుకు, కోడలు సేవచేస్తున్నారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా నాయనమ్మను ఓదారుస్తున్నారు. మనమడు కూడా నాయనమ్మకు సపర్యలు చేస్తున్నాడు. అతని పేరు రవి. నాయనమ్మకు తన మనుమడంటే ఎంతో అభిమానం.

ఒకసారి బంధువులు ఊరి నుండి వచ్చారు. వారిలో శేఖర్ అనేవాడు రవితో సమానమైన వయసు కలవాడు. రవితో బాగా ఆడుకుందాముని అనుకున్నాడు. కాని రవి నాయనమ్మ సేవలో నిమగ్నమయ్యాడు. ఇది శేఖర్కు నచ్చలేదు. దాంతో శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మంచం పక్కన ఉన్నట్టి వస్తువులను తారుమారు చేశాడు.

దాంతో ఆమె వస్తువులను అందుకుంటూ కింద పడింది. కాలు విరిగింది. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉంది. శేఖర్లో పశ్చాత్తాపం మొదలైంది. తనవల్లే నాయనమ్మకు కాలు విరిగిందని భావించాడు. నాయనమ్మకు జరిగినదంతా చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. నాయనమ్మ కూడా అతడిని ఓదార్చింది. తప్పును మన్నించింది.

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...