సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, జులై 2023, సోమవారం

Viii. 1. త్యాగనిరతి - డా. సిద్దెంకి



త్యాగనిరతి

నన్నయ

చదువండి ఆలోచించి చెప్పండి

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్నలు

1. దధీచి ఎవరు?
2. దధీచి చేసిన త్యాగం ఏమిటి? ఎందుకు?
3. త్యాగం అంటే ఏమిటి?
4. మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.

పాఠం నేపథ్యం
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే 'ఇది ఇట్లా జరిగింది' అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు.
ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ అశ్వాసం నుండి గ్రహించారు.


కవి పరిచయం
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది.
(11వ శతాబ్దం)
వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో 'శారదరాత్రులు' అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. 'ఆంధ్రశబ్ద చింతామణి' అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో 'ప్రసన్నకథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వం' అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.



విద్యార్థులకు సూచనలు
పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
ఆ పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.


ప్రవేశిక
మన ప్రాచీనసాహిత్యంలో నైతికవిలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబిచక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలుసుకుందాం.

I

ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు 
నట్టి నీకు బాడియయ్య? యిప్పు 
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా 
హార విఘ్న మిట్టులాచరింప?

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనంజేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు 2

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

ధర్మజ్ఞులైన పురుషులు 
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ 
ధర్మముగా మదిఁ దలఁపరు 
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్, 3

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు. 'శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి' యను వేదవచనంబ గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి యిట్లనియె 4
4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను 
నాశ్రయించే నాశ్రితునెట్టి యధముఁడయిన 
విడువఁడనినను నేనెట్లు విడుతు దీని? 
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె? చెపుమ 5

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.


ఆలోచించండి - చెప్పండి.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు?
"ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్" దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు?
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు?

వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండె? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీ యత్నం బాహారార్థం బేని యిప్పుం డివ్వసంబున మృగ మహిష వరాహ భగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువ' ననిన శ్యేనం బిట్లనియె... 6
6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షిఁ 
బూని కావ నీకు బుద్దియేని య
వని నాథ! దీని యంత నీ మాంసంబు 
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ 7
7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

చ॥ అనిన 'ననుగ్రహించితి మహా విహగోత్తమ' యంచు సంతసం 
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం |
నఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె 
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్  ... 8
8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.


ఈ॥ దానికి నచ్చెరువడి ధర 
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం 
దాన తుల యెక్కెనంతన్ 
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ 9
9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...


వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి 'నీధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యం శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్థిల్లుచుండు'మని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి. 10
10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు. 

ఆలోచించండి - చెప్పండి.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది?
"అనుగ్రహించితి మహా విహగోత్తమ' అని శిబిచక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్ధం చేసుకున్నారు?
శిబిచక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా! త్యాగం అవశ్యకత ఏమిటి?

తాత్పర్యాలు

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...

10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు.

ఇవి చేయండి

1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1.. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి?
2. ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.
అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి 
ధర్మువు సర్వంబునకుహితంబగహుమన
ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం 
వేద విహితంబైన యాహారంబు 
ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు 
నాశ్రీ త్యాగమిడి ధర్మువగునే? చెపుమ

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.
బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు 
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు 
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల.

అ) 'చెట్టు' అను పదానికి సరిపోయేపదం.(ఎ)
ఎ) తరువు,   బి) గురువు,   సి) ఫలం, డి) గుణం

ఆ) త్యాగానికి గురువులు ఎవరు?(బి )
ఎ) మానవులు,  బి) చెట్లు సి) పక్షులు డి) జంతువులు

ఇ) తనువును చీల్చి యిచ్చేవి(సి)
ఎ) మేఘాలు బి) నదులు సి) చెట్లు డి) పక్షులు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్ధం (సి)
ఎ) పెరుగుట బి) తరుగుట సి) బ్రతుకుట డి) మేల్కొనుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక (డి)
ఎ) భారం బి) ప్రాణం సి) యోగం డి) త్యాగం

III స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.

ఆహారం తినే సమయంలో ఇతరులకు విఘ్నం కలిగించకూడదు. ఆ సమయంలో మాట్లాడించడం, ఆటపట్టించడం లేదా ఇతర పనులతో ఇబ్బంది పెట్టడం వల్ల వారు ప్రశాంతంగా భోజనం చేయలేరు. ఆహారాన్ని సరిగా నమలకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భోజనం చేయడం ఒక అవసరమైన, గౌరవించదగిన ప్రక్రియ. ఇతరుల పట్ల మర్యాద, సహనం, గౌరవం చూపుతూ వారు భోజనం పూర్తిచేసే వరకు వేచి ఉండాలి. ఇలా చేయడం మంచి సంస్కారం, మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది.

ఆ) 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
ధర్మం మానవ జీవితానికి పునాది. ధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజంలో శాంతి, న్యాయం, సామరస్యం నెలకొంటాయి. సత్యం చెప్పడం, పెద్దలను గౌరవించడం, పరులకు సహాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటి సత్కార్యాలే ధర్మం. ధర్మాన్ని పాటించే వ్యక్తి అందరి ఆదరణను పొందుతాడు. కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలి. "ధర్మో రక్షతి రక్షితః" అనే సూక్తి ప్రకారం ధర్మాన్ని రక్షించిన వారినే ధర్మం రక్షిస్తుంది. కాబట్టి అందరూ ధర్మాన్ని ఆచరించడం ప్రతి మనిషి కర్తవ్యం.

ఇ) ఇతరుల కొఱకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.

ఇతరుల శ్రేయస్సు కోసం మన శక్తి మేరకు త్యాగాలు చేయడం గొప్ప మానవతా గుణం. అవసరంలో ఉన్నవారికి ధనం, ఆహారం, వస్త్రాలు, విద్యా సహాయం అందించవచ్చు. మన సమయం, శ్రమ, జ్ఞానాన్ని పంచుకొని వారికి అండగా నిలవవచ్చు. రక్తదానం, అవయవదానం వంటి మహోన్నత సేవలు కూడా త్యాగమే. ప్రకృతిని కాపాడేందుకు స్వార్థాన్ని తగ్గించి బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల సుఖం కోసం చేసిన చిన్న త్యాగం కూడా సమాజంలో ప్రేమ, దయ, సహకార భావాలను పెంపొందించి మన జీవితాన్ని సార్థకం చేస్తుంది.


ఈ) 'త్యాగనిరతి' అనే శీర్షిక పాఠానికి ఏవిధంగా తగినదో రాయండి.
ఈ పాఠంలో దధీచి మహర్షి తన ఎముకలను దేవతల మేలు కోసం దానం చేసి పరమ త్యాగాన్ని చాటాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నా కవచకుండలాలను దానంగా ఇచ్చి దానశీలతను ప్రదర్శించాడు. ఈ మహనీయులు స్వార్థం లేకుండా పరుల శ్రేయస్సు కోసం తమ సర్వస్వాన్ని అర్పించారు. త్యాగమే వారి జీవిత లక్ష్యంగా నిలిచింది. అందువల్ల ఈ పాఠానికి 'త్యాగనిరతి' అనే శీర్షిక అత్యంత సముచితంగా, భావగర్భితంగా సరిపోతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి..

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని అనుభూతిని వివరించండి.
త్యాగం మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దే గొప్ప సద్గుణం. స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల శ్రేయస్సు కోసం తన సమయం, శ్రమ, సంపద, అవసరమైతే ప్రాణాలను సైతం అర్పించడం త్యాగం. త్యాగం వల్ల మనిషిలో దయ, కరుణ, ప్రేమ, సేవాభావం వంటి ఉన్నత విలువలు పెంపొందుతాయి. త్యాగం చేసినవారు తమ కోసం కాకుండా సమాజ హితం కోసం జీవిస్తారు. దధీచి మహర్షి తన ఎముకలను దేవతల విజయానికి దానం చేసి త్యాగానికి ఆదర్శంగా నిలిచాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కవచకుండలాలను దానంగా ఇచ్చి దానగుణాన్ని చాటాడు. వారి త్యాగం వల్ల ఇతరులకు మేలు జరిగింది. త్యాగం చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి, ఆనందం, గౌరవం ధనంతో కొనలేనివి. త్యాగం వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టి సమాజంలో ఆదర్శంగా నిలిపిస్తుంది. అందువల్ల త్యాగం మానవత్వానికి చిహ్నం, సమాజ అభ్యున్నతికి మూలాధారం.

IV. సృజనాత్మకత / ప్రశంస.

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.

ఇబ్రాహీంనగర్,
తేది: 20.06.2025.

కు

సంపాదకులు గారికి,
వార్తాపత్రిక.

విషయం: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించవలెనని విజ్ఞప్తి.

మహోదయా,

మీ వార్తాపత్రిక ద్వారా ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. అన్నదానం ఆకలిని తీర్చితే, అవయవదానం ప్రాణాలను కాపాడుతుంది. మరణానంతరం దానం చేసిన కళ్లతో అంధులకు చూపు, మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాలతో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అయినప్పటికీ అవగాహన లేకపోవడం, అపోహల కారణంగా చాలామంది అవయవదానానికి ముందుకు రావడం లేదు. కాబట్టి అవయవదానం ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేక కథనాలు, వ్యాసాలు ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.

ధన్యవాదాలతో,

ఇట్లు,

విధేయురాలు,

(చిత్తరి వైష్ణవి)

8వ తరగతి,

ఇబ్రహీంనగర్.


V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్ధాలను రాయండి.

ఉదా: కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.

కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు. = ధర్మం 

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు. = మేలు

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణా రాష్ట్రం సిద్ధించింది. = సమర్పణ 

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక! = విస్తరించు, అభివృద్ది పొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. = ఆకలితో ఉన్నవాడు 

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా: ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో కలపడం ధర్మంకాదు
పాడి: న్యాయం, ధర్మం, తీర్పు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
అడవి:  అరణ్యం, విపినం

VI.భాషను గురించి తెలుసుకుందాం.


1. కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా: లోపలకి రావచ్చు అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి (4) 1. ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు. (3) 2. ప్రశ్నార్ధకవాక్యం
ఇ) ఆహా! ఎంత బాగుందో (1) 3. సామర్థ్యార్ధక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు (5) 4. ప్రార్ధనార్ధక వాక్యం
ఉ) గిరి! ఎక్కడున్నావు? (2) 5. నిషేధార్థక వాక్యం

6. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) ఇంద్రాగ్నులు - ఇంద్ర + అగ్నులు = సవరదీర్ఘ సంధి
ఆ) త్యాగమిది -  త్యాగము + ఇది  ఉత్వసంధి 
ఇ) ఆహారార్థం - ఆహార + అర్థం  = సవర్ణదీర్ఘ సంధి 
ఈ) నేనెట్లు  - నేను + ఎట్లు ఉత్తగుంధి
ఉ) శౌర్యాది - శౌర్య + ఆది  సవర్ణదీర్ఘ సంధి 

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలు – రంతిదేవుడు, కర్ణుడు


 
ప్రాజెక్ట్ పేరు ......................................................
ప్రాజెక్ట్ సంఖ్య 
విద్యార్థి పేరు ......................................................
క్రమసంఖ్య ......................................................
సేకరించిన వివరాలు 

నివేదిక

త్యాగం, దానం, పరోపకారం వంటి సద్గుణాలు మనిషిని మహనీయునిగా నిలబెడతాయి. భారతదేశ చరిత్ర, పురాణాల్లో త్యాగబుద్ధికి ఆదర్శంగా నిలిచిన మహనీయులలో రంతిదేవుడు, కర్ణుడు ప్రముఖులు.

1. రంతిదేవుడు

రంతిదేవుడు దయ, దానం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహారాజు. ఒకసారి నలభై ఎనిమిది రోజుల ఉపవాసం తర్వాత భోజనం చేయబోతుండగా వరుసగా వచ్చిన అతిథులకు తన వద్ద ఉన్న ఆహారమంతా దానం చేశాడు. చివరకు తాగడానికి మిగిలిన కొద్దిపాటి నీటిని కూడా దాహంతో వచ్చిన ఒక చండాలునికి ఇచ్చాడు. తన ఆకలి, దాహాన్ని లెక్కచేయకుండా పరుల బాధను తొలగించడమే తన ధర్మమని భావించాడు. ఈ విధంగా రంతిదేవుడు నిస్వార్థ సేవాభావానికి ఆదర్శంగా నిలిచాడు.

2. కర్ణుడు

కర్ణుడు మహాభారతంలోని దానవీరుడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతని సహజ కవచకుండలాలను దానంగా అడిగినప్పుడు, అవి తన ప్రాణరక్షణకు అవసరమని తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా దానం చేశాడు. తన మాటను నిలబెట్టుకొని దానగుణాన్ని ప్రదర్శించాడు. అందుకే కర్ణుడు **"దానవీరశూర కర్ణుడు"**గా చిరస్మరణీయుడయ్యాడు.

ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న విషయాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా త్యాగం, దానం, పరోపకారం వంటి మానవీయ విలువల గొప్పతనాన్ని తెలుసుకున్నాను. రంతిదేవుడు ఆకలితో ఉన్నప్పటికీ తన ఆహారాన్ని ఇతరులకు పంచడం, కర్ణుడు తన ప్రాణరక్షణకు అవసరమైన కవచకుండలాలను కూడా దానం చేయడం ద్వారా నిస్వార్థ త్యాగానికి ఆదర్శంగా నిలిచారని గ్రహించాను. పరుల శ్రేయస్సు కోసం చేసిన త్యాగమే నిజమైన మానవత్వమని తెలుసుకున్నాను. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, దానగుణాన్ని అలవరచుకోవడం, సమాజ సేవలో భాగస్వామి కావడం ప్రతి మనిషి కర్తవ్యమని ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్నాను. ఈ మహనీయుల ఆదర్శాలను నా జీవితంలో ఆచరించాలని సంకల్పించాను.


సూక్తి:

"త్యాగం చేసినవాడు గొప్పవాడు; పరుల కోసం జీవించినవాడు మహనీయుడు."

 

నేనివి చేయగలనా?
1. త్యాగంలోని గొప్పదనాన్ని సొంతమాటల్లో చెప్పగలను.
అవును /కాదు
2. అపరిచిత పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలను. సరైన జవాబులు గుర్తించగలను.
అవును /కాదు
3. నిత్యజీవితంలో జరిగిన ఒక సంఘటనలోని త్యాగభావాన్ని గుర్తించగలను.
అవును /కాదు
4. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికకు లేఖ రాయుము
అవును /కాదు

సూక్తి
త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల మానవజన్మ సార్థకమవుతాయి.ద్ఫజ్డ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి