I
నిన్నటిదాక లేవుకద నింగిని, పుట్టియు పుట్టకుండనే
మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే
మన్న! యిదేమినీతి, నడుమంతరపున్ సిరి కుబ్బువారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె మేఘమా?
ప్రతిపదార్థం:
మేఘమా = ఓ మేఘమా!
నిన్నటిదాక = నిన్నటివరకు
నింగిని = ఆకాశంలో
లేవుకద = లేవు కదా!
పుట్టియు పుట్టకుండనే = పుట్టీ పుట్టకుండానే
మిన్న = ఆకాశానికి
ఎగబ్రాకినానను + అనుచు = ఎగబాకానని (అంత ఎత్తుకు చేరుకున్నానని)
మీసలు = మీసాలు
దువ్వుచు = దువ్వుకుంటూ
నవ్వుచు + ఉంటివి = నవ్వుతున్నావు
ఏమి + అన్న = ఎందుకన్నా!
ఇది + ఏమి = ఇది ఎక్కడి
నీతి = నీతి (నీతికాదు అని భావం)
నడుమంతరపు = మొదటి నుంచీ లేకుండా
సిరికిన్ = సంపదను చూసుకొని
ఉబ్బువారి = మిడిసిపడేవారి
గర్వ + ఉన్నతి = గొప్ప గర్వం
నిల్వు = నిలువునా
నీరు + అయి = నీరై
మహా + ఉదధి = సముద్రం
పాలు + అయిపోదె = పాలు + అయిపోదు + ఎ = పాలైపోదా ? (అవుతుందని భావం)
కం. చిటపట చినుకులు రాలెను
పటపట వడగండ్లు పుడమిపై బడె, ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్.
______________________________________________________________________
ఆలోచించండి-చెప్పండి.
మేఘాన్ని, నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?
వర్షం పడడాన్ని కవి వర్ణించాడుకదా! జోరువానచం. పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది?
____________________________________________________________________
II
సీ. నేలపై మోపిన కాలు చుఱుక్కని
బొబ్బ లెక్కెడి దినమ్ములు గతించె,
నించుక యశ్రద్ద నుంచిన పాదమ్ము
జఱుకుజఱుక్కని జాఱదొడగె
పగలు రాత్రి యనక ప్రభు పాలితులనక
ప్రజలందఱును ఛత్రపతులె యైరి
నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె
తే.గీ॥ పులకరించి భూసతి రామచిలుకయయ్యె
హుంకరించి యాబోతులు అంకెవేసె
నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టె
నాశ లుప్పొంగి పారె వర్షాగమమున
*ఉ. ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం
పన్నులమీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా! 4
ప్రతిపదార్థం :
వానదేవుడా! = ఓ వానదేవుడా!
ఉన్నత = ఎత్తైన
సౌధ = మేడల యొక్క
గోపురపు = శిఖరాల మీద
ఉయ్యెలమంచములు + అందు = ఉయ్యాల మంచాలలో
తిన్నగా = హాయిగా
కన్నులు మూసి = కళ్ళు మూసుకొని
గుఱ్ఱుమని = గురకలు పెడుతూ
గాఢ = గాఢమైన (ఒళ్ళు మరచిన)
సుషుప్తిని = నిద్రలో
మున్గి+ ఉండ = మునిగి ఉన్న
సంపన్నుల మీదికిన్ = ధనవంతుల మీదికి
చనగ = పోవడం
వాటము కామిని = వీలు కాదని
చిన్నని = పేదవారిపైన
చొప్పకప్పు = జొన్నచొప్పుతో కప్పుకున్న
గుడిసెల్ = గుడిసెలను
వడి = గభాలున (వేగంగా)
కూలగ = కూలిపోయేటట్లుగా
దాడిచేతువా! = దాడి చేస్తావా! (చేయవద్దని భావం)
____________________________________________________________________
ఆలోచించండి- చెప్పండి
ప్రజలందరు ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు?
'భూసతి రామచిలుకయయ్యె' అని కవి ఎందుకన్నాడు?
వానలు పడడం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది? ఏమేం జరుగుతుందో
___________________________________
III
*చం. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి యీ
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా! 5
చం. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెపతెపలాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలుపోయినారు, నీ
విపుడె సవారిచేసి యలయింపకు వారిని వానదేవుడా
______________________________________________________________________
ఆలోచించండి-చెప్పండి.
మబ్బులను చూసి గుడిసెల కప్పులు, గుంజలు ఎందుకు గడగడలాడినాయి?
'శరీరములను రిపులకు అప్ప చెప్పడం' అంటే నీకేమి అర్థమయింది?
పుడిసెడు పేదకాపురము అని కవి అన్నాడు కదా! పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి?
పుట. 23
______________________________________________________________________
తాత్పర్యాలు
1. ఓ మేఘమా! నిన్నటివరకు ఆకాశంలో లేనేలేవు కదా! పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలుదువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలౌతుందని తెలుసుకో!
2. చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్దపెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.
3. కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపిలేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు ఛత్రీలు పట్టుకోవడంతో ప్రభువులు పాలితులు (రాజు-పేద) అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి.
వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.
4. ఓ వానదేవుడా! ఎత్తైన మేడలమీద, ఉయ్యాల మంచాలలో గుఱకలు పెడుతూ గాఢనిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలుకాదని, పేదవాళ్ళు జొన్నచొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడిచేస్తావా? వద్దు అట్లా చేయకు.
5. గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేదసంసారాన్ని నాశనం చేయకు.
6. పై కప్పులు సరిగ్గాలేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవాటికి) శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా! ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధపెట్టకు.
__________________________________________
ఇవి చేయండి
I విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం ? ఎందుకు ?
జవాబు. నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు వాన ధారలను మా కిటికీలోనుంచి చూస్తే బలే సరదాగా ఉంటుంది. వాన చినుకులలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని భయమే గానీ చిరుజల్లుల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. మా పాఠశాల ఆటస్థలంలో మేం ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా వానజల్లు పడుతుంది. అప్పుడు చురుకు చురుకుమంటూ చెంపలను కొడుతున్నట్లు పడే చిరుజల్లు ఎంతో బాగుంటుంది. అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం.
2. పాఠం చదివారు కదా! కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు. పరిచయం : కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ సరైనవే. అ) మేఘం గర్వం : వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే ఆరు ఋతువులలో వర్ష ఋతువు మధ్యలో
వస్తుంది మధ్యలోనే పోతుంది. ఎండాకాలంలో భూమిమీద నీరే ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలై కురుస్తాయి. అందువల్ల మేఘం హఠాత్తుగా ఏర్పడినట్లు అనిపిస్తుంది. నల్లని మబ్బు మీసాలు దువ్విన ఆకారంలో కనిపిస్తుంది. ఇంత మిడిసిపడిన మేఘం కూడా నీరైపోయి చివరకి సముద్రం పాలౌతుంది.
ఆ) వర్షధార : చిన్నచిన్న చినుకులతో మొదలయ్యే వాన కుండపోతగా మారడం మనం నిత్యం చూస్తున్నదే.
ఇ) ప్రజలు – ఛత్రపతులు : వానకు తడవకుండా ప్రతి ఒక్కరూ గొడుగు పట్టుకుంటారు. .
ఈ) వానదాడి: వాన తన ప్రతాపాన్ని భవంతులమీద కాక పేదల గుడిసెల మీద చూపుతుంది. మేడలు, మిద్దెలు వానకు తట్టుకుంటాయి. కానీ ఎండకు ఎండి, గాలికి పట్టుతప్పి ఉన్న పేదల గుడిసెలే వానకు తేలికగా కూలిపోతాయి.
ముగింపు : ఈ పాఠంలో కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ ప్రతిసారీ మన అందరి అనుభవంలోకి వచ్చేవే. చక్కని పరిశీలన దృష్టి కలిగిన కవి కనుక పల్లా దుర్గయ్య ఈ అంశాలను మనోహరంగా వర్ణించారు.
__________________________________________
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
అ. నడుమంత్రపు సిరికి గర్వపడే వారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది.
జవాబు.
“నడుమంతరపున్ సిరి కుబ్బు వారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె”
ఆ. నెర్రెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.
జవాబు.
“నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె”
ఇ. పటపటమని వడగండ్లు నేలమీద పడినాయి.
జవాబు.
“పటపట వడగండ్లు పుడమిపై బడె”
ఈ. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
జవాబు.
“ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల”
ఉ. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు, గుంజలు గడగడలాడుతున్నాయి.
జవాబు.
“గుడిసెల కప్పులొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత”
2. కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లై విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన.
ప్రశ్నలు:
అ. వాన ఎట్లా కురిసింది ?
జవాబు. చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసింది.
ఆ. వాన వేటిని నింపడానికి కురిసింది ?
జవాబు. వాన చెరువులు, బావులు నింపడానికి కురిసింది.
ఇ. వానవల్ల కలిగే లాభమేమిటి?
జవాబు. పసిడి పంటలను ఇవ్వడం, పరిసరాలను పచ్చదనంతో నింపడం అనే రెండూ వాన వల్ల కలిగే లాభాలు.
ఈ. “పసిడి పంటలు” అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థక పదం ఏది?
జవాబు.
పసిడి అనే పదానికి సమానార్థక పదం బంగారం.
ఉ. పై కవితలో ఉన్న జంటపదాలు ఏవి ?
జవాబు.
జలజల, గలగల అనేవి పై కవితలో ఉన్న జంట పదాలు.
__________________________________________
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతకాలంలో ఎట్లా ఉంటుంది ?
జవాబు. శీతకాలంలో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ చలి బాధ కూడా భవనాలలో ఉండే వారికంటే సౌకర్యవంతంగా లేని గుడిసెలలో ఉండే వారికి ఎక్కువ. ఈ కాలంలో కూడా ఉన్నవారు ముసుగుదన్ని పడుకుంటే, లేని వారు, నిరుపేదలు కడుపు నింపుకోడానికి కష్టపడుతూనే ఉంటారు. శీతాకాలంలో పగటి పొద్దు తక్కువ. రాత్రిపొద్దు ఎక్కువ. సాయంత్రం తొందరగా చీకటిపడుతుంది. అంతకు ముందునుంచే మంచు కురవడం మొదలవుతుంది. రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. తెల్లవారిన చాలాసేపటికి గానీ సూర్యుడు కనబడడు. పొగమంచు తొలగే వరకూ ప్రజలు చలికి వణుకుతూనే ఉంటారు.
______________________________________________________________________
ఆ. “చిన్ని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడిచేతువా ?” అని కవి ఎందుకు అని ఉంటాడు ?
జవాబు. సాధారణంగా వర్షం పడినప్పుడు బలమైన పునాదులతో, ఇనుము, సిమెంటులతో నిర్మించిన భవనాలకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తాటాకులతోనో, జొన్న చొప్పతోనో కప్పిన గుడిసెలకు మాత్రం ప్రమాదమే. అవి వర్షం జల్లులకు నానిపోయి కూలిపోతాయి కూడా. అందువల్లనే కవి ఓ వానదేవుడా! ఎత్తైన మేడలలో ఉండేవారి ఇళ్లను ఏమీ చేయలేక జొన్నచొప్పతో కప్పిన పేదల ఇళ్ళపై దాడి చేస్తావా ? చేయవద్దు సుమా! అని కవి అని ఉంటాడు
______________________________________________________________________
ఇ. వర్షాల కోసం ఎవరెవరు ఎదురుచూస్తారు ? ఎందుకు ?
జవాబు. వర్షాల కోసం భూమిపై ఉండే ప్రతి జీవి ఎదురుచూస్తుంది. మండే ఎండలతో బాధలు పడుతూ తాగడానికి గుక్కెడు నీళ్ళైనా లేని పరిస్థితులలో దాహం తీర్చుకోవడానికి ప్రతి జీవి ఎదురుచూస్తుంది. వర్షంపడితే బావులు, చెరువులూ నిండుతాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. పశువులకూ, పక్షులకూ, మనుషులకూ మంచినీరు బాగా లభిస్తుంది. ఆబోతులైతే హుంకారంతో రంకెలు వేస్తాయి. వర్షం వస్తేనే రైతులు నాగలిపట్టి వ్యవసాయపు పనులు మొదలుపెడతారు. వర్షం వల్లనే నేలంతా పులకరించి పచ్చని పైర్లతో సస్యశ్యామలమవుతుంది.
______________________________________________________________________
ఈ. డా॥ పల్లా దుర్గయ్య గురించి రాయండి.
జవాబు.పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు ‘సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగమైన ‘వర్షం’ ఆయన రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యంలోది.
______________________________________________________________________
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు. ‘వర్షం’ అనే పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో కవి మేఘం యొక్క గర్వం, వర్ష విజృంభణ, నేలపులకింత, విన్నపం అనే అంశాలను మనోహరంగా వర్ణించారు.
2. మేఘం గర్వం : మేఘం పుట్టీ పుట్టకుండానే ఆకాశంలోకి ఎగబాకింది. నల్లమేఘాలకొసలు మీసాలు దువ్వుతూ నవ్వుతున్నట్టున్నాయి. మధ్యలో వచ్చి మధ్యలోనేపోయే నీరు అనే సంపదతో మిడిసిపడినా మేఘం కరిగి నీరయి నేలపైపడి చివరికి సముద్రం పాలు కావలసిందే.
3. వర్ష విజృంభణ: చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.
4. నేల పులకింత : వేసవి ఎండలకు నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గొడుగులు అంటే ఛత్రాలు పట్టుకొని ఛత్రపతులు అయ్యారు. వర్షం అన్ని జీవుల్లో
5. ఆశలు నింపింది. విన్నపం : వానతో పూరిగుడిసెలలో ఉండే పేదలను ఇబ్బంది పెట్టవద్దని కవి వానదేవుణ్ణి ప్రార్థించాడు.
__________________________________________
IV. సృజనాత్మకత / ప్రశంస
1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు. ప్రకృతిలోని ప్రతి దృశ్యమూ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చేదే. పున్నమి వెన్నెల, ఇంద్రధనుస్సు, లేగదూడల పరుగులు, నదిలో తిరిగే పడవులు, పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ళ, జలపాతాల చప్పుడు ఇలా ప్రకృతి దృశ్యాలు మనలను ఎక్కడికో తీసికొని వెళతాయి. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో పక్షులు గూళ్ళకు చేరేటప్పుడు చేసే కూతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది కూడా ఏదైనా ప్రశాంత వాతావరణంలో ఏ మామిడి తోటలోనో, నది ఒడ్డున కూర్చుని వింటే, ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత కాలమైనా మరచిపోలేము. కోకిల కుహూ కుహూ రావాలు, పిచ్చుకమ్మల కిచకిచలు, చిలుకమ్మల, కాకమ్మల కూతలు భాషకందని అనుభూతులు.
2. ఎండాకాలంలో వాతావరణాన్ని, ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
1. పరిచయం : గ్రీష్మఋతువులో ఎండలు మెండుగా ఉంటాయి. అంటే ఏప్రిల్, మే నెలల్లో కాసే ఎండలను తట్టుకోవడానికి ప్రజలు ఎన్నో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎండలు, ఉక్కపోత, తీరని దాహం, వడగాలులు ముఖ్య లక్షణాలు.
2. ఎండలు : ఎండాకాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది. తెలతెలవారుతూనే సూర్యుడు పరుగులు తీస్తూ పైపైకి వస్తూంటాడు. పొద్దున్నుంచే ఎండతీవ్రత పెరుగుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం తలపైన గొడుగు లేకుండా కాలికి చెప్పులు లేకుండా నడవలేం.
3. ఉక్కపోత: ఎండాకాలంలో విపరీతంగా చెమట పడుతుంది. ప్రతి ఒక్కరూ విసనకర్రలతోనో, పంకాలతోనో, చలిమరలతోనో సేదతీరవలసిందే.
4. తీరని దాహం : విపరీతమైన చెమట వల్లనే గొంతు తడి ఆరిపోయి ఎక్కువ దాహం వేస్తుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఆ దాహం తీరదు. అందువల్ల ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
5. వడగాలులు : సాయంత్రం పూట మొదలై అర్ధరాత్రి వరకూ వీచే వడగాలులు చాలా ప్రమాదకరమైనవి. ఈ గాలులు వడదెబ్బకూ, ప్రాణాపాయానికీ ముఖ్యకారణాలు. అందుకోసం చల్లని నీడలో సేదతీరాలి.
6. ముగింపు : ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఎండలో తిరగకపోవడం, చల్లని నీడలో సేదదీరడం వంటి జాగ్రత్తలతో ఎండాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
V. పదజాల వినియోగం:
2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
అ. సోమనాద్రిరాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది.
జవాబు. అతికించడం
ఆ. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు.
జవాబు.రైతులు
ఇ. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది.
జవాబు.గాలి
ఈ. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి.
జవాబు.వేగం
3. కింది వాక్యాలు చదువండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.
అ. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కాని ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
జవాబు.సముద్రం,ఉదధి, పయోధి
ఆ. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
జవాబు.నింగి ,అంబరం
ఇ. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
జవాబు.భూమి , అవని, పుడమి
కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
తప్పకుండా
అ) బొబ్బలెక్కు – చిన్నపిల్లవాడి చేతిపై దోమ కరిచింది, అక్కడ బొబ్బలెక్కింది.
ఆ) అశ్రద్ధ – పాఠాలపై అశ్రద్ధ చూపడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులు రాలేదు.
ఇ) పటపట – వర్షం మొదలయ్యగానే కిటికీ గాజుపై జల బిందువులు పటపట మోగాయి.
ఈ) ఆశలుప్పొంగు – ఉద్యోగం వచ్చిందన్న వార్త విన్న వెంటనే అతని మనసులో ఆశలుప్పొంగాయి.
ఉ) పులకరించు – జాతీయ గీతం విన్నప్పుడు మనసంతా గర్వంతో పులకరించింది.
లింగములు
2. కింది పేరాలోని పుంలింగ స్త్రీ లింగ నపుంసక లింగ పదాలను గుర్తించి రాయండి.
స్త్రీలింగ పదాలు
సునీత
స్నేహితురాలు
పుంలింగ పదాలు
సురేశ్
అన్నయ్య
గోపాల్
నపుంసక లింగ పదాలు
చెట్టు
తొర్ర
బడి
సన్నివేశం
________________________________________
ఉ. నిన్నటిదాక లేవుకద నింగిని, పుట్టియు పుట్టకుండనే
మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే
మన్న! యిదేమినీతి, నడుమంతరపున్ సిరి కుబ్బువారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె మేఘమా?
తాత్పర్యం :
ఓ మేఘమా! నిన్నటివరకు ఆకాశంలో లేనేలేవు కదా! పుట్టీ పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలౌతుందని తెలుసుకో!
ఉ. ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం||
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!
తాత్పర్యం : ఓ వానదేవుడా! ఎత్తైన మేడలమీద, ఉయ్యాల మంచాలలో, గుఱకలు పెడుతూ, గాఢనిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలుకాదని, పేద వాళ్ళు జొన్నచొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడిచేస్తావా ? వద్దు అట్లా చేయకు.
వానాకాలాన్ని వర్ణించే రెండు మూడు పాటలు లేదా కవితలు సేకరించండి. వాటిని రాసి, చదివి వినిపించండి.
__________________________________________
1. ప్రాజెక్టు శీర్షిక : : వానా కాలాన్ని వర్ణించే రెండు పాటలు / కవితలు సేకరించడం, నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ :
అ) సమాచారం సేకరించిన తేది:
ఆ) సమాచార వనరు : అంతర్జాలం
3. సేకరించిన విధానం : నేను అంతర్జాలం నుండి ఈ క్రింది పాటలను సేకరించాను.
1.
2.
3.
4.
4. నివేదిక :
వానా వానా వెల్లువలో
రైతు ఆశల పల్లకి
వర్షాధారల
పాట 2 :
వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారాణికి తలబ్రాలు
విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెల్లివిరిసెను మురిపాలు
కత్తులు కత్తులు కలిసిన యట్టుల
ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చెక్కని మెరిసింది.
గడగడ గడగడ దివి ఉరిమింది.
చకచక చకచక దిశ మెరిసింది
చలిగాడుపు రివరివ విసిరింది.
పాడు కరవులకు బాణాలు మా
పంట చేలకివి ప్రాణాలు మా ॥ వచ్చెను ॥
కాపు కన్నులకు ముత్యాలు వరి
కర్రల నోళ్ళకు చనుబాలు ॥ వచ్చెను ॥
కోడెనాగులై ఉరికే వాగులు
క్షీరధారలై పారే తోగులు
భూసతి వానల తానములాడి
పచ్చిక కోకల పైట సవరించె ॥ వచ్చెను ॥
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి