సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

Siddenky లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Siddenky లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2026, ఆదివారం

కాలాన్ని మరువని నల్లాల కథలు

దళిత కథలలో విస్మృతికి గురైన కథలు నల్లాల లక్ష్మీరాజం గారివి. ప్రధానంగా దళిత కథలలో ఎక్కడ వారి కథ ప్రచురించ బడకపోవడం,వారి గురించి వారి కథల గురించి చర్చించకపోవడం విశ్లేషించకపోవడం బాధాకరం.గొప్ప కథలు రచించిన నల్లల లక్ష్మీరాజు తిరుగు ప్రయాణం కథలపై నా విశ్లేషణ.
ప్రచురించిన తొలి వెలుగు పత్రిక తేది. 24.05.2026 నప్రచురితమైంది తొలివెలుగు యాజమాన్యం,సంపాదకులు, మధుకర వైద్యులు అన్న గారికి పేరుపేరునా జై భీమ్ లు
///////////////////////




నల్లాల లక్క్ష్మిరాజం ‘తిరుగులేని ప్రయాణం’  విస్మృత కథకులు నల్లాల లక్క్ష్మిరాజం జగిత్యాల జిల్లాలోని తక్కెళ్లపల్లిలో రాజవ్వ, రాజయ్యల దంపతుల సంతానముగా తేది: 05.10.1970న జన్మించారు. వీరిది మాల కులం. కష్టపడుతూ చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ప్రచారాన్ని కోరుకోలేదు. తన పనిలో నిమగ్నమయ్యే వ్యక్తిత్వం కలవారు. వీరి కథలు ‘మÖడుతరాల తెలంగాణ కథ’, ‘తెలంగాణ దళిత కథలు’లో లేవు కాబట్టి విస్మృత కథకుడిగా చెప్పుకోవచ్చు.  వీరు రచించినవి ఎనిమిది కథలు మా(తమే తన కాలాన్ని నిక్షిప్తం చేశాడు. తన కథా సంపుటి పేరు ‘తిరుగు ప్రయాణం’. లక్క్ష్మిరాజం తొంభై దశకంలోని కల్లోలాన్ని తన కథల్లో ఇముడ్చుకున్నారు. పోలీసు కావడం వలన పోలీసు దృక్పథం, పోలీస్ నేపథ్యంతో వారి కథలలో కనబడుతుంది. దొరల పెత్తనాలు, అణిచివేతలు, అక్రమాలు దర్శనమిస్తాయి. 

  నక్సల్బరీ ఉద్యమానంతరం అటు ఊరిని శాసించే దొరలో, దొర అంటే భయపడే రాజేష్‌లో భయోత్పాతాన్ని చిత్రించిన  కథ ‘తిరుగు ప్రయాణం’. భయం వల్ల ఇరువురి జీవితాలు ఎంత అతులాకుతులం అయ్యాయో తెలియజేస్తుంది. దొర తన జీతగాడైన రాజేష్‌ని కొట్టడం వల్ల నేను అన్నలకు చెప్పుతనని రాజేష్ బెదిరిస్తూ వెళ్లిపోతాడు. అదే రోజు పక్కూరి దొర రాజగోపాల్‌రావు దొరను చంపిన అన్నలు నన్ను ఏం చేస్తారో అని తెలియక రాత్రకి రాత్రే పట్టణానికి పారిపోతాడు. కొన్నాళ్లకు దొర హైద్రాబాద్ నుండి ఊరికి పోతుండగా దాహమేసి భయంతో రోడ్డు పక్కన హోటల్లోకి వెళుతాడు. అక్కడున్నది రాజేష్. నీళ్లిచ్చి పరస్పరం పలకరించుకుంటారు. చర్చించుకుంటారు. నేను ఆ రోజు నేను అన్నలకు చెప్పలేదనీ, ఊరికి ఉత్తరం రాస్తే మీరు వస్తారనీ భయపడ్డాను. ఊరు మీదకే పాణం గుంజుతుందనీ, వెళ్లాలనీ ఉందని రాజేష్ చెబుతాడు. ఈ పట్టణంలో మనుషులు యంతాల్ల ఉన్నారనీ నాకు ఊరికి పోవాలని ఉందనీ దొర చెబుతాడు. బతుకమ్మ పండుగ రోజు ఇద్దరు కలిసి వెళతారు. తాను ఊరిలో ఉండననీ, మీరు ఊరిలో ఉంటే మంచిదని దొరకు రాజేష్ చెబుతాడు.  ఇద్దరు ఊరి గురించి చర్చించుకుంటారు. ఊరికి కొద్దిదూరంలో రాజేష్ అమ్మమ్మ చెల్లెలు కలుసుకున్నాడు. ‘దొర (దొరను ఊరిడ్సేలా చేసిన రాంరెడ్డి పటేల్)ను రాత్రి ఎవరో చంపారట. ఊల్లె దొరలు ఎవరూ లేరు. బొంబాయికి దెంకపోయిండు’ అని చెప్పగానే ఊల్లెకు పోతే నిన్ను పోలీసులు పట్టుకపోతరు. ఈ దొరను వెళ్లగొట్టిన రాంరెడ్డి పటేలే దొర. దొరయి అన్నీ అక్రమాలే. అన్నలు చంపిండ్రు. ఊరు ఉడుకుతుంది. “పో బిడా!్డ ఎక్కడన్నా మంచిగా బత్కుపో” అంది ముసలమ్మ. రాజేష్, దొర వెనక్కి తిరుగు ప్రయాణమవుతారు.
 విప్లవోద్యమం వల్ల గ్రామాల్లో దొరల ఆధిపత్యం క్షీణించి భయం ఇరువురిలో పెరిగింది. పీడితులకు ధైర్యం, పీడకులకు ఆందోళన వచ్చింది. హత్యలు, అస్థిరత వల్ల ప్రజలు పట్టణాలకు వెళ్లారు. దొర, రాజేష్ మధ్య మానవత్వం పెరిగినా భయం కొనసాగింది. తిరుగు ప్రయాణం ఆ కాలపు అనిశ్చితి, మార్పును ప్రతిబింబిస్తుంది.

చదువుకు ఆటంకాలు సృష్టిస్తున్న పరిస్థితులను అధిగమించి కొడుకును చదివించిన రాజవ్వ జీవితమే నల్లాల లక్క్ష్మిరాజం ‘రాజవ్వ కొడుకు’. పటేళ్లు దేవయ్యను వెటకారంగా చూస్తరు. ఝండా వందనం నాడు బహుమతి ఇవ్వడానికి తటపటాయిస్తే చేతులోంచి గుంజుకుంటడు. ఒక్కటికి నాలుగు చెప్పి తండ్రి బాగా కొట్టేల పురికొల్పుతరు. కొడుకును, తల్లిని రాజనర్సు కొడుతడు. దేవయ్యను మెచ్చుకున్న ఉపాధ్యాయుడు ‘దొరలకు పాలేర్లు దొరుకర భయం కావొచ్చు. ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు. దేవయ్య మంచివాడు”అని చెప్పిండు. భర్తను ఒప్పించింది. దేవయ్యను జగిత్యాల హాస్టల్ల జాయిన్ చేసింది. ఫస్టు క్లాస్‌లో పాసయిండు. రాత్రిళ్లు పనులు చేస్తూ చదువుకున్నడు. వకీలు అయ్యిండు. రిజర్వు కేటగిరి సర్పంచ్ అయ్యిండు. ఝండా వందనం నాడు అనర్గళంగా ప్రసంగించాడు. సమావేశమయ్యాక రాజనర్సు దారెంట వెళ్లుతుంటే రాజేశ్వరరావు కూసుండే గద్దెవైపు చూసా ఉమ్మి వేస్తూ నడవసాగాడు. 

కులం ఎలా శిక్షిస్తుందో, ఎలా హత్యచేసుకునే పరిస్థితులు కల్పిస్తుందో, ధ్వంసం చేస్తుందో తెలిపే కథ ‘దొమ్మరి గంగడు’. దొమ్మరులు వేశ్యావృత్తికి, జిమ్నాస్టిక్స్‌కి, దొంగతనానికి పెట్టింది పేరు. వాటినుండి బయట పడడానికి రైస్ మిల్లులో పనిచేస్తాడు. యజమాని దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసుల లెక్క ప్రకారం పెద్దదొంగగా రికార్డుల్లో నమోదు చేశారు. గంగని పెద్దకూతురు సరోజ వ్యభిచార వృత్తిలో కొనసాగుతూ హెచ్ఐవీ సోకి చనిపోతుంది. బడిలో క్లాస్‌మేట్ ఒకడు గోపితో మీ అక్క దగ్గరికి వస్తున్నరా? అన్నాడు. నేను కూడా మీ అక్కవద్దకు అలానే వస్తున్నరా అంటాడు. పెద్ద గొడవ జరిగి బడిమానివేస్తాడు. చిన్న కూతురు వ్యభిచార వృత్తిచేయనని మొండికేసి లారీ డ్రైవర్‌తో లేచిపోతుంది. “నాతో దొంగతనానికి రాకపోతే మీ అమ్మను పొడిచి, నేను చస్త.” అని తండ్రి బెదిరిస్తే గోపి తన తండ్రితో దొంగతనానికి వెళతాడు. దొంగతనం చేసిన డబ్బును చేతిలో పెట్టి “ఈ డబ్బు సంచితో దూరంగా పారిపో” అని గంగడు తలనరుక్కుంటాడు. కర్మకాండలలో గంగని స్థానంలో గోపిని కేసులలో రికార్డు చేస్తమనుకునే పోలీసుల ఎత్తులను చిత్తుచేస్తూ దొరకకుండా గంగలో గంగని ఎముకలు కలుపుతాడు. కొన్నాళ్లకు వృద్ధిలోకి వచ్చి దొమ్మరికాలనీ పాఠశాల స్థాపించి ఎమ్మెల్యేతో ప్రారంభించి తానే ఉపాధ్యాయుని మారిపోతాడు. అననుకూల పరిస్థితులలో అభ్యుదయం వైపు పురోగమించాలో తెలుపుతుంది.

ఏది విత్తుతమో అదే కోస్తము అని చెప్పినట్లుగా అక్రమసంబంధాల ఫలితాలు, పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలిపే కథ ‘మా ఊరి ముచ్చట్లు’. శాంతమ్మ, చుక్కారెడ్డిలు పట్టుపడ్డారు. ఇద్దరినీ కొడుదామని చూస్తున్నప్పుడు శాంతమ్మ భర్త నర్సయ్య “నా పెండ్లాం నా ఇష్టం. నడుమ మీకేంది?” నర్సయ్యను తిట్టుకుంటూ ఎక్కడోల్లు అక్కడ పోతరు. రిజర్వేషన్ కేటగిరి కింద శాంతమ్మను ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండ్రు. అధికారం చుక్కారెడిది. ఇద్దరు ఆలుమొగలులా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండ్రు. వాడ ఆడోళ్లను తిరస్కార భావంతో చూసేది. మీరు నన్ను సర్పంచ్ చెయ్యలే. మీతో నాకవసరం లేదని శాంతమ్మ అనేది. చుక్కారెడ్డి భార్య మంగమ్మ జీతగాడు బుచ్చన్నతో చాటుమాటున పక్క సుఖం పొదుతుంది. ‘మాలమాదిగి జాతి చిల్లరజాతి. సిగ్గెక్కడిది? మానం ఎక్కడిది? అని తిడ్తుండేది.  చుక్కారెడ్డి దంపతులకు పరస్పర రహస్యాలు తెలుసు. మిగతా జీతగాళ్లకూ, ఊరోల్లకూ తెలుసు. ఎప్పటోల్నే బుచ్చిగా అని పిలుస్తుంటది. చుక్కారెడ్డి కూతురు రజిత, శాంతమ్మ కొడుకు శంకరి ని ప్రేమించి వంకర తొవ్వలు తొక్కి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అది తెలిసిన చుక్కారెడ్డి వీర రౌద్రుడై ‘ఆ లంజెకొడ్కు ఎటువొయిండు ?, బతుకనియ్యము. చెప్పు.’ అని తిడుతండు. కోర్టుల పెండ్లి చేసుకున్నరు. ఊరంతా ఇవే ముచ్చట్లు... 

అత్త పెట్టే హింసను భరించలేని చెల్లెలు, చెల్లెలు అత్త అయ్యాక బిడ్డకోసం బాధపడ్డ బాధ్యతాయుత త్యాగాన్ని తెలిపే కథ ‘పునరావృతం’ అత్తింటి భరించలేక ఇల్లు చేరిన చెల్లెలు బాధను చూడలేని అన్న, జాగ అమ్మి కట్నకానుకల కోసం జాగ అమ్మి చెల్లించడానికి సిద్ధపడ్డడు. నా కోసం మీరేమి త్యాగం చెయ్యొద్దని చెబుతున్నా అన్న వినలేదు. కట్నకానుకలని పోసి చెల్లెలు సంసారం నిలబెట్టాడు. ఇరువై ఏళ్ల తర్వాత అల్లునికి కొలువు వచ్చింది. బిడ్డను ఇస్తనని పోయినప్పుడు తొంభైవేలు ఇస్తే ఖాయం లేకుంటే లేదని చెల్లెలు ఖరాకండిగా చెబుతుంది. ఒప్పుకొని వచ్చి భార్యకు వివరిస్తాడు. పెరడు, ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామని చర్చించుకుంటున్నప్పుడు ఆ మాటలు విన్న నా కోసం మీరేం త్యాగం చేయొద్దనీ చెబుతున్నా వినని తండ్రి(నాటి అన్న) అన్నింటిని బేరం పెడుతాడు. చరిత్ర పునరావృతం అవుతుందని ఆలోచించుకుంటాడు. 

కర్తవ్యం కన్నులు మూసుకుని పేల్చిన తుపాకి గుండ్లు గురితప్పి ఓ అమాయకున్ని.... సిద్ధాంతం శృతి తప్పి భ్లాస్టింగై కర్తవ్య పరున్ని బలితీసుకోగా అభిమానమే ఆకాశమంత ఎత్తు ఎదిగిందని వివరించిన నల్లాల లక్క్ష్మిరాజం కథ ‘పడగనీడలో పావురాలు’ నీతి నిలువెత్తుగా విధి నిర్వహణ చేసే ప్రకాశ్ అందరి ఆదరాభిమానాలు పొందాడు. పత్తాలాడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తమ్మున్ని ప్రేమించే అన్నను తమ్ముడే కొట్టిండు. వస్తున్న పోలీసులను చూసి అటక మీద దాచి పెట్టాడు. ‘వద్దు సార్. వాడు అమాయకుడు. నన్ను పట్టుక పోండ్రి సార్. తాగి కొట్టిండని తప్పైందనిపించాడు తమ్మునితో..’ ఎన్నో తీర్ల బతిమాలిండు రాజయ్య. రాజయ్య కానిస్టేబుల్ ప్రకాశ్‌కి కోడిని కోసుకొమ్మని ఇచ్చిపోయిన తెల్లారి చనిపోయిండు. పక్కూర్ల ఉన్న చిన్నవ్వ ఇంటికి పోయిండు. బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేశారు అన్నలు. పోలీసులు వచ్చి కాల్పులు జరిపారు. రాజయ్య గడ్డివాములో దాక్కున్నారు. పోలీసు గుండ్లు దూసుకెళ్లాయి. చూడడానికి పోతున్న ప్రకాశ్‌ను అందరు ఆడిపోసుకుంటున్నా ముందుకే వెళుతున్నాడు. అప్పుడప్పుడు ప్రకాశ్ పరామర్శించడం వలన పోచయ్య కోలుకున్నాడు. ఓటు నిర్భయంగా వేయాలని చెప్పి వస్తుండగా మందుపాతరలు పేలి ముక్కముక్కలయ్యిండు. గూడెం అంతా ఏడిసింది. సార్‌ని పోషయ్య మా గూడెంలోనే దహనం చేస్తామని చెప్పారు. ఓదార్చిండ్రు.

 ‘భలే బామ్మర్ది’ కథలో హస్యంతో ఆత్మీయత పుష్కలంగా పండించాడు.
మిరిగుడ్లు, పుండాకోరాడా!, కుదపెట్టుడు, ఇడ్సిపెడ్తం, దెంకపోయిండ్రు లాంటి జగిత్యాల పలుకుబడులు రికార్డు చేసిండు. శీలం కంటే కులం గొప్పదేమో! ఏమో!, “విశ్వాసం నాకెందకు లేదు బావ నా మీదికేయి కుక్క గూడ వేస్తే” అని వ్యంగం పండిస్తాడు. సమాజాన్ని చిత్రిక పట్టిన కథల రాజసం ఒలలాడే తిరుగులేని పయనమే ‘తిరుగులేని ప్రయాణం’. తెలుగు సాహిత్యం స్మరించదగిన కథలు అందించిన లక్క్ష్మిరాజంకి పోలీస్ సెల్యూట్‌లు.

14, నవంబర్ 2025, శుక్రవారం

“బాలల దినోత్సవం - నెహ్రూ " ఉపన్యాసం


 “బాలల దినోత్సవం - నెహ్రూ "


 గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులుగారికి, సహ విద్యార్థులందరికీ.
ఈరోజు మనం బాలల దినోత్సవాన్ని – మన దేశపు బాలల పండుగను – ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా భారత దేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జీవిత చరిత్ర, ఆయన విద్యా విలువలు, బాలలపై ప్రేమ గురించి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషం.

 నెహ్రూ గారి జీవితం – దేశసేవకు అంకితమైన యాత్ర

1889 నవంబర్ 14న అలహాబాదులో జన్మించిన నెహ్రూ గారు, ప్రసిద్ధ న్యాయవాది మోతీలాల్ నెహ్రూ గారి కుమారుడు. హారో, క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య పొందిన ఆయన, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేశారు.
మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలుజీవితాన్ని కూడా అనుభవించారు.
దేశం స్వతంత్రం అయిన తర్వాత భారతదేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ నిర్మాణానికి దిశానిర్దేశం చేశారు.

 “జాతికి రూపురేఖలు దిద్దేది పార్లమెంట్ కాదు, పాఠశాలే”
ఈ నెహ్రూ గారి మాట మన విద్యా వ్యవస్థకు సారాంశం.
వారు నమ్మారు — ఒక దేశ భవిష్యత్తు పాఠశాల తరగతుల్లో రూపుదిద్దుకుంటుంది.
విద్య కేవలం పరీక్షలు ఉత్తీర్ణం కావడం కోసం కాకుండా,
మనసును, నడవడికను, విలువలను మలచడం కోసం కావాలని నెహ్రూ గారి అభిప్రాయం.
వారు చెప్పిన విద్య అంటే మనిషిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దే ప్రక్రియ.

 ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ – జాతి చరిత్రలో ఒక దీపస్తంభం

జైలులో ఉన్నప్పుడు నెహ్రూ గారు రాసిన ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకం మన భారతీయ నాగరికత, సంస్కృతి, తాత్వికతపై ఒక విశ్వదృష్టి చూపుతుంది.
ఆ పుస్తకంలో నెహ్రూ గారు చెప్పారు —> “భారతం ఒక భూమి మాత్రమే కాదు, అది ఒక భావన. అది అనేక మతాలు, భాషలు, సంస్కృతుల సమాహారం.”

ఈ ఆలోచన ద్వారా ఆయన భారత వైవిధ్యానికి ఏకత్వాన్ని చూపించారు.
మనందరం ఒకే తల్లి భారతమాత సంతానమని ఆయన గుర్తు చేశారు.

ఇందిరాకు రాసిన లేఖల సారాంశం – నీతివంతమైన జీవితం పాఠం

తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి నెహ్రూ గారు రాసిన లేఖలు ప్రతి విద్యార్థికి మార్గదర్శకం. 
ఆ లేఖల్లో ఆయన చెప్పిన పాఠాలు :

సత్యనిష్ఠతో జీవించాలి.
ప్రకృతిని ప్రేమించాలి.
చదువుతో పాటు మనసు మెరుగుపరచుకోవాలి.
దయ, కరుణ, క్రమశిక్షణ మనిషిని ఉన్నత స్థాయికి చేర్చుతాయని గుర్తుచేశారు.


ఇందిరాకు రాసిన ఒక లేఖలో ఆయన రాశారు.
 “నా బిడ్డా, నిజమైన బలం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది.”
ఈ లేఖలు తండ్రి ప్రేమతో కూడిన తాత్విక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి.


🌹 నెహ్రూ గారి ఎర్ర గులాబీ – ప్రేమకు ప్రతీక

నెహ్రూ గారి ఎదపై ఎర్ర గులాబీ ఉండేది.
ఆ గులాబీ ప్రేమ, సౌందర్యం, తాజాతనంకి ప్రతీక.
వారు చెప్పినట్టు,
 “గులాబీ లాగే పిల్లలు కూడా సున్నితమైనవారు, అందమైనవారు. వారిని జాగ్రత్తగా పెంచాలి.”

అందుకే ఆయన ఎదపై ఎర్ర గులాబీ ఉంచుకోవడం ద్వారా పిల్లలపై ఉన్న ప్రేమను సూచించారు.

 ఎందుకు బాలలనే ఎక్కువగా ప్రేమించారు?
బాలలే రేపటి భారత భవిష్యత్తు.
వారు ఎక్కడికి వెళ్లినా పిల్లలతో మమేకమయ్యేవారు.
వారి ముచ్చట్లు వినేవారు, నవ్వేవారు.
పిల్లల్లోని నిజాయితీ, చలాకీతనం, ఆశయస్ఫూర్తి ఆయనను ఆకట్టుకునేవి.
అందుకే దేశం ఆయనను “చాచా నెహ్రూ” అని ప్రేమగా పిలిచింది.

🕊️ నెహ్రూ కోరుకున్న సమాజం
నెహ్రూ గారు కలలు కన్న సమాజం శాంతి, సామరస్యం, సమానత్వం నిండిన సమాజం.
స్త్రీ పురుష సమాన హక్కులు కలిగిన ప్రజాస్వామ్యం.
పేదరికం, అజ్ఞానం లేని సుసంపన్న భారతం.
ఈ సమాజాన్ని నిర్మించేది పాఠశాలల్లో చదువుకుంటున్న మనమంతా  విద్యార్థులమే.

నేటి విద్యార్థుల బాధ్యత 
మనమూ ఆయన కలలు నిజం చేయాలంటే
సమయాన్ని విలువైనదిగా భావించాలి.
సత్యం, అహింస, క్రమశిక్షణతో నడుచుకోవాలి.
ప్రకృతిని కాపాడాలి, దేశాన్ని ప్రేమించాలి.
సాంకేతికతను మంచికి వినియోగించాలి.

భిన్నత్వంలో ఏకత్వం అనే భారత స్ఫూర్తిని మన హృదయంలో నిలుపుకోవాలి.
నెహ్రూ గారు చెప్పినట్లు  “A university stands for humanism, for tolerance, for reason, for the adventure of ideas and the search for truth.”
(ఒక విద్యాసంస్థ మానవత్వానికి, సహనానికి, తాత్విక ఆలోచనలకు, సత్యాన్వేషణకు నిలయం కావాలి.)

మనకు వారసత్వంగా వచ్చిన ఆ నెహ్రూ గారి ఆలోచనలు, విలువలు, బాలలపై ప్రేమ —
ఇవి మనకు మార్గదర్శకం.
ఈ భారత దినోత్సవం సందర్భంగా మనమందరం మనలోని బాలస్వభావాన్ని సజీవంగా ఉంచుకుని,
నెహ్రూ గారు కోరుకున్న సుజన, సుసంపన్న, విద్యావంతమైన భారతాన్ని నిర్మిద్దాం.

🪷  జై బాల భారత్!

15, జులై 2025, మంగళవారం

"కొమ్ము" దళిత కథ 23 సంపాదకులతో 'సంచిక' ఇంటర్వ్యూ






కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ

నమస్కారం. సార్.
సంపాదకులు: నమస్కారం సార్.
~
1. జంబూ సాహితీ తరఫున మీ సంపాదకత్వంలో 'కొమ్ము' దళిత కథా సంకలనం వెలువరించినందుకు అభినందనలు. దళిత కథా వార్షిక సీరిస్‌ 2020లో మొదలైంది. అప్పటి నుంచి మీ ముగ్గురే సంపాదకులుగా ఉంటున్నారా? లేక ప్రతీ సంవత్సరం కొత్త సంపాదకులు బాధ్యత తీసుకుంటున్నారా?
సం: మేం ముగ్గురమే కొనసాగుతున్నాము. 2020 లో వెలువడిన తొలి దళిత కథ 'తొండంబొక్కెన', దేశంలో వెలువడిన తొలి దళిత కథ వార్షికగా ప్రసిద్ధికెక్కింది.
2.  చిందూ నేల-2021,
3. సాక - 2022,
4. కొమ్ము - 2023 ఆయా సంవత్సరంలో వెలువడిన కథల నుండి ఎంపిక చేసిన ఉత్తమ కథలను సంకలనంగా తెస్తున్నాం. ప్రారంభం నుంచి ఇప్పటివరకు నేను( డా. సిద్దెంకి యాదగిరి), గుడిపల్లి నిరంజన్ తప్పెట ఓదయ్య లము కలిసి సంపాదకులుగా వ్యవహరిస్తున్నాము. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


2. జంబూ సాహితీ దళిత కథా వార్షికల ప్రచురణకే పరిమితమా లేక దళిత రచయితల కొత్త పుస్తకాలు ప్రచురిస్తుందా? జంబూ సాహితీ నేపథ్యం గురించి వివరించండి.
సం. ప్రారంభం నుంచి ఇప్పటివరకు దళిత కథ వార్షికలకి తొలి ప్రాధాన్యమిస్తున్నాము. మీరన్న కోరిక ఆలోచనలో ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మున్ముందు విస్మృతికి గురైన దళిత సాహిత్యంను జంబూ సాహితీ ప్రచురించడానికి ముందుంటుంది.
2019 మార్చిలో కరోనా పాండమిక్ సిచువేషన్ ప్రపంచాన్ని బంధించింది. ఆ సమయంలో కవులు, కళాకారులు, రచయితలు తమదైన శైలిలో సామాజిక మాధ్యమాలను ఆశ్రయించి ఫేస్బుక్ యూట్యూబ్, జూం మొదలైన అంతర్జాల వేదికల ద్వారా పుస్తకావిష్కరణలు, సమీక్షలు, పరిచయాలు, విశ్లేషణలు ఇంటర్వ్యూలు మొదలైనవి. అలా సాహితి కార్యక్రమాలు  జరుగుతున్న నేపథ్యంలో దళితులకు వేదికంటూ లేని సమయంలో దళిత కథా సాహిత్యం, సంస్కృతి, జీవితాల మీద చర్చించడం జంబూ సాహితీ వేదికగా కార్యక్రమాలు ప్రారంభించాం. ఆనాటి జూమ్ వేదికలకు మా ముగ్గురితో పాటు జూపాక సుభద్ర, గోగు శ్యామల, డా. తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, సంపంగి శంకర్, గంధం విజయలక్ష్మి మొదలగు వారము కలిసి నిర్వహించాము. ఆ కార్యక్రమాలకు ఆయా రంగాలలో విషయ నిపుణుల ద్వారా జూమ్, గూగుల్ మీట్ వేదికగా ప్రసంగ కార్యక్రమాలు నిర్వహించాం, అలా నిర్వహించడానికి మేము ఎంచుకున్న పేరు జంబు సాహితీ. ఈ పేరును ఎంచుకోవడానికి గల కారణం భారతదేశాన్ని జంబుద్వీపమని  పిలుస్తారు‌. చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం దళితులే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ చారిత్రక పునాదులు దళితులే. పురాణ సాహిత్య క్రమాన్ని అనుసరించి ఈ దేశాన్ని మహాబలశాలి, అరి వీర భయంకరుడు, ధైర్యవంతుడు, కరుణ రసా హృదయుడు, జాంబవంతుడు అనే మహా చక్రవర్తి పరిపాలించాడు. అతని మూలంగానే ఈ దేశానికి జంబుద్వీపమని పురాణాల్లో పిలువబడుతుంది. వారి సంతతి మాదిగలు మరియు దళితులు. మనం ఎక్కడికి వెళ్లినా మన మూలాలను మర్చిపోవద్దని పెట్టుకున్న పేరే జంబు సాహితి. జంబూ  సాహితీ అంతర్జాల వేదికగా 36 ప్రసంగాలు నిర్వహించింది. జంబూ సాహితీ ప్రధాన భూమిక పోషిస్తూ ప్రముఖుల 32 ప్రసంగాలు యూట్యూబ్ లో నిక్షిప్తం చేసాం.
 

జంబూ సాహితి


3. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం ప్రచురణ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టారు? పూర్తయి పుస్తక రూపంలోకి రావడానికి ఎంత కాలం పట్టింది?
సంపాదకులు: 2023 జనవరి మొదటి తేదీ నుంచి కొమ్ము (తర్వాత పేరు పెట్టాము) డిసెంబర్ 31 వరకు నిరంతరం కొలుసాగుతుంటది. దళిత కథ అంటే దళితులు మాత్రం రాసిన కథలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లలో ఎక్కడ ప్రచురితమయ్యాయి మొదటిగా వెతుకుతాము. మేము (సంపాదకులుగా) చదువుతాము. ప్రాథమిక దశలోనూ కొన్ని కథలు ఎంపిక చేసి అందులోంచి మరికొన్నిటిని వడపోసి ఫిబ్రవరి నెలాఖరువరకు డ్రాఫ్ట్ కాఫీని సిద్ధం చేసుకుంటాము. మార్చి / ఏప్రిల్ లో ప్రముఖులకు ఈ కథలను పంపించి వారి సూచనలు సలహాలు పాటిస్తాం. తుది నిర్ణయం మాత్రం సంపాదకులుగా మేమే తీసుకుంటాం. పుస్తమ్కమ్ పూర్తయ్యే సరికి అక్టోబర్ మాసం  వచ్చింది.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


4. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం ప్రచురణలోని సాదకబాధకాలను వివరిస్తారా? ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?
రచయిత తన పుస్తకాన్ని తేవడానికి అనేక వ్యయప్రయాసలకోర్చేది మీకు తెలియంది కాదు. వ్యక్తిగతంగా ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం వ్యవస్తీకృత పనులలో ఉండదనే విషయాన్ని గమనించాలి. ఏ విషయమైనా మేము ముగ్గురం ప్రతిపాదించుకొని చర్చించుకొని, విశ్లేషించుకొని స్పష్టంగా ఒక అంచనాకు వచ్చి ముందుకు వెళుతూ ఉంటాం. కథల్ని వెతకడం, చదవడం, ఎంపిక చేయడం, డీటీపీ చేయడం, పేజీ సెట్టింగ్, కవర్  డిజైనింగ్, బుక్ సెట్టింగ్, బుక్ ప్రింటింగ్, ఆవిష్కరణ సభ నిర్వహణ మొదలైన అన్ని ఖర్చులు కలుపుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు దాటుతుంది. మేము చిరు ఉద్యోగులం. ఉపాధ్యాయులం. మాకు ఉన్న వెసులుబాటును అనుసరించి మూడు సంకలనాలు సొంతంగా మేమే తెచ్చాము. నాలుగవ కథా వార్షికకు తెలంగాణ ఉద్యమకారులు, దళిత మేథావి, ఉద్యోగ నాయకులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య కమిషనర్ గారు తాను సహకారం అందిస్తానని, నా వంతు సహకారం ఉండనీ అని వారు అన్నారు. పదిహేను వేల రూపాయల సహకారం అందించారు. వారి తల్లిగారు ఎంతో మంది ఉద్యమ కారులకు ఆశ్రయమిచ్చింది. అందువల్ల తిప్పర్తి గాలమ్మకు అంకితం ఇవ్వడం సహేతుకమని భావించి ఆమెకి అంకితం ఇచ్చాము. కొలకలూరి ఇనాక్, ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు, సతీష్ చందర్, ఆచార్య గుండె డప్పు కనకయ్య, ఆచార్య సూర్యా ధనంజయ్, ఆచార్య కాశీమ్, ఆచార్య కోయి కోటేశ్వర రావు, జీలుకరా శ్రీనివాసు, గడ్డం మోహన్ రావు,  ప్రోత్సాహమూ ఉంది. ఫెస్బుక్ వాల్ పైన అభినందనలు చెప్పనివారూ వున్నారు. ఎవరో మెచ్చుకోవాలనీ ఈ పని చేయడంలేదు. మావంతు బాధ్యతగా తలపెట్టిన కార్యంగా భావిస్తున్నాము.  ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలని పానుగంటి లక్ష్మీ నరసింహా రావు సాక్షి వ్యాసాల్లో చెప్పినట్లు పని చేసేవారినే విమర్శిస్తారు. ఆ విమర్శలను నిర్ధేశంగా మార్చుకుంటాము. 


జంబూ సాహితి

 
5. సంపాదకులు ముగ్గురు, ఎవరెవరు ఏయే బాధ్యతలు చూసుకున్నారు? సలహాలు, సూచనలు కాకుండా ఒకరి పనుల్లో ఒకరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదైనా వచ్చిందా? వస్తే ఎందుకని వచ్చింది?
సంపాదకులు: ప్రధానంగా కథలు చదవడం అందరి బాధ్యత. ఎవరి అభిప్రాయాలు వాళ్లు రాసుకుంటాం. చర్చించుకుంటాము. ప్రజాస్వామ్య పద్ధతిలో భావాలను విశ్లేషించుకుంటాం. ఒకరి పనులలో ఒకరం జోక్యం చేసుకోం. సేకరణ నుంచి మొదలుకొని పుస్తకం ముద్రించబడి ఆవిష్కరణ కార్యక్రమం వరకు బాధ్యతలను పంచుకుతాము. ఎవరమైన ఏ పనినైనా చేయడానికి సంసిద్ధమవుతాము. ఫోన్ ల నుంచి మొదలుకొని  అధ్యక్షతను, వందన సమర్పణను, ఫోను చేయడంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ పున: సమీక్షించుకుంటాం. పుస్తక బాధ్యతల విషయానికి వస్తే డిటిపి వర్క్ నేను (సిద్దెంకి) చేస్తాను. నేను, గుడిపల్లి, తప్పెట చదివి, దోషాలు, వాక్య క్రమాలు గుర్తించి సవరిస్తాము.  కొత్త రచయితలైతే చర్చిస్తాము. పుస్తకం అందంగా రావడం కోసం, కవర్ డిజైనింగ్ మొదలైన పనులను సాంకేతిక నిపుణులకు అప్పగిస్తాం. దళిత కథ - 2023 కథ వార్షిక 'కొమ్ము' డ్రాఫ్ట్ కాఫీ చదివి తమ అభిప్రాయాలు తెలియజేసిన వారిలో మన్నె ఏలియా, డా.  తైదల అంజయ్య ముందు వరుసలో ఉంటారు.
 
6. ఈ సంకలనం కోసం కథల ఎంపికలో ఏ ప్రమాణాలు పాటించాలని నిర్ణయించుకున్నారు? ఇతర సంస్థలు ప్రచురించే వార్షిక కథా సంకలనాలకన్నా ఏ రకంగా ఇది భిన్నమైనది?
సంపాదకులు: దళిత కథకు అధిక ప్రాధాన్యత ఇస్తాము. అట్లాగని దళితులు రాసిన ప్రతీ కథ దళిత కథ కాదు. ఒకవేళ దళితేతర కథ  మంచి కథ అయితే కూడా స్వీకరిస్తున్నాము. దళిత బహుజనవాదానికి చోటు కల్పిస్తాము.

జంబూ సాహితి

7. జంబూ సాహితీ గత సంకలనాలతో పోలిస్తే, 'కొమ్ము దళిత కథ - 2023' లో వైవిధ్యం ఏమిటి? ఈ సంకలనం ప్రత్యేకత/విశిష్టత ఏదైనా ఉందా?
సంపాదకులు: ఉంది. సామాజిక, రాజకీయ, ఆధునిక వివక్షను చిత్రించాయి. పదిహేను కథలు పదిహేను కోణాలలో ఆవిష్కరించాయి. ఏ కథా వార్షికకు ఆ వార్షిక దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. దళిత కథలకు దళిత జీవితమే ఇంధనం. దళిత బతుకులే శైలీ, వస్తు, శిల్పాలు. దళిత బతుకును ఏ  త్రాసు(తక్కెడ) కొలుస్తుంది?  దళిత కథలలో ఏడుపులు పెడబొబ్బలే కాదు ధిక్కారాలు, ఎత్తిన పోరుభావుటాలు, రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ స్పూర్తి, అంబేడ్కర్, జగ్జీవాన్ రామ్ ల  మార్గదర్శకత్వం, జాషువా పద్యాలు, మొత్తంగా చెప్పాలంటే మొండి బాధలే అక్షర రూపంలో నడిపిస్తూనే ఉంటున్నాయి. వేముల ఎల్లయ్య కక్క నవలలా, నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు కాథలులా రూల్స్ని బ్రేక్ చేస్తున్నాయి. దళిత కథ సమస్య తీవ్రతని అవగాహన కల్పిస్తుంది.  ఆలోచింపచేస్తుంది. పరిష్కార మార్గాలు చూపుతుంది. ఒక సంవత్సరంలో వచ్చిన కథలు మరో సంవత్సరంలో వచ్చిన కథలకు భిన్నంగా ఉంటాయి.

జంబూ సాహితి

 
8. స్థూలంగా దళిత కథలు అన్నప్పుడు అవమానాలు, హేళనలు, ఆర్థిక లేమి, అవకాశాలు లేకపోవడం వంటి అస్తిత్వ నేపథ్యపు ఇతివృత్తాలే ప్రధానంగా స్ఫురిస్తాయి. మరి ఈ సంకలనంలోని కథలలో వస్తు వైవిధ్యం ఉండేలా ఏ జాగ్రత్తలు తీసుకున్నారు?
సంపాదకులు: కాలే కడుపుకు మండే గంజి ఆకలి తీరుస్తది అనుకుంటే ఆలోచనలు కూడా అలానే ఉంటాయి.  స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు సమీపిస్తున్న దళితులకు ఆత్మగౌరమ్ దక్కడం లేదంటే నమ్మరు కానీ సంఘటనలు పరిశీలించండి సమస్యలు అర్థమౌతాయి. నొప్పి కలిగినోడు విలపిస్తాడు కానీ వినోదాన్ని ఆలపించడు.  దళిత కథలు రాస్తున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. రెండు రాష్ట్రాలలో కలిపి సీరియస్ గా రాసేవాళ్లు కేవలం  30 మంది లోపు కథకులే ఉన్నారు. వస్తు వైవిధ్యం గురించి హిజ్రాలలో మానవత్వం తెలిపే సోలోమన్ వవిజయ్ కుమార్ కథ శీలమంతురి రైల్వే గేటు దగ్గర కొజ్జ , ఆడపిల్లలు ముల్లులా బతకాలనే సతీష్ చందర్ కథ ముల్లు’, అంతరానితనం ఆకాశమంత దుక్కమంటూనే ప్రత్యామ్నాయం చూపే జూపాక సుభద్ర అంటూ ముట్టు’, అసలు పిసినారులను ముసుకుల్ని పటాపంచలు చేసే పసునూరి రవీందర్ బుచ్చయ్య బతుకు మర్మం’, వలస బతుకుల దీనత్వం చిత్రించిన ఇండ్ల చంద్ర శేఖర్ బేల్దారి’, మౌనంగా ఉంటూ మాట్లాడే మర్రి చెట్టు మన్నే ఏలియా సాక్షి ఆత్మీయతలు పంచే ఆవిడ చావు మానవ చిరునామా కాండ్రేగుల రావలచ్చుం కొట్టు’, దళితుల ప్రేమ గురించి మాదిగ రాజయ్య’, రచ్చకట్టలు తెలుపుతాయి.  చేదు నిజం’, నిలువెత్తు దుఖం’,  మొదలైన కథలు వినూత్నంగా ఉన్నాయి.
 
9. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనంలో లబ్ధప్రతిష్ఠులైన కథకుల కథలతో పాటు కొత్త/వర్ధమాన కథకుల కథలకు స్థానం దక్కిందా?
సం: ఐదు దశాబ్దాలుగా కథలు రాస్తున్న ఆచార్య కొలకలూరి కథ దళిత కథ 2020 లో ప్రచురించబడ్డది. అదే సంవత్సరం చరణ్ పరిమి బొంబాయి పొట్టేలు కథ ప్రచురించాము. ఆ కథ సంపుటి 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహితీ పురస్కార పోటీలో చివరి దాకా నిలిచింది. రామ్ పేరుమాండ్ల, కేపీ లక్ష్మీనరసింహ 'దోసిలి పట్టు', మేడి చైతన్య, కిరణ్ చర్ల, సిస్టర్ అనసూయ 'కుంగిన పొద్దు' డిజి హైమావతి 'బొందల గడ్డకు దూరంగా' కౌలూరి ప్రసాదరావు 'రెండు గ్లాసులు' కెంగార మోహన్, అనిల్ డ్యాని, గంధం విజలక్ష్మి, గడ్డం మోహన్ రావు, తవ్వ వెంకటయ్య, మండల స్వామి, దుర్గాని రాజు,మెర్సి మార్గరేట్, మేడి చైతన్య, పెద్దన్న, మొదలైన వారి కథలు సేకరించి జంబు సాహితీ వార్షికలలో స్థానం కల్పించింది.

జంబూ సాహితి

10. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం కోసం ఎంపికైన కథలు కాకుండా, ఏదైనా కథ బాగుండి కూడా, మీ ప్రమాణాలలో ఒదగకపోవడం వల్ల సంకలనంలో చేర్చకపోవడం జరిగిందా?
సం. జరిగింది. అనుకున్న ప్రమాణాల ప్రకారం కథ లేకుంటే నిస్సంకోచంగా పక్కన పెట్టాము. ఇక ముందు దళిత జీవిత చిత్రన చేసిన కథకే ప్రాధాన్యత ఇవ్వనున్నాము.


 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


11. భవిష్యత్తులో సంకలనం వెలువరించేందుకు, పత్రికలలో ప్రచురితమైనవి కాకుండా, ప్రత్యేకంగా ఒక థీమ్ ఇచ్చి కథలు వ్రాయించి ప్రచురించే అవకాశం ఉందా? ఆ విషయంలో మీ బృందం ఆలోచనలేమిటి?
సం. ఆలోచనలు ఉన్నాయి. దళిత కథను గొప్ప కథగా తీర్చి దిద్దాలనే సంకల్పం జంబూ సాహితీకి ఉంది. దళిత కథా శిక్షణ కార్యశాల నిర్వహిస్తాము. త్వరలోనే ఐదవ వార్షిక అనంతరం తప్పకుండా వీటిపై దృష్టి సారిస్తాము. కథా  విమర్శ వ్యాసాలను తెస్తాము.


 
జంబూ సాహితి

12. కొన్ని వార్షిక కథాసంకలనాలలో కొందరు కథకుల కథలు ప్రతి ఏడాదీ చోటు దక్కించుకుంటాయనీ, వేరే వారికి అవకాశం దక్కదన్న అభిప్రాయం పాఠకులలో ఉంది. మీరు ప్రచురించే సంకలనాలలో ఇలా జరగకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సం. మీరన్నది నూటికి నూరు పాళ్ళు  నిజం. మంచి కథకు తప్పనిసరి చోటు మాత్రం తప్పకుండా ఉంటుంది. రాసిన ప్రతీ కథకు ఎక్కడా చోటు దొరకక పోవచ్చు. అయినంత మాత్రాన కథ కాకుండా పోదు. వేరే సంకలనాలలో దళితేతరులు దళితకథ ఒక్కటో రెండో కథలను రిజర్వేషన్ కింద అచ్చు వేస్తారు. మేము అందరికీ చోటు ఇస్తామని హామీ ఇవ్వటం లేదు.. అలా దళిత కథకు చోటు దక్కకపోడం లేదనీ, వాళ్లెవరో చోటు కల్పించేదేముంది. మా దళిత కథ - మా ఆత్మ గౌరవ పతాక”గా తీర్చి దిద్దుతున్నాము. దళిత కథ వార్షిక తెస్తున్నాం.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువ కథకులు తప్పనిసరిగా చోటు దక్కే విధంగా ఎవరికి వారు నైపుణ్యవంతంగా కథలు తీర్చిదిద్దుకోవాలి. మాస్టర్ పీసుల్లాంటి కథలను అధ్యయనం చేయాలి. మంచి కథ ఎందుకైనదో ఆలోచించాలి. మన కథను ఇంతకంటే ఏమి చేయలేను అనే వరకు చదవాలి. వస్తు విసృతితో పాటు వస్తున్నవ్యత ఉండాలి. రాస్తున్న వస్తువు మీద సంపూర్ణమైన అవగాహన తెచ్చుకొని రాయాలి.  శైలి, శిల్పం, కథనం, సమర్థవంతంగా నిర్వహించాలి. స్పార్క్ లాంటి ముగింపుతో ఆలోచనత్మక సందేశం కలిగిన కథలై ఉండాలి.  జీన్ పాల్ సాంగ్త్రే అన్నట్టు ఈ కాలానికి చెల్లని కథ (సాహిత్యం) ఏ కాలానికి చెల్లదు. ఆ విధంగా నడుస్తున్న కాలాన్ని పొడుస్తున్న పొద్దును సాంఘిక సమకాలీన పరిస్థితులకు దర్పణం పట్టాలి. రాయడానికి ముందు అవగాహనతో రాయాలి. నూతనంగా ఉండాలి. కథకి సార్వజనీనత కల్పించినప్పుడు taప్పకుండా ఎంపిక అవుతుంది.

జంబూ సాహితి

 
13. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనంలో మీకు వ్యక్తిగతంగా ఏ కథ బాగా నచ్చింది? ఎందువలన? సంపాదకుడిగా కాకుండా, ఓ పాఠకుడిగా మీ అభిప్రాయం చెప్పండి.
అన్నీ మంచి కథలే. సతీష్ చందర్ కథ ముల్లు కథ లో స్త్రీలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసే కథ. జూపాక సుభద్ర కథ అంటూ ముట్టు ఒక పాఠకుడిగా నాకు బాగా నచ్చాయి.

జంబూ సాహితి

 
14. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనాన్ని పాఠకులకు ఎలా చేరువ చేస్తున్నారు? ఈ పుస్తకానికి వచ్చిన స్పందన ఏమిటి?
కొమ్ము దళిత కథను పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్ లో, తెలుగుబూక్స్. కామ్ అంతర్జాలంలోనూ  అందుబాటులో ఉంచాం. మంచి స్పందన వస్తుంది. దళిత కథను చాలామంది అభిమానిస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ దళిత కథను ఉద్యమం గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. కోరిన వారికి వ్యక్తిగతంగా కావాలని ఫోన్ చేసినవారికి పంపిస్తున్నాం.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ

15. తదుపరి సంకలనం కోసం పనులు మొదలయ్యాయా? కొత్త అవకాశాలు లభించి బతుకులు బాగుపడ్డాయనో, గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారి చీకట్లు తొలగుతున్నాయనో చెప్పే కథల్ని పాఠకులు ఆశించవచ్చా?
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కథలు మారుతాయి. దళిత కథలు మారాలంటే దళిత జీవితాలు మారాలి. సమాజంలో మార్పు రావాలి. మనిషిని మనిషిగా గౌరవించే రోజు రావాలి. కుల వివక్ష పోవాలి. కుల నిర్మూలన జరగాలి. అంబేద్కర్ కలలు నిజమవ్వాలి.  కథలు మారిన, మారని పరిస్థితులు తప్పకుండా ప్రతిబింబిస్తాయి. మాకు మేం నిత్య నూతనమవుతాము.... నవనవలాడే దళిత కథ సాహిత్య ఆకాశంలో రెపరెపలాదడిస్తాము.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు సంపాదకులు ముగ్గురికీ ధన్యవాదాలు.
సంపాదకులు: ధన్యవాదాలు.

కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


11, జూన్ 2025, బుధవారం

మండల స్వామి కథ "ఒట్టి చాపలు"

#telugu_siri_dr #shortstoriesintelugu #shortstories #telugu 
#మండల_స్వామి_కథ #ఒట్టి_చాపలు Dr. #Mandal_SwamyStory | Ottichapalu | #Telugu_siri _Dr.Siddenky



కవి, కథకుడు, విమర్శకుడు, కీర్తిశేషులు డా. మండల స్వామి గారు. తెలుగు సాహిత్య వేదిక నుంచి అర్ధాంతరంగా 
తేది : 19-10-2024న నిష్క్రమించడం సాహితీ లోకానికి బాధాకరం. 

 మండల స్వామి గారు మండల లక్ష్మమ్మ రాములు దంపతులకు తేది : 15 ఏప్రిల్ 1972లో పిట్టంపల్లి గ్రామం చిట్యాల మండలం నల్లగొండ జిల్లా లో జన్మించారు. 

పేదరికంలోంచి కడుపు మార్చుకుని కన్నీళ్లను మూటగట్టుకొని కలలు చేత్తో పట్టుకొని అక్షరలోకసంచారిగా అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచాడు. అక్షరమే ఆత్మవిశ్వాసం అని నమ్మి కష్టపడుతూ పీహెచ్డీ డిగ్రీ వరకు చదివాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఎందుకంటే బోధించడమే పరమావధిగా చైతన్యమే ప్రబోధంగా భావించాడు. 

మితభాషి. మృదుస్వభావి. నొప్పించని మనస్తత్వం, కలివిడి స్వభావం వారి సొంతం. 

మండల స్వామి "నల్లగొండ జిల్లా గ్రామ నామాలు" అనే అంశంపై పరిశోధన గావించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి పీహెచ్డీ డిగ్రీ పట్టా పొందాడు. విమర్శ వ్యాసాలు సమీక్షలు కవితలు కథలు రచించాడు. తెలంగాణ గ్రామ నామాలు వ్యాస సంపుటి మొదలైనవి అచ్చులోకి తేవలసి ఉన్నది. 

క్యాన్సర్ తో బాధపడుతూ ఆఖరి కోరికలను ఫోన్లో తెలియజేసి నా పుస్తకాలు ప్రచురించండి కోరాడు. 

ఈ పనిని భుజాల మీద వేసుకొని పెరుమళ్ళ ఆనంద్, సాగర డా. సాగర్ల సత్తయ్య , రామకృష్ణ మొదలగు మిత్ర బృందం కలగలిసి అంకుటిత దీక్షతో, అంకిత భావంతో సృజన సాహితి నల్లగొండ అందించిన సహకారం వల్ల మండల స్వామి కథలను "ఒట్టి చాపలు" పేరుతో ప్రచురించారు. ఆ కృషి అభినందనీయం.

ఒట్టి చాపలు పుస్తకం ఫిబ్రవరి 2025 లో ప్రథమ ముద్రణ తో 11 కథలతో ముందుకొచ్చింది. 

ముందుమాట రాస్తూ ప్రముఖ కవి రచయిత ఏనుగు నరసింహారెడ్డి "స్వామి లేడు. ఆయన కథలు ఉన్నాయి". స్వామి మరణించడం లేదు ఆయన కుటుంబానికి ఎంత పెద్దదో ఆయనకి సాహిత్యకారులకు అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. 

నేను గుడిపల్లి నిరంజన్ తప్పక ఓదయ్య నిర్వహించే
 జంబు సాహితీ వెలువరించే దళిత కథలలో డాక్టర్ మండల స్వామి గారి 'కాలం మారింది', 
'బతుకు గీత' రెండు కథలను ప్రచురించాం.
అట్లా వారితో సంభాషించడం. చర్చించడం. కథల గురించి కథ సాహిత్యం గురించి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడేవాడు.

SCERT ఉన్నతి శిక్షణా కార్యక్రమములో రాష్ట్రస్థాయి శిక్షణలో మాంటిసోరి లో ఐదు రోజులు వారితో ఉండే అవకాశం కలిగింది.

కుల్లం కుల్లం మాట్లాడతాడు. కపటం లేదు. కదిలిస్తే కన్నీళ్ళ చల్మా ఏరులై పారే మనస్తత్వం. నిప్పులు మింగిన నిజాల బాధలు పెల్లుబుకుతాయి.

సాగర సత్తన్న ఒట్టిచాపల పుస్తకం ఇవ్వడంతో ఇవన్నీ గుర్తుకొచ్చాయి. 
ఒక స్నేహితునిగా నేను వారి ఒట్టి చాపలు కథ చదివి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. వినండి. 

పుస్తకం కావలసినవారు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారిని 7989117415 అనే నెంబర్ ఫోన్ చేసి సంప్రదించండి.

(వీలు చూసుకుని మరో సమీక్షలో మరిన్ని వివరాలు రాస్తాను.)