సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

abhinandana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
abhinandana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2025, బుధవారం

VI. 1. అభినందన

అభినందన

అభినందన 


పాఠం ఉద్దేశం

ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన 'స్వరభారతి' అనే గేయసంకలనం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం



(15-04-1947) (17-05-1998)

శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్, కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణభారతహిందీప్రచారసభవారి 'స్రవంతి' పత్రికలో ప్రచురించబడ్డాయి.

లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసినచేయి.

-------------------------------------------------------------------------------------------------------------
విద్యార్థులకు సూచనలు:

పాఠంలోని బొమ్మను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.

అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.

పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు అర్థాలను తెలుసుకొండి. అర్ధాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు
------------------------------------------------------------------------------------------------------------------

ప్రవేశిక:

దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశప్రజలకు తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశంకోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్నిమాటలైనా సరిపోవు. అందుకే లాల్బహదూర్ శాస్త్రి "జై జవాన్ జై కిసాన్" అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకొండి.

I

పల్లవి :

వందనాలు వందనాలు 
అభినందన చందనాలివే 
మా అభినందన చందనాలివే. ॥ వంద ॥

శ్రమదాచని హాలికులకు 
తలవంచని సైనికులకు 
భరతమాత పురోగతికి 
ప్రాతిపదికలగు ఘనులకు || వందన||

పుడమితల్లి పులకింపగ 
రుధిరం స్వేదమ్ము కాగ 
పసిడిని పండించునట్టి 
ప్రగతి మార్గదర్శకులకు ॥ వంద ॥

(అర్థాలు: హాలికులు = రైతులు 
; పురోగతి = అభివృద్ధి:  ప్రాతిపదికలగు =  ఆధారమగు; పుడమి = భూమి; పులకింపగ = సంతోషించగా ;
రుధిరం = రక్తం; స్వేదము = చెమట
ప్రగతి = అభివృద్ధి.)
-----------------------------------------------------------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.

రైతులను "శ్రమ దాచని హాలికులని" ఎందుకన్నారు?

"భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు" అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది?

"రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి" అంటే మీకేమర్థమయింది?
-----------------------------------------------------------------------------------------------------------------

2

కంటికి కనురెప్పలాగ 
చేను చుట్టు కంచెలాగ
జన్మభూమి కవచమైన
ఘనవీరులు జవానులకు ॥ వంద ॥

ప్రలోభాల మాయలోన 
పడివోవని నిర్మలురకు 
నిమిషమేని విధి మరువని
నీతి కర్మ శీలురకు.  ॥ వంద ॥

అవిశ్రాంత సేద్యంతో 
ఆకలిమంటలను ఆర్పి 
దేశభక్తి ఖడ్గంగా, శత్రుమూకలను దున్మి
దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు ॥ వంద ॥

(అర్థాలు: కవచము = రక్షణ, ఘన వీరులు = గొప్పవారు, జవానులు = సైనికులు, ప్రలోభం =ఆశ / ఎర, మాయ = మోసం,  పడివోవని = పడిపోని, నిమిషమేని = నిమిషం కూడా వృధా చేయకుండా, విధి = పని, అవిశ్రాంత = ఎల్లప్పుడు, సేద్యం = వ్యవసాయం, ఖడ్గం = కత్తి భావుట = జెండా,  ఘనజనులు = గొప్ప ప్రజలు)
-----------------------------------------------------------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.

కంటికి కనురెప్ప, చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష? ఇటువంటివే మరికొన్ని చెప్పండి.

"జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు?

'నీతి కర్మశీలురు' అని ఎవరిని అంటారు?
-----------------------------------------------------------------------------------------------------------------

బొమ్మను చూడండి  మాట్లాడండి

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. గేయాన్ని పాడుతూ అభినయించండి.
జవాబు.
విద్యార్థుల పని.

2. ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు ? ఇట్లాంటివారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
జవాబు.
ప్రగతి మార్గదర్శకులంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేవారు. మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిలోకి తెచ్చేవారు. మహాత్మగాంధీ, బాలగంగాధరతిలక్ వంటి దేశ నాయకులు ప్రజలలో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమం వైపు నడిపించారు. రాజారామమోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను అభివృద్ధిమార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. పాఠాన్ని చదవండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.

జవాబు. రైతులు : శ్రమదాచనివారు. పసిడిని పండించువారు. ప్రగతి మార్గదర్శకులు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పుతారు.
సైనికులు: తలవంచనివారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు. ఘనవీరులు. నిర్మలురు. నీతికర్మ శీలురు. ఘనజనులు.

2. కింది గేయాన్ని చదవండి. ఖాళీలను పూరించండి.

జవాబు. పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్ళు – మన సంపద నిలయాలు భరతమాత నయనాలు
ప్రగతికి సోపానాలూ సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు

అ) భరతమాతకు నయనాలు ___జవాబు.పల్లెలు

ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___జవాబు.మణిదీపాలు

ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే _____జవాబు.మెట్లు

ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________జవాబు.మందిరాలు, నిలయాలు, ఇళ్ళు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జవాబు. దేశపురోగతి అంటే దేశం అభివృద్ధి చెందటం, పంచవర్ష ప్రణాళిక రచించిన పండిట్నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషిచేసి ప్రాజెక్టులు నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చిన స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన కురియన్ మొదలైన వారంతా దేశ పురోగతికి తోడ్పడినవారే.

. దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ?
జవాబు.నీతిశీలురు అంటే న్యాయమార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనివారు. న్యాయంగా ప్రవర్తిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. అవినీతి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులుండవు. అందువల్ల ప్రతివారు నీతిమంతులై ఉండాలి. కర్మశీలురు అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చేవారు. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్నీ చక్కగా నెరవేరుతాయి. అలా ఎవరి పనులను వారు పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దేశంతప్పకుండా ప్రగతి సాధిస్తుంది.

ఇ. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పటం అంటే ఏమిటి ?
జవాబు.అవిశ్రాంత సేద్యం అంటే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించటం. రైతు ఏ మాత్రం విరామం లేకుండా పంటలు పండిస్తూ ఉంటే కూడా సమయం చాలటం లేదు. ప్రజల అవసరానికి తగినంత పంట పండించి ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తాడు రైతు. ఇదే ఆకలి మంటలు ఆర్పటం అంటే.

ఈ. ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు. 
శేషం లక్ష్మీనారాయణాచార్య (జననం: 15-04-1947) - (మరణం: 17-05-1998) సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్, కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీప్రచారసభవారి 'స్రవంతి' పత్రికలో ప్రచురించబడ్డాయి.

లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసినచేయి.

2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.

1. ‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
రైతులు, సైనికులు దేశానికి ఎలా సేవ చేస్తున్నారో తెలుపండి ?
(లేదా)
జన్మభూమికి ఎవరెవరు ఎట్లా సేవ చేస్తున్నారో వివరించండి.

జవాబు.  రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్లుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, ఈ జన్మభూమికి కవచంవలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.

దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసుగలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.