బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
1.బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు.
జవాబు.అందరూ స్నేహంగా ఉండాలని, కష్టాల్లో పాలు పంచుకోవాలనే భావన కలిగింది.
పాఠం ఉద్దేశం
స్నేహమమనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టు కొనే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ ‘పంచతంత్రం’ ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన ‘మిత్రలాభం’లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.
ప్రవేశిక
“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.
------------------------------------------------------------
I
ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి.
కాకి పేరు లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం.తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి.
ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టుమీది కెగిరింది. ఒక కొమ్మమీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని, స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులోనుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులోనుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. "నువ్వెవరివి? ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు?" అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.
జింక మెల్లగా గొంతు సవరించుకొని "నేను చిత్రాంగుణ్ణి" అన్నది. "ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా, నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి" అని వేడుకొన్నది.
అప్పుడు తాబేలు, "చిత్రాంగా ! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తియ్యటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏలోటూ ఉండదు. అందరం హాయిగా ఉందాం" అన్నది.
ఎలుక, కాకి, "ఔనౌను" అని అన్నాయి.
చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి • నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి.
ఆలోచించండి-చెప్పండి.
తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారుకదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.
కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి?
