ఓ కుజనుల్ గొందరు రేగి యీ వసుమతిన్ క్రూరస్వభావంబుతో సుజనాళిన్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము జూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో త్రిజగత్కారణ! భక్తపాలన! హరా! శ్రీగుంటుమల్లేశ్వరా! - యర్రం విశ్వనాథం గుప్త
ధర్మార్జునులు
ధర్మరాజు మరియు అర్జునుడు. వీరిరువురు పాండవులు. ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. (పాండవాగ్రజుడు ధర్మరాజు). నడిపివాడు అర్జునుడు. (పాండవ మధ్యముండు అర్జునుడు). వీరిరువురి గుణగణాలను తెలియ జేయడం కోసమే ఈ పాఠం.
నేపథ్యం:
ప్రతి పద్య చమత్కారచణుడు చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసం అనే కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగాణాల గురించి తెలిపే సందర్భంలో అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహన శీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు అజ్ఞాపరిపాలనా వ్రతాన్ని గూర్చి ప్రభోదించడం ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ పరిచయం:
ధర్మార్జునులు ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ప్రబంధం అనగా ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో వర్ణన ప్రధానం.
కవి పరిచయం:
కవి పేరు : చేమకూర వెంకటకవి
కాలం :17వ శ.
ఆస్థానం : ‘విజయభవన’ అనే కవి పండిత సభగల తంజావూరు రాజు అభినవ భోజడు అనే బిరుదు గల రఘునాథ నాయకుని ఆస్థాన కవి.
రచనలు : 1. సారంగధర చరిత్ర
2. విజయ విలాసం(రఘునాథ నాయకునికి అంకితం) . ధర్మరాజు తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ నిరతి ఎటువంటిదో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు.
శైలి: ప్రతిపద్య చమత్కృతి
ఉ. ఆపుర 'మేలు మేలు బళి!', యంచు ప్రజల్ జయ వెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయాభరణుండు; సత్యభా
షా పర తత్త్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన వి
ద్యా పరతంత్ర మానసడు ధర్మ తనూజుడుగ్రతేజుడై
సారాంశం:
ధర్మరాజు యమధర్మరాజు వరపుత్రుడు. తాను యిచ్చిన ఆజ్ఞలను తనుకూడా పాటించే స్వభావం గలవాడు. శాంతి, దయ, నిజం చెప్పడం, మంచి వారిని ఆదరించి పోషించడం, దానగుణం, నిశిత పరాక్రమం కలిగి విద్యపట్ల ఆసక్తి గలవాడు. ఇతరులెవరైనా ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి, ఎదురుగా లేనప్పుడు చాటుగా వారిని గూర్చి చేడుగా మాట్లాడడం చేసేవాడు కాదు. ఏదైనా సాయం కోరితే సంపూర్ణంగా సహాయం చేసేవాడు. ఒకరిపట్ల పరిచయమైన మొదట్లో ఎక్కువ మర్యాదగా వుండి తర్వాత్తర్వాత అమర్యాదగా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు.
దానగుణం, ధర్మ ప్రవర్తన కలిగి అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. ప్రజలు గొప్పగా సిరి సంపదలతో ఉంటె సంతోషపడేవాడు. కోపం కొంచెం కుడా లేని సత్య స్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. స్థిర స్వభావం గలవాడు.
ధర్మరాజు నలుగురు తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరిని ఐదుగురిని పాండవులు అంటారు. వీరు ఓటమినే ఎరుగని పరాక్రమం గలవారు. అయిదు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని పొగిడేంత గొప్ప గుణవంతులు పాండవులు. పాండవులంతా ఒకరి మనసెరిగి ఒకరు నడుచుకుంటూ, పనులలో భేదాలు లేక, పెద్దా చిన్న వ్యత్యాసాలెరిగి మాట మీరకుండా, స్నేహభావంతో భక్తి , ప్రేమ, సహనంతో ఏంతో నేర్పుగా ఉండేవారు.
అన్నల పట్ల, తమ్ముల పట్ల సమాన భావాలు గలిగి, ఎదురులేని పరాక్రమంగల వానిగా పేరొంది ధర్మ ప్రవర్తన గలిగినవాడు పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడు. దయాగుణంలో గరుడ ధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు. యుద్ధవిజయాలలో శివునికి పోటీ పడే వీరుడు. ఈ భూమండలంలో అతనికి అతడే సాటియైన అర్జునుని పొగడడం అసాధ్యం.
అర్జునుడు తేరిపార చూస్తే చాలు, శత్రుసైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. విల్లుఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారి పడుతుంది. ఇక వేయి మాటలెందుకు? ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని, ఈ లోకంలో మరొకడు లేదు.