సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

6, మే 2024, సోమవారం

బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు - డా. సిద్దెంకి యాదగిరి


బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు
    - డా. సిద్దెంకి యాదగిరి 





జీవితాల్ని కథలుగా వ్యాఖ్యానించడమంటే మరుగున పడిన మానవ సంబంధాల ఎతలను దృశ్యీకరించడమే. నిజజీవితంలోని కనబడని కోణాల్ని, మనసు తడిని, ప్రేమ పదనను, ధర్మాగ్రహ పదునును అక్షరాల్లో అంతరాత్మను కథల్లో ఆవిష్కరించడమే కథనం.   నిబద్ధతతో నిజాయితీగా మానవీయతను నిలుపడమే కథల అంతిమ లక్ష్యం. బంధాలను అక్షరీకరించడం ద్వారా సంఘటనలకు జీవం పోసే అక్షర శిల్పి, కథకులు కొట్టం రామకృష్ణారెడ్డి. వారి కథలు జీవితాల్లోని అడుగంటిన ప్రేమను పాతాళగరిగెతో దేవి గిడస బారిన మనసుపై కుంభవృష్టిగా ఆర్ద్రతల్ని కురిపిస్తాయి. మమతల్నీ బాధ్యతగా హృదయంలోకి వొంపి అనుబంధాలను తిరిగి అంకురింప చేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి నిలదీసి అడుగుతున్నట్లు కనిపిస్తాయి. 

ఆధునిక జీవితంలో నూతన దంపతుల మధ్య అగాథం సృష్టిస్తున్న అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో దాంపత్య జీవితానికి మంట పెడుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి. మనసెరిగి మసలుకుంటే జీవితం ఎలా మారుతుందో నిరక్షరాస్యుల విచక్షణాత్మక నిర్ణయాన్ని ఆదర్శంగా చూపుతూ రాసిన కథ ‘అద్దం వెనుక’.
మనసుకు అవిటితనం లేని సీతమ్మకు భర్త రామయ్య అంటే మహా ప్రాణం. అతనికి, వ్యవసాయంలో, జీవితంలో అన్ని విధాలుగా తోడుండేది. ఒకనాడు సినిమా హీరో ప్రసేన్‌ చిత్రపటాన్ని చూసి ముచ్చటపడి కొనుక్కొచ్చి  దానిని రహస్యంగా అద్దం వెనుక దాచింది. సీతమ్మ మనసు గ్రహించిన రామయ్య చేసిన పనిని తెలిపే కథ ‘‘అద్దం వెనుక’’ చదివితే నేటి దంపతులకు అపార్ధాలు రావని తెలుపుతుంది. 

తండ్రి జబ్బుకు మందు తేవాలని కల్మకల్‌ వెళ్లిన రచయితకు మందు ఇచ్చిన సాకలి బాలయ్య వర్షం వస్తుందనీ, వెళ్ళవద్దని వారించినా వినకుండా బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో వయసుకు వచ్చిన మనుమరాలుతో ఉంటున్న ముసలమ్మ తుంగ గడ్డి గుడిసెలో ఆ రాత్రి ఆశ్రయం పొందుతాడు. వారిపట్ల ఎనలేని కృతజ్ఞతాభావంతో నిండిపోతాడు. తెల్లవారి బయలుదేరిన రచయితకు ఆ మనుమరాలి చూపులు ఎందుకు గుచ్చుకున్నయో, ఆ అనుభవాన్ని తలుచుకొని అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ ఊరినీ, అక్కడి పరిస్థితుల్ని కళ్లగట్టినట్టుగా హృదయానికి హత్తుకునేటట్టు మారాలనీ బోధిస్తూ  ‘ఆఖరికి’ కథ పాఠకుల్ని మూలాలు మరువకూడదనీ గుర్తు చేస్తుంది. 

అర్థం వేరు. అంతరార్థం వేరు. వాస్తవాన్ని గుర్తించకపోతే జరిగిన అపార్థమే జనిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న తల్లి కొడుకుల మధ్య ఒకరి మొఖం ఒకరు చూడకుండా ప్రేమ లేకుండా చేసిన ‘నూనె సుక్క’ తల్లి కొడుకులను ఒక జీవితకాలం ఎందుకు విడదీసింది? కనపడని శూన్యాన్ని ఎలా నింపిందో తెలుసుకున్న రచయితకు నానమ్మ చెప్పిన జీవిత తాత్వికత, మార్మికతలో జీవితానికి సరిపడే ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆలోచనలో బాధపడిరదెవరో ‘నూనె సుక్క’ కథ చదవి అపార్ధాన్ని తొలగించుకోవాల్సిందే.

రాముడు విడిచి వెళుతున్నాడని అయోధ్య వాసులు ఒకవైపు విలపిస్తున్నారు. రుతుక్రమాన్ని మరిచి అడవిలోని ఫలాలు ఫలి స్తున్నాయి. ఏది తెచ్చిన కాకి ఎంగిలి అనీ అంటారని ఆయాసం వస్తున్న ఆవాసాన్ని వెతికిన వాయసం. బిచ్చగాడు ఎత్తుకుపోయిన నాటి సీతమ్మను నేడు కనుగొనడానికి జనావాసాల మధ్య,  తిరుగుతూ వాయసం ఏం వెతుకుతుందో తెలియాలి అంటే ‘కాకి రామమం’ చదవాలి. రంగు నలుపు. కానీ కాకి మనసు నల్లగా ఉంటుందా అని ప్రశ్నిస్తుందీ కథ. ఈ కథలో కాకులంటే అణగారిన వర్గాలే. 

ఎండాకాలం తాతిల్‌ (సెలవులు)అంటే పిల్లలకు తల్లిదండ్రులకూ ఇష్టమే. పిల్లాడిని తీసుకుని లక్ష్మీ మామ ఆడపడుచు దగ్గరికి రుక్కమ్మతో సహా వెళ్లడం వల్ల లక్ష్మీ ఆశ అడియాశ అయింది. వారం తర్వాత వారం రోజులు బిడ్డ అత్తమామను పిలిచి తన ఇంట్లోనే మర్యాద చేసిండు రాములయ్య. వాళ్ల తర్వాత వారం రోజులు బిడ్డ కలమ్మ తల్లిగారింట్లో ఉన్నది. కలమ్మను సాగనంపుతున్న బస్సులోనే లక్ష్మి తండ్రి లక్ష్మిని తీసుకెళ్దామని దిగిండు. తల్లి గారి ఇంటికి వెళ్లే లక్ష్మికి అత్త రుక్కమ్మ ద్వారా నూరు రూపాయలు ఇస్తాడు. తాతీలు దొరకగానే వద్దామని అనుకున్నానని తండ్రితో చెబుతుంది. లక్ష్మికి తన తండ్రి అత్తమామల గురించి చెప్పిన తాతీల్‌ ఎవరెవరికీ కావాలో ఎలా అందివ్వాలో తెలియజేసిన విషయం ఆర్ద్రంగా చెప్పిన బ్రహ్మ రహస్యం ఏమిటో తెలిస్తే గాని కన్నీళ్లతో అమ్మగారింటికి పోయే కోడల్ని మొట్టమొదటిసారిగా విడ్డూరంగా ఊరిలోని చుట్టుపక్కలోల్లు  చూసిండ్రని ‘తాతిల్‌’ కథను ఆత్మీయతతో ముగిస్తాడు. 

కథకుడు ద్రష్ట అయి భవిష్యత్తును ఊహిస్తాడు. అసహజమనిపించినా రచయిత సహజంగా తీర్చిదిద్దాడు. ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగు చేస్తాడు ? దేవుడే ప్రకృతి. ప్రకృతే దేవుడుగా ఆచరించాలనీ, ఆరాధించాలనీ వివరిస్తుంది. అలా చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తు అభ్యున్నతికి పాటుపడ్డ వాళ్ళమైతామని బోధించే బాధ్యతని మేల్కొల్పే కథ 3456జిబి. ఈ కథ చదివితే ప్రకృతి వినాశనం కానివ్వ కూడదని గట్టిగా కోరుకున్న వాళ్ళమై గొప్ప బహుమానంగా ముందుతరాలకు అందజేయాలనీ సంకల్పించుకుంటాము. 

మనిషినై పుట్టనందుకు మురిసిపోతుందని తెలపడమంటే పశువుల గొప్పతనం కోడె పాత్ర ద్వారా ఉన్నతీకరిస్తాడు రచయిత.అప్పుడే పుట్టిన కోడె తల్లి మాటలు విని మురిసిపోయినా కష్టాలు తప్పలేదు. ముసలిదైన ఎద్దు నెమరేసుకుంటున్న జ్ఞాపకాల్లో కొత్తకోడల్ని హింసించి ఎలా బలితీసుకున్నారో ఎవరు బలిపసువులవుతున్నారో తెలుపుతూ పైసలు ఎదిరిచ్చి కష్టాలు కొనుక్కునే కోడళ్ళ బలహీనత మీద, చచ్చిపోయేలా కల్పించిన పరిస్థితుల మీద, జీవితకాలం పనిచేసి అతని అభివృద్ధికి ఆధారమైన ఆ పశువును కసాయి వాడికి అమ్ముతున్నపుడు ఆ పశువు జ్ఞాపకాల ఆత్మఘోషనే ‘బలిపసువు’ కథ బలి విధానాన్ని ధిక్కరిస్తుంది.

ఏ ఆధారం లేకుండా తన చెల్లెల్ని చంపిన వరకట్న పిశాచిపై తీర్చుకున్న పగకు శిక్ష విధించాలనుకున్న జడ్జి బాధితుడై మథనపడుతూ కుమిలిపోతూ ఒక్క శిక్షకైనా రెండో శిక్షకైనా అదే తీర్పు అనీ ఇవ్వాల్సిన తీర్పే ఇచ్చిన ‘తీర్పు’ కథ హృదయ ఫలకం పై చెక్కు చెదరకుండా ముద్రించబడుతుంది.

చెరపకురా చెడేదవు అని బోధించే కథ ‘ఆకుపచ్చటి నెత్తుటి జాడ’. శంకర్‌ రెడ్డిది ఓర్వజాలని మనస్తత్వం. కుమ్మరి మల్లయ్య జాగలోని మామిడి చెట్టు నీడ వల్ల పంట పండుతలేదనీ మనుషుల చేత కాత ఉండగానే దౌర్జన్యంగా కొట్టేస్తాడు. కుమ్మరి మల్లయ్య పిచ్చివాడై శాపనార్ధాలు పెట్టినందుకు రక్తం గారేటట్లు కొడతే చెట్టు మొదట్లోని తల్లి సమాధిపై పడి స్పృహ తప్పుతాడు. శంకర్‌ రెడ్డి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అతడి రెండో భార్య బావికాడి నివాసం నుంచి కనబడకుండా తప్పిపోయిన మిస్టరీ ఊహకందకుండా నడిపిన కథనం పాఠకున్ని విస్మయానికి గురిచేస్తుంది. 

అంతరిక్షజాడలు కనుగొంటున్న మనిషికి ఎదుటివారి అంతరంగంలోని స్వార్థం కనుగొనకపోవడమే అతి పెద్ద విషాదం. అంతరిక్ష యాత్రికుని మనసులో ఏముందో ఎవరికి అంతుపడుతుంది? ముక్కోణపు ప్రేమలో మిగిలేవి రెండే. మిగిలేది అంతర్ధానమే. స్వార్ధం రగిలించిన ప్రేమ కోసం అంతరిక్షంలో చేసిన అఘాయిత్యమే ‘ఎల్లలు’ కథలో గెలిచింది ప్రేమనా? స్వార్థమా ఏది గెలుస్తుందో చదివాక స్పష్టత కలుగుతుంది.

బతుకమ్మ పండుగకు తల్లి గారి ఇంటికి వచ్చిన బాల్య మిత్రురాల్లు వినోదా, సరోజ సుమతులు. పువ్వు ఏరడానికి పోయి అక్కడ సరోజ కుటుంబం పట్నం పోయి అప్పుల పాలైండ్రు. వినోద తక్కువ జీతమున్నా డబ్బు వెన్కకేస్తుండ్రు. ఏంటి మీ రహస్యం అని అడిగిన వినోదకు కరువులో ఉన్నా కష్టాలో ఉన్నా ఊల్లో ఉన్నా పట్నంల ఉన్నా ఎక్కడున్నా కష్టపడాలి. రేపటి కోసం పొదుపు చేయాలి. ఈ ఆలోచన, ఆచరణ లేకపోతే బతుకే ఆగమాగం అని పొదుపు రహస్యం చెప్పే ‘ఇగురం’ కథ ఏరుకొచ్చి పేర్చిన పెద్ద బతుకమ్మలా ప్రేరేపిస్తుంటది. 

చాలా మందికి కఠినపదాలకు అర్థాలు సమగ్రంగా తెలియవు. కథనేకాదు భాష కూడా అర్థమయ్యే విధంగా చెప్పడంలో రచయిత సిద్ధహస్తులు. సమూహంలోంచి వెలివేయబడితే ఒంటరితనమని, సమూహాన్ని వెలివేస్తే  ఏకాంతం అని పాత్రలు సమభాషిస్తాయి. ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య నిట్టూర్పే మానవ జీవితం. ఒంటరితనం ఓటమివైపు, ఏకాంతము గెలుపుకు బాటలేస్తాయనీ,  ఒంటరితనంలో సమాజం కోసం రచయిత లోలోన కుమిలిపోయే వ్యవస్థను చూసిన మనస్సుకు బతికినన్నాళ్లు ఈ బాధ తప్పదని ఉదాసీనంగా వెళ్లిపోవడమే ఏకాంతం కలిగించే జాలి అనీ డిస్ట్రక్టివ్‌ (విధ్వంసం)గా చెప్పే అంశం అబ్సట్రాక్టివ్‌ (అమూర్తం)గా వివరించే ‘ఒంటరి ఏకాంతం’ చదివితే ఎన్నో విషయాలు, విశేషాలు విధితమవుతాయి. ఈ కథ చదివాక కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’అన్న ప్రసిద్ధ పంక్తులు గుర్తుకొస్తాయి.

ఊరిలో మనుషుల మధ్య సంబంధం కలిపేది వృత్తి పని. వృత్తి పనివాల్లను కలిపే వేదిక పంట పండాక ధాన్యం కొలిచే కల్లం. పనిచేయనోళ్లకు మన దాన్నెం పంచిపెట్టుడెందుకు తాతా అని అడిగినప్పుడు కడుపులో చేయి పెట్టి దేవి తీసిన సమాధానం తాత చెప్తూ ‘‘ఆళ్ళందరూ పరాయోళ్ళు కాదురా! కులాలు వేరైనా మనందరం ఒకటే. మనకు భూముంది. సేద్యం చేస్తం. గది మన వృత్తి. కమ్మరి కుమ్మర్లందరూ మన కోసం పని చేస్తరు. మనం వాళ్ల కోసం పని చేయాలి. మనకోసం వాళ్లు చేస్తారు. ఎవ్వలి పని ఆడే చేసుకుంటే మందితోటేం పని?’’ అని  ఏకత్వం మర్మం చెప్పే ‘బర్కత్‌’ కథ మనుషులంతా ఒక్కటనే నిజం కడుపుల ఆత్మ కండ్లకు దుఃఖం తెస్తది. ఈ కథ ముగింపు నేడు దేశమంతా కులాల మతాల పేరిట జరిగే అసహనం జరిపే ఆకృత్యాలకు చెక్‌ పెట్టి గుణపాఠం చెబుతుంది.

నాయకుడిగా ఎదగాలనుకుంటే మనొక్కరమే ఎదుగుతాం. నాయకులు తయారు చేయగలిగిన వాడే మహానాయకుడు అని పేర్కొన్న ఒక జింక నాయకత్వం వహిస్తూ జింకల గుంపును, కుర్ర జింకను కాపాడుతూ పులిని చంపేస్తూ తను చనిపోతూ పదుగురికి  మేలు చేసే చావు గొప్పదనీ జింక చేసిన త్యాగమే ‘యుద్ధం’ కథ. ఈ కథలో జింకలు మానవులకు ప్రతీకలు. ఈ కథలో మానవ సమూహాన్ని ఎలా కాపాడాలో నేతలకు బోధించే గురూపదేశం ఉంది. 

జీవితంలో సంపాదనే ముఖ్యం కాదు బిడ్డా అని ‘‘పానంతోటి బతకాలంటే ఊర్లలో బతకాలె’’నని ఊరిపై నున్న మమకారానికి ఆకారాన్ని చిత్రించే ‘రెండో ఉత్తరం’ కథ ప్రతీకాత్మక భవిష్యత్తు సందేశాన్ని తండ్రి ద్వారా కొడుకు అందిస్తుంది. ఊరిని ఇడ్సిపెట్టి ఉండుడంటే పానం లేకుండ బతికినట్లే అని చదివిన కొడుకు శాశ్వతంగా ఇండియా వస్తాడు. 

తెరచిన కిటికీలోంచి ప్రకృతిని చూసినప్పుడు అనేక దృశ్యాలు కనబడుతుంటాయి. ఆలోచనల్లోకి వెళ్లి భ్రమల్లో బతుకుతుంటాం కానీ నిజం వేరే ఉంటుంది. అతనికి బాల్యమిత్రుడు చావు గుర్తు తెచ్చుకొని మనసు శకలాలుగా విరిగిపడుతుంది. ఎంసెట్‌ మెడికల్‌ సీట్‌ మొదటి ర్యాంకు సాధించిన కొడుకు బీఎస్సి అగ్రికల్చర్‌ వైపు వెళ్తాననడం. కిటికీ దృశ్యాలతో ఆలోచనలు ఆచరణలు మూలాల్లోకి వెళ్లడం కోసం మమేకం చేసే కథ ‘తెరిచిన కిటికీ.’ గో బ్యాక్‌ టూ అగ్రికల్చర్‌ అని వివరిస్తుంది.

అనువణువునా పల్లె తనం నింపుకున్న మనిషి జీవన విధానమే ‘ఇగురంగల్లోడు’ కథ. ఎవరికి అర్థం కాకపోయినా బాధ్యతకు నిలువెత్తు విగ్రహం. నీతికి చిరునామా. రీతికి దిక్సూచి. కడుపు నిండా కనబడని ప్రేమ, కనిపించే శత్రువుగానే ఉన్నా కుటుంబం పట్ల అంకితభావమే. ఉల్లాసము నింపని వ్యక్తి పట్ల కుటుంబ సభ్యుల అనుబంధాల అల్లికే ఈ కథ. 

ఊరు దాటకున్నా సరే వ్యవసాయ దంపతుల అన్యోన్యతలు ఎలా రెట్టింపు చేస్తూ బావిని హనీమూన్‌ గా భావిస్తూ, పొలాన్ని ఫారిన్‌ ట్రిప్‌ గా చిత్రిస్తూ జీవిత యాత్ర కొనసాగించాలనే సందేశాత్మకమైన కథ ‘యాత్ర’. ఏవీ లేవని బాధపడటం కంటే ఉన్న వాటితో తృప్తి పడటం జీవితానికి మించిన సంతోషం లేదని ఆలుమగలు అరమరికల్లేకుండా ఎలా జీవించాలో తెలియజేసే కథ యాత్ర. నవల లా సాగిన వర్ణన.



వర్ణన`పోలికలు: కథలోని వర్ణన ద్వారా సంఘటన, పాత్రోచిత సంభాషణ, సమన్వయంతో పాటు సొగసైన వర్ణనతో రచయిత ఆకట్టుకుంటాడు. పోలికల ద్వారా కథనానికి రచయిత బలం చేకూరుస్తాడు. ‘నా ఎన్నెల ఎలుగుల కన్న ఎక్వ వెలుగు యాడ్కెలొచ్చింది’ అని సీత కండ్లని సూసి, సిగ్గుపడి మబ్బు సాటుకు దాక్కున్న సంద్రుడు. అని వ్యక్తీకరించడం ద్వారా అతిశయాన్ని అతికిస్తాడు.(ఆఖరికి కథ). సూర్యుడు ఊరిడిసి పెట్టి పోయిండు, పొద్దుగాల మల్లొస్తనని జెప్పి’ అని తాతిల్‌ కథలో పోలుస్తాడు. పెండ్లిపిల్ల కడిగిన ముత్యమోలే మంచిగున్నది. (బలిపసువు). ‘ఎవరి బతుకు వారే బతుకాలనీ కోడి పిల్లలు పెద్దగయినంక కోడి పిల్లలను ఎడవాపుతుంది’ లాంటి పోలికలు కావల్సినన్ని ఏరుకోవచ్చు.

ప్రతి కథలోనూ ఒక సామాజిక దృక్పథంతో రాయడం రచయిత సామాజిక బాధ్యతకు నిదర్శనం. మనుషులంతా మానవీయ సంబంధాలతో అనుబంధాలు పెనవేసుకొని జీవించాలని, లుప్తమవుతున్న విలువల్ని పెంపొందించాలని సందేశం ఇచ్చేవి ‘నూనె సుక్క’ కథలు.

ఆర్ద్రతను పిండి మనసును తడి చేసే కథలు. కనిపించని కల్లోలాన్ని కనిపించేలా చెక్కిన శిల్పాలు. ఎంచుకునే కథా వస్తువును లోతుగా పరిశీలించి, పరిశోధించి ఫలవంతంగా అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడం కొట్టం రామకృష్ణారెడ్డి ప్రత్యేకత. వారు కథ వస్తువు ఎంపికలో జాగ్రత్త వహిస్తాడు.

 ఎంచుకున్న కథ పట్ల స్పష్టత లేనిది రాయడు. ఎక్కడా అనవసరమైన వాక్యాలు, పదాలు పాఠకుల్ని ఇబ్బంది పెట్టవు. వారి శిల్పంలో మట్టి కూడా మాణిక్యంగా మారుతుందనడంలో అతిశయం కాదేమో. వీరి కథనం ప్రత్యేకమైన శైలితో ఉంటుంది. కథకు కథకు పోలిక లేకుండా, ఊహకు అందకుండా రాసే వీరి శ్కెలి ఎంతో రమణీయం. ఎంతో అధ్యయనం చేస్తే కానీ ఇలాంటి శైలీఅలవడదు. 

రాసిన కథలను వాసికక్కేలా తీర్చిదిద్దడం వారి నిపుణతకు, నిబద్ధతకు పరాకాష్ట. ఇవి టైం పాస్‌ కథలు కావు. తప్పక చదవాల్సిన బతుకు గాథలు. బాధ్యతలకు బాటలేసే  అత్యుత్తమ మా’నవ’ జీవితానికి  ప్రబోధించే ఆచరణాత్మక ఎతలు.

    ` డా. సిద్దెంకి యాదగిరి 9441244773

5, మే 2024, ఆదివారం

శూన్యం భర్తీ చేసిన లోయ చివరి రహస్యం



జై భీమ్ ఫ్రెండ్స్. 
  
మే మాసం తంగేడు పత్రికలో 
భగవంతం గారి 'లోయ చివరి రహస్యం' కథ సంపుటి పై 
నా సమీక్ష. 

ప్రచురించిన తంగేడు యాజమాన్యానికి, సంపాదకులు కాంచపల్లి గోవర్ధన రాజు గారికి, ఘనపురం దేవేందర్ గారికి కృతజ్ఞతలు. 

తప్పకుండా చదివి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలు రాయగలరు. 


శూన్యం భర్తీ చేసిన లోయ చివరి రహస్యం
 
 ‘గద్యం కవీనాం నికషం వదంతి’ అనే ప్రసిద్ధోక్తి ఉంది అంటే కవి ప్రతిభకి గద్యమే గీటురాయి అని అర్థం. అలా  గద్యాన్ని హృద్యంగా, మార్మికత కలసిన తాత్వికతతో రసోద్భవం  కలిగించేలా రచించించిన కథల సమాహారమే రచయిత భగవంతం వెలువరించిన ఆయన మొదటి కథా సంకలనం ‘లోయ చివరి రహస్యం’.
 కవి కథకుడు అయితే పదునైన వాక్యం ఎలా ప్రయోగించగలడో, వాక్య విన్యాసాలతో , పదాల అల్లికలతో ఎలా పఠనానందం కలిగించగలడో ఈ కథలు చదివితే తెలుస్తుంది. 
ఈ కథల్లో మౌనం మాట్లాడుతుంది. శబ్ధం నిశ్శబ్ధాన్ని వెదుక్కుంటుంది. కథనం వేసవిలో చల్లగాలిలా మనసులోకి వీస్తుంది.

‘చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది’ అంటూ మొదలయ్యే ‘చంద్రుడు గీసిన బొమ్మలు’ కథలో చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టుగా వెన్నెల ఉందని కవిత్వీకరిస్తాడు రచయిత. ఆ పున్నమి రాత్రి చంద్రున్ని చూస్తూ పరవశానికి లోనైనా కథలోని పాత్రకు  
‘‘బుద్ధుడు 
చూసిన చంద్రున్ని
నేను చూస్తున్నాను’’ అనే భావనా కలిగి ఆ భావం జపనీస్‌ కవితా ప్రక్రియ అయిన హైకూలా అనిపించడంతో  అలాంటి భావన కలిగినవారు సృష్టిలో ఇప్పటివరకూ ఎవరెవరు ఉన్నారో తెలియజేయగలవనే చంద్రుడిని అడిగిన ప్రశ్నకు చంద్రుడు సమాధానమిచ్చాడా?  లేదా? అనేది కథ చదివి తెలుసుకోవాల్సిందే.

పక్షిలా రూపాంతరం చెందాలని బయలుదేరిన మనిషికి మనిషిలా రూపాంతరం చెందాలని బయలుదేరిన పక్షి ఎదురుపడితే ఎత్తైన కొండల మధ్యలో ఉంచి లోతైన లోయలమీదుగా రైలు పట్టాల మధ్యలోంచి వారి ఇరువురు రాత్రంతా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే- చివరికి వారు ఆశించిన ప్రయోజనం నెరవేరిందా లేదా అవగతం అవ్వాలంటే ‘లోయలోని రహస్యం’ కథను చదవాలి.

జీవన ఎడారిలో ఆశల పూలు పూయించే మరో కథ ‘వెలుతురు’. ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి దూకిన యాభై ఏళ్ల వ్యక్తిని చెరువులోని చంద్రుడి ప్రతిబింబం కాపాడి ఒడ్డున తన ఒళ్ళో పడుకోబెట్టుకొని స్వాంతన చేకూరుస్తూ ఆ చెరువులోని చేపలు చెప్పిన కవిత్వం చెప్పి, అతనికి జీవితం మీద ఆశలు రేకెత్తిస్తుంది. ఆ కవితల్లోని ఒకే వాక్యం ఇచ్చిన కాంతి సహాయంతో అతడు తన మిగిలిన జీవితం వైపు బయలుదేరుతారు. ఆ వాక్యం ఏమై ఉంటుందో ఆ చెరువులోని చేపలు చెప్పిన కవితలు ఏమిటో అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో ‘వెలుతురు’ కథలో మనకు తారసపడతాయి.

‘కొండను తవ్వి ఎలుకలు పట్టినట్లు’ అనేది నానుడి. అయితే ఒక ఎలుకకు ఎవరికి రాని సందేహం ఒకటి వస్తుంది. ‘ఈ మనుషులు కొండను తవ్వి ఎలుకను పట్టడానికైనా శ్రమిస్తారు కానీ ఎలుకను తవ్వి కొండను పట్టడానికి ఎందుకు ప్రయత్నించరు’ అని. అసలు ఎలుకను తవ్వి కొండలు ఎందుకు పట్టాలి అన్న సందేహం మీకు కూడా వచ్చినట్లయితే ఒక పురాతన మానవుడు పురాతన ఎలుక చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఆ ప్రయోగాన్ని ‘వెలుగు పూలు’ కథ మనసుకు హత్తుకునేటట్లు ఆవిష్కరిస్తుంది.

వేసవి సెలవుల్లో భువనేశ్వర్‌ దగ్గర అడవుల్లో ‘శూన్యాన్ని ఆరాధించే యోగుల బృందాన్ని’ కలవడానికై ప్లాన్‌ చేసుకున్న ఒక వ్యక్తి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని అనుభూతుల్ని మిగిల్చింది అన్నింటికన్నా ముఖ్యంగా చివరికి ఏమైందో తెలుసుకోవడానికి చిట్టచివరి సున్నా కథను తప్పక చదివి తీరాలి మార్మికత, తాత్వికత రెండు పట్టాల చివరి వరకు కొనసాగుతూ ఉత్కంఠంగా సాగిన కథ ఇది.
ప్రపంచంలో మనం ఉన్నట్లు మన చుట్టూ ప్రపంచం ఉంటుంది. ఎవరికి వారే ఒక ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల్లో జీవితం కొందరికి కలలోని కలలా అనిపిస్తుంది. అలాంటి ఒక్క కల రావడానికి ముందు వెనుకా ఒక వ్యక్తి చేసిన ప్రయాణమే ‘గోధుమ రంగు ఆట’ అనే కథ. ప్రఖ్యాత రచయిత త్రిపుర ‘భగవంతం కోసం’ కథకు కొనసాగింపు లాంటి కథ. 

ఒక్క శీర్షికలోనే తప్ప ఈ కథలు ఇంకెక్కడా ‘భగవంతం కోసం’ కథ తాలూకు నీడలు పడకుండా రచయిత జాగ్రత్త పడ్డాడు అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో నీ కథలలో అధికసార్లు ప్రయోగించిన పదం శూన్యం మనుషులకు ప్రకృతికి మధ్య ఏర్పడిన శూన్యం భర్తీ చేయబడాలని ఈ రచయిత ఆశిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ కథలన్నీ చదివాక, పుస్తకం చదివాక పూర్తయ్యాక మనసులో హృదయంలో ఆత్మలో ఒక సహానుభూతి మిగిలిపోతుందని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. ఇది రచయిత తాత్వికంగా, తార్కికంగా, మార్మికంగా తన బయటకి లోపలికి చేసిన ప్రయాణం తాలూకు అనుభూతులతో అనుభవాల సంపుటి.

వాక్యాన్ని వడగట్టి నిలిపిన గతకాలపు రచనల చింత ఈ పుస్తకాన్ని చేర్చవచ్చు. కొత్తగా రచనలు చేయాలనుకునే వారే కాకుండా రచనలు చేస్తున్న వారు కూడా తప్పక చదవాల్సిన పుస్తకం లోయ చివరి రహస్యం.

ఈ పుస్తకం వివరాలు:
‘‘లోయ చివరి రహస్యం’’ (కథలు), రచన: భగవంతం,  పేజీలు: 117, వెల: రూ. 150, ప్రతులకు: ఎమెస్కో, 9000413413, 9399328997.

డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ౯౪౪౧౨౪౪౭౭౩

1, మే 2024, బుధవారం

దళిత క్రైస్తవ బాధలు - గుడిసె ఏసోబు కథలు

కొలిమి అంతర్జాల పత్రిక మే మొదటి రోజున ప్రచురితమైన నా వ్యాసం తప్పకుండా చదివి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో రాయండి

ఈ కింది లింకు నొక్కడం ద్వారా వ్యాసాన్ని చదవవచ్చును

దళిత క్రైస్తవ బాధలు - గుడిసె ఏసోబు కథలు కొలిమి మే 1, 2024 న ప్రచురితం. 




కదులుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజ స్థితిగతులను, జనజీవన స్రవంతిని తనలో ఇమిడిచుకొని కాలాన్ని సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఆధునిక పోకడలతో మారుతున్న సమాజం సాహిత్యంపై ప్రభావాన్ని చూపింది. జాతీయోద్యమ కాలంతో ప్రభావితమైన రచయితలు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని కాంక్షిస్తూ తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. జాతీయోద్యమం, అభ్యుదయోద్యమం, భావకవిత్వోద్యమం, అనంతరం విప్లవ కవిత్వ ఉద్యమాలు వచ్చాయి. 1970లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్ ప్రభావంతో తెలుగు నేలలోని సాహిత్య దృక్పథమూ మారింది. కారంచేడు, చుండూరు, పాదిరి కుప్పం, వేంపేట లాంటి సంఘటనలు తిరుగుబాటుకు బాటలేశాయి. చదువుకున్న దళితులు తమ జాతి, కుల బాధల్ని రాయడానికి ప్రేరేపించాయి. పాట, మాట, కవిత్వం కథలుగా సాహిత్యం వివిధ ప్రక్రియలో విస్తృతమైంది.

1980వ దశకంలో అస్తిత ఉద్యమాలు ఉధృతంగా వ్యాపించాయి. అప్పటికి కథల్లోకి, కవితల్లోకి రాని అంశాలను జీవితాలను సంఘటనలను, మరుగున పడ్డ విషయాలను ఎన్నింటినో వస్తువులుగా తీసుకోని, అతి సామాన్యులే కావ్యనాయకులుగా సృజన కారులు వినూతనంగా అక్షరీకరిస్తున్నారు. అస్తిత్వ ఉద్యామాల్లో దళిత ఉద్యమం, స్త్రీవాద ఉద్యమంతో పాటు మైనార్టీ వాదం పెరుగుతూ వచ్చింది. మైనార్టీలనగానే కేవలం ముస్లింలే కాదు క్రిస్టియన్లు, బుద్ధులు, జైనులు మొదలైన అల్పసంఖ్యాకులైనవారు.

నాటి చెన్నపట్నం కేంద్రంగా క్రైస్తవ మిషనరీలు అటు తమిళనాడులోని ఇటు కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని ప్రవేశించాయి. వారు వ్యాపారంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజల మనసులు చూరగొని తమ మతవ్యాప్తికి పాటుపడ్డారు. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమిచుమన్న క్రీస్తు అనుసరించి జీవించేవారు క్రైస్తవులు. ఏసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రం పై తిరుగుబాటు చేసి అందరికీ సమాన ఆధ్యాత్మికతను ప్రసాదించాడు. శాస్త్రులు పరిశయ్యులను ధిక్కరించాడు. క్రీస్తువలే ప్రేమను పంచడం వల్ల క్రైస్తవము ప్రపంచవ్యాప్తంగా విస్తృతమయ్యింది. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏసుక్రీస్తు పేరిట ప్రేమను పంచడానికి వెళ్లారు. దళితుల్ని, రోగగ్రస్తుల్ని, ఆదరణ లేని వారిని క్రైస్తవ్యం చేరదీసి ఆదరించింది.

మారుమనస్సు పొంది రక్షణ పొందుడి అన్న యేసుమాటల్నీ పెడచెవిన పెట్టి యాకోబ్ రెడ్డి అనీ, వంకయ్య చౌదరీ అనీ కొనసాగుతున్నారు. తనను వెంబడించేవారు ఉన్న ఆస్తుల్నీ వాదులుకొని వెంబడించాలనీ చెప్పిన క్రీస్తును ఆదర్శంగా తీసుకుంటూనే తారతమ్యాలను సూచించే కుల గురుతులను వాదులుకోలేని వాళ్ళు ఆస్తులను వదులుకుంటా? వదులుకోరు.

క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అగ్రవర్ణాలైనా రెడ్లు కమ్మలు మొదలైన వారు పీఠాధిపతులుగా మఠాధిపతులుగా సంఘ(చర్చి) పెద్దలుగా, కోశాధికారులుగా, ఫాదరులు, స్వాములుగా వివిధ పదవులు అనుభవిస్తూ ఎంతగానో క్రైస్తవ సంస్థల ద్వారా వచ్చే విరాళాలు, చందాల ద్వారా లబ్ధి పొందుతూ వైద్య, విద్య సౌకర్యాలను అనుభవించారు. స్వార్థాన్నీ వదిలి క్రైస్తవ సమాజానికి అంకితం చేసిన వారూ ఉన్నారు.

క్రైస్తవంలోని అట్టడుగున ఉన్న దళితుల బాధలు సమానత్వం లేక వివక్ష మాత్రం యధావిధిగా కొనసాగింది. వైద్యాలయంలోనూ, విద్యాలయంలోనూ దళితులకు సులువుగా ప్రవేశం లేదు. అన్నిచోట్ల వివక్ష ఉన్నట్లే చర్చీలలో కూడా వివక్ష ఉంది. ఐక్యతగా ఉండకుండా దళిత క్రైస్తవులు కూడా మాలలుగా, మాదిగలుగా కులాలుగా విడకొట్టబడ్డారు.

తెలుగు సాహిత్యంలో దళిత క్రైస్తవ జీవితాన్ని చాలా మంది కథకులు కథలుగా మల్చారు. వారిలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, వేలూరి శివరామశాస్త్రి ‘వ్యత్యయం’, ‘సదాచారుడు’, కరుణ కుమార్ (కందుకూరి అనంతం) ‘పోలయ్య’, కొలకలూరి ఇనాక్ ‘ప్రకాశం పంతులుగారు’, ‘ఏడిస్తేనే ఆనందం’. చిలుకూరి దేవపుత్ర పిలాతు, బందీ; ఇండస్ మార్టీన్ ఫాధిరి గారి అబ్బాయి, మధురాంతకం నరేంద్ర ప్రార్థన, పి. చిన్నయ్య ముత్తమ్మ ఉరఫ్ మరియమ్మ సమాధి కథతో పాటు చాలామంది కథకులు క్రైస్తవ జీవితాల్ని కథలుగా రాశారు. ఈ పరంపర సతీష్ చందర్, పీవీ సునీల్ కుమార్, ఎం ఎం వినోదిని, ఇండ్ల చంద్రశేఖర్, చరణ్ పరిమి, ఎండ్లూరి మానస, మెర్సీ మార్గరెట్, చల్లపల్లి స్వరూప రాణి కథలు రాస్తున్నారు. క్రైస్తవ్యంలో రెండు విభాగాలైన ప్రొటెస్టెంట్లు కేథలిక్ సంఘాల ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను పద్ధతులను ఇంకా కథలుగా రాయవలసి వుంది.

దళిత క్రైస్తవ బాధలను కళ్ళకు కట్టినట్టుగా చిత్రించిన ధార గోపి కథలే ‘గుడిసె ఏసోబు’ కథలు. ఇండస్ మార్టీన్ ‘ఫాధిరి గారి అబ్బాయి’, ఏం. ఎం వినోదిని ‘బ్లాక్ ఇంక్’ కథలు, క్యాథలిక్ చర్చి జీవితాలను పూదోట శౌరీలు ‘సిలువగుడి కథలు” క్రైస్తవ జీవితాలను ప్రతిబింబించాయి.

కింది కులాల అడ్డడుగు దళిత బహుజనుల వెతల్ని కథలుగా బతుకు చిత్రాలను దార గోపిచే రచింపబడిన గుడిసె ఏసోబు కథలలో ప్రధానంగా అగ్రవర్ణాల వారికి మరియు దళిత క్రైస్తవులకు మధ్య ఉన్న అంతరాలను బట్టబయలు చేసి తరాల అంతరాలను, వ్యత్యాసాలను వ్యక్తిగత జీవితాలను వ్యవస్థీకృత కట్టుబాట్లను మతం ముసుగులో దాగిన ఆధ్యాత్మిక సేవా వెనుక ఉన్న రహస్యాలను బట్టబయలు చేసి చూపించింది. ఈ కథలు 1988-89 మధ్య కాలంలో విద్యార్థి విశ్లేషణ పత్రికలో ధారావాహికగా ప్రచురించబడ్డాయి.

సనాతన మతమైనా ప్రేమను పంచే మతమైనా చివరికీ బీదలకు అక్షరం అందకూడదనీ, ఆశల్నీ కుట్రపూరితంగా ఎలా చిదిమెస్తారో, ఎంత అందంగా ఉన్నత కులాలవారు నిరాకరించిన వాస్తవాలు చిత్రిక కట్టిన పరిస్తితులే ఈ కథ. శక్తిని ధారపోసి నిర్మించిన కూలీల శ్రమ పరిమళమే కాన్వెంట్ స్కూల్. తన కొడుకును కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని మరియమ్మ కోరికను ఆధారం చేసుకుని పెళ్లయ్యే వరకు పాలేరు తనం చేసిన ఏసోబు తన కొడుకు పాలేరుగా మారకూడదనుకుని కాన్వెంట్ స్కూల్ కి తీసుకెళ్తుంటాడు. తోవలో తన స్థానంలో పాలేరైన యాకోబుకు తెలుపుతాడు. కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ పెద్దమ్మగారు లోపల కరణంతో మాట్లాడుతుంటుంది. వేచి చూసి విసిగి అలసి ఆ ఫ్లోర్ మీద కూర్చోగానే చల్లగా ఉండటం వల్ల నిద్ర పట్టింది ఏసోబుకు. ఉరుము ఉరిమినట్టుగా ఆ యజమాని పిలవగానే దిగ్గున మేల్కొంటాడు ఏసోబు. కాన్వెంట్ స్కూల్లో చదవాలంటే ఫీజు కట్టాలి. డ్రెస్సులు కుట్టించాలి. బూట్లు కొనాలి. ఇంగ్లీషులో ఇంటి వద్ద బోధించాలి. ఇవన్నీ నీతో అయ్యే పనేనా అని యజమానురాలైన పెద్దమ్మ గారు అడ్మిషన్ నిరాకరించడమే ‘కాన్వెంట్’ కథ.

ఒకానొక క్రిస్మస్ పర్వదినాన గుడిసె ముందు అందంగా తీర్చిదిద్దిన పశువుల పాక అవసరమా అని జాన్ బాబు ప్రశ్నిస్తాడు. మనమూ మన చందాలు వాళ్ళకి అవసరం. వారికి మన బీదరికం తప్పనిసరిగా కావాలి. ఆ బీదరికాన్ని చూపిస్తూ విదేశాల నుండి సంచులు నింపుకోవడం వాళ్ల విధి. అదే వారికి సమకూర్చే నిధి. వారి కాన్వెంట్లో మన పిల్లలకు చదువు చెప్పరు. దవాఖానాలో ప్రాణం పోతున్నా మందులు ఇవ్వరు. ఆపత్కాలంలో మంచి వైద్యం కోసం పట్నానికి తీసుకువెళ్దామంటే డ్రైవర్ రాడనీ, లేదనీ అనేక ఎత్తులేస్తారు. మనకు కావలసింది బీదల యేసే కానీ ఆడంబరాలతో పెద్దారెడ్డితో వచ్చే యేసు కాదనీ చెప్పే కథ ‘బీదలయేసు’లో ఒక తిరుగుబాటు కనిపిస్తుంది.

ఇక్కడి చర్చి సభ్యులను చూపెడుతూ హాస్పిటల్స్ స్కూల్లను నిర్వహించే క్రైస్తవ యజమాన్యాల వారు పిల్లల పట్ల ప్రవర్తించే తీరును మానసిక క్షోభకు గురిచేసే చిత్రహింసలను తులనాడే కథ ‘ఆ బోర్డింగ్ కు యెళ్ళను’. సహవాసగాళ్లతో సినిమాకెళ్లి ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత హాస్టల్ కి రాగానే బాలస్వామికి మరియు అతని మిత్రులకు బడితేపూజ చేస్తాడు వార్డెన్. సెలవుల్లో ఇంటికి వచ్చి నేను ఆ బోర్డింగ్ కి వెళ్ళను అని మారాం చేస్తాడు. గమనించిన జాన్ బాబు వీరి గుట్టును బట్టబయలు చేస్తాడు. అనవసరంగా పిల్లల్ని కొడుతూ హింస పెడుతున్న క్రైస్తవ విద్యాసంస్థలపై మన పేరు చెప్పి కోట్లకు కోట్లు విరాళాలు సేకరించిన విషయాలను శౌరితాతకు వివరిస్తాడు. వచ్చే సంవత్సరం మరో స్కూల్ కి వెళ్ళుదువుగాని ఇప్పుడైతే అదే స్కూల్ కి వెళ్ళమని బాలస్వామిని బుజ్జగించి పంపిస్తారు.

నిరాటంకంగా కురిసే తుఫాను వల్ల ఎన్నో కుటుంబాలు చెదిరిపోతాయి. సరైనా నివాసాలు లేని పశుపక్షాదులు జంతువులు కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ తుఫాను దరిద్రులైన బీదలు, దళిత క్రైస్తవ జీవితాల్లో నింపిన విషాదాలను వివరించే కథ ‘మాయదారి తుఫాను’. తుఫాన్ వల్ల గుడిసెలు కూలిపోయాయి. మనుషులు చనిపోయారు. తండ్రిలేని కొడుకును కాపాడుమని మరియమ్మకు ప్రార్థన చేస్తూ విరిగిన వేపచెట్టు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచింది యాకోబు తల్లి. ఒకవైపు కూలిన వేప తొలగిస్తూనే మరోవైపు పాడెను సిద్ధం చేస్తున్నారు. పెడ్డారెడ్డి కూలిన చెట్లను అధికం చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభుత్వ అధికారులకు. ఆ అధికారులు ఈ దళిత క్రైస్తవవాడలోకి రాలేదు. కొంతసేపటికి సాములోరి జీపు వచ్చింది. మేం బతికినమో లేదో చూడడానికి వచ్చారా స్వామి అని శౌరితాత వెటకారంగా అన్నాడు. తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం కూలిన గుడిసెలకు తాటాకులు ఇస్తామని ఆ వివరాలు రాసుకొని పంపితే వచ్చాము. మీరేమో పూట గడవడం కోసం డబ్బులు లేదా పప్పులు అడుగుతారు. మీకు ఇంత పొగరు కాబట్టే ఆ ఊర్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అని వెళ్ళిపోయారు స్వాములోల్లు ఇద్దరు.

తుఫాను బాధితులకు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఇస్తే అధికారులు కేవలం రెండు వందల రూపాయలు అందిస్తారు. మా డబ్బులు మాకు కావాలని నినదించినందుకు లాఠీ చార్జి పాలయ్యారని సమాధానం చెబుతారు. దళిత క్రైస్తవులకు ఆపత్కాలంలో వచ్చిన సొమ్ము అధికారులు ఇవ్వరు. క్రైస్తవులు అని గుచ్చి చెప్పే సాములోరు ఆదుకోరు. పైగా మీరు పొగరుబోతులనీ, అహంకారులనీ అసహ్యించుకుంటారు.

నేనైతే కచ్చితంగా అమ్మగార్లపై జరిగిన అన్యాయాన్ని ఖండిస్తా. అంతేకాదు దోషులు పట్టి శిక్షించే వరకు క్రైస్తవ సంస్థలను బందు పాటించాలని అంటాను. మనకు మన మతానికి అన్యాయం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాం. ఇకపోతే ఇదే సమయంలో అమ్మగార్ల అందరినీ ఇంకో మాట అడుగుతాను అదేమంటే దేశంలో అనేక చోట్ల రోజూ ఎంతో మంది ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క అత్యాచారాన్ని మీరు ఖండించారా? ఏ అత్యాచారం గురించి అయినా న్యాయ విచారణ కోసం బందు పాటించారా? గురువులకు కూడా ఇంకో ప్రశ్న దళిత క్రైస్తవులపై ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఒక్కరోజైనా నిరసన తెలిపారా? అని జాన బాబుతో అందరూ తిరుగుబాటును ప్రకటించిన కథ ‘అమ్మగార్లేనా మనుషులు’. ఈ కథలో కారం చెడు చుండూరు సంఘటనలు కూడా పాత్రుల ద్వారా చర్చించారు.

వద్దని వారించిన బోర్డింగ్ కు వెళ్ళనని మొరపెట్టుకున్న బాలస్వామి చివరికి తన అలవాట్లను మార్చుకోలేక హాస్టల్ లో చేరాడు ఒకఅర్ధరాత్రి. అప్పటికే పలుమార్లు వార్డెన్ హెచ్చరించినా, కొట్టిన వినకుండా మళ్లీ దొరికిపోయాడు బాలస్వామి. అందరి సమక్షంలో గుండు గీకి దుర్మార్గంగా అవమానించాడు వార్డెన్. బాలస్వామికి పట్టిన గతే అందరికీ పడుతుందని గుణపాఠం చెప్పడానికి ఇది చేస్తున్నానని మరి చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా మీ అమ్మానాన్నలు తీసుకురమ్మని పంపిస్తే ఒక డ్యామ్ లో పడి చనిపోయాడు బాలస్వామి. చచ్చిపోయేంత అవమానం ఒత్తిడితో జరిగిందా ఎందుకో తెలియాలంటే తప్పకుండా ‘మీకోసం మీ పిల్లల కోసం’ కథ చవాల్సిందే.

దళిత క్రైస్తవ బాధల్ని వివక్షల్ని చర్చకు పెట్టాయి ‘గుడిసె యేసోబు’ కథలు. ఈ సంకలనంలో ఏడు కథలే వున్నప్పటికీ అట్టడగు క్రైస్తవ వ్యథలను విశేషంగా చిత్రించాయి. ఈ పుస్తకాన్నీ ప్రచురించిన దళిత స్త్రీ సాహిత్య పరిషత్ కన్వీనర్ లీలాకుమార్ మానవత్వం గుండెకాయలేని మతం మృతమైనదనీ అంటారు. ఈ కథల ద్వారా వెల్లడైన విషయాలను. వాస్తవాలను స్వీకరించి సంస్థలు, స్వాములు ప్రక్షాళన చేసుకుంటే మంచిదనీ.. ఆరోగ్యకరమైన మానవత్వం అనీ ఈ కథలు గొప్ప సందేశం అందించాయి.


kolimi internet magazine may 1, 2024.