వర్తమాన కాలంలో అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని ఎదిరించే ప్రముఖ కవి బిల్ల మహేందర్. నివాసం వరంగల్ జిల్లా వారు సంపాదకత్వానికి ఖిల్లా గా ఉన్నారు.
మనసును తొలిచే సంఘటనలను సమాజ స్థితిగతులను చూస్తూ, అతడు అక్షరీకరించకుండా ఉండలేకపోవడమే వారి నైజంగా మారిపోయింది. ఈ దేశంలో బలహీనుల మీద బలవంతుల అనబడే పులుల ఆట సాగుతూనే ఉందని బాధపడతాడు.
"ఇప్పుడు
ఎవరి నోటి నుండైనా 'పులి-మేక' పదం జారి పడ్డప్పుడు
తెలియకుండానే కళ్ళనుండి రక్తం కారుతుంటది"అని విషాదమై విలపిస్తాడు.
బిల్ల మహేందర్ తాజా కవిత్వమే 'నేను మరణిస్తూనే ఉన్నాను'.
బిల్లా మహేందర్ సంపాదకత్వంలో
1. కాలాన్ని గెలుస్తూ (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం)
2. కోవిడ్ 19 (కరోనా విపత్తు పై ఓరుగల్లు కవుల కవితా సంకలనం)
3. వలస దుఃఖం (కరోనాలో వలస కార్మికుల జీవన భీభత్సం పై కవితా సంకలనం)
4. బిల్కిస్ భానో (సంఘీభావ కవిత్వం) మొదలైన కవితా సంకలనాలను సంపాదకత్వం వహించి వెలువరించారు.
1. పోరు గానం (తెలంగాణ ఉద్యమ గేయాలు)
2. పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవిత్వం)
3.బలిదానాలను మరుద్దాం బుక్ లెట్ 4. గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతులపై కవిత్వము)
5. కొన్ని ప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు (కవిత్వం)
6. తను నేను వాక్యం (కవిత్వం)
7. ఇప్పుడు ఒక పాట కావాలి కవిత్వం మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు
నేను మరణిస్తూనే ఉన్నాను అనే పుస్తకం అ ఆ ప్రచురణలు వరంగల్ ద్వారా ఫిబ్రవరి 2025 లో ప్రచురించారు. ఇందులో 63 కవితలు ఉన్నాయి. ఈ పుస్తకం పేరు వినగానే ప్రఖ్యాత మానవతావాది సాయిబాబా గారి కవిత్వం 'నేను చావును నిరాకరిస్తున్నాను ' గుర్తుకు వస్తుంది.
కవిగా నేను మరణిస్తున్నాను అనే కవితలో
మానసిక సంఘర్షణను చిత్రీకరిస్తూ
"ఎవరైనా
ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు
గుండెచెరువైదాకా ఏడవాలంటే
దేహంలో సత్తువలేదు కళ్ళలో తడి జాడలేదు
బతుకంతా
అసమానత సిలువను మోస్తున్నాను
అడుగడుగునా
అవమానపు చూపులను ధరిస్తున్నాను
పేరులో
మనిషిని మాయం చేసి
మతాన్ని వెతుకుతున్నారు
కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు
ఊరెప్పుడూ నాది కాలేదు
బతుకు చుట్టూత కంచె నాటి
పొలిమేర పాతేసింది
నగరమెప్పుడూ
నా భుజాన్ని తట్టి పలకరించలేదు
మురికి కాలువలు ఫుట్ పాతులు
నా చిరునామాగా మార్చింది
పిడికెడు
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని
ఏ తీరం వెంబడి పయనుంచినా
గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి
నా దేశం
ఏ కులం గానో మతం గానో
విడిపోయిన ప్రతిసారి
నేను మరణిస్తూనే ఉన్నాను
అని చెప్పడం కవి యొక్క స్పష్టమైన ఉద్దేశం అవగతం అవుతుంది. ఈ దేశం పట్ల ఉన్న మమకారం మంటగలుస్తున్నప్పుడు అతని బాధ క్షణక్షణం మరణిస్తున్నానని వ్యక్తికరించడం కవి బాధ్యతకు పరాకాష్ట గా నిలుస్తుంది. పాఠకుల మదీ గెలుస్తుంది.
సమాజంలోని అనేక అంశాలను తన కవితల్లో నిక్షిప్తం చేసి నిప్పులు చెరుగుతూ ఎగిరే క్షిపణిలా తీర్చిదిద్దాడు. ఈ కవితలలో తాత్వికత, మార్మికత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటాయి. సమానత్వాన్ని సాధించే విధంగా పురికొల్పు(ప్రేరణ) ఉంటుంది. మోటివేషనల్ థింకింగ్, ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ గా ఉంటాయి.
ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను రాసే కవిత్వం సామాజిక బాధ్యతను నెరవేర్చాలని కోరుకుంటూ
ఇప్పుడు కావాల్సింది భూమికి బరువైన కవిత్వం కాదని 'నిప్పుల్లో కాల్చినా నిలబడే వాక్యాన్ని రాయి' మనే మహేందర్ ఆరాటం కనబడుతుంటుంది.
ఇంకా నాశనం కానీ అక్షరాన్ని గురించి గొప్పగా ఆవిష్కరిస్తూ
"చలనం కలిగినప్పుడు నువ్వు మరణిస్తున్నా సరే వాక్యాన్ని రాయి బతికే ఉంటావ్" అంటాడు.
మనిషి ఒక మొక్కలా ఎదిగి కొమ్మలాగ విస్తరించాలి ఎన్నో జీవులకు ఆవాసమైనట్లుగా మనిషి బతుకు పరిపూర్ణమవ్వాలని కోరుకుంటాడు. నిజంగా సాహిత్యం కూడా అదే చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మిన కవి మనిషి మహోన్నత స్వభావాన్ని గురించి వివరిస్తాడు.
మనిషి సాంఘిక జీవి (మాన్ ఈజ్ సోషల్ అనిమల్) అని చెప్పిన ప్రసిద్ధసూక్తిని ఆధారం చేసుకుని మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో విశ్లేషిస్తాడు. మనిషి పదిమందికి సహకరించే సాయపడే మంచితనం అద్దుకోవాలని ఆశిస్తాడు.
"వర్ణమేదైనా
మనిషి పువ్వై పుష్పించాలి
ఏ సిగలోనో మెడలో దండలానో
నలుగురి గుండెల్లోనూ కొలువవ్వాలి"(మనిషి పుష్పించాలి) అని ఉత్కృష్టమైన మానవ జన్మని ప్రభావంతంగా చిత్రీకరణ పట్టాడు.
విశ్వ నరుడను నేను అని ప్రకటించుకున్న గుర్రం జాషువా వలే తాను ఒక మనిషిని నాకు విభజన రేఖలు వద్దు అని నినదిస్తూ
"దయచేసి మీరెవరు
నన్ను ఏ మతం అని అడగకండి
ఎందుకంటే నేను మతాన్ని కాదు మనిషిని"(మతాన్ని కాను) కవితలో తన్ను తాను మంత్రితో వ్యక్తిగా ప్రకటించుకుంటాడు.
మనిషి మహోన్నతను గురించి తెలియజేస్తూ మనిషిని దేవుడిగా మలచిన తీరు హృద్యంగా ఉంది. మనుషులకు మనుషులే తోడవ్వాలని అండగా నిలవాలని పదే పదే మనిషితనాన్ని గుర్తు చేస్తాడు
"రండి
ఇవాళనే కాదు
ప్రతిరోజు అతడికి చప్పట్లు కొట్టి మనసారా అభినందిద్దాం
మనిషే దేవుడని నిర్భయంగా ప్రకటిద్దాం"(మనిషి దేవుడని ప్రకటిద్దాం) అని అక్షరాలతో నినదిస్తున్న కవి బిళ్ళ మహేందర్
కొత్త పద బంధాలు పదచిత్రాలు భావ చిత్రాలతో కవిత్వం సంపద్వంతంగా తీర్చిదిద్దాడు.
ఈ కవిత్వానికి ముందుమాట రాసిన కాత్యాయని విద్మహే గారు ప్రశ్నకు మరణం ఉండదు. అది ఎప్పుడు నియంత గుండెకు గురిపెట్టిన ఆయుధంగా పదునైనది ఈ తాత్వికత తెలిసిన కవిగా మహేందర్ కనబడతాడు అని వ్యాఖ్యానించింది.
అణచివేయబడ్డ వాళ్ళ పట్లా కేవలం సానుభూతి మాత్రమే కాదు నిబద్ధత కనబడుతుందని నారాయణస్వామి వెంకట యోగి గారన్నారు.
సామాజిక బాధ్యతగా సాహిత్యంలో మనిషితనమే మహాన్నతమని సమర శంఖం పూరిస్తున్న Billa Mahender కు అభినందనలు.