సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

5, జూన్ 2025, గురువారం

పల్లె_పలుకుబడుల_పరావర్తనం-#'ఆరుద్ర_పురుగు’

కవి, రచయిత, నటుడు, సాహిత్య కార్యకర్త, సంపాదకులు, మితభాషి, స్నేహ సుగందాల వారధి. #కూకట్ల తిరుపతి అన్న

 మనిషిని శుభ్రం చేసే మహా సాధనం సాహిత్యం అని నమ్మి 
తెలుగు భాష ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

పెద్దపల్లి 
జిల్లా తెలుగు విషయానిపుణులుగా కొనసాగుతున్నారు.
 పదో తరగతి వరకు వివిధ పాఠాలను యూట్యూబ్లో అందుబాటులో ఉంచారు. వివిధ సాహితీ ప్రక్రియలో తనదైన శైలితో ఆలోచింపజేస్తున్నాడు.

వారి కవితా సంపుటి "ఆరుద్ర పురుగు" పై న గతం లో నేను రాసిన సమీక్ష మరొకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా....

#Kukatla Thirupathi 



 అన్న జన్మదిన సందర్భంగా... 

#పల్లె_పలుకుబడుల_పరావర్తనం-#ఆరుద్ర_పురుగు’

 పల్లె, సంస్కృతి ఆప్యాయతలు వెల్లి విరిసే మమతల రaురి. ఆత్మీయతలు పంచే సమతల బడి. నిష్కల్మష మనసులో నిండు మానవత్వం తొణికిసలాడుతుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చేనుచెలకలతో పచ్చగా అలరారుతుంది. పక్షుల కిలకిల రాగాలతో, పశువులతో మమేకమయ్యే జీవనం రమణీయం. పలుకుబడులు ఎద మత్తడి దుంకుతూ మానవత్వం పరవళ్లు తొక్కుతుంటాయి. పల్లె జీవితం అనుభవిస్తే కాని అర్థం కాదు. చదివినా, విన్నా, దృశ్యశ్రవణ మాధ్యమంలో అర్థమయ్యేది అసంపూర్ణమే. పల్లెతనం పట్టుకోవడం, పలుకు బడులను ఆస్వాదించడం అనుభవానికే అవగతం. పల్లె జీవితాన్ని అక్షరాల్లో పొందించి తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్ని అలికిపూస్తున్న వర్తమాన యువకవి కూకట్ల తిరుపతి.
      ఈ కవి బాల కార్మికుడు. కులవృత్తిని చేస్తూ మంద వెంట కాపరిలా పరిగెతుడూనే ప్రకృతితో తన్మయత్వం చెందినోడు. ఇతని బాల్యం తరచి చూస్తే
 ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను / మంద నా గురుకులం తాతతండ్రులు నా ఉపాధ్యాయులు / కొండకోన నా తరగతి గది /తడిదుక్కి నా ముద్దు పలక / దుడ్డుకోన నా సుద్దముక్క / అనుదినం ఒక అధ్యాయం బోడూబీడు నా ఆటస్థలం’ అని బెల్లి యాదయ్య చెప్పినట్లు గడిచింది జీవితం. ఇతని పదేళ్ళ వయసు వరకు గొర్లను కాస్తూ బతుకెళ్లదీశాడు. జీవాలు ప్రసవించినపుడు అడవిలో పురుడుపోసి భుజమ్మీద కన్నతల్లిలా మోసినోడు. ఆ జీవాలకు రకరకాల పేర్లు పెట్టినోడు. గాయమైనా, రోగమొచ్చినా ఆకుపసరుతో వైద్యం చేసినోడు. శబ్దం విని జీవాల్ని గుర్తుపట్టినోడు. పాటలు, కళలపై ఉన్న ఆసక్తి అతన్ని అక్షరాలకు దగ్గరజేసింది. పలుకు బడుల నుంచి బడి పలుకుల భాష నేర్చుకొని అక్షరాలకు దూరమైన అస్థిత్వ చైతన్యాన్ని పుణికి పుచ్చుకొని బతుకుల్ని, ఆకలి బాధల్ని, అలజడి జీవితాల్ని కవిత్వీకరిస్తున్నాడు. 
 ఏ పద్యాలు దూరమయ్యాయో, వాటిని అభ్యసించి, అధ్యయనం చేసి తెలుగు ఉపాధ్యాయుడై విద్యార్థులకు హృద్యంగా నూరిపోస్తూ తెలంగాణ భాషకు ప్రాణం పోస్తున్నాడు. దశాబ్దం కాలంలో శతక, నానీలు, కవిత్వ, సమీక్ష ప్రక్రియలలో ఐదు పుస్తకాలు ముద్రించాడు. ‘‘ఆరుద్ర పురుగు’’ కవితా సంపుటి ఐదవది.  
 2015లో ముద్రితమైన ఇందులో 37 కవితలను ఏడు విభాగాలుగా విభజించుకోవచ్చు. అవి బహుజన జీవనం, దళిత జీవితం, గిరిజన జీవితం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, తెలంగాణ ప్రాంతీయ అస్థిత్వ చైతన్యం, ఆధ్యాత్మిక జీవితం, ఇతరాలుగా విభజించవచ్చు.   
1.బహుజన జీవితం: కవి స్వతహాగా బహుజనవాది. బహుజన జీవనాన్ని పల్లెతన్నాన్ని కలిపి అక్షరాలు నిలుపుతున్న ఆశావాది. రేపటి ఉషోదయాన్ని నిర్మించడంలో ‘‘నేను కలగంటున్న’’ అని తన కలను, మనల్ని మమేకం చేసుకుంటాడు. రైతుల ఎతను మనసుకు హత్తుకుంటున్నాడు. భూమికి ఆకుపచ్చటి రంగేసినట్లు కాలం కావాలనీ, పంటలు పండాలనీ, పారకం నీళ్లు మా బీళ్లు తడపాలనీ స్థానిక, ప్రాంతీయ స్పృహకల్గిస్తూ ‘‘దుబ్బ సెల్కల నిద్దుర మబ్బు వదిలి / ఆరొక్క దినుసు అంకురం తొడుగాలనీ / పిడుసగట్టిన నాలుకల తండ్లాట / ఎన్కటి కెల్లున్న యెతలు పాపుటకు
గుక్కెడు నీళ్లకోసం/ నేను కలగంటున్న’’ అంటూ సమాజంతో దారిద్రాన్ని తొలగించటానికి, కరువు దాహార్తిని తీర్చటం కోసం నీళ్లను వినియోగించాలని కలగంటున్నాడు.
      ప్రతి ఒక్కరికీ బాల్యం మరుపురాని అనుభూతి. పసితనంలోని ఆటపాటలు గుర్తుకొచ్చే కొద్దీ మనసు ఉప్పొంగుతుంది. పసితనంపై ఒక్కో కవి ఒక్కో విధంగా స్పందిస్తుంటాడు. ఎవరు దర్శించినా, స్పర్శించినా అది అందరి బాల్యమవుతుంది. పనిలోనే ఆటవిడుపును అందుకోవడం, అందుకున్న బాల్యాన్ని దృశ్యమానం చేస్తున్నాడు కవి మనసులల్ల నిలిసిన దీపం’’ అని తాత చూపిన బాటను నేమరేసుకుంటూ ముగిస్తాడు.  
 ‘‘బర్రెంక పాట బొట్టాడిపిన దొప్పల / నురుగులా పొంగ పిండిన మ్యాక పాలు / పొద్దును కొద్దిగ పొదుగంగనే / అడుగువడ్డ పోశమ్మ లెక్క జుర్రిన జున్ను గడ్డల చిక్కదనమే నా పసితనం’’ అంటూ తన అచ్చటా ముచ్చటా కవితలో సెల్క పసితనాన్ని ఆకలి తీర్చుకునే నైపుణ్యాన్ని ఒడిసిపట్టిన బతుకును అక్షరాల్లో ఒంపుతున్నాడు. తన బాల్యపు గురుతులను కురిపిస్తుంటే మనం తడిసి మంచులా ముద్దవ్వాల్సిందే. తన బాల్యపు ఛాయలను తళుక్కున మెరిసే మెరుపు తీగలాగ మనుసు పలకపై ముద్రిస్తుంటాడు.
      కవి జీవితంతో పాటు ఆత్మీయ బంధాలు, బంధుత్వాలు అక్షరీకరిస్తున్నాడు. తల్లి దండ్రులకంటే తాత నాయనమ్మల తోటే చనువు ఎక్కువ వారినీ అక్షరబద్దం చేసి రుణం తీర్చుకుంటూ తా ప్రవర్తనను ఆహార్య వ్యవహారాలని విషదీకరిస్తూ ‘‘ నువ్వు మొకంగల్ల గల్లర సరం, బొంగుర మోల్గె గిరగిర తిర్గేది సరాయించితే సగం ఊల్లెకినిపించే, ఎత్తు పొడుగును, ధరించిన గొంగడి, మంద కాడి కుక్కను ‘‘మల్లిగా’’ అని పిలవడం. మంద మీదపడి తోడేళ్లు దాడి చేస్తుంటే ఎదుర్కొనే తత్వం అనేక కోణాలను స్పృశించాడు. తాతను కొనియాడుతూ‘‘మా తాత నిలువెత్తురూపం, మా మనసులల్ల నిలిసిన దీపం’’ అని తాత చూపిన బాటను నేమరేసుకుంటూ ముగిస్తాడు.  
 ఊరుమీద మంద పెరుగుతందనే నెపంతో మంద పిల్లలు పట్టుకు తినే భూస్వామ్య వ్యవస్తను ఎదురించాలనీ ‘‘పైసోపర్కో యియ్యకుం ఉత్తనే జోపుకెల్లె పెత్తనాలు......’’ అంటూ వ్యవస్థను తిరస్కరిస్తూ పరిష్కారం చూపుతాడు. సోయి తెచ్చుకొని బతుకాలని చెబుతూం ‘‘ఆగమాగంగా జీవునాలు / తంతెల కొద్దీ తరిగిపోయినయి / గతుకుల బతుకులు అతుకులు వడి / ఇగెనన్న అగ్గెల కచ్చి సోయి జెండా ఎగురెయ్యాలె’’ అంటూ తిరుగుబాటు జెండా ఎగిరేయాలని పురికొలుపుతున్నాడు. కవి స్పృహను తన మూలాలపై గురిపెట్టి, అస్థిత్వాన్ని వెల్లిడిస్తున్నందుకు అభినందించాల్సిందే.
 2.దళిత జీవితం: తెలుగు సాహిత్యంలో దళితుల బాధల్ని సానుభూతితో అక్షరబద్ధం చేస్తున్న వర్దమాన కవుల్లో కూకట్ల ఒకరు. దళితున్ని పంచముడిని పిలుస్తున్న వాళ్లని దళిత గొంతుకై ప్రశ్నిస్తూ ‘అయిదవ వాన్నే నేను’ అను ఆత్మగౌరవం స్ఫూర్తిని నింపుతూ ‘కూడళ్ల కాడల్లా / కూడబలుకు చాటింపును నేను ఎట్టికి మొల్సిన మొలుకను నేను’ అంటూ వ్యంగ్యంగా వ్యక్తీకరిస్తూ కొనసాగింపుగా చివరికి సావుడప్పును మొత్తంగా మాదిగ వృత్తిని ఆవిష్కరించాడు. తిరుగుబాటును మరో కోణంలో ప్రకటిస్తూ ‘డొక్కలు చింపే చురకత్తి / డోలుకొట్టే డప్పు కుదురు / సివంగిలయి లేస్తున్నె / అంటుముట్టులు /శింపులేశాలేస్తున్నాయి’’ అంటూ దూరం కొట్టిన మనువాదం డొంక తిరుగుడు సమాధానాలు వల్లిస్తుందంటాడు. శంబూకవధను, తెగిపడ్డ ఏకలవ్యుని బొటనవేలును ప్రతీకలుగా తీసుకొని చీల్చబడిన (దళిత) అస్థిత్వపు పొడలను పొగ రాజేసి తిరుగుతుండు.
3. ప్రకృతి ప్రేమికుడు: తన గ్రామం మద్దికుంట పల్లె ప్రకృతిని ముద్దుముద్దుగా అక్షరాలతో అద్దుతున్నారు. వయ్యారాలు ఒలకబోస్తూ పల్లెను ఒరుసుక పారే బుగ్గదాం. ఒర్రెను, ఎర్రడాలు వానొస్తది అని ఎర్కజెప్పే విషయాన్ని, ఊరుకు అనుకొని ఉన్న పరువు గుట్ట. గుట్టతో జీవరాశుల బతుకు పెనవేసుకొని ఉంటది. గుట్టను గుత్తెదారు చదును చేస్తూంటే ఆ కుట్రపై అక్షరాలతో పదునుపెడుతూ ఊరుబాధను గుండెలోతుల్లోంచి కణకణ మండిరచికైత జేసాడు.
  ‘‘ఎక్కడో భూమి పుట్టిన్నాడు పుట్టింది / మా ఊరు శివారుల జిలాల గుట్ట
  గుట్టంత చెట్టు గుమ్మంత పూతతో / అవ్వోలె అక్కునకందుకొని
     సకల జీవరాశిని సవరిచ్చింది’’ తల్లి సవరిస్తది. గుట్టలో తల్లిని చూపిస్తున్నడు.గుట్ట వల్ల మనుషులే కాదు. సకల జీవరాశులు మనుగడ సాగిస్తయి. గుట్ట ఒక జీవనైవిధ్యం. బతుకు తెరువు. కవి ఇక్కడ అవ్వకు గుట్టకు అభేదం చెపుతూ రూపకాన్ని సృష్టించాడు. గుట్ట అంతర్థానమవుతుందని పక్కున పలిగి ఏడిసిండు తిరుపతి. కోప తీవ్రతని ప్రకటిసూ ‘‘కాలం కంట్లె కారంబోసుకున్నది / సిగసాని కుంట కన్నీళ్లను నింపుకున్నది/ గుత్తేదారు కండ్లల్ల వడ్డది గుట్ట / గుట్టను పరపర నమిలి మింగిండు?’’ పరోక్షంగా సర్కరును, కాలాన్ని బాధ్యుల్ని జేస్తూ గుట్టను తల్సుకుంటూ ప్రజల బాధను ఊరు పక్షంగా నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. ‘ప్రజలను సాయుధం చేస్తున్న నేటి రెవెల్యూషనరీ కవి’ అని చెప్పిన శివాసాగర్‌ను గుర్తకు తెస్తున్నాడు. కాలం వెంట పరిగెడుతూ కుట్రను పసిగట్టే లక్షణం ఈ కవికుంది.
       ప్రకృతి ఎప్పటికి అంతుపట్టని మర్మం. ప్రకృతిని పసిగట్టిన మానవుడు స్థల కాలాదులను నిర్ణయించటం మానవుని వంతయింది. కార్తెలో ఆరుద్ర కార్తె ఒకటి. ఈ కార్తిలో ఆరుద్ర పురుగు అందం అందరి చూపుల్ని బంధిస్తది. ఆరుద్ర పురుగు కార్తె తర్వాత కనబడది.‘‘మల్లెపుడత్తవని /మనస్సెదురు సూత్తది /మట్టిలపుట్టుడు గిట్టుడు
ఆ బతుకెంతో గొప్పది’’ ఆరుద్ర పురుగు జీవితాన్ని కవిత్వీకరించాడు.
 4.సామ్రాజ్యవాదం: ఉదయం లేచింది మొదలు పొద్దస్తమానం బహుళజాతి వస్తు సేవల నెపంతో మనల సావగొడ్తది. వస్తువును మనిషి నియంత్రించాల్నా మనిషిని నియంత్రిస్తుంది. దీన్ని ఎంత మాత్రం తిరుపతి ఉపేక్షిచడు.‘‘మొలస్కో మొలకలా / ఆరునెల్ల ఆయువెకాదు / ఒప్పందాల అంగడి బొమ్మ పైసలతో / పానం బొసుకుంటది / బహుళ జాతి వలపు / బహురూపుల యేశాలది’’ అని ఆక్టోపస్‌ కవిత ద్వారా బహుళజాతి డాంబికాల్ని దుయ్యబడుతాడు కూకట్ల తిరుపతి. 
 ‘‘ఎద్దేడ్సిన ఎవుసం / రైతేడిసిన రాజ్యంఅరిష్టం, అరిష్టం’’ అని నినదిస్తాడు. రైతుకు వ్యతిరేకమైన ఏ ఆయుధం రైతు ముందు వర్థిల్లదంటూ వాస్తవీకరిస్తాడు. రాజ్యమంటే నిర్భంధం, నిరంకుశం. అణిచివేత ఎక్కడ ఉంటదో పోరాటం అక్కడ ప్రారంభమవుతుందని కూకట్ల తన కవిత్వంలో కనుమరుగవుతున్న తెలంగాణ పదాలను వెతికిపడుతూ ప్రయోగిస్తున్నాడు. ఒర్సుక, మారుమనం, ఎన్నాద్రి, మెదుం, ఆసువోసినట్లు, జమాబంది.అంబేద్కర్‌ చెప్పినట్లు పోలీసు దళాలను వ్యతిరేకించే షర్మిల ఇరోమ్‌ జీవితాన్ని అక్కడి పరిస్థితులను వివరిస్తూ ‘‘చిక్కిన పౌరహక్కుల బొక్కల గూడుకు ఇరోమ్‌ ఎనగర్ర’’ అంటూ ఇనుప చెట్టుగా ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితిని ప్రకటిస్తాడు.
 5.తెలంగాణ వాదం: కొంరం భీం, చాకలి ఐలమ్మ నియంత నిజాంను ఎదురించిన వారసత్వం కలిగిన బహుజన బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని హత్తుకున్నారు. హైద్రాబాద్‌ ఫ్రీజోన్‌ పేరిట మోసం చేయజూస్తే హెచ్చిర్క వలసవాదులకు హెచ్చరిక జారీచేసి ధర్మా గ్రహాన్ని ప్రదర్శించాడు.
 ‘‘ఇంకా సోచాయించితే / గండి మైసమ్మ కాడ గావు బడ్తం చిడ్డా
నాజీ శక్తులనే నాశనం జేసినోల్లం / సమజయిదా / హైదారాబాద్‌ సిర్ఫ్‌ హమారా / తెలంగాణ ఆత్మరా’’ అంటూ హైదారాబాద్‌ అందరిదనీ పేచిలు పెడితే గోచీలు జాగర్తని అక్షరాల్ని ఎక్కుపెట్టిండు.
       కొట్లాడుతూ ఎన్నోద్దులు పోరుపడదాం. ఇడిపోయి ఇగురంగా బతుకుదామని బోధపోత్తండు కవి. ‘‘ఇడిపోవుడే ఇలవర్స కదా / యిడుపు కాయిదం సేతులవడని మా యెవ్వారం మేం జేసుకునుడే.’’ అంటూ మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని స్వభావోక్తంగా అక్షరాల్తో గర్జిస్తున్నాడు.
      సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తిని, గిరిజన సంస్కృతిని కళ్ళకద్దుకోవాలనీ ప్రేరేపిసూ పండ్లు పట పట పాలాలేగంగా / కత్తికొగన్ని కండగ కోసి / అగ్గి కురిపిచ్చిన అడవి బిడ్డ్త కన్నెపిల్లకి వన్నెలద్దింది’’ అంటూ ఆదివాసీ సంస్కృతిని పోదిచ్చి మేడారం జాతర బహుజన విజయ భాసికంగా స్మరించుకోవాలంటాడు.
 తనవాళ్లు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం అంత సులుపు కాదు. అమితంగా ప్రేమించిన కూతురు అందని తీరాలకు వెళ్లిందని కవి హృదయం పగిలిన అద్దమైంది. మనసు కకా వికలమై కుమిలిన జీవితం కమిలిన గాయమైంది. కవి హృదయం ఆడివిల్ల కోసం పాణం సగం తెగి కొట్టుకాడుతున్న జివునమవుతుందో ‘పేగుసంవందం’ దుఃఖపు తెరను విసురుతూ ‘ఆడివిల్ల లేని చావు చావొద్దంటరు / మలాంటి దిక్కుమల్లె జీవునాలకు / ఆ బాగ్గెమెట్ల కలుగుద్దీ’’ అంటూ వలపోసి వలపోసి మీదపడి ఎగతట్టుకుంట ఏడుస్తడు. ఏడిపిస్తడు. రాయిని కన్నీళ్లతో కడిగి కరిగిస్తడు.
        అగ్గి, అవ్వల్‌దర్జ, కులకస్సి, సంవందం, ఇలవర్స, ఆడివిడ్డ లాంటి ఎన్నో తెలంగాణ మాండలిక పదాలను ప్రయోగిస్తున్నాడు. విశ్లేషణాత్మకంగా అన్వయం చేస్తున్నాడు.
      తెలుగు పండితవడం మూలంగా శబ్ద వ్యామోహం ఎక్కువయింది. కవితలు దీర్ఘంగా ఉంటున్నాయి. కవిత పొడవవుతున్న కొద్దీ చిక్కదనం మరోసారి సరిచూసుకుంటే బాగుంటుందని అనిపించింది. చిన్న తప్పిదాల్ని ఉదాసీనంగా అలవాటేగా మారిపోతుందనడంలో సందేహం లేదు. 
 కవి స్వతహాగా సమీక్షకుడు. అయినప్పటికీ వ్యామోహం నుంచి పారిపోవాలి.. ఈ విషయాలు తిరుపతికి తెలియనవి కావు కాని మరొకసారి గుర్తుచేస్తున్న అంతే. కూకట్ల చాలా మంది కవులకు, కళాకారులకు, తెలుగు పండితులకు సోపతి. మృదుస్వబావి.స్నేహశీలి. చిరునవ్వులు చిందిస్తూ కుల్ల కుల్ల మాట్లాడుతడు. తెలంగాణ రచయితల వేదికకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నెల నెల ఎన్నీల ముచ్చట్లు, అమాస అలికిడులు నిర్వహిస్తూ అందరితో తను సిద్దమవుతడు. ఈ మధ్య కాలంలో అమెరికా తెలుగు అసోసియేషన్‌ వారి కవితా పోటీల్లో బహుమతి లభించడం వల్ల అప్పుడప్పుడు అవకాశాలు దొరికినప్పుడల్లా తనేంటో రుజువు పరుచుకుంటున్నాడు.
      ఇప్పటికే ఐదు పుస్తకాలతో తెలుగు సాహిత్యంలో స్థానం సుస్థిరం చేసుకున్నడు. ఈ ‘ఆరుద్ర పురుగు’ కవితా సంపుటి ద్వారా కవిత్వాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాడు. తిరుపతిని నిండుగా గుండెలకు హత్తుకుందాం రండి.
  (నడుస్తున్న తెలంగాణ సెప్టెంబర్‌ 2016లో ప్రచురితం.)








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి