siddenky.blogspot.com డా. సిద్దెంకి

సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, మే 2026, ఆదివారం

కాలాన్ని మరువని నల్లాల కథలు

దళిత కథలలో విస్మృతికి గురైన కథలు నల్లాల లక్ష్మీరాజం గారివి. ప్రధానంగా దళిత కథలలో ఎక్కడ వారి కథ ప్రచురించ బడకపోవడం,వారి గురించి వారి కథల గురించి చర్చించకపోవడం విశ్లేషించకపోవడం బాధాకరం.గొప్ప కథలు రచించిన నల్లల లక్ష్మీరాజు తిరుగు ప్రయాణం కథలపై నా విశ్లేషణ.
ప్రచురించిన తొలి వెలుగు పత్రిక తేది. 24.05.2026 నప్రచురితమైంది తొలివెలుగు యాజమాన్యం,సంపాదకులు, మధుకర వైద్యులు అన్న గారికి పేరుపేరునా జై భీమ్ లు
///////////////////////

నల్లాల లక్క్ష్మిరాజం ‘తిరుగులేని ప్రయాణం’  విస్మృత కథకులు నల్లాల లక్క్ష్మిరాజం జగిత్యాల జిల్లాలోని తక్కెళ్లపల్లిలో రాజవ్వ, రాజయ్యల దంపతుల సంతానముగా తేది: 05.10.1970న జన్మించారు. వీరిది మాల కులం. కష్టపడుతూ చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ప్రచారాన్ని కోరుకోలేదు. తన పనిలో నిమగ్నమయ్యే వ్యక్తిత్వం కలవారు. వీరి కథలు ‘మÖడుతరాల తెలంగాణ కథ’, ‘తెలంగాణ దళిత కథలు’లో లేవు కాబట్టి విస్మృత కథకుడిగా చెప్పుకోవచ్చు.  వీరు రచించినవి ఎనిమిది కథలు మా(తమే తన కాలాన్ని నిక్షిప్తం చేశాడు. తన కథా సంపుటి పేరు ‘తిరుగు ప్రయాణం’. లక్క్ష్మిరాజం తొంభై దశకంలోని కల్లోలాన్ని తన కథల్లో ఇముడ్చుకున్నారు. పోలీసు కావడం వలన పోలీసు దృక్పథం, పోలీస్ నేపథ్యంతో వారి కథలలో కనబడుతుంది. దొరల పెత్తనాలు, అణిచివేతలు, అక్రమాలు దర్శనమిస్తాయి. 

  నక్సల్బరీ ఉద్యమానంతరం అటు ఊరిని శాసించే దొరలో, దొర అంటే భయపడే రాజేష్‌లో భయోత్పాతాన్ని చిత్రించిన  కథ ‘తిరుగు ప్రయాణం’. భయం వల్ల ఇరువురి జీవితాలు ఎంత అతులాకుతులం అయ్యాయో తెలియజేస్తుంది. దొర తన జీతగాడైన రాజేష్‌ని కొట్టడం వల్ల నేను అన్నలకు చెప్పుతనని రాజేష్ బెదిరిస్తూ వెళ్లిపోతాడు. అదే రోజు పక్కూరి దొర రాజగోపాల్‌రావు దొరను చంపిన అన్నలు నన్ను ఏం చేస్తారో అని తెలియక రాత్రకి రాత్రే పట్టణానికి పారిపోతాడు. కొన్నాళ్లకు దొర హైద్రాబాద్ నుండి ఊరికి పోతుండగా దాహమేసి భయంతో రోడ్డు పక్కన హోటల్లోకి వెళుతాడు. అక్కడున్నది రాజేష్. నీళ్లిచ్చి పరస్పరం పలకరించుకుంటారు. చర్చించుకుంటారు. నేను ఆ రోజు నేను అన్నలకు చెప్పలేదనీ, ఊరికి ఉత్తరం రాస్తే మీరు వస్తారనీ భయపడ్డాను. ఊరు మీదకే పాణం గుంజుతుందనీ, వెళ్లాలనీ ఉందని రాజేష్ చెబుతాడు. ఈ పట్టణంలో మనుషులు యంతాల్ల ఉన్నారనీ నాకు ఊరికి పోవాలని ఉందనీ దొర చెబుతాడు. బతుకమ్మ పండుగ రోజు ఇద్దరు కలిసి వెళతారు. తాను ఊరిలో ఉండననీ, మీరు ఊరిలో ఉంటే మంచిదని దొరకు రాజేష్ చెబుతాడు.  ఇద్దరు ఊరి గురించి చర్చించుకుంటారు. ఊరికి కొద్దిదూరంలో రాజేష్ అమ్మమ్మ చెల్లెలు కలుసుకున్నాడు. ‘దొర (దొరను ఊరిడ్సేలా చేసిన రాంరెడ్డి పటేల్)ను రాత్రి ఎవరో చంపారట. ఊల్లె దొరలు ఎవరూ లేరు. బొంబాయికి దెంకపోయిండు’ అని చెప్పగానే ఊల్లెకు పోతే నిన్ను పోలీసులు పట్టుకపోతరు. ఈ దొరను వెళ్లగొట్టిన రాంరెడ్డి పటేలే దొర. దొరయి అన్నీ అక్రమాలే. అన్నలు చంపిండ్రు. ఊరు ఉడుకుతుంది. “పో బిడా!్డ ఎక్కడన్నా మంచిగా బత్కుపో” అంది ముసలమ్మ. రాజేష్, దొర వెనక్కి తిరుగు ప్రయాణమవుతారు.
 విప్లవోద్యమం వల్ల గ్రామాల్లో దొరల ఆధిపత్యం క్షీణించి భయం ఇరువురిలో పెరిగింది. పీడితులకు ధైర్యం, పీడకులకు ఆందోళన వచ్చింది. హత్యలు, అస్థిరత వల్ల ప్రజలు పట్టణాలకు వెళ్లారు. దొర, రాజేష్ మధ్య మానవత్వం పెరిగినా భయం కొనసాగింది. తిరుగు ప్రయాణం ఆ కాలపు అనిశ్చితి, మార్పును ప్రతిబింబిస్తుంది.

చదువుకు ఆటంకాలు సృష్టిస్తున్న పరిస్థితులను అధిగమించి కొడుకును చదివించిన రాజవ్వ జీవితమే నల్లాల లక్క్ష్మిరాజం ‘రాజవ్వ కొడుకు’. పటేళ్లు దేవయ్యను వెటకారంగా చూస్తరు. ఝండా వందనం నాడు బహుమతి ఇవ్వడానికి తటపటాయిస్తే చేతులోంచి గుంజుకుంటడు. ఒక్కటికి నాలుగు చెప్పి తండ్రి బాగా కొట్టేల పురికొల్పుతరు. కొడుకును, తల్లిని రాజనర్సు కొడుతడు. దేవయ్యను మెచ్చుకున్న ఉపాధ్యాయుడు ‘దొరలకు పాలేర్లు దొరుకర భయం కావొచ్చు. ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు. దేవయ్య మంచివాడు”అని చెప్పిండు. భర్తను ఒప్పించింది. దేవయ్యను జగిత్యాల హాస్టల్ల జాయిన్ చేసింది. ఫస్టు క్లాస్‌లో పాసయిండు. రాత్రిళ్లు పనులు చేస్తూ చదువుకున్నడు. వకీలు అయ్యిండు. రిజర్వు కేటగిరి సర్పంచ్ అయ్యిండు. ఝండా వందనం నాడు అనర్గళంగా ప్రసంగించాడు. సమావేశమయ్యాక రాజనర్సు దారెంట వెళ్లుతుంటే రాజేశ్వరరావు కూసుండే గద్దెవైపు చూసా ఉమ్మి వేస్తూ నడవసాగాడు. 

కులం ఎలా శిక్షిస్తుందో, ఎలా హత్యచేసుకునే పరిస్థితులు కల్పిస్తుందో, ధ్వంసం చేస్తుందో తెలిపే కథ ‘దొమ్మరి గంగడు’. దొమ్మరులు వేశ్యావృత్తికి, జిమ్నాస్టిక్స్‌కి, దొంగతనానికి పెట్టింది పేరు. వాటినుండి బయట పడడానికి రైస్ మిల్లులో పనిచేస్తాడు. యజమాని దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసుల లెక్క ప్రకారం పెద్దదొంగగా రికార్డుల్లో నమోదు చేశారు. గంగని పెద్దకూతురు సరోజ వ్యభిచార వృత్తిలో కొనసాగుతూ హెచ్ఐవీ సోకి చనిపోతుంది. బడిలో క్లాస్‌మేట్ ఒకడు గోపితో మీ అక్క దగ్గరికి వస్తున్నరా? అన్నాడు. నేను కూడా మీ అక్కవద్దకు అలానే వస్తున్నరా అంటాడు. పెద్ద గొడవ జరిగి బడిమానివేస్తాడు. చిన్న కూతురు వ్యభిచార వృత్తిచేయనని మొండికేసి లారీ డ్రైవర్‌తో లేచిపోతుంది. “నాతో దొంగతనానికి రాకపోతే మీ అమ్మను పొడిచి, నేను చస్త.” అని తండ్రి బెదిరిస్తే గోపి తన తండ్రితో దొంగతనానికి వెళతాడు. దొంగతనం చేసిన డబ్బును చేతిలో పెట్టి “ఈ డబ్బు సంచితో దూరంగా పారిపో” అని గంగడు తలనరుక్కుంటాడు. కర్మకాండలలో గంగని స్థానంలో గోపిని కేసులలో రికార్డు చేస్తమనుకునే పోలీసుల ఎత్తులను చిత్తుచేస్తూ దొరకకుండా గంగలో గంగని ఎముకలు కలుపుతాడు. కొన్నాళ్లకు వృద్ధిలోకి వచ్చి దొమ్మరికాలనీ పాఠశాల స్థాపించి ఎమ్మెల్యేతో ప్రారంభించి తానే ఉపాధ్యాయుని మారిపోతాడు. అననుకూల పరిస్థితులలో అభ్యుదయం వైపు పురోగమించాలో తెలుపుతుంది.

ఏది విత్తుతమో అదే కోస్తము అని చెప్పినట్లుగా అక్రమసంబంధాల ఫలితాలు, పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలిపే కథ ‘మా ఊరి ముచ్చట్లు’. శాంతమ్మ, చుక్కారెడ్డిలు పట్టుపడ్డారు. ఇద్దరినీ కొడుదామని చూస్తున్నప్పుడు శాంతమ్మ భర్త నర్సయ్య “నా పెండ్లాం నా ఇష్టం. నడుమ మీకేంది?” నర్సయ్యను తిట్టుకుంటూ ఎక్కడోల్లు అక్కడ పోతరు. రిజర్వేషన్ కేటగిరి కింద శాంతమ్మను ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండ్రు. అధికారం చుక్కారెడిది. ఇద్దరు ఆలుమొగలులా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండ్రు. వాడ ఆడోళ్లను తిరస్కార భావంతో చూసేది. మీరు నన్ను సర్పంచ్ చెయ్యలే. మీతో నాకవసరం లేదని శాంతమ్మ అనేది. చుక్కారెడ్డి భార్య మంగమ్మ జీతగాడు బుచ్చన్నతో చాటుమాటున పక్క సుఖం పొదుతుంది. ‘మాలమాదిగి జాతి చిల్లరజాతి. సిగ్గెక్కడిది? మానం ఎక్కడిది? అని తిడ్తుండేది.  చుక్కారెడ్డి దంపతులకు పరస్పర రహస్యాలు తెలుసు. మిగతా జీతగాళ్లకూ, ఊరోల్లకూ తెలుసు. ఎప్పటోల్నే బుచ్చిగా అని పిలుస్తుంటది. చుక్కారెడ్డి కూతురు రజిత, శాంతమ్మ కొడుకు శంకరి ని ప్రేమించి వంకర తొవ్వలు తొక్కి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అది తెలిసిన చుక్కారెడ్డి వీర రౌద్రుడై ‘ఆ లంజెకొడ్కు ఎటువొయిండు ?, బతుకనియ్యము. చెప్పు.’ అని తిడుతండు. కోర్టుల పెండ్లి చేసుకున్నరు. ఊరంతా ఇవే ముచ్చట్లు... 

అత్త పెట్టే హింసను భరించలేని చెల్లెలు, చెల్లెలు అత్త అయ్యాక బిడ్డకోసం బాధపడ్డ బాధ్యతాయుత త్యాగాన్ని తెలిపే కథ ‘పునరావృతం’ అత్తింటి భరించలేక ఇల్లు చేరిన చెల్లెలు బాధను చూడలేని అన్న, జాగ అమ్మి కట్నకానుకల కోసం జాగ అమ్మి చెల్లించడానికి సిద్ధపడ్డడు. నా కోసం మీరేమి త్యాగం చెయ్యొద్దని చెబుతున్నా అన్న వినలేదు. కట్నకానుకలని పోసి చెల్లెలు సంసారం నిలబెట్టాడు. ఇరువై ఏళ్ల తర్వాత అల్లునికి కొలువు వచ్చింది. బిడ్డను ఇస్తనని పోయినప్పుడు తొంభైవేలు ఇస్తే ఖాయం లేకుంటే లేదని చెల్లెలు ఖరాకండిగా చెబుతుంది. ఒప్పుకొని వచ్చి భార్యకు వివరిస్తాడు. పెరడు, ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామని చర్చించుకుంటున్నప్పుడు ఆ మాటలు విన్న నా కోసం మీరేం త్యాగం చేయొద్దనీ చెబుతున్నా వినని తండ్రి(నాటి అన్న) అన్నింటిని బేరం పెడుతాడు. చరిత్ర పునరావృతం అవుతుందని ఆలోచించుకుంటాడు. 

కర్తవ్యం కన్నులు మూసుకుని పేల్చిన తుపాకి గుండ్లు గురితప్పి ఓ అమాయకున్ని.... సిద్ధాంతం శృతి తప్పి భ్లాస్టింగై కర్తవ్య పరున్ని బలితీసుకోగా అభిమానమే ఆకాశమంత ఎత్తు ఎదిగిందని వివరించిన నల్లాల లక్క్ష్మిరాజం కథ ‘పడగనీడలో పావురాలు’ నీతి నిలువెత్తుగా విధి నిర్వహణ చేసే ప్రకాశ్ అందరి ఆదరాభిమానాలు పొందాడు. పత్తాలాడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తమ్మున్ని ప్రేమించే అన్నను తమ్ముడే కొట్టిండు. వస్తున్న పోలీసులను చూసి అటక మీద దాచి పెట్టాడు. ‘వద్దు సార్. వాడు అమాయకుడు. నన్ను పట్టుక పోండ్రి సార్. తాగి కొట్టిండని తప్పైందనిపించాడు తమ్మునితో..’ ఎన్నో తీర్ల బతిమాలిండు రాజయ్య. రాజయ్య కానిస్టేబుల్ ప్రకాశ్‌కి కోడిని కోసుకొమ్మని ఇచ్చిపోయిన తెల్లారి చనిపోయిండు. పక్కూర్ల ఉన్న చిన్నవ్వ ఇంటికి పోయిండు. బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేశారు అన్నలు. పోలీసులు వచ్చి కాల్పులు జరిపారు. రాజయ్య గడ్డివాములో దాక్కున్నారు. పోలీసు గుండ్లు దూసుకెళ్లాయి. చూడడానికి పోతున్న ప్రకాశ్‌ను అందరు ఆడిపోసుకుంటున్నా ముందుకే వెళుతున్నాడు. అప్పుడప్పుడు ప్రకాశ్ పరామర్శించడం వలన పోచయ్య కోలుకున్నాడు. ఓటు నిర్భయంగా వేయాలని చెప్పి వస్తుండగా మందుపాతరలు పేలి ముక్కముక్కలయ్యిండు. గూడెం అంతా ఏడిసింది. సార్‌ని పోషయ్య మా గూడెంలోనే దహనం చేస్తామని చెప్పారు. ఓదార్చిండ్రు.

 ‘భలే బామ్మర్ది’ కథలో హస్యంతో ఆత్మీయత పుష్కలంగా పండించాడు.
మిరిగుడ్లు, పుండాకోరాడా!, కుదపెట్టుడు, ఇడ్సిపెడ్తం, దెంకపోయిండ్రు లాంటి జగిత్యాల పలుకుబడులు రికార్డు చేసిండు. శీలం కంటే కులం గొప్పదేమో! ఏమో!, “విశ్వాసం నాకెందకు లేదు బావ నా మీదికేయి కుక్క గూడ వేస్తే” అని వ్యంగం పండిస్తాడు. సమాజాన్ని చిత్రిక పట్టిన కథల రాజసం ఒలలాడే తిరుగులేని పయనమే ‘తిరుగులేని ప్రయాణం’. తెలుగు సాహిత్యం స్మరించదగిన కథలు అందించిన లక్క్ష్మిరాజంకి పోలీస్ సెల్యూట్‌లు.

13, మే 2026, బుధవారం

neeli nela ethalu - 1, తెలంగాణ దళిత కథా పరిణామం



తెలంగాణ దళిత కథా పరిణామం 


"వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి." — డా. బి. ఆర్. అంబేడ్కర్.

"నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించుకునే హక్కులేని దళితులు ఈ రోజు సమూహ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం" అని బాలగోపాల్ తన 'దళిత' వ్యాససంపుటిలో అభిప్రాయపడ్డాడు.

మనిషిని మనిషిగా కాక కులదృక్పథంతో చూసే నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఏర్పడడంతో భారతీయ సమాజం అంతరాలతో, అభ్యంతరాలతో నిండిపోయింది. వైరుధ్యాలతో కులగర్వం పెరిగింది. ఏ రెండు కులాలు ఒకటిగా లేకపోవడం, ఏ కులానికి ఆ కులపు ప్రత్యేకత ఉండడం ఒక ముఖ్య కారణమయ్యాయి. ఛాందసవాద ఆచారాలు, కఠిన సంప్రదాయాలు, మూఢత్వంతో నిండిన కట్టుబాట్లు, నియమాలు రూపొందించుకోవడం వల్ల కులాల మధ్య, మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించబడి అధికమయ్యాయి. కొంచెం తీవ్రత తగ్గినా చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తత్ఫలితంగా మనుషుల మధ్య స్పష్టమైన విభజనరేఖ గీయబడింది. ప్రాచీన సాహిత్యంలో అధికభాగం వర్ణవ్యవస్థను సమర్థించింది.

వర్ణవ్యవస్థను రూపుమాపాలని కలలుకన్న సాహిత్యం మనుషులంతా ఒక్కటే అని చాటింది. అందరూ ఒక్కటే అనే సిద్ధాంతం ద్వారా పాల్కురికి సోమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, దున్న ఇద్దాసు మొదలైనవారు తమ పద్యాలు, గేయాలు, తత్త్వగీతాల ద్వారా తెలుగు సమాజంలో మార్పును ఆకాంక్షించారు. సాహిత్యంతో బలమైన ముద్రవేశారు. అయినప్పటికీ కుల ఛాందసవాదం ఊగి ఆగిన ఊయల తీరే ఉంది.

ఫూలే దంపతుల నిస్వార్థ సేవ, అంబేడ్కర్ పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా హరిజనోద్ధరణకు పిలుపునిచ్చింది. నిరసనల నడుమ దళితుల ఆలయ ప్రవేశాల కోసం కృషిచేసింది. స్వాతంత్ర్య కాలంలో ఆధునిక భావాలు ఆహ్వానించబడినప్పటికీ అవి వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తేలేకపోయాయి. కూటికి పేదనే అయినా కులానికి తక్కువనా? అనే కులాహంకారం నిండిపోయింది.

కులాలకు మూలం వర్ణవ్యవస్థ. కులనిర్మూలన జరగాలంటే వర్ణనిర్మూలన జరగాలని 'వర్ణనిర్మూలన' సిద్ధాంతాన్ని గ్రంథరూపంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించారు. కులవ్యవస్థ మనుషుల్ని కలవనివ్వలేదు. "కులవ్యవస్థ శ్రామికుల్ని సైతం విభజించింది" అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. కులం మనుషులను విభజించడానికి మాత్రమే ఉపయోగపడిందని అర్థమవుతుంది. ఒక కులం మీద ఒక కులం నిచ్చెనమెట్ల తీరుగా తారతమ్యాలు సృష్టించబడ్డాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తన Who Were the Shudras (1946) అనే పుస్తకంలో, శూద్రులు అనాదిగా హిందూ సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థలో నాల్గవ వర్ణంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవకులుగా పరిగణించబడ్డారని పేర్కొన్నారు. వీరు ఆర్యుల తెగలకు చెందినవారని, బ్రాహ్మణులతో జరిగిన సంఘర్షణ కారణంగా హోదా కోల్పోయి తక్కువ కులంగా మారిన రాజవంశీకులని ఆయన వాదించారు. ఇదే అంశాన్ని — బింబిసారుని (క్రీ.పూ. 542) కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భాగమైన శూద్రులకన్నా హీనంగా మరొక వర్ణం, పంచమవర్ణాన్ని సృష్టించినట్లు — రొమిల్లా థాపర్ (తరతరాల భారత చరిత్ర) పేర్కొన్నారు. కాలక్రమేణ కులాల మధ్య అంతరాలు ఆర్థిక, ఆధ్యాత్మిక, వృత్తిపర, సామాజిక వివక్షకు దారితీశాయి. నీచవృత్తులు చేసే మనుషులను నీచంగా చూడడంతో అంటరానితనం వేళ్లూనుకుపోయింది. ఒకప్పుడు వెలుగువెలిగిన ఈ దేశ మూలవాసులు శూద్రులుగా మార్చబడ్డారని అవగతమవుతుంది. శూద్రులు పంచములుగా పిలువబడుతున్నారు. పంచములు అంటే హిందూ సాంప్రదాయ చాతుర్వర్ణ వ్యవస్థ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) పరిధిలోకి రాని, ఆ వ్యవస్థకు వెలుపల ఉన్న అణగారిన వర్గాల వారు (దళితులు/అస్పృశ్యులు) అని అర్థం. వీరు సాంప్రదాయ కులనిచ్చెనమెట్లలో ఐదవ వర్ణంగా లేదా అంతకంటే తక్కువగా పరిగణించబడేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో హరిజనులు (దేవుని బిడ్డలు) గా సంబోధించబడినవారే ఇప్పుడు దళితులుగా పిలువబడుతున్నారు. స్వాతంత్ర్యానంతర కాలంలో దళితుల జీవితం తెలుసుకోవాలంటే సాహిత్యం అధ్యయనం చేయాల్సిందే. సాహితీ ప్రక్రియలు చాలా ఉన్నాయి. కథకు మానవ జీవితంలో విశేషమైన పాత్ర కలదు. పండిత పామర జనరంజకంగా ఆదరించబడుతుంది.


దళిత పదం వివరణ: 'దళిత' అను శబ్దానికి ఖండించబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి. (ఇంగులం — దళిత అస్తిత్వ వ్యాసాలు, శ్రీనివాస్, సంగిశెట్టి). 1972లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్ మ్యానిఫెస్టో ప్రకటించిన ప్రకారం — "దళితులంటే... షెడ్యూల్డ్ ట్రైబ్స్, నయా బౌద్ధులు, శ్రామికులు, భూమిలేని పేదలు, రైతులు, మహిళలు, ఆర్థికంగా, రాజకీయంగా, మతం పేరిట దోపిడీకి గురయినవారందరూ దళితులే!" అయితే ప్రస్తుతానికి 'దళిత' అనే పదం షెడ్యూల్డ్ కాస్ట్స్‌కు పరిమితమైంది. సామాజికంగా అంటరానివారిగా పరిగణింపబడుతున్న కులాలకు మాత్రమే ఈ పదం వర్తించబడుతోంది.


తెలుగులో దళిత సాహిత్య భూమిక: 9వ శతాబ్దంలో శాసనభాషగా, 11వ శతాబ్దం నుండి అనువాదంతో ప్రారంభమైన తెలుగుకు వెయ్యేళ్ల లిఖిత చరిత్ర ఉంది. ఆధునిక తెలుగు దళిత సాహిత్యం పేరులేని రచయిత రాసిన 'మాలవాండ్ర' పాటతో (1919) ప్రారంభమైందని చెప్పాలి. మంగిపూడి వేంకటశర్మ 'నిరుద్ధ భారతం' (1933), కథాప్రక్రియలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర (1925) పత్రికలో 'పుల్లంరాజు', 'ఇలాంటి తవ్వాయి వస్తే' కథలతో దళిత దృక్కోణం వెలువడింది. అడివి బాపిరాజు 'నరసన్న పాపాయి', కరుణకుమార 'పోలయ్య', చలం 'హరిజన సమస్య', గోపిచంద్ 'చెప్పులు కుట్టేవాడు' మొదలైన కథలు వెలువడ్డాయి. ఈ కథలను సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శకులు తేల్చారు.

తొలి తెలుగు దళితకథ, తొలి తెలంగాణ దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 1931లో 'వెట్టిమాదిగ' కథను అజ్ఞాతవాసి పేరిట రాశాడు. ఈ మధ్యకాలంలో సంగిశెట్టి శ్రీనివాస్ వివరిస్తున్న కథ 'నేరేడు పండ్ల కంటు' (గోలకొండ పత్రిక 1926–1935) 1930లో శ్రీనివాస్ అనే యానాం దళితుడు రాసిన తొలి దళిత కథగా ప్రకటిస్తున్నాడు. తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ 'ఇంకెక్కడి విజయం' (1934) గృహలక్ష్మి పత్రికలో అచ్చయింది. తెలంగాణ తొలి దళిత కథా రచయిత్రి జనగామకు చెందిన మామిడి సత్యవతి 'తెరతొలగింది', 'హితువు', 'సుశీల', 'స్వేచ్ఛ' మొదలైన కథలు రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత కథాసంకలనం డా. ఆర్. చంద్రశేఖరరెడ్డి మరియు కె. లక్ష్మీనరసయ్య సంపాదకత్వంలో 'దళిత కథలు' (1996) విశాలాంధ్ర ప్రచురించింది.

కంచికచెర్ల కోటేశు హత్య (1968, ఫిబ్రవరి 24) తో దళిత స్పృహ రచయితలలో కలిగినా, మహారాష్ట్రలో దళిత పాంథర్స్ వల్ల దళిత సాహిత్యం సామాజికోద్యమంగా వికాసం చెంది తెలుగు నేలకు వ్యాపించింది. కారంచేడు సంఘటన (1985, జూలై 17) దళిత సృజనకారులలో మరింత దళిత దృక్పథాన్ని మేల్కొల్పింది. తెలుగు సృజనకారులు వివిధ ప్రక్రియలను ఆశ్రయించి ప్రజలను జాగృతం చేశారు. ప్రధానంగా పాట సుడిగాలిలా చుట్టేసింది. కథా ప్రక్రియ అందరికీ చేరింది.


దళిత కథ పుట్టుక: మనిషి పుట్టినప్పుడే కథ పుట్టిందంటారు కదా! మరి దళితకథ? జీవితంలోంచి, అణచివేతలోంచి, పీడనలోంచి ఉద్భవించింది. దళితకథలో శిల్పం, శైలీ లేదు, నైపుణ్యం లేదనే వారున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వివక్షలేని జీవితం దళితులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందనే విషయం గ్రహించాలి. అందమైన అల్లిక గురించి ఆలోచించకుండా అణచబడుతున్న జీవితాల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి విమర్శ రాదు. దళితులకు విశేషమైన జీవితముంది. విషయ విస్తృతి ఉంది. లెక్కకు మించి వివక్షలు (అకాడెమిక్ అన్‌టచ్‌బిలిటీస్) ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారికి కిరాయి ఇల్లు దొరకని వ్యవస్థలోనే ఉన్నామనేది ఎవరూ ఆలోచించరు. దళిత కథ దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది.

దళిత దృక్పథంతో తొలి కథాసంపుటి బోయ జంగయ్య 'లోకం' (1997). తొలి దళిత కథాసంకలనం ప్రచురించారు. భార్గవీరావు సంపాదకత్వంలో 'ఇంకానా? ఇకపై సాగవు' (1994), గుండెడప్పు కనకయ్య సంపాదకత్వంలో వెలువడిన కథాసంకలనం 'ఎదురుచూపులు' (1998), వారిదే దళిత చైతన్యంతో రాసిన తొలి కథాసంపుటి 'మేమిట్లుండం' (1998) వెలువడ్డాయి. గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లపొద్దు' (2002) — యాభై రెండు మంది దళిత స్త్రీల సాహిత్య సంకలనం; జూపాక సుభద్ర, గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లరేగడి సాళ్లు' (2006) — మాదిగ ఉపకులాల మహిళా కథలు; జాజుల గౌరి 'మన్ను బువ్వ' (1999) మొదలైన కథాసంపుటాలు వచ్చాయి. డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య సంపాదకులుగా జంబూ సాహితీ సంపాదకత్వంలో దళిత కథావార్షికలు రూపుదిద్దుకున్నాయి — 'తొండం బొక్కెన' (2020, దేశంలోనే తొలి దళిత కథావార్షిక), 'చిందూనేల' (2021), 'సాక' (2022), 'కొమ్ము' (2023), 'గండదీపం' (2024).


తెలంగాణ కృషి: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటయ్యాక కథాసాహిత్యంపై వెలువరించిన సంకలనం 'మూడు తరాల తెలంగాణ కథ'లో తెలంగాణ తొలి దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 'వెట్టిమాదిగ' కథకు, యువ దళిత కథా రచయితలకు చాలామందికి స్థానం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ, దామోదరరావుల సంపాదకత్వంలో ఆంగ్లంలో Telangana Harvest: Telugu Short Fiction (1912–2011) — తొలితరం కథకులతో పాటు జాజుల గౌరి, జాతశ్రీ, పసునూరి రవీందర్‌ల కథలున్నాయి. తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య యువపురస్కారం డా. పసునూరి రవీందర్ 'అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా' (2015) కథలకు వరించడం దళిత కథకు దక్కిన ఆత్మగౌరవమే. సిద్దెంకి యాదగిరి 'తప్ష' కథల సంపుటికి 2019 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారం వరించడం కూడా దళిత కథకు దక్కిన గౌరవంగా భావించాల్సిందే. తెలంగాణ దళిత కథను సుసంపన్నం చేస్తూ కథలు రాస్తూ అస్తిత్వ పతాక ఎగురవేస్తూ దళిత జీవితాలను ఆవిష్కరిస్తున్నారు.


తెలంగాణ కథాసాహిత్య చరిత్ర: తెలంగాణలో పురుడు పోసుకున్న దళితోద్యమం భారతదేశానికే దిక్సూచిగా నిలిచింది. హైదరాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందూ ఉద్యమం ప్రోద్బలంతో 1936లో డా. బి.ఆర్. అంబేడ్కర్ అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ, బి.ఎన్. వెంకటరావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమాల ఖిల్ల. నిరంతరం చైతన్యం పుణికిపుచ్చుకున్న నేల. ఈ నేలలో కథాసాహిత్యం కూడా పోరుగాథలను, ఉద్యమాలను చిత్రించింది. దళిత కథల్లో అస్తిత్వంతో పాటు దళిత దృక్పథాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించాయి. 'వెట్టిమాదిగ' కథతో ప్రారంభమైన తెలంగాణ అనేక కథలకు జీవంపోసింది. కథాసంపుటాలు, సంకలనాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో ఎనభై ఆరుగురు దళిత కథకుల కథలతో 'తెలంగాణ దళిత కథలు' పుస్తకానికి రాసిన ముందుమాటలో సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళిత కథలను ఐదు దశలుగా విభజించారు — తొలిదశ భాగ్యరెడ్డి వర్మ కాలం (1931–1956), రెండో దశ బోయ జంగయ్య కాలం (1956–1970), మూడో దశ జాతశ్రీ–కనకయ్యల కాలం (1970–2000), నాల్గో దశ స్త్రీ త్రయ కాలం (2000–2014), ఐదో దశ యువకాలం (2014– ...). ఆయా కాలాల్లో ప్రభావితం చేసిన రచయితల వల్ల ఆ కాలాలుగా విభజించారు. వారు సూచించిన కాలానంతరం కూడా కథలు రాశారు — ఉదా. బోయ జంగయ్య కాలం 1956–1970 అనుకుంటే వారు 'మూలాలు' కథ 2005లో రాశారు. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేస్తే పొడిచిన పొద్దును, నడిచిన కాలాన్ని, గడిచిన బతుకు వేదనలను అధ్యయనం చేస్తే దళితుల జీవితం అర్థమవుతుంది. కాలాలు సరే కాని కథకులను కాలకర్తలుగా కాకుండా కాలాన్నే ప్రమాణికంగా తీసుకుందాం. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేద్దాం.