తెలంగాణ రాష్ట్రంలో దళిత కథా పరిణామం -ఒక పరిశీలన (2014-2025)
-డా. సిద్దెంకి యాదగిరి
‘‘వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి.’’ -డా. బి. ఆర్. అంబేడ్కర్.
మనిషిని మనిషిగా గాక కులదృక్పథంతో చూసే నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడడంతో భారతీయ సమాజం అంతరాలతో అభ్యంతరాలతో నిండిపోయింది. వైరుధ్యాలతో కులగర్వం పెరిగింది. ఏ రెండు కులాలు ఒకటిగా లేకపోవడం, ఏ కులం ప్రత్యేకత ఆ కులానికి ఉండడం ఒక ముఖ్య కారణమయ్యాయి. ఛాందసవాద ఆచారాలు, కఠిన సంప్రదాయాలు, మూఢత్వంతో నిండిన కట్టుబాట్లు, నియమాలు రూపొందించుకోవడం వలన కులాల మధ్య, మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించబడి అధికమయ్యాయి. కొంచెం తీవ్రత తగ్గినా చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తత్ఫలితంగా మనుషుల మధ్య స్పష్టమైన విభజన గీయబడిరది. ప్రాచీన సాహిత్యంలో అధిక భాగం వర్ణవ్యవస్థను సమర్ధించాయి.
బింబిసారుని(క్రీ.పూ.542) కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భాగమైన శూద్రులకన్న హీనంగా మరొక వర్ణం పంచమ వర్ణాన్ని సృష్టించినట్లు రొమిల్లా థాపర్ (తరతరాల చరిత్ర) పేర్కొన్నారు. కాలక్రమేణ కులాల మధ్య అంతరాలు ఆర్థిక, అధ్యాత్మిక, వృత్తిపర, సామాజిక వివక్షకు దారితీసాయి. నీచవృత్తుల చేసే మనుషులను నీచంగా చూడడంతో అంటరానితనం వేళ్లూనుకుపోయింది.
వర్ణ వ్యవస్థను రూపుమాపాలని కలలుకన్న సాహిత్యం మనుషులంతా ఒక్కటే అని చాటింది. అందరు ఒక్కటే అనే సిద్ధాంతం ద్వారా పాల్కురికి సోమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్ర చారి, వేమన, దున్న ఇద్దాసు మొదలగువారు తమ పద్యాలు, గేయాలు, తత్త్వగీతాల ద్వారా మార్పును ఆకాక్షించారు. సాహిత్యంతో బలమైన ముద్రవేసారు. అయినప్పటికీ కులఛాందసవాదం మారలేదు.
ఫూలే దంపతుల నిస్వార్థ సేవ, అంబేడ్కర్ పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీకూడా హరిజనోద్ధరణకు పిలుపునిచ్చింది. నిరసనల నడుమ దళితుల ఆలయప్రవేశాల కోసం కృషిచేసింది. స్వాతంత్య్ర కాలంలో ఆధునిక భావాలు ఆహ్వానించబడ్డప్పటికీ అవి వ్యవస్థలో మార్పు తేలేకపోయాయి. కూటికి పేదనే అయినా కులానికి తక్కువనా? అనే కుల అంహకారం నిండిపోయాయి.
కులాలకు మూలం వర్ణవ్యవస్థ. కులనిర్మూలన జరగాలంటే వర్ణనిర్మూలన జరగాలని వర్ణ నిర్మూలన సిద్ధాంతాన్ని గ్రంథ రూపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించారు. కులవ్యవస్థ మనుషుల్ని కలవనివ్వలేదు. ‘కుల వ్యవస్థ శ్రామికుల్ని సైతం విభజించింది’ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
అణగారిన కులాలను భారత స్వాతంత్య్ర కాలంలో హరిజనుల(విష్ణువు సంతతి)సంబోధించింది. రాజ్యాంగం షెడ్యూల్డు కులాలుగా స్థిరపరిచింది. తదనంతర కాలంలో దళితులుగా రూఢ అయ్యింది. దళిత అనుపదానికి నిర్వచనాలు చాలా ఉన్నప్పటికి దళిత్ పాంథర్స్ 1973లో వెలువరించిన మ్యానిఫెస్టోలో ‘‘దళితులంటే... షెడ్యుల్డ్ ట్రైబ్స్, నియో బుద్ధిస్టులు, శ్రామికులు, భూమిలేని పేదలు, రైతులు, మహిళలు, ఆర్థికంగా రాజకీయంగా, మతం పేరిట దోపిడీకి గురయిన వారందరూ దళితులే! అయితే ప్రస్తుతానికి దళిత అనే పదం షెడ్యూల్డ్ కాస్జ్స్కి పరిమితమైంది. ‘దళిత’ పదం సామాజికంగా అంటరానివారిగా పరిగణింపబడుతున్న కులాలకు పరిమితమైంది.
తెలుగులో దళిత సాహిత్యం: వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషలో దళిత స్పృహ తక్కువేనని చెప్పక తప్పదు. ఆధునికత సంతరించుకున్న తెలుగు సాహిత్యం అనామక రచయిత రాసిన ‘మాలవాండ్ర’ పాటతో (1919) కొంత తదాత్య్మయం పొందింది. మంగిపూడి వేంకట శర్మ ‘నిరుద్ధ భారతం’(1933) అంటరానివెతలను అర్థం చేసుకొన్నది. సహానుభూతి ప్రకటించింది. పద్యం నుంచి వచనరూపంలోకి మళ్లిన తెలుగు సాహిత్యం 1902లో కథా ప్రక్రియలోకి అడుగిడిరది. విమర్శకుల దృష్టిలో 1910లో స్పష్టమైన కథలక్షణాలు గల ప్రక్రియగా రూపాంతరం చెందింది. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ప్రబుద్దాంధ్ర(1925) పత్రికలో ‘పుల్లంరాజు’, ఇలాంటి తవ్వాయి వస్తే’, కథతో దళిత దృక్కోణం వెలువడిరది. తదనంతరం అడివి బాపిరాజు ‘నరసన్న పాపాయి’, కరునకూమార ‘పోలయ్య’, చలం ‘హరిజన సమస్య’ గోపిచంద్ ‘చెప్పులు కుట్టేవాడు’ మొదలైన కథలు సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శకులు తేల్చిండ్రు.
దళితులు అనుభూతితో రాసిన సాహిత్యం 1930గోల్కొండ పత్రికలో శ్రీనివాస్ అనే యానాం దళితుడు ‘నేరేడు పండ్ల కంటు’ రాసిన తొలి దళిత కథకుడు. అంబేడ్కర్ కంటే ముందే దళితుల అభ్యున్నతిని కాంక్షించిన భాగ్యరెడ్డి వర్మ ఉద్యమిస్తూనే 1931లో ‘వెట్టిమాదిగ’ కథ రాసిన తొలి తెలంగాణ దళిత కథకుడుగా నిర్ధారించబడ్డాడు.
తొలి తెలుగు దళిత కథా రచయిత్రి ఆంధ్ర ప్రదేశ్కి చెందిన తాడి నాగమ్మ ‘ఇంకెక్కడి విజయం’(1934), గృహలక్ష్మి పత్రికలో అచ్చయ్యింది. తెలంగాణ తొలిదళిత కథకురాలు జనగామకు చెందిన మామిడి సత్యవతి5 ‘తెరతొలగింది’,‘హితువు’, ‘సుశీల’ మొదలైన కథలు రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలనుంచి దళిత కథా సంకలనం డా. ఆర్. చంద్రశేఖర్ రెడ్డి మరియు కె. లక్ష్మి నరసయ్య సంపాదకత్వంలో ‘దళిత కథలు’(1996) విశాలాంధ్ర ప్రచురించింది.
కంచికచెర్ల కోటేశు హత్య(1968 ఫిబ్రవరి24)తో దళిత స్పృహ రచయితలలో కలిగినా మహారాష్ట్రలో దళిత పాంథర్స్ వల్ల దళిత సాహిత్యం సామాజిక ఉద్యమంగా వికాసం చెంది తెలుగు నేలకు వ్యాపించింది. కారంచేడు సంఘటన(1985 జూలై 17న) దళిత సృజనకారులలో మరింత దళిత దృక్పథాన్ని మేల్కొల్పింది. తెలుగు సృజనకారులు వివిధ ప్రక్రియలను ఆశ్రయించి ప్రజల్ని జాగృతం చేసారు. ప్రధానంగా పాట సుడిగాలిలా చుట్టేసింది. కథా ప్రక్రియ అందరికి చేరింది.
భారత రాజ్యాంగం అమలవుతున్న డెబ్బై సంవత్సరాలలో కూడా కులపంకిలం సమసిపోలేదు. వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉండడం బాధకరం. కుల వివక్షతో పాటు మోడరన్ లైఫ్ స్టైల్ని, అనేక అంశాలను కూలంకషంగా ఎప్పటికప్పుడు సామాజిక బాధ్యతతో తెలంగాణ కథకులు చిత్రించారు. తెలంగాణ దళిత కథ జీవితంలోంచి, అణచివేతలోంచి ఉద్భవించింది. దళితకథలో శిల్పంలేదు. నైపుణ్యంలేదు అనేవారూ ఉన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వివక్షలేని జీవితం దళితులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందనే విషయం గ్రహించాలి. అందమైన అల్లిక గురించి ఆలోచించక అణచబడుతున్న జీవితాల గురించి ఆలోచించినపుడు ఇలాంటి విమర్శరాదు. దళితులకు విశేషమైన జీవితముంది. విషయ విస్తృతి ఉంది. వివక్షలూ(అకాడమిక్ అన్టచ్బిలిటీస్) ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి కిరాయి ఇల్లు దొరకని వ్యవస్థలోనే ఉన్నామనేదీ ఆలోచించరు. దళిత కథకు శైలి, శిల్పము లేదని ఎన్ని విమర్శలు చేసినా దళిత కథ ముందుకు సాగుతూనే ఉంది. ఇక్కడి దళిత బతుకుల్ని చిత్రించిన కథలను, నవలను కేంద్ర సాహిత్య అకాడమీ కళ్లకు అద్దుకుని అభినందించింది. జంబూ సాహితీ ప్రతి సంవత్సరం తెస్తున్న దళిత కథ దేశంలోనే తొలి దళితకథ వార్షికగా నిలిచింది. అనేక మంది యువరచయితలతో కథా సాహిత్యం నిత్యనూతమవుతుంది.
దళిత దృక్పథంతో తొలికథాసంపుటి బోయజంగయ్య ‘లోకం’ (1997), తొలి దళిత కథా సంకలనం కర్నాటక బర్షికిచెందిన ఇక్కడ ఉద్యోగం చేస్తూ భార్గవీరావు సంపాదకత్వంలో ‘ఇంకానా ఇకపై సాగవు’ (1994), గుండెడప్పు కనకయ్య సంపాదకత్వంలో వెలువడిన కథా సంకలనం ‘ఎదురుచూపులు’(1998), వారిదే దళిత చైతన్యంతో రాసిన తొలి కథాసంపుటి 1998 ‘మేమిట్లుండం’(1998) వెలువడ్డాయి. గోగు శ్యామల సంపాదకత్వంలో ‘నల్లపొద్దు’(2002) యాభై రెండు మంది దళిత స్త్రీల సాహిత్య సంకలనం, జూపాక సుభద్ర, గోగు శ్యామల సంపాదకత్వంలో ‘నల్లరేగడి సాల్లు’ (2006) (మాదిగ ఉపకులాల మహిళా కథలు) జాజుల గౌరి ‘మన్ను బువ్వ’ (1999). మొదలైన కథా సంపుటాలు వచ్చాయి.
తెలంగాణ కథా సాహిత్య చరిత్ర: తెలంగాణ నేల ఉద్యమాలఖిల్ల. నిరంతరం పోరుగాథలతో చైతన్యం పుణికిపుచ్చుకున్న నేల. ఈ జాగలో కథా సాహిత్యం కూడా పోరుగాథల్ని, ఉద్యమాల్ని చిత్రించింది. దళిత కథల్లో అస్తిత్వంతో పాటు దళిత దృక్పథాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం 1998లో ప్రారంభమైనా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంతో రాజకీయ రంగు పులుముకుంది.
‘తెలంగాణ దళిత కథలు’ కు ముందుమాటలో సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళిత కథల్ని నాలుగు విభాగాలుగా విభజించారు. తొలిదశ భాగ్యరెడ్డి వర్మ కాలం(1931-1956), రెండోదశ బోయ జంగయ్య కాలం (1956-1970), మూడోదశ జాతశ్రీ, కనకయ్యల కాలం (1970-2000) నాలుగో దశ స్త్రీ త్రయకాలం (2000-2014) ఐదో దశ యువకాలం (2014` ) అని సంగిశెట్టి శ్రీనివాస్ విభజించారు. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేద్దాం.
1. కుల చిత్రణ: ఎటువైపు వెళ్లినా కుల వెంటాడుతుంది. కుల పంకిలం అంతటా వ్యాపించిన విధానాన్ని దళిత కథకులు చిత్రించారు. అంటరాని తనం ఎంతదుర్మార్గంగా వ్యవహరిస్తుందో చిన్ననాడు జరిగిన సంఘటన ఆధారంగా గిరిపుత్రుల కూడా చిన్నచూపును చిత్రించిన జూపాక సుభద్ర కథ ‘అడవిని యిడువని అంటు’ కథలో చక్కగా వివరించింది. లేక లేక అడవిలోకి వచ్చిన దోస్తును ఇంటికి తీసుకెళ్లి స్టీలు ప్లేట్లో అంబలి ఇస్తది. తాగుతున్నపుడు తల్లి చూసి తన కూతురుని ఘోరంగా తిడ్తది. కొడుతది. జర్నలిస్టుగా దళితులపై జరుగుతున్న ఘోరాలను రాస్తున్నప్పుడు తన కులం తెలియగానే తనలోతాను మథనపడే గోగు శ్యామల కథ ‘తెరీడిన పూవెండ’ చిత్రిస్తది. దళిత జర్నలిస్టు ‘‘నేను దళిత్’’ అని అమెరికాలో ఆత్మగౌరవంగా ప్రకటిస్తది.
కులం తెలియగానే ఛాందసవాద యజమాని ఇంట్లో వస్తువులు బయటపడేస్తాడు. వస్తువులన్ని డీసిఎంలో వేసుకొని తిరుగుతుంటే అంబేడ్కరిస్టు వచ్చి మా ఇంట్లో కిరాయి ఉండండి సార్ అని ఆహ్వానించడంతో కథలోని పాత్రగా, రచయితగా మండల స్వామి ‘ఇల్లు దొరికింది’ అని తృప్తిపడుతాడు. ‘కిరాయిల్లు’ కథలో విఠలాపురం పుష్పలత వివరించింది. ఒక స్థాయికెదిగిన మాదిగ ఉద్యోగి మూలాన్ని మరిచి కిరాయి కోసం ఇబ్బందులకు గురిచేసే ఆత్మవిమర్శలాంటి కథ ‘పుండాకోరు’ను సిద్దెంకి యాదగిరి చిత్రించాడు.
ఆకలి అంటరానితనం మిక్స్చేసి, అగ్రవర్ణాల వారు మాదిగల్ని బొందపెట్టైనా సరే ఎలా ఎదుగుతారో తెలిపే పసునూరి రవీందర్ కథ ‘లీఫ్మెన్’. ఆకలి తాళలేక ఆకులు తినే మాదిగ లింగంను దేవున్ని చేసింది మీడియా. పూజలందుకుంటున్న లింగంను గోపాల్రెడ్డి చంపి ఏమీ ఎరుగకుండా గుడికట్టుమని లింగమయ్య బాబా దేశసంచారం పోయిండని ప్రజలధనం దోచుకోవడానికి మరో ఉపాయంతో సిద్ధపడ్తాడు.
వ్యవస్థను ప్రశ్నించిన కథ ‘అపచారమపచారం’ అస్పృశ్యుల నీడను తాకనివ్వని సమాజంలో, దళితులకు నీళ్లివ్వని బావిలో పంది పడ్డది. ఆ బావిలోనికి దిగి పందిపిల్లను తీయడానికి చిన్రాజిగాడు ఒప్పుకుంటాడు. తీసాక శుబ్బురంగా స్నానం చేసి గుళ్లోని నందిని తాకి మొక్కుత అని అడిగితే సరే అని చెప్పి పనిచేసాక గుడి మెట్లనుకూడా తాకనివ్వరు. ఈ వ్యవస్థ మీ ‘థూ’ అని ఉమ్మేస్తాడు చిన్రాజిగాడు. దళితులకు నేటికీ వైంకుఠధామంలోనూ వివక్ష ఎదురవుతున్న పరిస్థితులను పెద్దన్న మారాబత్తుల ‘వైకుంఠ క్షామం’లో స్వభావోక్తంగా చిత్రించాడు.
2 దళిత స్త్రీ చిత్రణ : ‘‘ఒక సమాజ పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి కొలుస్తాను ’’ `అంబేడ్కర్. మహిళలలో దళిత మహిళలు వేరు. వ్యవస్థలో కులాధిపత్యం, ఇంట్లో పురుషాధిపత్యం రెండు తెలంగాణ దళిత స్త్రీలను అణిచివేసాయి. అయినా దళిత స్త్రీ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూనే ఉంది.
తెలంగాణ పల్లెల్లో భూస్వాముల ఆగడాలకు బలైన మాల మాదిగ ఆడోల్ల గోసలు అంతా ఇంతా కాదు. భర్త పక్కలోంచి బార్యను తీసుకెల్లిన దుర్మార్గాలను, కుక్కలు చింపిన విస్తరిలా మారిన ఆడోల్ల బతుకుల్ని జూపాక సుభద్ర రాసిన ‘పగిలిన పచ్చిపుండ్లు’ కథ ద్వారా వెనుకటి ఎతలను ఏతం బొక్కెన తీరు ఎత్తిపోసింది. అత్తబతుకును, ఆమెలాంటి కింది కులాల ఆడోల్లను పటేల్ భూస్వాములు ఎట్లా నాశనం చేసారో తెలిపింది.
పురిటిలోనే పసిపిల్లలను అమ్ముకునే దుస్తితిని కొమ్ము రజిత ‘ఫెర్టిలిటి’కథలో వివరించింది.తాళపల్లి యాకమ్మ ‘మమతల మల్లెలు’ కథ నాన్న ఘనత పతాకస్థాయి కల్పించింది. మహిళలందరి సమస్యలకే తీరుగా ఉండవని కులాన్ని, ఆర్థిక స్థితిని బట్టి వేరువేరని ‘ఉత్సవం’ కథలో యాకమ్మ చిత్రించింది. పల్లెటూర్లలో బాల్యవివాహాన్ని అడ్డుకోవడం గురించి తాళ్ళపల్లి యాకమ్మ ‘గురుదక్షిణ’ సామాజిక స్పృహకలిగిస్తుంది. గర్భిణీ స్త్రీ చనిపోతే బొందల గడ్డలో పూడ్చిపెట్టేటపుడు అవమానించి, అడ్డుకొని, చివరకు బొందల గడ్డలో కూడా స్త్రీ వివక్ష ఎదుర్కొంటున్నదని తెలియజేసే కథ డి.జి హైమావతి ‘బొందల గడ్డకు దూరంగా’ మహిళల దుర్భర వివక్షకు దుర్బిని. ఆర్థిక స్థాయి పెరిగినా, ఆలయ ప్రవేశం జరగదని, అడుగడుగున వివక్ష పోదనీ, పూజచేసే వద్ద బైండ్ల పూజారి ఉంటేనే సమానత్వం ఉంటుందని కలగన్న కథ గోగు శ్యామల కథ ‘కలల రాణి’ భవిష్యత్తు దర్శనం చేసింది. బంధాలు, అనుబంధాలు, అవమానాల మధ్య సమాజంలో స్త్రీల బతుకు ఎంగిలి విస్తరిలా ఉందని కిరణ్చర్ల ‘ఇత్తారాకుల తట్ట’ కథలో దృశ్యీకరిస్తాడు. భర్త రోజు కొడుతుంటే తిరగబడ్డ భార్య కథే మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’ వివరిస్తది. విప్లవం బాట పట్టిన సెల్లెల్ని చూద్దామని వెళ్లిన అక్కకు చెల్లెలు మరియ మనువాద బ్రాహ్మణీయ భావజాలం నింపుకున్న మంజుల అని తెలియగానే వెనుదిరిగిన అక్క బాధే జూపాక సుభద్ర ‘మా సెల్లే మల్లక్క’ కథ వివరిస్తుది. పిల్లలు లేని గొడ్రాలు శుష్క జీవితాన్ని రామ్ పెరుమాండ్ల ‘కన్నీటి కథ’ దు:ఖపు తెరతో ముగిస్తాడు. ‘ఆమె పేరు హంపి’ (కిరణ్ చర్ల) కథ అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్న రూరల్ లైఫ్ గురించి రాసాడు. డిజి హైమవతి కథ ‘సీతవ్వ’లో దళిత ఆత్మగౌరవం కనబడుతుంది. చనిపోయిన భర్తను తలుచుకుంటూ అట్లే చనిపోయిన భార్య జీవితాన్ని రామ్ పెరుమాండ్ల ‘కన్నీటి కథ’ విషాదంగా చిత్రించాడు. గంధం విజయలక్ష్మి కథ ‘ముచ్చలిక’ గోసంగి స్త్రీ సాధించుకున్న విజయాలు విశదపరిచింది. వీరి ‘ఫీజు’ కథలో మోసంచేసిన భర్తను కటకటాల పాలు చేసిన మహాలక్ష్మి ఒక మేల్కొల్పు. ప్రేమించి పెద్ద చేసిన వ్యక్తి నాయనమ్మ కళ్ళ ముందు చనిపోతూన్న దీనస్థితిని చిత్రించిన యాదగిరి కథ ‘నాయనమ్మ’ ఆత్మీయతకు చిరునామా.
3. విద్యాభ్యాస చిత్రణ: దళిత కథకులు అధికంగా ఉపాధ్యాయ వృత్తి నిర్వహించడం వలన విద్యాభ్యాస చిత్రణ కలిగిన కథలు అనుభవపూర్వకంగా చిత్రించబడ్డాయి. ఈ వరసలో భూతం ముత్యాలు ముందుటాడు. డ్రాపౌట్ అయిన విద్యార్థులను బడికి రప్పించిన కథ ముత్యాలు ‘బడిబాట’. ఒకవైపు బడికి మరొకవైపు పత్తిచేలో పత్తిపూవైన బాల్యాన్ని చిత్రించిన కథ ‘దూదిపింజె’. దివ్యాంగురాలైన బాలిక తన కనీస అవసరాల తీర్చుకోలేని దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిన ‘జేజి’ కథ. పాఠశాల విద్యార్థుల చదువుకు దూరం అవుతున్న వారి జీవితాలను ఎరుక చేసే కథలు తెలియజేస్తాయి.
దళిత ఉపాధ్యాయులు అనేక జీవితాలకు ఆలంబనగా నిలిచారు. కల్లోలమైన జీవితంలోనూ డ్రాప్ అవుట్ విద్యార్థిని లలిత కోసం పడే వేదన మామూలుది కాదు. తన బిడ్డకు జన్మనిచ్చే సమయం మరోవైపు కనబడని బిడ్డలాంటి లలిత కోసం లేబర్ రూములో ఆయాసపడుతున్న వేదనే డిజి హైమావతి రాసిన కథ ‘మూసిన తలుపులు’ పాఠకుడి ప్రసవ వేదనలా మలచిన తీరు మానవ హోమమే. పాఠశాలలో ఆహార అలవాట్లను కట్టడి చేసే జూపాక సుభద్ర కథ ‘నీసు నియ్యతి’ తెలుపుతుంది. ఇదే అంశంపై పసునూరి రవీందర్ ‘ప్యూర్లీ నాన్ వెజిటేరియన్’ కథలో బలమైన అభివ్యక్తి ద్వారా కులవివక్ష తీవ్రతను తెలియజేస్తూ ‘ఈ దేశం రెండుగా చీలినట్లే... ఆ తరగతి రెండుగా చీలిందనీ’’ పేర్కొనడం ప్రస్తుత పరిస్థితులకు దర్పణం పడుతుంది. హాస్టల్లో, పాఠశాలలో చికెన్ పెడతారు కానీ ఇష్టమైన బీఫ్ ఎందుకు పెట్టరు చెప్పిన జూపాక సుభద్ర కథ ‘బీఫ్ బిందాస్’ కోరికను వ్యక్తీకరిస్తది.
ఉన్నత చదువులకోసం వెళ్లడం దళిత విద్యార్థులకు పరిస్థితులు ప్రతిబంధంకంగా నిలుస్తున్నాయి. వాటిని అధిగమించి దళిత ఉపాధ్యాయుడు ఉద్యోగం చేస్తున్న తన భార్య ద్వారా చదువు విలువ చెప్పించి త్రిపుల్ ఐటి జాయిన్ కావడానికి కార్యోన్ముఖులు చేసిన సిద్దెంకి యాదగిరి కథ ‘సందిగ్ధం’ కర్తవ్య దీక్షను బోధించింది.
విద్యార్థులకు ఏదైనా అపాయం జరిగితే ఓర్చుకోలేని సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ లోకం ఉన్న ఈ సమాజంలో అనుకోకుండా చనిపోయిన విద్యార్థి గురించి విలపిస్తున్న ఉపాధ్యాయుడి అంతరంగ ఆవిష్కరణ తప్పెట ఓదయ్య కథ ‘పుట్టెడు ఎత’. చదువుతున్నంత సేపు ఒక దుఃఖపు తెరను మనల్ని ఆవహిస్తుంది. ఆవరిస్తుంది. అతలాకుతలం చేస్తుంది. మారని పరిస్థితి గురించి మనసు మారాం చేసేలా రాయడం కథకుడి ప్రత్యేకత. పేద విద్యార్థులకు దారి చూపిన గురువులను గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేసే తాళ్లపల్లి యాకమ్మ కథ ‘గురు బ్రహ్మ’ నిజంగా గురుదక్షిణనే.
కులాలకు ఉపకులాలకు మధ్య ఉన్న అంతరాలు బడిలో భోజనము వద్ద ఎలా ప్రవర్తిస్తాయో, ఆ దుస్థితిని తెలిపే తప్పెట ఓదయ్య కథ ‘‘మీరేంటోళ్లు సార్’’. కింది కులాల్లో ఎంత అనైక్యత అంతరాలను వివరిస్తుంది. కొత్తగా విధుల్లో చేరిన ఉపాధ్యాయుడు, పాఠశాల పేరెంట్స్ కమిటీ నిర్ణయం మేరకు మధ్యాహ్న భోజన వంటమనిషిగా ఒక మాదిగ స్త్రీ నియమించుకున్నారు. కానీ మాల ఉపకులమైన నేతకాని కులం వాళ్లు వ్యతిరేకిస్తారు. అడుక్కుతినే అనాథపిల్లలని చదివిస్తానని భరోసా నింపడమే సిద్దెంకి యాదగిరి ‘మార్పు’ సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయులకు ఉదాహరణగా నిలుస్తుంది.
కష్టపడి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించడం మండల స్వామి ‘విజయతీరం’ కథలో చూస్తాము. వీరి ‘సదువుకోవాలె’ కథలో ఇంట్లోంచి పారిపోయి బంగారు లోకం చూపె చదువుకోసం వెనుదిరగడం గణనీయమై మార్పుగా మనముందుంచాడు. బుడగ జంగాల విద్యార్థుల జీవితాల్ని డిజి హైమావతి ‘జోలెవిలువ’ కథ ఆవిష్కరించింది. పిల్లలకు రూపంతోపాటు పోరాడే లక్షణాన్ని ఇవ్వాలని చింతకింది శివశంకర్ ‘రూపాంతరం’ కథలో పేర్కొంటాడు.
4. ఉద్యమాల ప్రభావాలు: తెలంగాణ ఉద్యమం పేరుతో పదమూడువందల మంది బలిపీఠమెక్కిన అమరులలో ఒకడైన కొడుకు శాంతమ్మ కలలో రోజూ మాట్లాడ్తాడు. ఒకరోజు మనకేం ఒరిగింది బిడ్డా? అని ప్రశ్నించగానే బాల్రాజ్ కలలోకి రాలేదు. శాంతమ్మకు కలత నిద్రే మిగిలిందని. ఇది తెలంగాణ అమరవీరుల తల్లుల బాధగా పసునూరి రవీందర్ ‘రాచపుండు’ కథలో వివరిస్తాడు.
యూరేనియం తవ్వకాలు జరపి అడవిని ఆక్రమించుకుంటున్న పోలీసులపై వనజ ఎత్తిన పిడికిలితో పరిస్థితి బాధితుల వైపు మళ్లిందని తెలిపే తాళ్లపల్లి యాకమ్మ కథ ‘పిడికిలి’ సమకాలీన సందర్భాన్ని చిత్రిక పట్టింది. సబ్బండ వర్ణాలు ఎలా మోసపోయాయో సావులో తెలిసొచ్చిన యువకుడు ఇప్పుడు నలుగురిని కూడేసి కొట్టాల్సిన డప్పు అని తెలిపే పసునూరి రవీందర్ ‘జెజ్జనక’ కథ మరో ఉద్యమానికై మోగుతుంది. ఆహార అలవాట్ల మీద జుల్ము ఏంది? అని ప్రశ్నించే ఉప్పులేటి సదయ్య కథ ‘ఉడో’ దేశకాల పరిస్థిలకు చిత్రిక పట్టింది. ‘గొడ్డును తేవాల... తునుకల గై కాడ కావలుండల్ల... కనుమరుగై కాకులత్తే ‘ఉడో’ అని కొట్టల్ల’ అని ఉద్యమించాలని బోధిస్తది.
5. రాజకీయ కథలు: దళితుల్ని అగ్రవర్ణాల వారు రాజకీయంగా ఎలా అణగదొక్కుతారో తెలిపే కథలు చాలా వచ్చాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న విషయం గురించి చర్చిస్తున్న మాలా మాదిగల సంభాషణ విన్న ఆ ఊరి దొర ‘‘ఏంరా ఏం మాట్లాడుతుండ్రు. అయితే గియితే నా జీతగాడు ముఖ్యమంత్రి అయితడు. లేదంటే నేనే అయిత. మా నుంచి అధికారం ఎవర్రా తీసుకునెటోడు’’ అని గద్దిస్తాడు. ఆ హామీ బుట్టదాఖలవుతుందని ముందే పసిగట్టిన భూతం ముత్యాలు కథ ‘తెలంగాణ పొద్దుపొడ’ కుట్రల్ని బట్టబయలు చేసింది. రిజర్వేషన్ల వల్ల దళితులను అలంకరించిన పదవులు పెత్తనం చేసి ఊరి పెద్దల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారిపోతాయి నిరూపించే జూపాక సుభద్ర కథ ‘రాణిర్కం’. నిబద్ధతగా పనిచేస్తున్న వ్యక్తిని కాదని రిజర్వేషన్లకు వేలం వేసి సర్పంచ్ పదవిని ఎవరు ఎక్కువ డబ్బులు గ్రామపంచాయితికి చెల్లిస్తారో వారే ఏకగ్రీవం చేస్తామనీ ఉన్నత కులాల వారు ఎలా వ్యవహరిస్తారో, రిజర్వేషన్లు దళితులదే అయినా ఏ విధంగా అమ్ముతారో తెలిపే సిద్ధెంకి యాదగిరి కథ ‘మూడు గుడిసెల పల్లె’ నేటి పరిస్థితులకు అద్దంపడుతుంది.
ఎవరి మాటవినని కట్టమల్లు ఎన్నికలలో నిలబడ్డడు. వెంకట్రెడ్డి తన జీతగాడైన మల్లిగాన్ని నిలబెట్టి గెలిపించుకుంటాడు. కొన్నాళ్లకి కట్టమల్లు సావుకి రాజవ్వను రానివ్వకుంట కులపోల్లను ఉసిగొలుపుతాడు. అప్పటికే రెడ్డిచేతిలో మోసపోయిన రాజవ్వ ఒక్కతిగా రావడం జీర్ణించుకోలేని యువకుల రక్తం మరుగుతుంటది. చంకకు డప్పువేసుకుని యుద్ధం చేయాలని ‘పులిఅడుగు దెబ్బ’ కథలో పసునూరి రవీందర్ చైతన్యం నింపుతాడు.
ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోల్పోయిన జీవితాలను చక్కదిద్దిన సవాలే కె.పి లక్ష్మీనరసింహ కథ ‘యువనాయకత్వం’ ఎత్తుకు పై ఎత్తులు వేసి ఓడిమ్చలనుకున్న భూస్వాములను దేబ్బతీసే నేటి తరానికి కర్తవ్య దీక్షగా మనముందు ఉంచాడు. కులం కారణంగా అనేక మంది చోటా మోటా లీడర్లు అవమానాల పాలయ్యారు. అవమానాలు ఎలా ఎదుర్కున్నారో తెలిపే డా. మండల స్వామి కథ ‘‘కాలం మారింది’’.
6. కరోనాకాలం : ప్రపంచ మానవాళిని భయకంపితులు చేసిన అంటు రోగము కరోనా. కరోనా కాలంలో దళితుల మీద ప్రేమ తోటి రాసిన కథలు చాలా వచ్చాయి. భూతం ముత్యాలు ‘కాని కాలం’, ‘వలస బతుకులు’ కరోనాకాలంలో కరోనా నేపథ్యంలో కరోనా విస్తరించిన నేపథ్యంలో జరిగిన పరిణామాలను వాస్తవ సంఘటనలను అక్షర రూపమే ఈ కథలు. కరోనాకాలంలో సర్పంచ్ చేస్తున్న కామెంట్లను సెటైరుగా సిద్ధెంకి యాదగిరి తీర్మానం కథ నాటి రాష్ట్ర రాజకీయాలను బయల్పరిచింది. కరోనా మీద 12 కథలు రాసి ‘దుఃఖ నది’ కథా సంపుటి వెలువరించిన రచయిత్రి తాళ్లపల్లి యాకమ్మ. ప్రాణాలకు తెగించి ప్రాణం పోసే ‘ప్రాణదాతలు’ అని యాకమ్మ డాక్టర్లను కీర్తించింది. నిరంతరాయంగా అవిశ్రాంతంగా డాక్టర్ల జీవనశైలిని ‘ఆపద్బాంధవుడు’ కథ ద్వారా వివరించింది. కరోనాకు ముందు నిలబడి యుద్ధం చేసే వీరులు పారిశుద్ధ కార్మికులు పోలీసులు వైద్యులు వీరిని వీరి అంకిత భావాన్ని ‘వారియర్స్’ కథగా హృదయానికి హత్తుకునే విధంగా చిత్రించింది. భూమిని, వ్యవసాయము వదిలివెళ్లిన వారు ఎంతపిలిచినా ఊరికిరారు. ఊరికి వద్దామనుకుంటే రాకుమని చెప్పడమే గోగు శ్యామల కథ ‘కరోనాసుగ్గి’ చిత్రించింది. కరోనా కాలంలో తక్కువ కర్సు అయితదని నిశ్చయించిన పెళ్లిని కాలరాసిన వ్యక్తిత్వంతో ‘గంగ టీచర్’ కథ ద్వారా మండల స్వామి ఉపాధ్యాయుల బాధ్యతను వివరిస్తాడు.
7. ప్రేమ కథలు : దళిత కులాల మనస్తత్వమే ప్రేమ సంస్కృతి. మనుషుల్లో, మనసులో పట్టజాలనంత ప్రేమ పొంగిపొర్లుతది. తొందరగా ప్రేమకు దాసోహమవుతారు. బతికి ఉన్న తల్లిదండ్రులు చనిపోయారని రెడ్డి వనితని వివాహం చేసుకొన్న వ్యక్తి ‘కీర్తిశేషులు’లో తాళ్లపల్లి యాకమ్మ రికార్డ్ చేసింది.
కుక్కలతో కథ చెప్పడం గుడిపల్లి నిరంజన్ ప్రత్యేకత. ‘ప్రేమించుకున్న కుక్కలు ఛి.. ఛి.... వాళ్లు మనుషులు. వాళ్లకంటే హీనులు మరొకరు లేరని మాట్లాడుకుంటున్న తీరు మానవులకి బుద్ధి చెబుతున్నట్లుంది. ఆ కుక్కల చర్చ నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్న ‘రచ్చకట్ట’. అంబేడ్కర్ కలల రాజ్యాధికార దిక్సూచిగా నిలిచింది. మతాలు మధ్యదూరి స్వచ్ఛమైన ప్రేమను కాలరాస్తది. మాదిగ రాజయ్యను పెళ్లి చేసుకుంటా అన్నందుకు పరువు హత్యగా జరీనా సజీవంగా కాల్చివేయబడుతదని తెలిపే రాజు దుర్గాని కథ ‘మాదిగ రాజయ్య’. ప్రేమ కలిపిన రాజకీయ కథలకు కెపి లక్ష్మి నరసింహ కేరాఫ్ అడ్రస్ చెప్పుకోవచ్చు. కులోన్మాదంతో కన్నకూతుళ్లను పరువు హత్యలు చేస్తున్న వారి నేపథ్యంగా సంచలనం సృష్టించిన సంఘటన ఆధారంగా రాసిన వేముల ఎల్లయ్య కథ ‘మారుతి మర్డర్’ చిత్రించింది. కెపి కథ ‘పరువు హత్యలు’ ఆ కోవకే చెందింది. ‘దుసరి తీగ’ కథలో ఆ సమాధి ఎవరదని అడిగితే నీకు తెల్వదా? ప్రణితను మూన్నెల్ల కిందట చంపేసి హత్య చేసిండ్రని చెప్పినప్పుడు గుండెపగిలేలా రోదిస్తాడు. మాదిగోల్ల పిల్లను పెళ్లిచేసుకోవడం వల్ల ఎలక్షన్లో గెలిపించి ‘నెత్తిమీద ఎత్తుకొని ఊరేగిస్తం’ అని కెపి లక్ష్మినరసింహ చిత్రిస్తడు. ‘‘ఇంకా మరువవారా ఆ పిల్లను?’’ అని బువ్వమ్మ అడిగింది. ‘‘నీ దగ్గర గాజులు కొనని రోజున మర్చిపోయిన అనుకో అత్త’’ అని తన గుండెలో నిలిచిన ప్రేమను వ్యక్తపరచిన కె.పి లక్ష్మి నరసింహ కథ ‘గాజులు కొనని రోజున’’ ప్రేమ కథలలో పేరెన్నికగన్నదిగా నిలిచిపోతుంది. ‘సాయబోల్ల పిల్ల’ అమ్మాయి ప్రేమను గెలిపించుకున్న యువత పట్టుదలను మేడి చైతన్య కథ సాక్ష్యంగా నిలుస్తుంది. మోహపు విరాగంలో కలుసుకున్న ఆమెను మరిచిపోలేని ఉప్పొంగే ప్రేమకెరటాలు కిరణ్చర్ల ‘సముద్రం నిద్రపోదు’. వీరి మరోకథ ‘తూ హోగా జరా ఫాగల్’ మోహం బరవవకుండా చూసుకోవాలి. ప్రేమించడమంటే ఇష్టాన్ని కూడా చంపేసుకోవడం చెబుతుంది.
8. బహుజన వాదం: దళితులకు మిగతా కులాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు మధ్యవ్ను అనుబంధమే బహుజన తత్వం. దళిత కథలలో బహుజనవాదాన్ని చిత్రించిన కథలు ఉన్నాయి. ఎల్లకాలం ఎవరు బతుకరు. కలకాలం గుర్తించుకొనే విధంగా బతకడమే గొప్ప బతుకు. పుట్టిన ప్రాణి చనిపోవాల్సిందే. ఊరోల్ల కాళ్లకు చెప్పులు చేసి ఇచ్చి అందరి ఆరోగ్యాలు కాపాడిన మంచి మనిషి చివరి ఘడియల్లో సరైన వైద్యం అందక ప్రాణమిడిసిన మనిషిని అందరు కొనియాడడమే ‘ఊరుమెచ్చిన మనిషి’ కథను గుడిపల్లి నిరంజన్ అత్యున్నతంగా తీర్చిదిద్దాడు. గొల్లలకు మాదిగలకు ఉన్న అనుబంధం తెలిపే తప్పెట ఓదయ్య కథ ‘మల్లక్క’. మాయితనం చేసే మాదిగను చేరదీసి చదువుకు సహకరించిన ఆసామి గొల్ల మల్లక్క. అతని పెళ్లిచేసింది. నౌకరి కోసం చదువుతున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఆర్థిక సహకారం అందజేసింది. పల్లెల్లో బహుజనుల మధ్య ఉన్న ఆత్మీయతను పట్టి చూపే డా. సిద్దెంకి యాదగిరి కథ ‘‘బెస్త నర్సయ్య మామ’’. గంగపుత్ర నర్సయ్య కులమతాలను నిరసించి అందరు సమానమని చాటుతూ మాదిగి రాజయ్య కుటుంబాన్ని చేరదీసాడు. రాజయ్య భార్య లచ్చవ్వ ప్రతీ రాఖీల పండుగకు సోదరభావంతో రాఖీలు కడుతుండేది. ఎవరింట్ల పండుగ జరిగినా బంధువుల్లా కలిసిపోయేవారు. ఆత్మీయంగా వ్యవహరించిన బెస్త నర్సయ్య మామ కరోన కాలంలో చనిపోయాడు. ముఖం చూడలేని పరిస్థితిని తలుచుకొని వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను సాధించాలని రచయిత తన కూతురుకు చెప్పడమే కథ. బీసిలను సొంతవాళ్లుగా పరిగణించే దళితుల్ని దూరం కొడుతున్న పరిస్థితులు పసునూరి రవీందర్ కథ ‘అయినా మనిషి మారలేదు’ కథలో కనపడుతాయి. సావు బట్టలుతుకుమన్నరు... అని ఉన్నంతలో మేడలో జీవించే సాకలమ్మ తన ఇంట్లో కిరాయికుండే అనితతో తన గోడు చెబుతుంటది. అనిత ఓదార్చుతుంది. ఆమెలోని కులచిత్తుడు మేల్కొని మాదిగొల్లు మనుషులే కానట్లు మాట్లాడుతుంటది. విషయం తెలుసుకున్న అనిత భర్త మనుషుల్ని కులాలుగా విడదీస్తున్న నిచ్చెనమెలట్లదే తప్పనుకుంటాడు. మన్నె ఏలియా ‘జీవిగంజి’ కథలో వాగులో కొట్టుకపోతున్న సాకలామే ప్రాణాన్ని కాపాడినందుకు తోడబుట్టిన తోడులా ప్రేమిస్తది. చచ్చిపోయే ముందు జీవిగంజి తాగి తృప్తిగా మరణిస్తుంది. మాదిగి మల్లయ్య పిట్టకు వెడితేనే ఆమె ఆత్మసంతృప్తి చెందుతుందని దృశ్యీకరించడం మనుషుల బంధాల అల్లికలకు నిదర్శనంగా ఉంది. బహుజన సిద్ధాంతానికి మూలమైన సావిత్రిభాయి ఫూలే జీవితాన్ని కథల్లోకి తీసుకువచ్చి స్ఫూర్తిని డిజి హైమవతి నింపింది. ముస్లిం కుటుంబాలకు దళిత కుటుంబాలకున్న ఆత్మీయతలను అల్లిన మారాబత్తుల పెద్దన్న రాసిన ‘బూబమ్మ ` మల్లెపూల పందిరి’, ‘బూబమ్మ బ్యాంగిల్ స్టోరీ’లను అందించాడు.
9. ఉప కులాల చిత్రణ: కులాలకు ఉపకులాలకు చాలా తేడా. వీరి మధ్య అంతరాలున్నాయి. వాటిని రచయితలు ఫోకస్ గా వివరించారు. ఊరిలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప బతుకలేని వృత్తి బేగరి కులానిది. ఆ కుల ఎతను దయనీయంగా ఆవిష్కరిస్తూ బాధపడే తల్లి మనసును చిత్రించి కులవృత్తి వదలడమే పరిష్కారంగా చూపిన భూతం ముత్యాలు కథ ‘సావుకూడు’ తెలియజేస్తుంది. కులాంతర వివాహము జరుపుకోవడం కులం వెలివేసిన కనపడని మనువు లక్షణాలు తెలిపే భూతం ముత్యాలు కథ ‘వెలి’, నిలువు నీడకోసం వేసుకున్న ప్రభుత్వ జాగ కబ్జ చేసుకోవాలనీ రాజకీయులు ఆడిన నాటకంలో ‘గుడిసెలంటుకున్నాయి’ కథలో పేదల బతుకుల్ని బుగ్గి అయిన తీరును చూపించింది. పనిముట్లంటే ప్రాణమనే విషయాన్ని మన్నె ఏలీయా కథ ‘జమిడికె’లో జమిడికెను కాజేయాలనీ చూసిన పట్నం సార్ ఇస్తున్న ఐదువందల రూపాయలను వద్దనీ మొకమ్మీద కొట్టిండు బీములు. ‘‘ఇందామని రాలే. నా జమిడికె కొందామనీ వచ్చిండు’’ అని భార్యకు చెప్పుతడు. నా ప్రాణముండంగ నా జమిడిక ఎవరికియ్యననడం అందరికీ ఆచరణీయం. చెరువు మీది బెంగతో ఊరు నాశనమయ్యిందని, అతను కలగన్న జీవిత కాలరాయబడిరదనీ ‘నీరటిగాడి కల’లో కుమిలి కుమిలి కల్లోలం గురించి ఆలోచిస్తాడు. ఎవరు నింపారని తర్కిస్తూ బిపి పెరిగింది, నరాలు తెగినయి. ప్రాణం పోయిందనీగుడిపల్లి నిరంజన్ కథ ఆలోచింపజేస్తుంది. సిక్కెంటికెల మనిషిని మనిషిగా చూసి నీళ్లివ్వని స్థితిని కెపి లక్ష్మి నరసింహ కథ ‘దోసిలిపట్టు’ వివక్షను తెలుపుతుంది.
10. విప్లవ ప్రభావ చిత్రణ: సంతు మంచి బాలుడని శత్రువులతోనే ఒప్పిస్తాడు కథకుడు. నక్సలైట్ అని ముద్రవేసి నానా రకాలుగా చిత్ర హింసల పాల్జేస్తారు. మళ్లీ పోలీసులు వస్తారు. అరెస్టు చేయకుండా తప్పించుకుంటూ పోతాడు. చెరువు కట్టవద్దకు పోగానే పిడికె సేతుల పట్టుకొని ఈ బాంబు వెయ్యిమంటరా? అని ప్రశ్నించి, పోలీసోల్ల వద్దనుంచి వ్యూహాత్మకంగా తప్పించుకుంటాడు. ఉపాయముండాలె గని అపాయం నుంచి తప్పించుకోవచ్చునో తెలిపే ఉప్పులేటి సదయ్య కథ ‘పిడికె’. డిజి హైమవతి ‘విముక్తి మార్గం’ కథ విప్లవ కోణంలో వెల్లడిమ్చింది.
11. లోపాలను ఎత్తి చూపిన కథలు: ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వ కార్యకలాపాలను దళిత కథ ఎప్పటికప్పడు కలం దూసింది. అక్షరాలతో సాక్షీభూతంగా నిలిచింది. అనాలోచిత నిర్ణయం వలన దేశం డబ్బుల్లేక విలవిలాడిన సందర్భాలు అనేకం. దేశంలో నోట్ల రద్దువల్ల ఇబ్బందుల గురైన దళితులు ఎలా లోనయ్యారో తెలుపుతున్న సంఘటనలు ఉన్నాయి. క్యూలో నిలబడి డబ్బులు తీసుకుంటే దినసరి కూలి పోతందని తెలిపే జూపాక సుభద్ర కథ‘లోట్ల కరువు లొల్లి’ చిత్రించింది. చెప్పులు కుట్టే లింగమ్మ బిడ్డ పెళ్లికోసం జాగ అమ్మింది. డబ్బులు ఇచ్చినరోజే నోట్లు రద్దయినయి. వాటిని చెల్లించలేక పడే యాతనను సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’ కథ చెబుతుంది. ప్రాజెక్టుల పేరుతో కొల్లగొడుతున్న తమ జీవితాన్ని బద్దిపోష అనే ముసలమ్మ తన చివరి కోరిక ఏంటో వివరించే సిద్ధంకి యాదగిరి కథ ‘ఆఖరి కోరిక’ వివరిస్తుంది.
అనుబంధాలు అల్లుకున్న ఊరు ముంపు గ్రామమై మునిగిపోతున్నందుకు, ప్యాకేజీలు రాకపోవడం వల్ల బ్రతుకు స్మశాన వైరాగ్యం నింపుకున్నది. చితిపేర్చుకొని చనిపోయిన స్థలాన్ని దర్శించి, అక్కడి ప్రజల దు:ఖంతో మమేకమవ్వడం మానవత్వం కలిగిన ఉపాధ్యాయ బృందం అక్కడి మట్టితో విలపించిన విషాదగీతం సిద్దెంకి యాదగిరి కథ ‘నిలువెత్తు దుఃఖం’ బాధితుల ఓదార్పుకు స్వాంత్వన, సహచింతన, తదాత్మయం మానవత్వానికి నిదర్శనం.
ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం హామీలు అమలు కాలేవని పాలన తిరుగుబాటు ప్రకటించి ‘ఒడువని లడాయి’ కథ ద్వారా మార్గదర్శనం చేసిండు పసునూరి రవీందర్. శవాలమీది ప్యాలాలు ఏరుక తిన్నట్లు తాయిలాలు ప్రకటించి మళ్లీ గెలువాలనీ కలలు గంటున్న రాజముద్రికల్ని కూలదోయడమే లక్ష్యమని ప్రకటించిన సిద్దెంకి యాదగిరి ‘శవకీయం’ కథ ఏది మంచిగనిపిస్తే ఆ పార్టీ గెలిపించాలని చర్చించుకున్నారు.
12. ఇతరములు: కుల వివక్ష ప్రతినిధి అయి పీడిoచిన వ్యక్తిని అంతిమ సంస్కారంలో అయిన వాళ్లు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు రాలేదు. మహోన్నత మనసుతో పురుగులు పడ్డ శవాన్ని దళితులు ఎలా మోసారో తెలియజేసే జూపాక సుభద్ర కథ ‘‘అప్పు పడ్డది సుమీ’’ మాదిగల మానవత్వాన్ని చాటుతుంది. పిల్లలు లేని గోనవ్వను కిరాస్థాని మతం వారు క్యాన్సర్తో బాధపడుతున్న కన్నబిడ్డలకంటే ఎక్కువ ప్రేమించడం, మరణించాక ఖననం చేయడమే సిద్దెంకి యాదగిరి ‘సావు’ కథలో నాటకీయంగా ఉంది. మెర్సి మార్గరేట్ ‘వర్షం సాక్షిగా’ క్రైస్తవ పద్ధతిలో భూస్థాపన (ఖననం) జరిగిందో హృద్యంగా ఉంది.
కుల వివక్ష ప్రతినిధి అయి పీడిoచిన వ్యక్తిని అంతిమ సంస్కారంలో అయిన వాళ్లు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు రాలేదు. మహోన్నత మనసుతో పురుగులు పడ్డ శవాన్ని దళితులు ఎలా మోసారో తెలియజేసే జూపాక సుభద్ర కథ ‘‘అప్పు పడ్డది సుమీ’’ మానవత్వాన్ని చాటుతుంది.
ఆత్మవిశ్వాసం నింపాలి కానీ ఎవరైనా ఏదైనా అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయగలరనీ దేశ గురువు చెప్పిన బోధను ఆచరించి అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిన సామాన్యుడే అసామాన్యుడైన జయజీవితాన్ని డా. గాదె వెంకటేష్ కథ ‘దేశ గురువు’ బోధించిన తీరు సమయోచితంగా ఉంది.
చింతకింది శివశంకర్ ఇప్పుడిప్పుడే దళితకథకు ఆశలు నింపుతున్న యువకథకుడు ‘స్వాతంత్య్రం’ కథ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ కి ఎప్పుడు రావాలి, దళితులకు ఎప్పుడు రావాలి? ఆడవాళ్లకి ఎప్పుడు రావాలని ప్రశ్నిస్తుంది. మరో కథ ‘బొందల గడ్డ’ పల్లెటూరిలో ఉండే కుల వ్యవస్థలోని అధికారంపై, అత్యాచారాలపై తిరుగుబాటు చేస్తుంది.
వృత్తి చిత్రణ: చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకున్న నర్సింహా లందను పూజిస్తాడు. నమ్ముకున్న వృత్తి కడుపుకు నింపనప్పుడు తినవోతే తిండికి లేని పరిస్థితిని తెలిపిన సిస్టర్ అనసూయ కథ ‘కుంగిన పొద్దు’ తెలుపుతుంది. భార్య చివరాఖరి ఘడియల్లో వృత్తినొదులుతాడు. నాలుగురోడ్ల కూడలిలో అంబేడ్కర్ వద్దన్నందుకు దొరతల్లి సావుకు మాదిగలు దప్పులు కొట్టరు. తత్పలితంగా దొరతల్లి శవయాత్రలో యుద్ధంలో ఓడిన సైనికుని తీరు వెళ్తున్నాడనీ చిత్రించిన విధానాన్ని ‘ధూం తడాఖా’ కథలో పసునూరి రవీందర్. వీరే మరో కథ ‘జెజ్జెనక జెన్’ కథలో ‘డప్పు కొట్టెటోళ్ల, సబ్బండ కులాల రాత మార్చుట కొరకే నేనే మోగిస్తున్నా.. మోగిస్తున్న’ అని చెప్పడం నింపుతున్న ఆత్మవిశ్వాసమే. కథలలో డప్పును, డప్పు కేంద్రంగా కథలు ఎక్కువ రాసింది కూడా వీరే. బహుజన తాత్వికతతో ఉమ్మడి శత్రవుని ఎప్పటికైనా ఎదుర్కోవాలని బహుజనులని ఏకం చేసి పోరుబాటకు ప్రాణంపోసే జిలుకర శ్రీనివాస్ కథ ‘నర్సయ్య ధ్యానం’ బహుజన వాదానికి సిద్దాంతమే. ‘బైండ్ల సెంద్రయ్య’ కథల ద్వారా తిరుగుబాటును, దళితబహుజనులను కాపాడుకోవాలనే ఆరాటాన్ని చూస్తాము. దళితులను వలచి వచ్చిన ప్రేమలు, ధిక్కారాలు ఎన్నో ఆ కథలలో చిత్రించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇటుకకు రాయితో సమాధానం’ చెప్పినట్లు కథ నడపడం వీరి ప్రత్యేకత.
సంస్కృతి: దళితులకు విశిష్టమైన సంస్కృతీ సంప్రదాయం ఉంది. జోగినిగా మార్చినపుడు ఉన్న కుండను ‘జలిగె కుండ’ అని పిలుస్తారు. అదే పేరుతో డిజి హైమవతి కథ ప్రచురించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రచురించబడిన దళిత కథా సంపుటాలు:
1. అవుటాఫ్ కవరేజ్ ఏరియా (తొలి తెలంగాణ కేంద్రసాహిత్య యువ పురస్కారం) -డా. పసునూరి రవీందర్ (2014)
2. తప్ష కతలు 2016 (తె.వి.వి 2019కి ఉత్తమ గ్రంథ పురస్కారం) -డా. సిద్దెంకి యాదగిరి,
3. దగ్థం - భూతం ముత్యాలు (2017)
4. రాయక్క మాన్యమ్ -జూపాక సుభద్ర (2017)
5. జోలెవిలువ - డిజి హైమావతి (2018)
6. మమతల మల్లెలు(2018) -డా. తాళ్లపల్లి యాకమ్మ
7. అంబలి గంప -కెపి లక్ష్మీ నరసింహ(2019)
8.రక్షణ -డా. తాళ్లపల్లి యాకమ్మ(2020)
9. మాలపల్లి -భూతం ముత్యాలు (2020)
10. రిజర్వేషన్ భోగి -జూపాక సుభద్ర (2021)
11. దు:ఖ నది -డా. తాళ్లపల్లి యాకమ్మ (2022)
12. బైండ్ల సెంద్రయ్య కథలు- జిలుకర శ్రీనివాస్ (2022)
13. కండీషన్స్ అప్లయ్ -డా. పసునూరి రవీందర్ (2023)
14. మూడు గుడిసెల పల్లె- డా. సిద్దెంకి యాదగిరి (2023)
15. గాజులు కొనని రోజున - కెపి లక్ష్మీ నరసింహ (2025)
16. ఒట్టి చాపలు -డా. మండల స్వామి
(2025) గడ్డం మోహన్రావు కథా సంపుటి వెలువరించారు.
జంబూ సాహితీ ప్రచురణలో సంపాదకులుగా డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య సంపాదకత్వంలో దళిత కథావార్షిక ‘తొండం బొక్కెన’ 2020 దేశంలో తొలి దళిత కథావార్షికగా ప్రసిద్ధి కెక్కింది. చిందూనేల (2021), సాక (2022), కొమ్ము (2023) సంకలనాలుగా వెలువడ్డాయి. దళిత కథ (2024) ప్రచురణలో ఉంది. సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో తెలంగాణ దళిత కథలు బృహత్తర కథా సంకలనం(2021)లో వెలువడిoది.
తెలంగాణ కృషి: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటయ్యాక కథా సాహిత్యంపై వెలువరించిన సంకలనం ‘మూడు తరాల తెలంగాణ కథ’లో తెలంగాణ తొలి దళిత కథకులు భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టి మాదిగ’ కథకు, యువదళిత కథా రచయితలకు చాలామందికి స్థానం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ. దామోదరరావుల సంపాదకత్వంలో ఆంగ్లంలో ‘తెలంగాణ హార్వెష్ట్ తెలుగు షార్ట్స్ ఫిక్షన్’(1912-2011) (తొలితరం కథకులతో పాటు జాజుల గౌరి, జాతాశ్రీ, పసునూరి రవీందర్ల కథలున్నాయి. తెలంగాణ తొలి కేంద్రసాహిత్య యువపురస్కారం డా. పసునూరి రవీందర్ ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ 2015 కథలకు వరించడం దళితకథకు దక్కిన ఆత్మగౌరవమే. కేంద్ర సాహిత్య యువపురస్కారం పొందిన తొలి తెలుగు నవల, మాదిగ ఉపకులాల తొలి నవల డా. గడ్డం మోహన్ రావు ‘కొంగవాలు కత్తి’కి 2016లో కేంద్ర సాహిత్య యువపురస్కారం లభించడం దళిత సాహిత్యానికి గర్వకారణం. సిద్దెంకి యాదగిరి ‘తప్ష’ కతల సంపుటికి 2019 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారం వరించింది.
తెలంగాణ దళిత కథ ఆధునిక కులస్వభావాన్ని, వివక్షల తీరుతెన్నులను చిత్రించింది. ఆకాశంలో సగమైన అబలలు ఆత్మగౌరవాన్ని ప్రకటించింది. కొడితే పరిష్కారం అవుతుందనుకున్నపుడు భర్తను అంతపనిచేసిన స్త్రీలు తగిన గుణపాఠం చెప్పారు. విద్యాభ్యాసంలో సావిత్రిభాయి ఫూలే, అంబేడ్కర్లే ఆదర్శంగా విద్యనభ్యసించారు. అధిక కథలు చదువుకు విలువ ఇవ్వడం ద్వారా గొప్ప స్ఫూర్తిని నింపారు. ప్రతి ఉద్యమం సమానత్వం తెస్తుందని నమ్మికతో భాగస్వాములయ్యారు. దళితులు లేనిది ఏ ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ హక్కులు కల్పించిన ఓటును ఎన్నికలు ఎంతగా మోసం చేయబడుతున్నాయో గల్లినుంచి ఢల్లీిదాక దళితకథ స్వభావోక్తంగా విశ్లేషించింది. పరిష్కార మార్గాలు కూడా చూపింది. తరతరాల అంటరానితనం కరోనా కాలాన్ని కూడా సామాజిక కోణంలో సృశించింది. రకరకాల ప్రేమలు, మోసాలని పసిగట్టి, పరువు హత్యలను, నిజాలను నిగ్గుదీసింది. ఈసడిరచుకున్న ఉమ్మడి శత్రువును ఢీకొట్టడానికి బహుజనవాదానికి బాటలు వేసింది. వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రాయక్క మాన్యమ్లో రాయక్కలా, బైండ్ల సెంద్రయ్య ఉపదేశంని, తీర్పులను విన్నాయి. ఉపకులాలను తనలో ఇముడ్చుకొని ఐక్యతకు మారుపేరుగా నిలిచింది. వివిధ ఉద్యమాలను ఆవాహన చేసకొని ముందుకు సాగింది. అధికార ముద్రికల అక్రమాలపై న్యాయాన్ని గురిపెట్టాయి. ఎన్నో విశిష్టతలు కల దళితకథకు ఇంకా సముచిత స్థానం దక్కాల్సి ఉంది. వివిధ కోణాలలో పరిశోధించాలి. సామాజిక మార్పుకు దళితకథనే ఔషధంలా పనిచేస్తుంది. భవిష్యత్తును గమనించిన విదేశి విద్యాలయాలు ఇస్తున్న ప్రోత్సాహాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. తెలంగాణ దళిత కథ మూడు పూవులు ఆరు కాయలుగా విలసిల్లుతున్నప్పటికీ ప్రతీ విశ్వవిద్యాలయం, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు మరింత సహకారం అందించాలి. ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి దళిత సాహిత్యానికి పాటుపడాలి. దళిత కథలపై సంపూర్ణ పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంది. వినూత్నమై అంశాలు వెలికి తీసి భవిష్యదర్శనం చేయాల్సిన అవసరమూ ఉంది.
- డా. సిద్దెంకి యాదగిరి
sygiri773@gmail.com