సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

23, నవంబర్ 2023, గురువారం

VII.10. సీత ఇష్టాలు



 1.పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.చిత్రంలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇది బుర్రకథ చెబుతున్న దృశ్యం. మధ్యలో ఉన్నవారిని కథకుడు అనీ, అటూఇటూ ఉన్నవారిని వంతలు అని పిలుస్తారు.
 2.వారు ఏం చేస్తున్నారు?
జవాబు.వారిలో మధ్యలో ఉన్నవాడు అడుగులు కదిలిస్తూ అభినయిస్తూ బుర్రకథ చెబుతున్నాడు. అటూఇటూ ఉన్న వంతలు అతడిని అనుసరిస్తూ వంత పాడుతున్నారు.
ప్రశ్న 3.
ఇట్లాంటి ప్రదర్శనను మీరు ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు.ఇలాంటి ప్రదర్శనను ఒకసారి మా స్నేహితుని బడిలో వాళ్ళ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శిస్తుంటే చూశాను. నాన్న నడిగితే దీనిని బుర్రకథ అంటారని, ఇది మన ప్రాచీన జానపద కళల్లో ముఖ్యమైనదని చెప్పాడు.

పాఠం ఉద్దేశం:

ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీవిద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాలపట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, “బుర్రకథ”వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం “బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంతపాడేవాళ్ళు ఉంటారు. వచన గేయరూపంలో కథను చెపుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు.

ప్రవేశిక: 
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి, విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడటానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికీ ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని, ముందడుగువేస్తారు. అట్లాంటి ఒక సీతకథను పాఠం చదివి తెలుసుకుందాం


ఆలోచించండి – చెప్పండి ( Page No.95)
1.“కొత్త వింత-పాత రోత” సామెత ఏఏ సందర్భాలలో వాడుతారు?
జవాబు.కొత్త విషయాలు ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. కొత్తవి కనబడగానే అప్పటిదాకా వాడుతున్న పాతవాటిని వదిలేస్తాం. కొత్త డిజైన్లతో దుస్తులు రాగానే పాతవి వదిలేస్తాం. నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇలాంటివన్నీ కొత్తవి బాగున్నాయని పాతరోల్ అనీ మార్చేస్తాం. ఇలా ఎన్నో సందర్భాలలో కొత్తవింత పాతరోత అనే సామెత వాడుతాం.


2.ఆ ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలేమిటి? మిత్రులతో చర్చించండి.
జవాబు.1) మూఢ నమ్మకాలు
2) ఆడపిల్లమీద పెట్టే ఖర్చు వృథా అనే దురభిప్రాయం
3) ఆడపిల్లలకు అయ్యే ఖర్చు ఎక్కువ అనే అభిప్రాయం కారణాలు.

ఆలోచించండి – చెప్పండి ( Page No.98)
 1. ఈ ఆడపిల్లలు ఇంటివద్ద ఏయే పనులు చేస్తూ తమ ఇష్టాలు కోల్పోతున్నారు? చర్చించండి.
జవాబు.సాటి పిల్లలతో ఆడుకోవాలనే కోరిక, బాగా చదువుకోవాలనే కోరిక, విహారయాత్రలకు వెళ్ళాలనే కోరిక కోల్పోతుంది. + సీతను
2.దాచిన తల్లి మనసు ఎటువంటిది? దీనిపై మాట్లాడండి.
జవాబు.శ్రావణి టీచర్ ఊళ్ళోకి రాగానే బడి ఈడు పిల్లలను వెతుకుతూ ఊళ్ళోకి బయలుదేరింది. సీత యింటికి రాగానే సీతను తల్లి లోపల దాచిపెట్టింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. పిల్లలను బడికి పంపిస్తే తను ఇబ్బంది పడాలి. తరువాత పుట్టిన పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరు అని తల్లి భయపడింది. అందుకే సీతను దాచింది.
3.స్త్రీ గొప్పదనమేమిటి?
జవాబు.మానవజన్మలో ఆడజన్మ చాలా గొప్పది. ఎందుకంటే స్త్రీకి ఓర్పు ఎక్కువ. అందరితో స్నేహంగా ఉంటుంది. అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అంత గొప్పతనమున్న ఆడపిల్లను చక్కగా పెంచితే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందుతాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.101)
1.టీచర్ ఆదర్శ మహిళల గురించి సీత తల్లికి ఎందుకు చెప్పి ఉంటుంది?
జవాబు.బడికి పంపాల్సి వస్తుందని సీత తల్లి సీతను దాచిపెట్టి ఇంట్లో ఎవరూ లేరని అబద్ధం చెప్పింది. శ్రావణి టీచర్కు అర్థమయింది. సీత తల్లి అవసరం కోసం అలా చేసిందే కాని ఆమె చెడ్డది కాదని టీచర్ గ్రహించింది. అందుకే ఆదర్శ మహిళల గురించి చెప్పింది. అది వింటే తప్పకుండా తల్లి మనసు మారుతుందని టీచర్ అభిప్రాయం.


ప్రశ్న 2.
చదువుకున్నవాళ్ళు ఎట్లా ఆలోచించాలని సీత ఇష్టాల ద్వారా తెలుసుకున్నారు?
జవాబు.
సీత ఇష్టాలు పాఠం ద్వారా చదువుకున్న వారి ఆలోచనలు ఎలా ఉండాలో మనకు కింది విధంగా తెలుస్తుంది. ఆడపిల్లలను చిన్నచూపు చూడకూడదు. అన్నింటిలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. చదువుల్లోనూ పదవుల్లోనూ కూడా ఆడపిల్లలు మగవారితో సమానమే. వాళ్ళలోని ప్రతిభను అందరూ గౌరవించాలి.
 3.సీత ఇష్టాలు తెలుసుకున్నారు కదా! సీతవలె అమ్మాయిలు ఎట్లాంటి ఇష్టాలు కలిగి ఉండాలి?
జవాబు.
అమ్మాయిలందరూ ఈ రోజులలో పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలనీ కోరుకోవాలి. సాంకేతిక విద్యలపైన వైద్య విద్యలపైన మక్కువ చూపించాలి. మగవారితో సమంగా ఎటువంటి ఉద్యోగమైనా చెయ్యగలగాలి. అంతరిక్షంలోనూ, సముద్రంలోనూ, నేలపైనా కూడా ముందుకు దూసుకు వెళ్ళాలి. ఇలాంటి ఇష్టాలు కలిగి ఉండాలి.

ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు ? కారణాలు చెప్పండి.
జవాబు.ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. పురాణాల్లో మైత్రి గార్గి వంటి పండితులున్నారు. చరిత్రలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు, మాంచాల, చానమ్మ వంటి వీరపత్నులు, ఆధునిక కాలంలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ వంటి స్వరాజ్య సమర యోధులూ ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో అంతరిక్షం నుంచి జలాంతర సీమల వరకూ ప్రతి పనినీ చేయగల సమర్థులైన మహిళలు, క్రీడా రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే.

2. శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు.శ్రావణి టీచర్ వంటి వారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెబుతారు. ముఖ్యంగా మా తెలుగు ఉపాధ్యాయులు సమాజసేవ గురించి, మానవతా విలువల గురించి, క్రమశిక్షణ గురించి పదేపదే చెబుతారు. బడికి రాని పిల్లల తల్లిదండ్రులకు నచ్చ జెప్పి పిల్లలు బడికి వచ్చేలా చేస్తారు.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. ‘కొత్త వింత – పాత రోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి ?
జవాబు.“పాతంటే రోతగా ఉందా ?” “పాతలేందే కొత్తెక్కడుంది ?” “కొత్త కొత్త అంటున్నారు, కొత్త చెత్తంతా పాతలోంచే కదా వచ్చింది” “పాతంటే రోతని నేనన్నానా ?” మొదలైన వాక్యాలు “కొత్త వింత పాత రోత’ అనే అర్థాన్నిస్తాయి.

2. పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు.రాజు – రోజా పోట్లాడుకుంటూ అనే మాటలు నాకెంతో నవ్వు తెప్పించాయి. తిక్క సన్నాసీ అని పిలవడం, కొత్త చెత్త పాతలోంచే వచ్చింది అనడం, కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అరుస్తున్నావనడం, రాజు ఒకటో తరగతిలో ఉండగానే పెద్ద లెటర్స్ 26 చదివానని అనడం, అవేంటని అడిగితే ABCD అని చెప్పడం ఇవన్నీ ఈ పాఠంలో ఎంతో నవ్వు పుట్టించిన అంశాలు.

3. కింది పేరా చదివి క్రింది పట్టికను పూరించండి.
1940 ప్రాంతంలో తెలంగాణాలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది. వితంతువులకోసం వసతిగృహాలు ఏర్పాటు చేసింది. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి మొదలయిన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషి చేశారు. అఘోరనాథ చటోపాధ్యాయగారి భార్య వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికలకోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజనీనాయుడు గారి తల్లి.

జవాబు.

సంఘ సంస్కర్తలు రచయిత్రులు సంస్థలు
సుమిత్రాదేవి రత్నదేశాయి లేడీ హైదరీల క్లబ్
ఈశ్వరీబాయి సోదరీ సమాజం
సంగెం లక్ష్మీబాయి ఆంధ్ర యువతీమండలి
ఆంధ్ర మహాసభ

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధికోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు.శ్రావణి టీచర్ రామాపురం అనే గ్రామంలో బడిలో టీచర్ గా చేరింది. ఆమె పిల్లల అభివృద్ధికోసం పాటుపడేది. బడిలో పిల్లలకు పాఠాలు నేర్పడమే కాకుండా మంచి మంచి కథలు చెప్పడం, ఆటలాడించడం, పాటలు పాడించడం, మంచి సూక్తులు వినిపించడం వంటివి చేశారు. పిల్లలను తన సొంత బిడ్డలలాగా చూసుకున్నారు. బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను బడిలో చేర్పించారు.

ఆ. ‘బుర్రకథ’ ప్రదర్శన విధానం గురించి రాయండి.
జవాబు.బుర్రకథ మన ప్రాచీన జానపద కళారూపాలలో ఒకటి. ముఖ్యమైనది కూడా. ఇందులో ఒక ప్రధాన కథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. చారిత్రక విషయాలు గాని, జానపద విశేషాలు గాని వీరుల చరిత్రలు గాని ఇతివృత్తంగా పాటల రూపంలో సాగుతుంది బుర్రకథ. ఎక్కడికక్కడ గతిమారుతూ వేరు వేరు ఊత పదాలతో కథ సాగుతుంది. భళా భళి, సై, తందాన తాన వంటి ఊతపదాలుంటాయి. చిన్న చిన్న అడుగులు లయబద్ధంగా వేస్తూ అభినయం చేస్తూ సొంతంగా పాటపాడుతూ తంబుర మీటుతూ చిరుతలతో తాళం వేస్తూ బుర్రకథ చెప్పడానికి గొప్ప ప్రతిభ కావాలి.

ఇ. పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఆడపిల్లల పరిస్థితులను గురించి రాయండి.
జవాబు.ఆడపిల్లలు పుట్టారంటేనే బాధపడే రోజులవి. ఐనా పూట గడవని స్థితిలో ఉన్న పేదలు ఆడపిలను కూడా పనిలోకి పంపుతున్నారు. లేదా పెద్దవాళ్ళు పనికి పోతూ చిన్న పిల్లల బాధ్యత ఆడపిల్లలకు అప్పగిస్తున్నారు. ఆ కొంచెం ఆధారం పోతుందేమోనని వాళ్ళను దాచేసి, టీచర్లు పిలవడానికి వచ్చినా పంపడం లేదు. ఇలా ఆడపిల్లలను చదివించకపోవడం వల్ల వాళ్ల ఉజ్జ్వల భవిష్యత్తును మసి చేస్తున్నారు.

ఈ. “పెద్దలు పనికి – పిల్లలు బడికి” అనే నినాదాన్ని గురించి రాయండి.
జవాబు.పెద్దలు తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను పనిలోకి తీసుకుపోకూడదు. పిల్లలచేత పనిచేయించడం నేరం. అలా పని చేయిస్తే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు. పెద్దలు పనిలోకి వెళుతూ పిల్లలను బడికి పంపించాలి. ప్రభుత్వం ఉచితంగా చదువుచెప్తూ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా కల్పించింది. అలాంటప్పుడు పిల్లలను తామేమీ భరించక్కరలేదుగనుక చక్కగా బడికి పంపించాలి అని తెలియజేస్తుంది. ఈ ‘పెద్దలు పనికి పిల్లలు బడికి’ అనే నినాదం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో సమాధానం రాయండి.
అ. “సీత ఇష్టాలు” కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.రామాపురం అనే పల్లెటూళ్ళో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతుల కూతురు సీత. సీతకొక తమ్ముడు, ఒక చెల్లెలు. శివయ్య, గౌరమ్మ పనికిపోతూ సీతకు చిన్నపిల్లల బాధ్యత అప్పగించారు. అందుకే సీత బడికెళ్ళి చదువుకోలేక పోయింది. వాళ్ళ ఊరికి శ్రావణి అనే టీచరు వచ్చి సీతను బడికి పంపమని తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. వాళ్లు ఒప్పుకొని సీతను బడికి పంపారు. సీత చక్కగా చదువుకొని అన్నిటా మొదటి స్థానం సాధించింది. పక్క ఊరికి పోయి పై చదువులు చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించింది. మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. పిల్లల చదువుకోసం, స్త్రీలకు మేలుచేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది.

IV. సృజనాత్మకత/ప్రశంస
1. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే “నినాదాలు” రాయండి.
జవాబు.ఎన్నో జన్మల పుణ్యఫలం – ఆడపిల్లే శ్రేష్ఠం
ఆడవాళ్ళంటే ఓర్పు – ప్రతిపనిలో వారిదే నేర్పు
ఆడపిల్ల ఉన్న ఇల్లు – ఆనందాల హరివిల్లు
ఆడపిల్ల తక్కువ కాదు – మగపిల్లవాడు ఎక్కువ కాదు.
ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడండి. – సమాజాన్ని ముందుకు నడపండి.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాలను చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.
అ. మండలంలో అభివృద్ధిపనులు నిర్వహించే అధికారి = మండలాధికారి
ఆ. నాయకత్వం వహించేవారు = నాయకులు
ఇ. ఉపన్యాసం ఇచ్చేవారు -.వక్తలు
ఈ. హరికథ చెప్పేవారు - హరికథకులు
ఉ. శిక్షణను ఇచ్చేవారు-శిక్షకులు

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలలో సమాపక, అసమాపక క్రియాభేదాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక క్రియలు రాయండి.

అ. వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి అసమాపక క్రియలు
తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు – సమాపక క్రియలు
జవాబు.
ఆడి, పాడి, విని, చేసి, వండి, వడ్డించి, నడిచి, పరుగెత్తి, నిద్రించి, మేలుకొని

సమాపక, అసమాపక క్రియలను ఉపయోగించి వాక్యాలు రాయండి.

సమాపక క్రియతో వాక్యాలు అసమాపక క్రియతో వాక్యాలు
1. పాప చాక్లెట్ తిన్నది. 1. పిల్లలు బడికి వెళ్ళి, చదువుకుంటారు.
2. జ్యోతి నాట్యం చేసింది. 2. పోస్టుమాన్ వచ్చి, ఉత్తరం ఇచ్చాడు.
3. అత్త నాకోసం స్వెటర్ అల్లింది. 3. అమ్మ దారం తెంపి, పూలు కట్టింది.
4. జానకి కూరలు తెచ్చింది. 4. నాన్న అన్నం తిని, ఆఫీసుకెళ్ళారు.
5. రామారావు పద్యాలు రాశాడు. 5. తాడును చూసి, పాము అనుకున్నాను.
2. ఈ కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విధ్యర్థక వాక్యాలను గుర్తించండి. తగిన విరామ చిహ్నాలను ఉంచండి.

అ. దెబ్బ ఎట్లా తగిలింది.
ఆ. అమ్మో ఎంత పెద్ద పామో
ఇ. తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి.
ఈ. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో
ఉ. పండుగ నాటికి గుడిని అలంకరించండి.
ఊ. మీది ఏ ఊరు

ఆశ్చర్యార్థక వాక్యాలు : ఆ) అమ్మో! ఎంతపెద్ద పామో! ఈ) నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో !
ప్రశ్నార్థక వాక్యాలు : అ) దెబ్బ ఎట్లా తగిలింది ? ఊ) మీది ఏ ఊరు ?
విధ్యర్థక వాక్యాలు: ఇ) తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి. ఉ) పండుగ నాటికి గుడిని అలంకరించండి.

ప్రాజెక్టు పని: 

మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, మీకు నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి. జవాబు. మా ప్రాంతంలో సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము మొదలైన కళారూపాలు నేర్పుతారు. కొన్ని ప్రదర్శనలు కూడా జరుగుతాయి. వాటిలో నాకు నచ్చిన కళారూపం నాట్యం, ఇందులో సాహిత్యం, సంగీతం, నృత్యం అనే మూడు సమాన ప్రాధాన్యం కలిగి ఉండి వినడానికి చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇందులో ఆహార్యం ఆకర్షణీయంగా ఉంటుంది.

ప్రశ్న 1.
సీతకథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. అటువంటివాళ్ళను గురించి చర్చించండి
జవాబు.
సీత కథ విన్న తరువాత మొదట్లో జాలి కలిగినా తరువాత ఆమె సాధించిన విజయాలకు ఎంతో ఆనందం కలిగింది. “ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్”. అన్నట్లు ఆడపిల్లలని చులకన చేయకుండా సీత లాంటి వాళ్ళను చదివిస్తే వారికీ, వారి కుటుంబానికే గాక దేశానికి మంచి పేరు తేగలరు అనిపించింది.

 2.‘సీత’ లాంటివాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.మన దేశంలో సీతలాంటి వాళ్ళెందరో ఉన్నారు. ఎందుకంటే మన దేశంలోని బడుగువర్గాల వారందరూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే గాని రోజు గడవని పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపించకుండా చిన్న పిల్లల సంరక్షణను కొంచెం ఎదిగిన పిల్లలకు అప్పగించడం, ఎదిగిన పిల్లల్ని పనిలోకి పంపించడం సర్వసాధారణం. దీనివల్ల ఎంతో మంది సీతలు చదువుకొనే భాగ్యం కోల్పోతున్నారు.
3.“ఆలస్యం అమృతం విషం” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు.
ఆలస్యం = ఆలస్యం చేస్తే, అమృతం = అమృతము కూడా, విషం = విషంగా మారిపోతుంది. ఏ పని ఎప్పుడు చెయ్యాలనుకున్నామో ఆ సమయానికి చేసెయ్యాలి. అలా చెయ్యకపోతే పని అనుకున్నట్లు జరగక పోవడం కష్ట నష్టాలు వాటిల్లడం జరుగుతుంది. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. మన పాఠంలో ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుందామా మూడవబిడ్డ కోసం చూద్దామా అని ఆలోచించే లోపలే ఆలస్యం అయిపోయి మూడవ బిడ్డ పుట్టింది.

 4.మీరు చదువుకొని ఏం కావాలనుకొంటున్నారు ? ఎందుకు ?
జవాబు.నేను చదువుకొని టీచర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డాక్టరునైనా, ఇంజనీరునైనా, శాస్త్రజ్ఞుణ్ణనా, మరే ఉన్నతాధికారినైనా తయారుచేసేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తే సమాజానికి చక్కని పౌరులనందించి దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తాము నేర్చుకున్నది ఇతరులకు అందిస్తారు. అందుకే నాకు ఉపాధ్యాయుణ్ణి కావాలని ఉంది.

5.ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి
జవాబు.మన సమాజంలో మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ అనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానులే. మగపిల్లల కంటే బాగానే ఆడపిల్లలు చదవగలరు. అన్ని పనులు సమర్థవంతంగా నెరవేర్చగలరు. ఏ ఉద్యోగంలోనైనా రాణించగలరు. రాజ్యాలైనా ఏలగలరు. ఆడపిల్లలకు ఓర్పు, ఇతరులపట్ల స్నేహభావం, ప్రేమ ఎక్కువ. ఏ విషయంలోనూ ఆడపిల్లలు మగ పిల్లలకు తీసిపోరు. కనుక ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ సమానమే.
 6.బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు.బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోపక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తూ కథ చెబుతాడు. వంతలు దక్కీలు వాయిస్తూ తందానతాన, సైసై అంటుంటారు. బుర్రకథలో మొదట కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు. జానపద కళల్లో బుర్రకథకు ప్రముఖ స్థానం ఉంది. సమాజంలోని సమస్యలను చెప్పి ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహించింది.
7.సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు.నాకు బాగా చదువుకోవడమంటే ఇష్టం. వార్తాపత్రికలలో వచ్చే పజిల్స్ పూర్తి చేయడమంటే ఇష్టం. బొమ్మల కథల పుస్తకాలు బాగా ఇష్టపడతాను. తల్లిదండ్రులకు సహాయపడుతూ నానమ్మ తాతయ్యకు కబుర్లు చెబుతూ సంతోషపెట్టడం ఇష్టం. బాగా చదువుకొని టీచర్నై మా టీచర్ గా ఆదర్శంగా నిలబడి సమాజాన్ని తీర్చిదిద్దడం విద్యార్థులను మంచి పౌరులుగా తయారుచెయ్యటం ఇష్టం. అందరితో స్నేహంగా ఉంటూ సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. ఆటలాడడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం, బొమ్మలు తయారు చేయడం కూడా ఇష్టమే.

అర్థాలు

దంపతులు = భార్యాభర్తలు / ఆలుమగలు
పైడి = బంగారము
బీజము = విత్తనము
మేలు = మంచి / ఉపకారము
శ్రీలు = సంపదలు
సంగ్రామము = యుద్ధము
సమరము = యుద్ధము
పర్యాయపదాలు

దంపతులు – భార్యాభర్తలు / ఆలుమగలు
ఇష్టము = వాంఛ,కోరిక
సంగతి = విషయము, సమాచారము
మేలు = మంచి, శుభము
పైడి = పుత్తడి, బంగారము
వ్యతిరేక పదాలు

కొత్త × పాత
చైతన్యము × జడత్వము
తొలి × చివరి
జయము × అపజయము, పరాజయము
ఉత్తముడు × అధముడు
మంచివాడు × చెడ్డవాడు
కష్టము × సుఖము
ఇష్టము × అనిష్టము
ముందు × వెనుక / తర్వాత
బలము × దుర్బలం / బలహీనము

ప్రకృతులు – వికృతులు
రూపము – రూపు
కథ – కత, కద
ప్రయాణము – పయనము, పైనము
రత్నము – రతనము
కష్టము – కస్తి,కసటు
భారము – బారకము
శాస్త్రము – చట్టము
స్వతంత్రము – సొంతము
భరము – బరువు
సూక్తులు – సుద్దులు
పుణ్యము – పున్నెము, పున్నియము
రాజు – రాయలు
రాట్టు – ఱేడు
అక్షరము – అక్కరము, అచ్చము
విజ్ఞానము – విన్నాణము, విన్ననువు
సంధులు

దినోత్సవము – దిన + ఉత్సవము – గుణ సంధి
విద్యార్థిని – విద్యా + అర్థిని – సవర్ణదీర్ఘ సంధి
కొత్తెక్కడ – కొత్త + ఎక్కడ – అత్వ సంధి
చెత్తంతా – చెత్త + అంత – అత్వ సంధి
వద్దని – వద్దు + అని – ఉత్వ సంధి
కొత్తవని – కొత్త + అని – ఇత్వ సంధి
తగవులాడు – తగవులు + ఆడు – ఉత్వ సంధి
తమ్ముడన్నట్లు – తమ్ముడు + అన్నట్లు – ఉత్వ సంధి
దంపతులున్నారు – దంపతులు + ఉన్నారు – ఉత్వ సంధి
ఎక్కువాయె – ఎక్కువ + ఆయె – అత్వ సంధి
అంకితమై – అంకితము + ఐ – ఉత్వ సంధి
వాళ్ళెందుకు – వాళ్ళు + ఎందుకు – ఉత్వ సంధి
అనుకున్నంత – అనుకున్న + అంత – అత్వ సంధి
సాధ్యమవుతుంది – సాధ్యము + అవుతుంది
ఈడున్న – ఈడు + ఉన్న – ఉత్వ సంధి
ఒక్కొక్క – ఒక్క + ఒక్క – ఆమ్రేడిత సంధి
వాళ్ళింటికి – వాళ్ళ + ఇంటికి – అత్వ సంధి
అభ్యున్నతి – అభి + ఉన్నతి – యణాదేశ సంధి
మాటలన్ని + మాటలు + అన్ని – ఉత్వ సంధి
ప్రభావితులైన – ప్రభావితులు + ఐన – ఉత్వ సంధి
చిన్నక్క – చిన్న + అక్క – అత్వ సంధ
ప్రధానోపాధ్యాయులు – ప్రధాన + ఉపాధ్యాయులు – గుణ సంధి
చేయాలని – చేయాలి + అని – ఇత్వ సంధి
ఎంపికయింది – ఎంపిక + అయింది – అత్వ సంధి
చక్కనమ్మ – చక్కని + అమ్మ – ఇత్వ సంధి
సీతమ్మ – సీత + అమ్మ – అత్వ సంధి
జరిగిందక్కా – జరిగింది + అక్కా – ఇత్వ సంధి
సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
1. పుణ్య ఫలము పుణ్యము యొక్క ఫలము షష్ఠీ తత్పురుష సమాసము
2. మానవ జన్మ మానవుల యొక్క జన్మ షష్ఠీ తత్పురుష సమాసము
3. నలుగురు గొప్పవాళ్ళు నలుగురు సంఖ్య గల గొప్పవాళ్ళు ద్విగు సమాసము
4. స్వరాజ్య సమరము స్వరాజ్యము కొరకు సమరము చతుర్థీ తత్పురుష సమాసము
5. మహిళల మార్గము మహిళల యొక్క మార్గము షష్ఠీ తత్పురుష సమాసము
6. పదహారేళ్ళు పదహారు సంఖ్యగల ఏళ్ళు ద్విగు సమాసము
7. ఇంటిపనులు ఇందలి పనులు సప్తమీ తత్పురుష సమాసము
8. చదువుల తల్లి చదువులకు తల్లి షష్ఠీ తత్పురుష సమాసము
9. నాలుగురాళ్ళు నాలుగు సంఖ్య గల రాళ్ళు ద్విగు సమాసము
10. శత్రువినాశము తల్లియు, తండ్రియు ద్వంద్వ సమాసము
11. రామకథ శత్రువుల యొక్క వినాశము షష్ఠీ తత్పురుష సమాసము
 

1. అ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజాచైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పే వారిని “కథకుడు” అనీ, ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.

ప్రశ్నలు:

1. బుర్రకథ ఎటువంటి కళారూపం ?
జవాబు.జానపద కళారూపం

2. బుర్రకథలో ఎన్ని పాత్రలు ఉంటాయి ?
జవాబు.
మూడు పాత్రలుంటాయి.
3. కథ చెప్పేవారిని ఏమంటారు ?
జవాబు.ప్రధాన కథకుడు
4. ప్రక్కలనున్నవారిని ఏమంటారు ?
జవాబు.వంతలు
5. బుర్రకథ చెప్పిన వారి పేరేమిటి ?
జవాబు.కృష్ణవేణి

ఆ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
పరమానందయ్యగారు శిష్యులను తన వద్దనే ఉంచుకొని చదివిస్తారు. వారిమీద ఆయనకు ఎంతో అభిమానం. శిష్యులకు గురువు అంటే ఎంతో గౌరవం, చనువు. వారి మధ్య సంబంధం తండ్రీబిడ్డల సంబంధం కంటె గొప్పది. ఆయన వారి తప్పులను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు.

ప్రశ్నలు:
1. ఈ పేరాలో గురువుగారి పేరేమిటి ?
జవాబు.పరమానందయ్య
2. గురు శిష్యుల బంధాన్ని ఏ బంధంతో పోల్చారు ?
జవాబు.తండ్రీబిడ్డల బంధంతో
3. గురువు శిష్యులను ఎలా చూసేవారు ?
జవాబు.ఎంతో అభిమానంగా
4. శిష్యులకు గురువుపై ఎటువంటి భావం ఉండేది ?
జవాబు.గౌరవం, చనువు
5. శిష్యులు ఎక్కడ ఉండేవారు ?
జవాబు.గురువుగారి దగ్గర
2. కింది వాక్యాలను సరైన వరుసలో పేరాగా రాయండి.
1. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు.
2. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత.
3. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు.
4. శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల.
5. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి పుట్టాడు.
జవాబు.శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి
పుట్టాడు.

3. ఈ క్రింది పేరాలు చదివి వాటికి ఐదేసి ప్రశ్నలు రాయండి.
అ. అంగవైకల్యం తప్పుకాదు. అది ఆయాపరిస్థితులలో వెనుకపడడమే. వారికి చేయూతనిచ్చి పైకి తీసుకురావలసిన బాధ్యత మనందరిదీ. ఒక చల్లని మాట, ప్రేమతో కూడిన చల్లని స్పర్శ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే మన చేతనైనంతలో వారిలో ధైర్యాన్ని నింపుదాం.

1. అంగవైకల్యం అంటే ఏమిటి?
2. ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది?
3. మనం వారిలో ఏం కలిగించాలి?
4. మన బాధ్యత ఏమిటి?
5. ఈ పేరాకు శీర్షిక రాయండి.

ఆ. ఉత్తానపాద మహారాజు పెద్ద భార్య సురుచి, చిన్న భార్య వినీత. పెద్ద భార్య కుమారుడు ధ్రువుడు. రాజు చిన్న భార్యను, ఆమె కుమారుడు ఉత్తముడిని ఎక్కువ ప్రేమించేవాడు. పక్షపాతం కలిగి ఉండేవాడు. సురుచిని, ధ్రువుని అవమానించేవాడు. అందుకే ధ్రువుడు శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేశాడు.
1. రాజుకు ఎంతమంది భార్యలు ?
2. ఉత్తముడు ఎవరి కుమారుడు ?
3. రాజుకు ఎవరియందు పక్షపాతం ?
4. ధ్రువుని తల్లి ఎవరు ?
5. ధ్రువుడు ఎవరిని గురించి తపస్సు చేశాడు ?

4. క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.
అ. కొత్త నీరొచ్చి ……………………….. నీటిని కొట్టేసింది.
జవాబు.కొత్త × పాత
ఆ. పట్టణాల కంటె ……………………….. అందంగా ఉంటాయి.
జవాబు.పట్టణాలు × పల్లెలు / పల్లెటూళ్ళు
5. ప్రకృతి వికృతులను మార్చి రాయండి.
అ. మీరు కథలు చెప్పుకోడమేనా ? నాక్కూడా ……………………….. చెబుతారా ?
జవాబు.కథలు (ప్ర) – కతలు (వి)
ఆ. నాన్న పుస్తకంలో ఎన్నో సూక్తులు చదివి, ఆ ……………………….. అన్నీ నాకు చెబుతారు.
జవాబు.సూక్తులు (ప్ర) – సుద్దులు (వి)
6. గీతగీసిన పదానికి అదే అర్థం ఇచ్చే పదం ఖాళీలో రాయండి.
అ. ఉత్తములు కార్యసాధకులు. ఆ ……………………….. మనకు ఆదర్శం.
జవాబు.ఉత్తములు = గొప్పవాళ్లు
ఆ. సంఘానికి సేవచేసిన సంస్కర్తలను చూసి నేను కూడా ……………………….. సేవ చేయాలనుకున్నాను.
జవాబు.సంఘానికి = సమాజానికి
7. సమాసాల పేర్లు రాయండి.
అ. పూటగడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయె.
జవాబు.తల్లిదండ్రులు = తల్లియు, తండ్రియు – ద్వంద్వ సమాసము
ఆ. అక్షరమాల లోని అక్షరాల సంఖ్య ఎంత ?
జవాబు.అక్షరమాల = అక్షరముల యొక్క మాల – షష్ఠీ తత్పురుష సమాసము
8. సంధులు గుర్తించండి.
అ. అమ్మా నేను ఎక్కాలన్నీ చదివాను.
జవాబు.
ఎక్కాలు + అన్నీ = ఉత్వసంధి
ఆ. తల్లిదండ్రులు పిల్లల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తారు.
జవాబు.అభి + ఉన్నతి = యణాదేశ సంధి
ఇ. రమ తెలివితేటలకు ప్రధానోపాధ్యాయుడు ముగ్ధుడైనాడు.
జవాబు.
ప్రధాన + ఉపాధ్యాయుడు = గుణసంధి
9. గీత గీసిన పదాల ఆధారంగా వ్యతిరేక వాక్యాలు రాయండి.
అ. నీవు చెప్పినది కొంతవరకే అర్థమయింది.
జవాబు.
అర్థమయింది × అర్థం కాలేదు
నీవు చెప్పినది పూర్తిగా అర్థం కాలేదు.
ఆ. ఇవాళ నాతో సినిమాకు వస్తావా ?
జవాబు.
వస్తావా × రావా
ఇవాళ నాతో సినిమాకు వస్తావా ? రావా ?


VII. 11. శ్రీలుపొంగిన జీవగడ్డ


11. శ్రీలు పొంగిన జీవగడ్డ

పాఠం ఉద్దేశం:

భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశగౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇతి మాత్రా ఛందస్సులో, అంత్యప్రాసలతో, రాగయుక్తంగా, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించాడు.

కవి పరిచయం:
పేరు: రాయప్రోలు సుబ్బారావు 
జన్మస్థలం : గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. 

రచనలు: తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

ప్రవేశిక

భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాఙ్మయం ఉపనిషత్తులు సమాజానికి దివ్యమార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్యరీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మనదేశపు ఘనత ఎంత విశిష్టమైనవో ఈ పాఠం
ద్వారా తెలుసుకుందాం!

చదవండి – ఆలోచించండి – మాట్లాడండి

ప్రశ్నలు:
1.పై వాక్యాలు దేని గురించి చెప్తున్నాయి?
జవాబు.పై వాక్యాలు దేశం యొక్క గొప్పదనం గూర్చి చెప్తున్నాయి.
2.దేశంపట్ల ఎటువంటి భావనతో ఉండాలి?
జవాబు.మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ కాలుపెట్టినా, ఎంత ఉన్నతస్థానానికి వెళ్ళినా మన దేశం పట్ల గౌరవ భావంతో ఉండాలి.
3.జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు.మన భారతమాత గొప్పతనాన్ని చాటడమే జాతి గౌరవాన్ని నిలపడం అని నా ఉద్దేశ్యం.
4.ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు?
జవాబు.శ్రీ రాయప్రోలు సుబ్బారావు.

ఆలోచించండి – చెప్పండి ( Page No.108)
1.కవి భారత భూమిని ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.భారత భూమిలో సంపదలున్నాయి. వజ్రాల గనులు, బంగారం గనులు, ఇవికాక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఎన్నటికీ తరగని ప్రకృతి సంపద ఉన్నది. చదువులకు, సాములకు, ఋషులకు, వీరులకు నిలయమైనది భారతభూమి. ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులు దేశగౌరవాన్ని కీర్తి శిఖరాలపై నిలిపారు. అందుకే కవి భారతదేశాన్ని శ్రీలుపొంగిన జీవగడ్డ అన్నాడు. శ్రీలు అంటే సంపదలు.

 2.భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది.
జవాబు.భారతదేశంలో వ్యాసుడు, వాల్మీకి మొదలుగా గల మహాకవులు, మహర్షులు జన్మించారు. సంస్కృతికి, సంప్రదాయానికి నిలయంగా ఉన్నది ఈ దేశం. వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది పవిత్ర గ్రంథాలు ఇక్కడే పుట్టాయి. అందుకే ఈ దేశం పుణ్యభూమిగా కీర్తించబడింది.
3.చెవులకు విందుచేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు.మనకు ఇష్టమైనది సమృద్ధిగా దొరకడమే విందు. ఇంపైన భోజనం విందు భోజనం. చూడటానికి అందంగా ఉంటే కనుల విందు అనీ, అలాగే వినడానికి ఇష్టంగా ఉండే మాటలుగాని పాటలుగాని లభించినపుడు చెవులకు విందు అనీ అంటాము. చెవులకు విందుచేయడం అంటే మధురంగా పాడటం, ప్రియంగా మాట్లాడటం.


ఆలోచించండి – చెప్పండి ( Page No.109)
 1.ఎటువంటి పనులు చేసినవారు ధీరపురుషులుగా కీర్తించబడతారు?
జవాబు.దేశము యొక్క గర్వమును నిలబెట్టేట్లు ప్రకాశింపజేసిన వారిని, దేశము యొక్క గొప్ప చరిత్రను ప్రపంచమంతా తెలిసేలా చేసిన వారిని, దేశమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారిని ‘ధీరపురుషులు’ అని కీర్తిస్తారు. ధీరులు అంటే వీరులు.
2.భారత వైభవాన్ని ఎందుకు పాడుకోవాలి?
జవాబు.మనం భారతదేశంలో పుట్టాం. భారతీయులం. ఈ భారతదేశం గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఆ గొప్పదనాన్ని సంపాదించి పెట్టిన మహనీయులను గుర్తుచేసుకుంటూ భక్తితో భారతదేశ వైభవాన్ని పాడుకోవాలి.


ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఈ గేయం దేన్ని గురించి చెపుతున్నది? ఇందులో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి ?
జవాబు.
1. ఈ గేయం భారతదేశం గొప్పతనం గూర్చి చెపుతోంది.
2. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, వీరులైన రాజులను గూర్చి, ఇక్కడి నదుల గొప్పదనం గురించి గానం
చేయాలని చెపుతోంది.
దేశభక్తికి సంబంధించిన విషయాలు :
భారతదేశం సిరులు పొంగిన జీవగడ్డ, పాడిపంటలు గల భాగ్యదేశం.
దేశ గౌరవం ప్రకాశించేటట్లు, దేశ చరిత్ర విస్తరించేటట్లు, దేశాన్ని కాపాడిన వీర పురుషుల గురించి తెలుసుకోవాలి. అదే దేశభక్తి.

2. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి.
జవాబు.
కవి రాయప్రోలు సుబ్బారావు మనదేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేవిధంగా, ప్రతివారూ పాడుకొనేందుకు వీలుగా ఈ కింది విషయాలను చెప్పారు.మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. అలాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.

వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది.

ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారంగల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది.

సూత్రాలను చెప్పిన కాలంనాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి.

కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి.
నవరసాలతో నిండిన, తేటతెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.

పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగుపదాలతో అందరూ కలసి పాడుకోవాలి.

ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు.భరతఖండము, జీవగడ్డ, భాగ్యసీమ, విమల తలము, భావిభారతము.

2. ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
అ. మనదేశం వేదాలకు పుట్టినిల్లు
జవాబు.వేదశాఖలు వెలిసెనిచ్చట.
ఆ. కాకతీయుల యుద్ధ నైపుణ్యం
జవాబు.కాకతీయుల కదన పాండితి.

ఇ. లేత మాటలు చెవులకింపుగ
జవాబు.చివురు పలుకులు చెవులవిందుగ.
ఈ. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
జవాబు.ఉపనిషన్మధువొలికె నిచ్చట.
ఉ. నవరసాలు నాట్యమాడాయి.
జవాబు.నవరసమ్ములు నాట్యమాడగ

III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి.
జవాబు.చరిత్రలో భారత దేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. కాకతీయరాజులు గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు, విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయలు తమ పరాక్రమంతో శత్రువులను మట్టుపెట్టి సుస్థిర రాజ్యాన్ని స్థాపించారు. వీరశివాజీ మన దేశాన్ని శత్రువుల బారినుండి కాపాడిన మహావీరుడు.

ఆ) “బానిసతనం” అంటే ఏమిటి ?
జవాబు.“బానిసతనం” అనగా ‘దాస్యము’ అని అర్థం. స్వేచ్ఛగా బతకలేకపోవడం, ఇతరుల అధికారానికి లోబడి ఉండడం బానిసతనం. ఆంగ్లేయులు మనదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి నెమ్మదిగా మనమీద పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలకు పైగా మనలను పాలించారు. ఆ సమయంలో ఆంగ్లేయులు మనలను చిత్రహింసలకు గురిచేశారు. ఆంగ్లేయుల అహంకారానికి ‘మనం 200 సంవత్సరాలు పైగా బానిసతనం’ చేయవలసి వచ్చింది. చివరకు మనదేశ ప్రజలు ఉద్యమాలు నడిపి వారిని తరిమికొట్టారు.

ఇ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
జవాబు.“భరతఖండంబు” సిరులు పొంగిన, జీవమున్న భూమి.
పాడి పంటలతో వర్ధిల్లుతుంది.
విస్తారమైన అడవులు సమృద్ధిగా ఉన్నాయి.
అనేక నదీజలాలు మన దేశాన్ని సమృద్ధం చేస్తున్నాయి.
అటువంటి భారతదేశాన్ని భాగ్యసీమ అనడంలో సందేహం లేదు.

ఈ) రాయప్రోలు సుబ్బారావుగారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
జవాబు.భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

2. కింది ప్రశ్నలకు పదేసి పంక్తులలో జవాబులు రాయండి.
 1.భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు.మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలుగల భాగ్యదేశం. వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్ర భూమి ఇది. అయితే ఆ కాలం నాటి గొప్పతనం, చరిత్ర పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. అవన్నీ మరుగున పడిపోయాయి.
మనందరం భారతీయులం. కాబట్టి మనం మనదేశ గొప్పదనాన్ని గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పవిత్రమైన నదులు, పవిత్రమైన అరణ్యాలున్నాయి. “భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం” మనది. మనదేశం మతసామరస్యానికి (ఆలవాలం) నిలయం. ఇవన్నీ మనదేశానికి ఉన్న ప్రత్యేకతలు. మనందరం మనదేశము యొక్క గొప్పదనాన్ని గూర్చి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. అప్పుడే మనం ఏ దేశం వెళ్ళినా, మన దేశం యొక్క గొప్పదనాన్ని గూర్చి విదేశీయులకు చక్కగా వివరించగలుగుతాం.
 2.శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి.
జవాబు.భారతదేశం సిరిసంపదలకు నిలయం. ఇక్కడ వేదాలు, వేదాంగాలు వెలిసినాయి. ఆదికావ్యమైన రామాయణం వాల్మీకి రాశాడు. వ్యాసుడు మొదలైన గొప్ప ఋషులకు ఇది నివాసం. అందమైన అడవులు, మహావృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఉపనిషత్తులు రాయబడ్డాయి. తత్త్వవేత్తలకు నిలయమైన పుణ్యభూమి భారతదేశం. సూత్రయుగములనాటి సంస్కారము, క్షేత్రయుగములనాటి శౌర్యము ఈ నడుమ వచ్చిన బానిసత్వంతో చెరిగిపోయేవికావు. ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి చిరకాలం పాడుకుందాం.
చెవులకు ఇంపైన పదాలు కూర్చి నవరసభరితంగా కావ్యాలు రాసిన మంచి మనసుగల కవులను గౌరవిద్దాం. దేశమంతా తిరిగి దేశచరిత్రను ప్రపంచవ్యాప్తంచేసి ధీరులను గురించి తెలుసుకుందాం. ధర్మపరులైన పాండవుల పరాక్రమాన్ని తెలిపే మహాభారత కథను, లోకాన్ని వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని గానం చేద్దాం. తుంగభద్రతీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి జగద్విఖ్యాతుడైన తెలుగురాజు శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుందాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

అ. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
జవాబు. నేను భరతమాతను. సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగుతున్నాను. రామాయణ, భారత భాగవతాలను రచించిన వాల్మీకి, వ్యాసులకు తల్లినైనాను. ఔషధాలతో నిండిన అరణ్యాలెన్నో నాలో ఉన్నాయి. బలపరాక్రమాలు కలిగిన రాజులకు జన్మనిచ్చి పోషించాను. వీరాధివీరులైన నాయకులై నా బిడ్డలవలన నా కీర్తి ప్రపంచ వ్యాప్తమైంది. నా బిడ్డలైన కౌరవ పాండవులు ధైర్యసాహసాలతో కురుక్షేత్ర యుద్ధం చేశారు. వారందరిని భక్తి శ్రద్ధలతో పాడుకోండి. పవిత్రమైన నదులెన్నో నాపై ప్రవహిస్తున్నాయి. వాటిలో మధురజలాలను తాగడానికి, పంట పొలాలకు ఉపయోగించుకోండి. అందరూ కలిసి నా గొప్పతనాన్ని గానం చేయండి. జన్మధన్యం చేసుకోండి అని భరతమాత తన ఆత్మకథను తెలిపింది.
ఆ. మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు.మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపద గాయకులం
మా ఊరిలో బడి ఉంది
మా ఊరిలో గుడి ఉంది.
మా ఊరు మారుమూలపల్లె. పంట పొలాలున్నాయ్
మా ఊరి చుట్టుపట్ల మామిడితోటలున్నయ్
మా ఊరికి మైలుదూరాన.
మా ఊరు మారుమూలపల్లె
వ్యవసాయం మా జీవనం
పదిమందికి సాయమే మాకు మనోబలం
ఐఏయస్ లయిండ్రు మా ఊరిపోరగాండ్రు
ఐపియస్ లయిండ్రు మా ఊరి చెల్లెండ్రు
మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపదగాయకులం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి.

అ. ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తూంటారు.
జవాబు.విపినాలు = అడవులు 
సొంతవాక్యం : అనేక రకాలైన పక్షులు, జంతువులు అడవులలో ఉంటాయి.

ఆ. మనందరం భూ తలం మీద నివసిస్తున్నాము.
జవాబు.తలం = ప్రదేశం, చోటు
సొంతవాక్యం : భారతదేశంలో పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఇ. ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
జవాబు.మేళవింపు = కలియు, జతగూర్చు.
సొంతవాక్యం : నవరసాల జతకూర్చు మన తెలుగు నాటకాలు.

ఈ. తేనెటీగలు మధువును ఇస్తాయి.
జవాబు. మధువు = తేనె
సొంతవాక్యం : తేనెను పాలల్లో వేసి పిల్లలు ప్రతిరోజూ తాగటం వల్ల బలం వస్తుంది.

ఉ. నేటి బాలలే భావి భారతపౌరులు.
జవాబు.భావి = భవిష్యత్తు
సొంతవాక్యం : విద్యార్థులు భవిష్యత్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి.

ఊ. సైనికులకు చేవ ఉండాలి.
జవాబు.చేవ = సారము, ధైర్యము.
సొంతవాక్యం : యుద్ధమునందు సైనికులకు ధైర్యము ఉండాలి.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి.
అ. అధిక సంపదలు కలిగినవారికంటే గుణవంతులే గొప్ప.
జవాబు.శ్రీలు, భాగ్యములు.
ఆ. మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటీషువారి కింద బానిసతనంలో మగ్గిపోయింది.
జవాబు.బానిసతనం, దాస్యం
ఇ. మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి.
జవాబు.మంచివారు, గొప్పవారు, మహనీయులు
ఈ. వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది.
జవాబు.వేడి, కాక
ఉ. వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు.
జవాబు.వ్యాసుడు, బాదరాయణుడు.
3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.
అ. విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
జవాబు.విపినాలు, అరణ్యాలు
ఆ. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
జవాబు.ధరణి, గడ్డ వీరులు, పౌరుషవంతులు జన్మించిన, పుట్టిన
ఇ. గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
జవాబు.కలకాలం, ఎల్లప్పుడు
ఈ. విశాలమైన మన దేశంలో విస్తారమైన అడవులున్నాయి.
జవాబు.విశాలమైన, విస్తారమైన.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలను చదువండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ఉదా : ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ! – ఆశ్చర్యార్థక వాక్యం
అ) పనిని త్వరగా పూర్తిచేయాలి.
జవాబు.నిశ్చయార్థక వాక్యం
ఆ) చుట్టాలు ఎప్పుడు వస్తారు.
జవాబు.ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఈ పుస్తకం వెల ఎంత.
జవాబు.ప్రశ్నార్థక వాక్యం
ఈ) పాఠం అందరూ చదువుకొని రండి.
జవాబు.విధ్యర్థక వాక్యం
ఉ) మీరు నానుండి తెలుసుకోండి.
జవాబు.విధ్యర్థక వాక్యం
కింది వాక్యాలను చూద్దాం.
అతడు వస్తాడో? రాడో?
రేపు వర్షం పడవచ్చు.
ఈ రోజు ఎండ కాస్తుందో? లేదో?
ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది.
పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.

లోపలికి రావచ్చు.
కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
మీరు వెళ్ళవచ్చు.
ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు’.
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

ఇతరులను ఎగతాళి చేయవద్దు.
నీటిని వృథా చేయవద్దు.
ఎక్కువసేపు నిద్రపోవద్దు.
ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి “నిషేధార్థక వాక్యాలు”.

ఒక పనిని చేయవద్దనే (నిషేధించే) అర్థాన్ని సూచించే వాక్యం ‘నిషేధార్థక వాక్యం”.

2. కింది వాక్యాలను చదువండి. అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
అ) అట్లా అనుకోకండి.
జవాబు.నిషేదార్థక వాక్యం
ఆ) నేను చెప్పింది విన్నారో ! లేదో !
జవాబు.సందేహార్థక వాక్యం

ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో ! లేదో !
జవాబు.సందేహార్థక వాక్యం

ఈ) మీరెప్పుడైనా రావచ్చు.
జవాబు.అనుమత్యర్థక వాక్యం

ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు.
జవాబు.నిషేదార్థక వాక్యం

ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు.
జవాబు.అనుమత్యర్థక వాక్యం
ఋ) అబ్బ ! ఎంత వర్షం కురిసింది.
జవాబు.
ఆశ్చార్యార్థక వాక్యం

ౠ) మనసు పెట్టి వినండి.
జవాబు.విద్యర్థక వాక్యం

ప్రాజెక్టు పని:

భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు
1. భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
అసేతుహిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు

త్రివేణిసంగమ పవిత్రభూమి
నాల్గువేదములు పుట్టినభూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి

2. జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి
జయజయజయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి॥
జయజయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలితలలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా||
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథవిహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా॥ (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి)

3. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీజాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
జనియించి నాడవీ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోసె నీ తల్లి కనకగర్భమున
లేదురా ఇటువంటి భూదేవి ఎందు
లేరురా మనవంటి పౌరులింకెందు
పాడరా నీ తెల్గు బాలగీతమును
పాడరా నీ వీర భావభారతము (రాయప్రోలు సుబ్బారావు)

విశేషాంశాలు
నవరసాలు : శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. వీటిని నవరసాలు అంటారు.
 1.భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకన్నారు ?
జవాబు.వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న భూమి ఇది. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు.
2.దేశగౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.
జవాబు.రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన కాకతీయ వీరుల పరాక్రమం ప్రపంచ ప్రఖ్యాతం. పాండవులు ధర్మాన్ని పాటించి కురుక్షేత్రయుద్ధంలో కౌరవుల అధర్మాన్ని నాశనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన బలపరాక్రమాలతో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కళలను, కళాకారులను పోషించాడు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ సాటిలేనిది.

3.యుద్ధాలు ఎందుకు చేస్తారు ? యుద్ధాలవల్ల లాభమా ? నష్టమా ? ఎందువల్ల ?
జవాబు.1) ఏదైనా ఒక దేశము యొక్క అధికార యంత్రాంగం కాని, సైన్యంగాని బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఆక్రమించుకొనటానికి బలంగాఉన్న దేశాలు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుంటాయి.
2) యుద్ధాలవల్ల రెండు పక్షాలలోనూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. యుద్ధసామాగ్రికి ఎంతో ధనం నష్టపోతాము. యుద్ధాలవల్ల నష్టాలను పూడ్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది.
3) కొన్ని అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెగబడి యుద్ధాలు చేసి ఆ దేశ నాయకులను, సామాన్యపౌరులను చిత్రహింసలకు గురిచేసి చంపేస్తాయి.
4) కొన్ని దేశాల ప్రజలు యుద్ధాలకు భయపడి బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తారు. పై విషయాలను గమనిస్తుంటే యుద్ధాలవల్ల నష్టాలేగాని లాభం ఏ మాత్రం ఉండదు అని నా అభిప్రాయము 
 4.మీకు తెలిసిన కొందరు ప్రాచీన, ఆధునిక తెలుగుకవులను గురించి తెలపండి.
జవాబు.తెలుగులో ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతానికి శ్రీకారం చుట్టాడు. తరువాత వచ్చిన తిక్కన, ఎర్రన భారతాన్ని పూర్తిచేశారు. పోతన, శ్రీనాథుడు గొప్ప కవులు పండితులు. శ్రీకృష్ణదేవరాయలు కవిరాజు. అష్టదిగ్గజ కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. వీరంతా ప్రాచీనకవులు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, చిన్నయసూరి, తిరుపతి వేంకటకవులు, వేటూరిప్రభాకర శాస్త్రిగారు, దాశరథి, బి. రామరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ఆధునిక కవులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది.
5.గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.“రాయప్రోలు సుబ్బారావు” గారు రచించిన ఈ గేయం చాలా బాగుంది. దీనిని చదువుతుంటేనే శరీరం గగుర్పాటుకు గురౌతున్నది. కవి హృదయంలో నుండి ఈ గేయం పొంగిపొర్లింది. కవికి గల దేశభక్తి బాగా తెలుస్తున్నది. భారతదేశ ఔన్నత్యాన్ని బాగా అవగాహన చేసుకొని భక్తితో ఈ దేశభక్తి గేయాన్ని కవి రచించారు. రచయిత ఈ గేయాన్ని రచించి

‘మాతృదేశం’ పట్ల తనకు గల గౌరవాన్ని చాటుకొన్నారు.
మన దేశంలో వేదాలు పుట్టాయని, భారత రామాయణాది గ్రంథాలు జన్మించాయని, వ్యాస, వాల్మీకాది కవులు జన్మించిన పుణ్యభూమి అని కవి దేశ గౌరవాన్ని చాటి చెప్పారు. తెలుగు కవులు తేట తెలుగు పదాలతో చెవులకు ఆనందం కలిగించే విధంగా కవిత్వం రాశారని, వాటిద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచమంతా వ్యాపించాయని కవి తమ అభిప్రాయాలను చక్కగా వివరించారు.
పర్యాయ పదాలు
శ్రీలు – సంపదలు, భాగ్యములు
పాలు – క్షీరము, దుగ్ధము
వేదము – ఆమ్నాయము, ఋషి
కావ్యము – కృతి, గ్రంథము
విపినం – అరణ్యం, అడవి
వృక్షం – చెట్టు, భూరుహము
మధువు – తేనె, పవిత్రము
దీప్తి – కాంతి, వెలుగు
రణం – యుద్ధం, సమరం, కదనం
కత్తి – అసి, ఖడ్గం
కదనం – యుద్ధం, రణం
భంగం – అల తరంగ
నింగి – ఆకాశం, గగనం
వ్యతిరేక పదాలు
ఆది × అంత
నింగి × నేల
గౌరవం × అగౌరవం
పుణ్య × పాపం
ప్రకృతులు – వికృతులు

ప్రకృతి – వికృతి

శ్రీ – సిరి
భక్తి – బత్తి, బగితి
కావ్యం – కబ్బం
హృదయం – ఎద, ఎడ, ఎడద
కవిత – కయిత, కైత
గౌరవం – గారవం
కథ – కత, కద
సంధులు

జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వసంధి
భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వసంధి
అత్వసంధి : సూత్రం – అత్తునకు సంధి బహుళము.
విమలతలమిదె – విమలతలము + ఇదే – ఉత్వసంధి
కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
దేశమరసిన – దేశము + అరసిన – ఉత్వసంధి
ఉత్వసంధి : సూత్రం – ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
క్రింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

వేద శాఖలు వెలసె నిచ్చట
ఆది కావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !

ప్రశ్నలు:
1. ‘వేదశాఖలు’ అనగా నేమి ?
జవాబు.వేదశాఖలు అనగా వేదాలు, వేదాంగాలు
2. ‘ఆదికావ్యం’ అనగా ఏది ?
జవాబు.ఆదికావ్యం అనగా శ్రీమద్రామాయణము.
3. ‘బాదరాయణుడు’ అంటే ఎవరు ?
జవాబు.బాదరాయణుడనగా వేదవ్యాసుడు.
4. “పరమ” అనగా ఏమిటి ?
జవాబు.పరమ అనగా ‘శ్రేష్ఠమైన’ అని అర్థం.
5. ఈ గేయాన్ని ఎవరు రచించారు ?
జవాబు.ఈ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు రచించాడు.
క్రింది గేయ భాగాలను చదివి ప్రశ్నలు తయారుచేయండి.
1. “లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా!”
జవాబు.
1. ఈ గేయం దేన్ని గురించి చెబుతోంది?
2. చీకిపోవడం అంటే ఏమిటి?
3. కాకతీయులెటువంటివారు?
4. ఈ గేయం దేన్ని గురించి పాడమంటోంది?
5. ఎలా పాడమంటోంది?

2. పాండవేయుల పదునుకత్తులు
మండి మెరసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవే చెల్లెలా !
జవాబు.
1. పాండవేయులు అంటే ఎవరు?
2. కత్తులు ఎటువంటివి?
3. రణకథ అంటే ఏమిటి?
4. కత్తులు ఎవరివి?
5. రణకథను ఎలా పాడాలి?

ఈ గేయభాగంలోని పదాల క్రమాన్ని సరిచేసి రాయండి. భావం రాయండి.
1. వృక్ష విపిన బంధుర వాటిక
నిచ్చట వొలికె ఉపనిషన్మధు
విస్తరించిన తత్త్వము విపుల
తలమిదె విమల తమ్ముడా !”
జవాబు.
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా

భావం : ఓ తమ్ముడా! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది- అని పద్యభావం.

2. నాట్యమాడగ రసమ్ములునవ
పలుకులు విందుగ చివురు చెవుల…
కాంత కవితలల్లిన హృదయుల
చెల్లెలా గారవింపవె !
జవాబు.నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా!
భావం : ఓ చెల్లెలా! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పద్యభావం.

కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలకృష్ణగోఖలే ముఖ్యులు. ఈయన గాంధీజీకి రాజకీయ గురువు, ధైర్యశాలి. వందేమాతర గీతం ద్వారా ప్రజలను చైతన్యపరచిన బంకించంద్ర చటర్జీ ధీశాలి. బ్రిటిషువారిని గడగడలాడించిన లాలాలజపతిరాయ్ “పంజాబ్ కేసరి”గా ప్రసిద్ధి చెందారు. బ్రిటిషు వారి దుర్మార్గాలను ఎదిరించిన తాంతియాతోపే గొప్పవీరుడు. 1859లో ఏప్రియల్ 18న ఈయనను బ్రిటిషువారు ఉరితీశారు. బ్రిటిషు పాలకుల నెదిరించి ప్రజలను చైతన్యపరచిన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఏమాత్రం జంకని వీరనాయకుడు. ‘సైమన్ గోబ్యాక్ అని నినదించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యశాలిగాక మరెవ్వరు.
ప్రశ్నలు:
1. గోపాల కృష్ణ గోఖలే ఎవరు ?
జవాబు.గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు.
2.. వందేమాతరం గీతం ఎవరు రాశారు ?
జవాబు.
వందేమాతరం గీతం బంకించంద్ర ఛటర్జీ రాశారు.
3. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు ?
జవాబు.
లాలాలజపతిరాయ్ ని ‘పంజాబ్ కేసరి’ అని పిలుస్తారు.
4. ప్రకాశం పంతులు ఏమని నినాదం చేశారు ?
జవాబు.ప్రకాశం పంతులు ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదం చేశారు.
5. 1859 ఏప్రియల్ 18న బ్రిటిష్వారు ఎవరిని ఉరితీశారు ?
జవాబు.1859 ఏప్రిల్ 18న తాంతియాతోపేను బ్రిటీష్వారు ఉరితీశారు.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
‘భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాలమైన దేశం. ఎంతో మంది రాజులు దీనిని పాలించారు. కళలను పోషించి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదేశం. ఉన్నతులైన వైద్యులను, శాస్త్రవేత్తలను తయారుచేసి ప్రపంచంలో తన గొప్పతనాన్ని చాటుకున్నది.
ప్రశ్నలు:
1. భారతదేశం ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించింది?
జవాబు.
భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది.

2. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిందెవరు ?
జవాబు.
మనదేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు

3. మన దేశానికి గొప్పదనం ఎవరివల్ల వచ్చింది ?
జవాబు.
ఉన్నతమైన వైద్యులు, శాస్త్రవేత్తల వలన

4. మనదేశం ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం

5. పై పేరాలోనుంచి ఒక వ్యతిరేక పదముల జంటను రాయండి.
జవాబు.
భిన్నత్వం × ఏకత్వం

కింది పదాలు విడదీసి, సంధిపేర్లు రాయండి.

1. భాగ్యసీమయి
జవాబు.
భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వ సంధి

2. కవితలల్లిన
జవాబు.
కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి

3. రాగమెత్తి
జవాబు.
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి

సంధిగల పదం గుర్తించి, విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
1.. రాలు కరగగ రాగమెత్తి
జవాబు.
రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
2. శ్రీలు పొంగిన జీవగడ్డయి
జవాబు.
జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వ సంధి
3. దేశాన్ని గురించి కవి ఇట్లనెను
జవాబు.ఇట్లనెను ఇట్లు + అనెను – ఉత్వసంధి

26. కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.
1. నవరసాల ………… నిండి, తేట తెలుగు మాటల ………… చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవుల ………… గౌరవించాలి.
జవాబు.
నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జీవగడ్డ
జవాబు.భారతదేశము సిరులు పొంగిన జీవగడ్డ.
2. భాగ్యసీమ :
జవాబు.భారతదేశము పాడిప
3. శౌర్యచండిమ :
జవాబు.కాకతీయ రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
4. చెవుల విందు :
జవాబు.బాలమురళి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
5. చీకిపోవని :
జవాబు.ఆంధ్రుల తేజస్సు చీకిపోవని చేవగలది.
కింది పదాలకు వ్యతిరేకపదాలు రాసి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.
1. ధీరుడు
జవాబు.ధీరుడు × భీరుడు
నా మిత్రుడు భీరుడు కాదు
2. ఆది
జవాబు.ఆది × అనాది
మన దేశంలో వరకట్న దురాచారం అనాదిగా వస్తోంది.
3. పదను
జవాబు.పదను × మొండి
మొండి మనుషులు ఏమి చెప్పినా అర్ధం చేసుకోరు.
గేయం – అర్థాలు – భావాలు
1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా !
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
శ్రీలు = సంపదలు
పొంగిన = పొంగినటువంటి
జీవగడ్డ + అయి = ప్రాణముగల భూమి అయి
పాలు పారిన = = పాలు ప్రవహించిన
భాగ్యసీమ+అయి = సంపదలుగల దేశం అయి
ఈ భరతఖండము = ఈ భారతదేశము
వరలినది = వర్దిల్లినది
భక్తిపాడర = భక్తితో పాడుము

భావం: మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. ఓ తమ్ముడా! అలాంటి భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలని భావము.

2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
వేదశాఖలు = వేదాలు వేదాంగాలు
ఇచ్చటన్ = ఇక్కడ (ఈ భారతదేశంలో)
వెలసెన్ = వెలిశాయి
ఇచ్చట = ఇక్కడ, ఈ భారతదేశంలో
ఆదికావ్యంబు = మొదటి కావ్యం (వాల్మీకి రచించిన రామాయణం)
అలరెన్ = ప్రకాశించింది
ఇది = ఈ భారతదేశము
బాదరాయణ = వేదవ్యాసుడు మొదలుగా గల
పరమ ఋషులకు = శ్రేష్ఠులైన ఋషులకు (మునులకు)
పాదుసుమ్ము = కుదురుసుమా !
భావం: ఓ చెల్లెలా ! వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం అని పై పద్యభావం.
3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమలతల మీదె తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
ఇచ్చట = ఇక్కడ (ఈ భారతదేశంలో)
విపిన = అడవియందలి
బంధుర = దట్టమైన
వృక్షవాటిక = చెట్ల తోపు
ఉపనిషత్+మధువు = వేదాంతము అనెడి తేనెను
ఒలికెన్ = చిందించింది.
ఇదె = ఈ భారతదేశమే
విపుల = విపులమైన, విరివియైన
తత్త్వము = సత్యమును
విస్తరించిన = ప్రసరింపజేసిన
విమలతలము = పవిత్రమైన భూమి
భావం: ఓ తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది పద్యభావం.
4. సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్రదాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెను చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
సూత్రయుగముల = సూత్రాలను చెప్పిన కాలం నాటి
శుద్ధవాసన = స్వచ్ఛమైన సంస్కారం
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
క్షాత్రయుగముల క్షత్రియుల కాలం నాటి =
చిత్ర దాస్యముచే = వింత బానిసతనం వల్ల
చరిత్రల = కథల నుండి
చెరిగిపోయెను = అంతరించిపోయాయి
భావం: ఓ చెల్లెలా ! సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పదనం, ప్రచండ పరాక్రమం ఉన్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ విదేశీయుల క్రింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి అని పై పద్యభావం.
5. మేలికిన్నెర మేళవించీ
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
మేలికిన్నెర = శ్రేష్ఠమైన వీణను
మేళవించ = కలిపి, జతగూర్చి
రాలు కరగగ = రాళ్ళను కూడా కరిగించగల
రాగమెత్తి = రాగమును గ్రహించి
పాలతీయని = పాలవంటి తియ్యనైన
భావిభారత = భావి భారతదేశ భాగ్యాన్ని గురించి
పదము = పాటలను
పాడర = పాడాలి
భావం: ఓ తమ్ముడా! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో, బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాటలు పాడుకోవాలని భావం.
6. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
నవరసమ్ములు = తొమ్మిది రసములు
నాట్యము + ఆడగ = నాట్యము చేయునట్లుగా
చివురుపలుకులు = చిగురు వంటి మెత్తనైన మాటలు
చెవుల విందుగ = చెవులకు ఇంపు కలుగ జేయు నట్లుగా, వినసొంపుగా
కవితలు+అల్లిన = కవిత్వాన్ని కూర్చిన
కాంతహృదయులన్ = మనోహరమైన మనస్సులు గలవారైన కవులను
గారవింపవె = గౌరవింపుము
భావం: ఓ చెల్లెలా ! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పై పద్యభావం.
7. దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !
అర్ధాలు
తమ్ముడా = ఓ తమ్ముడా !
దేశగర్వము = దేశము యొక్క గౌరవము, గొప్పదనం
దీప్తి చెందగ = ప్రకాశించేటట్లు
దేశ చరితము = దేశము యొక్క చరిత్ర
తేజరిల్లగ = ప్రకాశించేటట్లుగా
దేశము + అరసిన = భారత దేశాన్ని కాపాడిన
ధీరపురుషుల = వీరపురుషులను గురించి
తెలిసి = తెలుసుకొని
పాడ = పాడుము
భావం: ఓ తమ్ముడా ! దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని పాడాలని భావం.
8. పాండవేయుల పదును కత్తులు
మంది మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
పాండవేయుల = పాండవుల యొక్క
పదును కత్తులు = పదునైన కత్తులు
మండి = మండుతూ
మెఱసిన = ప్రకాశించిన
మహిత = గొప్ప దైన
రణకథ = కురుక్షేత్రయుద్ధ కథను గుఱించి
కండగల = దృఢమైన, స్థిరమైన
చిక్కని = చక్కని తెలుగు పదాలతో
తెలుంగుల = తెలుగువారితో
కలసి = కలిసి
పాడవె = పాట పాడుము
భావం: ఓ చెల్లెలా ! పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి దృఢమైన తెలుగు వారితో కలసి పాడుకోవాలని పై పద్యానికి భావం.
9. లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదములు
చేర్చి పాడర తమ్ముడా!
అర్ధాలు
తమ్ముడా! = ఓ తమ్ముడా !
లోకమంతకు = ప్రపంచమంతటికీ
కాక పెట్టిన = వేడెక్కించిన
కాకతీయుల = కాకతీయరాజుల యొక్క
కదన పాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
చీకిపోవని = బలహీనముకాని
చేవపదముల = శక్తివంతమైన మాటలను
చేర్చి = కూర్చి
పాడర = పాడుమా !
భావం: ఓ తమ్ముడా! ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో పాడుకోవాలని పై పద్యభావం.
10. తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడని తెలుంగునాథుల
పాట పాడవె చెల్లెలా !
అర్ధాలు
చెల్లెలా = ఓ చెల్లెలా !
తుంగభద్రా = తుంగభద్రానది యందలి
భంగములతో = అలలతో
పొంగి = ఉప్పొంగి
నింగిని = ఆకాశాన్ని
పొడిచి = పిడికిలితో కొట్టి
తుళ్ళి = గర్వించి
భంగపడని = ఓటమిని పొందని
తెలుగునాథుల = ధైర్యం గల తెలుగు రాజుల గురించి (శ్రీకృష్ణ దేవరాయలు)
పాట పాడవె = పాట పాడుమా !
భావం: ఓ చెల్లెలా ! తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కు చెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని పై పద్యభావం.






ప్రాజెక్టు పని 
భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి నివేదికను రాశి ప్రదర్శించండి. 
ప్రాథమిక సమాచారం

ప్రాజెక్టు శీర్షిక: భారతమాతను స్తుతించే గేయాలు
ప్రాజెక్టు సంఖ్య: 4
విద్యార్థి పేరు: __________
తరగతి: ఎనిమిదవ తరగతి
క్రమ సంఖ్య: ___
తేది: __________

నివేదిక
భారతదేశం మన మాతృభూమి. ఈ పవిత్ర భూమిని “భారతమాత”గా భావించి ఎన్నో గేయాలు రచించబడ్డాయి. ఈ గేయాలు మనలో దేశభక్తిని, ఐక్యతను, త్యాగస్ఫూర్తిని పెంపొందిస్తాయి. భారతమాతను స్తుతించే కొన్ని జాతీయ గీతాల పల్లవులను సేకరించి వాటి భావాన్ని ఈ నివేదికలో అందిస్తున్నాను.

“వందే మాతరం” జాతీయ గీతం భారతమాతను ప్రకృతి సౌందర్యంతో నిండిన తల్లిగా చిత్రిస్తుంది.
పల్లవి:
“వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజశీతలాం”
ఈ గేయం స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. దేశం పట్ల ప్రేమను రగిలించింది.
“జన గణ మన” మన జాతీయ గానం.
పల్లవి:
“జన గణ మన అధినాయక జయ హె
భారత భాగ్య విధాత”
ఈ గేయం భారతదేశంలోని అన్ని ప్రాంతాల ఐక్యతను ప్రతిబింబిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావాన్ని బలపరుస్తుంది.
“సారే జహాం సే అచ్చా” గేయం దేశ గౌరవాన్ని తెలియజేస్తుంది.
పల్లవి:
“సారే జహాం సే అచ్చా
హిందోస్తాం హమారా”
ఈ గేయం భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా కొనియాడుతుంది. సోదరభావం, శాంతి, సంస్కృతిని ప్రశంసిస్తుంది.
“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం ప్రాంతీయ గర్వాన్ని తెలియజేస్తుంది.
పల్లవి:
“మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతి”
ఈ గేయం భాషా సంస్కృతిని గౌరవిస్తూ దేశ ఐక్యతకు తోడ్పడుతుంది.
ఈ గేయాలన్నీ భారతమాతను స్తుతిస్తూ దేశభక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పండుగల సందర్భంగా ఈ గేయాలను పాడడం ద్వారా మనం దేశానికి గౌరవం తెలుపుతాము. విద్యార్థులు ఈ గేయాల భావాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మంచి పౌరులుగా ఎదగగలరు.
ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలు: ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ గీతాల ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. దేశభక్తి, ఐక్యత, గౌరవం వంటి విలువలు మన జీవితంలో ఎంత ముఖ్యమో గ్రహించాను. భారతమాత పట్ల ప్రేమ, బాధ్యత మరింత పెరిగింది.
ముగింపు: భారతమాతను స్తుతించే గేయాలు మన హృదయాలలో దేశప్రేమను వెలిగిస్తాయి. ఈ గేయాలు మన సంస్కృతి, ఐక్యత, గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. భారతమాతకు వందనం చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి.